మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు

పుస్తకం అంటే ఏమిటి?

ఇక్కడ ఆగి, అసలు పుస్తకం అంటే ఏమిటో చూద్దాం. గత రెండు వందల సంవత్సరాలుగా ఒక కవి పేరుతో కనిపించిన లిఖితప్రతులన్నీ ఎక్కడెక్కడివీ వెతికి సంపాదించి అవి దొరికిన చోట్లేమిటి, వాటిని వాడిన వాళ్ళు ఎలా వాడారు, వాటి పఠన సంప్రదాయాలేమిటి, అనే వాటితో సంబంధం లేకుండా అన్నీ గుదిగుచ్చి వాటి పాఠాలు తైపారు వేసి అక్షరదోషాల్ని, పునరుక్తుల్ని, వ్యాకరణం లోని లోపాల్ని సవరించి ఒక నిర్దుష్టమైన పరిశోధిత ప్రతిని (Urtext) తయారు చేయడం మనం పాశ్చాత్యుల నుండి నేర్చుకున్నాం. మహాభారతానికి పూనా ప్రతి, రామాయణానికి బరోడా ప్రతి ఇలా తయారయినవే. తెలుగులో ఇదే పద్ధతుల్లో ఈ ఉద్ధరణ కార్యక్రమం నిర్వహించినవాడు సి.పి. బ్రౌన్.

మౌఖిక వ్యవహారానికి (orality) లిఖిత వ్యవహారానికి (literacy) పెద్ద అగడ్త ఉందని చూపించి, ఆ పద్ధతిలో చాలా శ్రద్ధగా, వివరంగా పరిశ్రమించి కృషి చేయటం పాశ్చ్యాత్యదేశాల్లో ఒక చిన్న సైజు పరిశ్రమ లాగా కొనసాగింది. దానికన్నా భిన్నంగా భారతీయభాషల్లో ఒక విలక్షణమైన వాగ్వ్యవహారం యేర్పడిందని చూపిస్తాను. భారతదేశంలో భాషలకు అక్షరత్వం లేఖనం రాకముందే యేర్పడింది. వీటికే వర్ణాలని పేరు. సంస్కృతవర్ణసమామ్నాయం ధ్వనుల స్ఫుటీకరణ వల్ల వాగ్రూపం లోనే ఏర్పడింది. ఆ వర్ణాలకి లిఖితరూపం ఇవ్వడం తర్వాత జరిగింది. పాణిని వాడిన మాహేశ్వర సూత్రాలు;

అ ఇ ఉ (ణ్)
ఋ లు (క్)
ఏ ఓ (ణ్)
ఐ ఔ (చ్)
హ య వ ర (ట్)
ల (ణ్)
ఞ మ ఙ ణ న (మ్)
ఝ భ (ఞ్)
ఘ ఢ ధ (ష్)
జ బ గ డ ద (శ్)
ఖ ఫ చ ఠ థ చ ట త (వ్)
క ప (య్)
శ ష స (ర్)
హ (ల్)

అనేవి ధ్వని రూపంలోనే ప్రకటితమయ్యాయి. ఇతర భారతీయ భాషలు కూడా ఇదే వరసలో అ ఆ ఇ ఈ అనే వర్ణ క్రమం చెప్పుకుంటాయి. తెలుగులో గుణింతం చెప్పేటప్పుడు కకారఅకారాలు క, కకారఆకారాలు కా, కకారఇకారాలు కి, కకారఈకారాలు కీ అని చెప్పేవారు. (రాయడం అలవాటు చెయ్యడానికి, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు, కకు గుడిస్తే కి అని చెప్పడం తరవాత కాలంలో వొచ్చింది.) ఉదాహరణకి, ఈ కింద భారతీయభాషల్లో హిందీకి, తెలుగుకీ వర్ణాలు ఒకే క్రమంలో వుండటం చూడచ్చు.

ఈ ధ్వనులకి ఏ రకమైన లిఖితరూపానైన్నా జోడించుకోవచ్చు. సంస్కృతాన్ని భారతీయభాషల్లో అనేక లిపుల్లో రాస్తారు. సంస్కృతానికి తనదైన లిపి అంటూ ఒకటి లేదు. నాగరలిపికి నాగరి ప్రచారణ సభ వాళ్ళ ప్రచారం వల్ల ప్రాధాన్యత వచ్చింది కానీ ఇప్పటికీ తెలుగువాళ్ళు తెలుగు లిపి లోనే సంస్కృతం రాస్తారు, చదువుతారు. అలాగే కన్నడంవాళ్ళు కన్నడ లిపిలో, వంగదేశీయులు వంగ లిపిలో సంస్కృతం చదువుతారు. ధ్వనికీ, లిపికీ వున్న సంబంధం ఇది: ధ్వని ముందు, లిపి తరువాత ఏర్పడింది. అందుచేత తెలుగులో రాయడానికి, పాండిత్యానికి మధ్య వున్న సంబంధం అవిభాజ్యమైనది కాదు. తెలుగులోను సంస్కృతంలోను స్వయంగా రాయటం నేర్చుకోనక్కర లేకుండా పండితుడవడం సాధ్యం. ఇంతకు ముందు నేనింకొక చోట చెప్పినట్లుగా తెలుగులో రాయడం అంటే రచన చేయడం అనే అర్థం ఈ మధ్యకాలం లోనే వచ్చింది. అంతకు ముందు రాయడం అంటే చూచి ఇంకొక ప్రతి రాయడం, లేదా బొమ్మ గీయడం. కవులకి రాయసకాళ్ళు వేరే వుండేవాళ్ళు. పుస్తకానికి ప్రతులు రాసేవాళ్ళు రాయసకాళ్ళు. బొమ్మలు గీసేవాళ్ళు కూడా రాయసకాళ్ళే. కాళహస్తిలో కలంకారీ బొమ్మలు గీసే వాళ్ళు ఉండేవీధికి రాతపనివీధి అనే పేరు ఇప్పటికీ వుంది. మన కవులు పుస్తకాలు చేశారు, చెప్పారు, నిర్మించారు, అల్లారు, కట్టారు. కానీ రాయలేదు. ఆ పని రాయసకాళ్ళు చేశారు. (ఇంతకు ముందు వరకూ ఈ వ్యాసంలో రాయడం అనే క్రియ రచించు అనే అర్థంలో మన ఇప్పటి అలవాటుని గౌరవిస్తూ వాడాను.) దీన్ని బట్టి మనకి రెండు రకాల వాగ్వ్యవహారాలున్నాయి. ఒకటి సాక్షరమైన వాగ్వ్యవహారం, ఇంకొకటి నిరక్షరమైన వాగ్వ్యవహారం. అంటే ఒక రకంగా చదువుకున్న పండితులు, చదువురాని వాళ్ళు కూడా వాగ్వ్యవహారం లోనే వుండేవారు. కావ్యాలని వర్గీకరించిన దండి, భామహుడు దృశ్యకావ్యాలు, శ్రవ్యకావ్యాలు అని కావ్యానికి రెండే విభాగాలు చేశారు. మొన్నమొన్నటి వరకు చదవటం అంటే పైకి చదవటమే. పైకి చదవందే పద్యానికి అస్తిత్వం లేదు. సంస్కృతంలో బహుశ్రుతుడు అంటే పండితుడు అని అర్థం. అంటే చాలా విన్నవాడు అని.

మహాభారతం, రామాయణం లాంటి పుస్తకాలు చదివినా, అమరుశతకంలో శ్లోకం ఒకటొకటి చదివినా, అన్నీ పైకే చదివారు. అచ్చు రాకముందు చదవడమంటే పైకి చదవడమే. తాటాకు మీద ఉన్నా, భూర్జపత్రం మీద ఉన్నా, లిఖితమైన ప్రతి తరవాత పైకి చదవడం కోసం రాసిందే. అంటే, మనకి రెండు రకాల ‘పుస్తకాలు’ ఉన్నాయన్న మాట. ఒకటి, లిఖిత పుస్తకం, రెండోది శ్రవ్య పుస్తకం. ఈ శ్రవ్య పుస్తకం ఒక వ్యక్తి నుంచి మరొకరికి, ఒక తరం నుంచి మరొక తరానికి శ్రవ్యంగానే అందింది. అది అలా ఉండగా, లిఖిత పుస్తకం లిఖితంగానే ఒక తరం నుంచి మరొక తరానికి అందింది. పుస్తకం ఎలా చదవాలో తెలియని వాళ్ళు ఎప్పుడూ లిఖిత పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని తిన్నగా చదివెయ్యలేదు. అంటే, ఆధునిక కాలంలో నవల లాగా లైబ్రరీ నుంచో పుస్తకాల షాపు నుంచో తెచ్చి పుస్తకం తెరిచి చదివేయడం మొదలు పెట్టలేదు. ఈ సంగతి తెలుసుకుంటే మనకు రాతలో విరామ చిహ్నాలు ఎందుకు అవసరం లేకపోయాయో బోధపడుతుంది. పద్యం ఎక్కడ ఆపాలో, ఎలా విరవాలో, ఎలా పూర్తి చేయాలో తెలుసుకోక ముందు పద్యాన్ని ఎవరూ ఎప్పుడూ చదవలేదు. అందుచేత మనకి ఫుల్‌స్టాపులు, కామాలు, సెమీ కోలన్లు అక్కర లేకపోయాయి. (నిజానికి పాశ్చాత్య పుస్తకాలకీ అక్కర లేకపోయాయి. ఆ సంగతి పరుచూరి శ్రీనివాస్, పప్పు నాగరాజు చెప్తారు.)

మళ్ళా క్లుప్తంగా చెప్పాలంటే, మనకు పుస్తకాలు రెండు మార్గాలలో ప్రచారమయ్యాయి. ఒకటి, లిఖిత మార్గం, రెండవది శ్రవ్య మార్గం. రెండూ సమాంతరంగా నడిచాయి. పుస్తకం చదవక ముందు అది ఎలా చదవాలో ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి కాబట్టి లిఖిత పుస్తకాన్ని పాఠకుడు తిరిగి పునర్నిర్మిస్తాడన్నమాట, అవసరమైతే మధ్యమధ్యలో తన వ్యాఖ్యానాలు కూడా జోడించి. భారత రామాయణాల లాంటి పెద్ద పుస్తకాలైతే, మొదటి ఆకు (పేజీ) నుంచి మొదలు పెట్టి చివరి ఆకు దాకా వరసగా ఎవరూ ఎప్పుడూ చదవరు. అందులో కొన్ని భాగాలు తీసి వాటికి వేరే మొదలు ఏర్పాటు చేసి, ఇంకొక చివర ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక గ్రంథాన్ని పాఠకుడు తయారు చేస్తాడు. ఇలా చూస్తే, చదువుతున్న ప్రతిసారి లిఖిత పుస్తకం నుంచి శ్రవ్య పుస్తకం ఎప్పటికప్పుడు తయారవుతుంది అన్నమాట. ఈ విషయాన్ని పై బొమ్మలో చూడవచ్చు.

ఇలా లిఖిత గ్రంథం నుంచి శ్రవ్య గ్రంథం (దీనినే స్వీకృత గ్రంథం అని కూడా అనవచ్చు) ఏర్పడే సంప్రదాయం అచ్చుయంత్రం వల్ల, ఆధునిక విద్యల వల్ల దెబ్బ తింది. మనకు ఇప్పుడు అచ్చులో వందలకొద్దీ పుస్తకాలు కనిపిస్తాయి. కానీ, అవి లిఖిత గ్రంథాలు మాత్రమే. వాటి శ్రవ్య రూపాలు ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు, అక్కడక్కడా. కానీ మనకు వాళ్ళ మీద ఆదరణ లేదు.

ఈ సంగతి 12వ శతాబ్దంలోనే గమనించాడనుకుంటాను శ్రీహర్షుడు, నైషధీయచరితంలో చివర ఇలా రాశాడు.

గ్రంథగ్రంథి క్వచిత్క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా
ప్రాజ్ఞమ్మన్యమనా హఠేన పఠితీ మా ఽస్మిన్ఖలః ఖేలతు
శద్ధారాద్ధగురుశ్లథీకృతదృఢగ్రంథిస్సమాసాదయ
త్వేతకావ్యరసోర్మిమజ్జనసుఖవ్యాసజ్జనం సజ్జనః

ఈ అసాధ్య సుందరమైన ఈ శ్లోకాన్ని అనువదించే ప్రయత్నం చెయ్యను. దీని తాత్పర్యం ఏమిటంటే — ఇందులో ప్రయత్నించి మరీ కొన్ని పీటముడులు వేశాను. సమర్థుడు కాని వాడెవడూ, తాను పండితుణ్ణనే గర్వంతో ఇందులో వీలు పెట్టకుండా వుండడానికి. శ్రద్ధగా గురువు దగ్గిర నేర్చుకున్న సజ్జనుడు, ఆయన సహాయంతో ఆ ముడులు విప్పి, ఈ కావ్యరసడోలికల్లో ఓలలాడు గాక.

లిఖిత గ్రంథమే మిగిలి, శ్రవ్య గ్రంథం నశించిపోయిన స్థితిలో, గ్రంథమంతా లిఖిత గ్రంథమే అనుకుని దానితోటే మన గ్రంథ పరిష్కరణ కొనసాగించి నందువల్ల ఆధునిక కాలంలో ఎన్ని నష్టాలు వచ్చాయో చెప్పడానికి నాకిక్కడ అవకాశం చాలదు. నేను చెప్పదలచుకున్న దేమిటంటే –

పుస్తకాలు ఒక్కొక్కటీ వేరు వేరుగా ఉండవు. అనేక పుస్తకాలు ఒక చిన్న సమాజంగా ఏర్పడతాయి. ఆ పుస్తకాల లాగే, ఆ పుస్తకాలు చదివే వాళ్ళు కూడా ఒక సమాజంగా ఏర్పడతారు. ఈ పుస్తకపఠితృ సమాజాలకి పుస్తక కర్తకున్నంత స్వామ్యం ఉంటుంది. అందుకే వాళ్ళు పుస్తక పాఠాలలో చేర్చే మార్పులు పుస్తక కర్త చేసిన మార్పుల లాగా అంగీకరించ బడతాయి. పుస్తకపఠితృ సమాజం పుస్తకానికి వేరే అర్థం ఇస్తే ఆ అర్థాన్ని ప్రతిబింబించే కవి ఆ పుస్తకానికి కర్త అవుతాడు. పుస్తకపఠితృ సమాజం నిష్కర్షగా, చాలా కొద్దిమంది ఏ మార్పులూ లేకుండా కొనసాగితే, ఆ పుస్తకం కూడా అలాగే ఏ మార్పులు లేకుండా కొనసాగుతుంది. ఉదా. పాణిని వ్యాకరణం, పతంజలి మహాభాష్యం, మొదలైనవి ఇలాంటివి. కానీ పుస్తకపఠితృ సమాజం విస్తారమైనదై దేశమంతా వ్యాపిస్తే ఆ పుస్తకాలలో మార్పులు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి.

గ్రంథాలకి కర్తలే కాకుండా చరిత్రలు వుంటాయి. సంస్కారాలు ఉంటాయి. చావు పుట్టుకలు ఉంటాయి. పునర్జన్మలుంటాయి. ఇవి ఏదో వేరే దొరికే వస్తువులు కావు. వాటి కర్తలకి యథార్థమైన జీవిత చరిత్రలుండవు. కాలంతో మారుతున్న వారి జీవిత చరిత్రల అయథార్థత్వమే పుస్తకాలకు ప్రాణం పోస్తుంది. అంటే పుస్తకాలు, వాటిని చదివే సమాజాలకి ప్రతిబింబాలు.

ఈ పరిస్థితి దాదాపు ఆధునికత మొదలవుతున్న రోజుల నుంచి మారడం మొదలు పెట్టింది. ఒక రకంగా అదే ఆధునికతకి గుర్తు. ఆధునిక కాలంలో పుస్తక రచయితకీ (ఈ మాట ఆధునిక కాలంలోనే అవసరమై కల్పించుకున్న కొత్త్త మాట) పుస్తకానికి వున్న సంబంధం ఎలా మారిందో ఇంకో వ్యాసంలో చెప్తాను.

(ఈ వ్యాసం నేను ఎమొరీలో, షికాగోలో, బ్రౌన్‌లో, యేల్‌లో ఇచ్చిన ఉపన్యాసాలకి లిఖిత రూపం. ఇది ఉపన్యాసంగా రాయబడింది కాబట్టి దీనికి ఆచూకీలు చూపించే పాదసూచికలు లేవు. ఎక్కడైనా, వాక్యాల తప్పులు కూడా వుండచ్చు. – నారా.)

(పాదసూచికలు మే 3వ తేదీ జత చేయబడ్డాయి – సం.)


  1. వాల్మీకి. శ్రీమద్రామాయణం, వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచంద్రుడు. హైదరాబాదు; ఆర్ష విజ్ఞాన ట్రస్టు; 1987; 1-15.
  2. పైదే; 1-16.
  3. ఈ కథే ఈదులపల్లి భవానీశకవి ధర్మఖండము (శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాశాల, పిఠాపురం, 1931) అనే పుస్తకంలో కూడా వుంది. భవానీశకవి సుమారు 1660-1700 ప్రాంతం వాడు.
  4. రఘునాథ నాయకుడు; వాల్మీకి చరిత్రము, పరిష్కర్త బి. రామరాజు; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు; 2008.
  5. రాజస ప్రవృత్తి కలవాళ్ళు ఏ విషయాన్నయినా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించకుండా, “అయధావత్” గ్రహిస్తారు. భగవద్గీత 18-31.
  6. ఈ సందర్భంలో తప్పకుండా చదవవలసిన రెండు ఇంగ్లీషు ప్రచురణలు; David Perkins, Is Literary History Possible?, The Johns Hopkins University Press; 1993. Michael Foucault, What Is an Author? (1969), in: Donald F. Bouchard (Ed.); Language, Counter – Memory, Practice: Selected Essays and Interviews by Michel Foucault. Ithaca/ New York: Cornell UP, 1977: 113 -138.
  7. ధ్వన్యాలోకం – తృతీయోద్యోతం.
  8. రసగంగాధరం – ప్రథమాననం.
  9. సుబ్బరామదీక్షితులు; సంగీత సంప్రదాయ ప్రదర్శిని; మొదటి సంపుటం; రెండవ ముద్రణ; ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి, హైదరాబాదు; 1973 (మొదటి ముద్రణ తేదీ లేదు); పే. 9-10.
  10. విస్సా అప్పారావు (సం); క్షేత్రయ్య పదములు; సరస్వతీ పవర్ ప్రెస్; రాజమహేంద్రవరము; 1963 (మొదటి ముద్రణ 1950).
  11. భల్లాలదేవ; భోజప్రబంధ; నిరణ్య సాగర్ ప్రెస్, 1932.

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి:

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 ...