7
ప్రాంతీయ వివక్ష, అసమానతలు చాలా ప్రాంతాల్లో ప్రాంతీయ అస్థిత్వ పోరాటాలకు పాదువేశాయి …. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి కథకులు ప్రాంతీయ స్పృహతో కథలు రాస్తున్నారు.
అసలు ఏ కథ అయినా ప్రాంతీయ వాసనలు లేకుండా ఉండదనిపిస్తుంది.
తెలంగాణ ప్రాంతం నుంచి కాలువ మల్లయ్య (యుద్ధభూమి, నేలతల్లి) బెజ్జారపు రవీందర్ (నిత్య గాయాల నది) ఇంకా బోయ జంగయ్య, పెద్దింటి అశోక కుమార్ వంటివారు ప్రాంతీయ స్పృహతో కథలు రాస్తున్నారు ….
ఇంకా చిత్తూరు ప్రాంతం నుంచి నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, మధురాంతకం నరేంద్రవంటి వారు ప్రాంతీయతను ప్రతిబింబిస్తున్నారు ….
అట్లాగే కారా, రావిశాస్త్రి, భూషణం వంటి వారందించిన కథల కాగడాని ఒడుపుగా అందుకుని అప్పల్నాయుడు, గౌరునాయుడు వంటి వారు ప్రాంతీయతను కథల్లో పలికిస్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి ….
ఈ నేపథ్యంలో
‘సీమ కథలు’, ‘ఇనప గజ్జెల తల్లి’, ‘ఫ్యాక్షన్ కథలు’, ‘హంద్రీ కథలు’, ‘కళింగాంధ్ర కథలు’, ‘నాగావళి కథలు’, ‘వంశధార కథలు’, ‘రుంరaావతి కథలు’ వంటి కథా సంకలనాలు ప్రాంతీయతను ప్రతిబింబిస్తూ వెలువడ్డాయి….
నెల్లూరు నుంచి ‘కథాకేళి’ వంటి సంకలనాలు వచ్చినప్పటికీ అది ప్రాంతీయతను కాకుండా నెల్లూరి రచయితలకు సంబంధించిందిగా మిగిలిపోయింది….
ప్రస్తుత తెలుగు కథ పఠనం చేసినట్టయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విభిన్న జీవిత కోణాలు …. వివిధ మాండలికాలు పాఠకుడికి అవగతమవుతాయి….
అభివృద్ది, వెనుకబాటుతనం …. ముందు వెనుకలు మంచిచెడులు వంటి సామాజిక మూలాలమీద నుంచే ప్రాంతీయ స్పృహ సాహిత్యంలోకి కూడా విస్తరిస్తుంది …. ఆ ఎక్కువ తక్కువలు మారనప్పుడు అనివార్యంగా సాహిత్యంలో ఆ ప్రాంత పరిస్థితులు ప్రతిబింబిస్తూ ఉంటాయి….
సాహిత్యం పుట్టుకకు మూలం ‘అసంతృప్తి’ అంటారు కాత్యాయనీ విద్మహే ఒకచోట …. ప్రస్తుత తెలుగు కథను చూస్తూంటే ఈ మాటలు అక్షర సత్యాలుగా అనిపిస్తాయి …. మనసుల్లోని ఈ అసంతృప్తికి మూలకారణమైన సామాజిక పరిణామాలనూ, దానికి మూలకారణమైన రాజ్య స్వభావాన్నీ …. అందులో అంర్జాతీయ ద్రవ్య సంస్థల జోక్యాన్నీ ఇలా అన్ని కోణాలనూ కూడా ప్రస్తుత తెలుగు కథ ప్రతిబింబిస్తూంది ….
అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉన్న తెలుగు కథ, ఏ ప్రపంచ భాషల సరసన నిలబడ్డానికయినా వెనుదీయనంత శక్తివంతంగా ఉన్నటువంటి తెలుగు కథ ఇతర భాషల్లోకి అనువాదానికి నోచుకోకపోవడంతో తెలుగు కథ ఖ్యాతి ఇనుమడించాల్సినంతగా ఇనుమడించడం లేదని అనిపిస్తుంది ….
ఇవ్వాళ తెలుగు కథల్లో మనల్ని మనం పోల్చుకునే, నిమగ్నం చేసే హృదయ సంబంధి లక్షణముంది …. ఒక వైపు గ్రామీణ జీవన అమాయకత్వం నైర్మల్యం, దిగ్భ్రమ, సంతోషం, దిగులు …. పల్లెల పరిసరాలు, జీవద్భాషతో అత్యంత సహజంగా చిత్రిస్తోన్న కథకులు మరోవైపు ప్రజా ఉద్యమాల విషయం వచ్చేటప్పటికి ఒక ధిక్కార స్వరంతో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, దుయ్యబడుతూ, ఎండగడతూ కథలు రాయడం విశేషం ….
గత పదిహేనేళ్ళ తెలుగు కథానికని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు రెండు దశాబ్దాల తెలుగు సమాజ జీవన పరిణామాలని మనం దర్శించవచ్చు …. ఈ కథల్లోని పాత్రలేవీ పాత్రలు కాదు …. రక్తమాంసాలున్న సజీవమైన మనుషులే …. అందుకే వాళ్ళు వాళ్ళ స్వంత భాషని మాట్లాడుతారు …. స్వంత కష్టాలని చెప్పుకుంటారు …. స్వంత దిగుళ్ళని పాఠకులతో పంచుకుంటారు …. జీవన తాత్త్విక పొరల్లో నుంచి గుండెని తడుముతారు ….
ఇవ్వాళ తెలుగుకథ ఒక కథ కాదు …. జీవన కఠోర వాస్తవం …. జీవితాల్లోని వివిధ రకాల దోపిడీని, పీడననూ, హింసనూ, వేదననూ …. ఆ మొత్తం దురవస్థల నుంచి బయటపడడానికి మనుషులు చేస్తోన్న పెనుగులాటలను, ఆరాట పోరాటాలనూ చీకటి వెలుగుల కలనేతగా పొదుగుకున్న ఒక సజీవ చిత్రరాజ్యం …. *