ప్రస్తుత తెలుగు కథ - ఒక జీవన కఠోర వాస్తవం
(9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ లో రూ. 15000 పారితోషికం అందుకున్న వ్యాసం)
4
‘శ్రమజీవుల శ్రమతోనే ఈ ప్రపంచం ముందుకు నడుస్తున్నప్పుడు ఆ శ్రమజీవుల సమస్యలను పట్టించుకోకుండా ఉండే స్వేచ్ఛ రచయితకు లేదు’ అంటాడో రచయిత ….
జీవితాల్లోని సంఘర్షణని, వైరుధ్యాలనీ అర్థం చేసుకుంటూ ఆ వైరుధ్యాలని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ …. ప్రతిఘటించాల్సిన చోట ప్రతిఘటిస్తూ సాహిత్యాన్ని వెలువరించడం రచయితల కనీసపు కర్తవ్యం …. దీనినే పోరాటం, ఉద్యమం …. విప్లవం అని మనం అనుకోవచ్చు ….
ఈ దశాబ్దిన్నర కాలంలో వచ్చిన విప్లవోద్యమ కథలు రాజ్యవ్యతిరేక స్వభావాలనూ, గిరిజనులు, వ్యవసాయ కూలీలు, కార్మికవర్గం వంటి వారికి జీవనం లేకుండా చేసే విధానాలను ఎండగడుతూ …. ఆ శ్రమజీవులకు బ్రతికే ధైర్యాన్నిస్తూ ఉత్సాహన్నిస్తూ చిత్రితమైనాయి …. మనందరికీ తెలుసు శ్రీకాకుళం నుంచి ఉత్తర తెలంగాణ వరకు వ్యాపించిన విప్లవోద్యమం …. రాజ్య అణిచివేతల వలన పైకి పూజ్యంగా కన్పించినప్పటికీ అది ఆ ప్రాంత జీవన రంగాలలో అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంది ….
విప్లవ కార్యకర్తలు తమ ఆచరణ ద్వారా, న్యాయ పోరాటాల ద్వారా … ప్రజా సమూహాలలో భాగమై తమ సమస్యల్ని ఎవరో వచ్చి పరిష్కరిస్తారని కాకుండా తామే పరిష్కరించుకోవలసిన అవసరాన్ని, చైతన్యాన్ని వారిలో కలిగిచడమే కాకుండా … వారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని, వారి జీవితాలలో మమేకమై విడదీయ లేనటువంటి ప్రభావం తీరును … క్రమాన్ని గొప్పగా చిత్రిక పట్టిన కథ ‘అతడు’ ….
ఉద్యమ కెరటాల తాకిడి, వాటి అణచివేతల వికృత రూపాలుగా దుర్భర నిర్భంధాన్ని చవిచూసిన తెలంగాణ పల్లెలలోని వాతావరణం ‘అతడు’ కథలో అడుగడుగునా కనిపిస్తుంది… అంతటి నిర్భంధంలో కూడా అతడి కర్మకాండకు మరో మరణ యాత్రతో పాటు అంతర్లీనంగా ప్రజలు హాజరు కావడాన్ని … అతడి మీద ప్రేమనీ, అనుబంధాన్నీ చక్కగా చిత్రించిన కథ ఇది …
అలాగే రఘోత్తమరెడ్డి రాసిన చావువిందు, జాడ, పనిపిల్ల వంటి కథలు విప్లవోద్యమ నేపథ్యంలో ప్రజా సంబంధాలనూ, భూమి సంబంధాలనూ, భార్యాభర్తల సంబంధాలనూ విశ్లేషిస్తూ దొరల పెత్తనాలను ప్రతిఘటించే క్రమంలో ప్రజలను చైతన్యవంతులను చేసే దిక్కుగా సాగుతాయి … ‘చావువిందు’ కథ ఈ కోవలోనిదే …
‘పనిపిల్ల’ కథ మీద సుదీర్ఘమైన చర్చ జరిగి ఆ చర్చా వ్యాసాలతో ఒక ప్రత్యేకమైన పుస్తకం రావడం విశేషం…
ఉద్యమాన్ని అణిచివేయడం కోసం రాజ్యం అనుసరించే హింసా రాజకీయాల దారుణ స్థితిని వివరిస్తూ వచ్చిన కథ డా॥ వి.చంద్రశేఖరరావు రాసిన ‘మాయాలాంతరు’ … విప్లవోద్యమంలో స్త్రీలను ఎన్కౌంటర్లకు గురిచేసి అది హత్యకాదని నమ్మించడానికి ప్రేమ కథలల్లడాన్ని నిరసిస్తూ మార్మిక పద్ధతిలో సాగిన కథ ఇది…
పారిశ్రామిక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ చీకట్లోకి నెట్టేస్తోన్న కార్మిక వర్గాల జీవితాల మీదికి వెలుగు ప్రసరిస్తూ పి.చంద్ ‘భూనిర్వాసితులు’ అదేవిధంగా సాగునీటి నిస్తామంటూ ప్రభుత్వం భ్రమింపచేస్తోన్న ప్రాజెక్టుల కింద ముంపుకి గురయి నిర్వాసితులవుతోన్న అనేక గ్రామాల ప్రజల జీవితాల మీద నల్లూరి రుక్మిణి ‘ముంపు’ వంటి కథలొచ్చాయి…
అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి పి.చిన్నయ్య ప్రజాజీవితం ఎదుర్కొంటోన్న సమస్యల విభిన్న కోణాలని … పాఠకుల, ప్రజల దృష్టిలోకి తీసుకు రావడమే ధ్యేయంగా విప్లవోద్యమ నేపథ్యంలోంచి కథలు రాయడం జరిగింది … ‘పయిలం’ అన్న కథా సంపుటం వెలువరించారు.
మిడ్కో రాసిన ‘మెట్ల మీద …’ అన్న కథ కూడా చెప్పుకోదగినది …
తమ ఊళ్ళో విప్లవ చైతన్యం లేనిరోజుల్లోనే ఉద్యమంలోకి వెళ్ళి కొన్నేళ్ళు గడిపి … జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తిరిగి వచ్చేప్పటికి కుటుంబంలో, ఊరిలో పూర్తి చైతన్యం కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది … ఈ కథని చాలా లోతయిన దృష్టితో, వివరంగా చర్చకు పెడ్తాడు రచయిత…
శ్రీకాకుళ గిరిజనోద్యమ నేపధ్యం నుండి సువర్ణముఖి రాసిన ‘అన్నలొస్తున్నారు’, ‘తగువులు’ వంటి కథలు అణిచివేతకు గురికాబడిన గిరిజనుల జీవితాలనూ … ఇప్పటి దోపిడీని సమీక్షిస్తూ శ్రీకాకుళం మళ్ళీ విప్లవోద్యమానికి సన్నద్ధమవుతోన్న తీరును చిత్రిస్తాయి…
అలాగే గిరిజన సంక్షేమ పథకాల పేరులో అవి గిరిజన స్త్రీల జీవితాలలో సృష్టించే కష్టాలు, కన్నీళ్ళు, లైంగిక పీడన వంటి అనేక కోణాలను చిత్రిస్తూ వారు ప్రతిఘటనకు, పోరాటానికీ సన్నద్ధం కావడాన్ని విశ్లేషిస్తూ గౌరు నాయుడు ‘బతుకాకు’, ‘రక్తాశ్రువు’ వంటి కథలు రాశారు … ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలు విప్లవీకరింపబడ్తున్న క్రమాన్ని చెప్తాయి.
అలాగే అరవయ్యిల్లో వచ్చిన కారాగారి ‘యజ్ఞం’ కథకి కొనసాగింపుగా ఈ శతాబ్దంలో అప్పల్నాయుడు ‘యజ్ఞం తరువాత’ అన్న కథ రాశారు.
ఇది నిజంగా గొప్ప ప్రయత్నం … నాలుగు దశాబ్దాల కాలంలో వచ్చిన అనేకానేక పరిణామాలను వివిధ కోణాల నుంచి లోతుగా చర్చకు పెడుతుందీ కథ … ‘యజ్ఞం’. తర్వాతి కాలంలో ఉద్యమ ప్రభావం వలన వచ్చిన మార్పుల్ని, నూతన ఆర్థిక విధానాల ప్రభావాలనీ … ఆ నేపధ్యంలో యజ్ఞం కథలోని పాత్రల జీవిత పరిణామాలనీ పట్టుకుంటుంది ‘యజ్ఞం తర్వాత’.
తన కొడుకుని చంపి వెట్టిచాకిరీ నుంచి తప్పించాననుకున్న సీతారాముడు ఆ తర్వాతి కాలంలో ఉద్యమంలో చేరి లక్షుం నాయుడ్ని చంపుతాడు … అయినా పరిస్థితుల్లో కొత్త మార్పులేమీ ఉండవు … సీతారాముడ్ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చంపేసిన తర్వాత అతని జ్ఞాపకార్ధం స్థూపం నిర్మించబడుతుంది. చివరికి అదికూడా మిగలదు … అతడి అన్నకొడుకు చిన అప్పల్రాయుడు ఉద్యమంలోకి వెళ్ళడం … ఒకానొక రాత్రి అతడు వచ్చినప్పుడు అతడికీ మేష్టారుకీ మధ్య జరిగే చర్చలో అనేకానేక విషయాలు పాఠకుల ముందు పరుస్తాడు రచయిత…
ఈ శతాబ్దపు గొప్ప ప్రయత్నం ఈ కథ …
ఈ పదిహేనేళ్ళ కాలంలో విప్లవ కథ ప్రజలను చైతన్యపరిచి ప్రజల పక్షాన బలంగా నిలబడింది … సామ్రాజ్య వాదాన్ని ఎదుర్కొన్నది … భూస్వామ్య విధానాన్ని, భూమి సంబంధాలనూ బయటపెట్టింది … పీడిత ప్రజల్ని సంఘటిత శక్తిగా మార్చే నిర్మాణ బాధ్యతని నెత్తికెత్తుకుంది…
ఈ క్రమంలో తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విప్లవోద్యమ రచయితలు నిరాఘాటంగా ముందుకు సాగుతున్న తీరును గమనించి ప్రభుత్వం నిషేధాన్ని విధించి … ప్రజల నుంచి, ప్రజాస్వామిక మేధావుల నుంచి, రచయితలు, కవులు కళాకారుల నుంచి వచ్చిన వ్యతిరేకతకు తలఒగ్గి నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది …
రచయిత సత్యాన్వేషి … రచయితల భావప్రకటనా స్వేచ్ఛ, మౌలికమైన ప్రశ్నించే హక్కుకి సంకెళ్ళు వేయడం అనే దుశ్చర్యని తెలుగు కథకులంతా కూడా తీవ్రంగా ఖండించారు…
కీలక పదాలు : కబురు, 9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ