నాయకరాజులు
భక్తికవుల్ని రాజకవుల్ని విడతీయడానికి కల్పించబడ్డ పైకథలు చూసిన తరువాత ఇంకొక రకమైన కథలు చూద్దాం.
నాయకరాజుల కాలంలో రాజే దేవుడైనాడు. ఆ కాలంలో కవుల్ని రాజకవులనాలా? భక్తికవులనాలా? ఆ కాలంలో వున్నవాడని చెప్పబడుతున్న క్షేత్రయ్యని గురించి రెండురకాల కథలూ ప్రచారంలో వున్నాయి. నిజానికి క్షేత్రయ్యని కల్పించినవి ఈ కథలే. క్షేత్రయ్య పేరుతో వున్న పదాలకి, ఆ తరవాత అలాంటి భాష లోనే కనిపిస్తున్న ఇతర పదాలకి, నిజమైన ప్రయోక్తలు వేశ్యలు. నాయకరాజుల కాలంలో వేశ్యావృత్తి సగర్వమైన వృత్తి. దీనికి సామాజికమైన ఆంక్షలు కానీ, నైతికమైన ప్రతిబంధకాలు కానీ అప్పుడు లేవు. వేశ్యలు సంగీతజ్ఞులు, రసజ్ఞులు, సాహిత్యవేత్తలు, తమ జీవితాన్ని తాము సగర్వంగా సగౌరవంగా నిర్వహించుకుంటున్న వాళ్ళు. వాళ్ళు పాడుకుంటున్న పదాలకి ఒక మొగకర్తను సమకూర్చవలసిన అవసరంలో క్షేత్రయ్య పుట్టాడని నా అనుమానం. వేశ్యావృత్తికున్న గౌరవం వెనకపడుతూ సమాజంలో ఇంకొక రకమైన ఆధిపత్యం అమల్లోకి వస్తోంది. క్షేత్రజ్ఞుడు అనే పేరుతో సుబ్బరామదీక్షితులవారు (1839-1906) సంగీతసంప్రదాయప్రదర్శినిలో9 ఒక కథ చెప్పారు.
తంజావూరు రాజైన విజయరాఘవ భూపాలుడు క్షేత్రయ్యని గొప్పగా ఆదరించి అనేక బహుమానాలు ఇవ్వడం ఆయన ఆస్థానంలో వున్న ఇతర కవులకి ఈర్ష్య కలిగించింది. మహారాజా ఇదేమిటి? ఏరా, రారా, పోరా అని పదాలు రాసే క్షేత్రయ్య మీద ఇంత గౌరవమా, ఇన్ని బహుమానాలా? అని వాళ్ళు తమ అభ్యంతరాన్ని తెలియచేస్తే క్షేత్రయ్య ఆ సంగతి విని కాంభోజిరాగంలో వదలకపోవే అనే పదం మూడో చరణం దాకా — “భామరో శకునము లడిగితి మువ్వగోపాలుడు వత్తునని కామించి నాధుల కలయు చెలులజూచి కరగి చింతనొందితి,” — చెప్పి మిగతా చరణాలని ఆస్థానకవుల్ని పూర్తి చేయమని తాను తీర్ధయాత్రకు వెళ్ళిపోతాడు. ఆస్థానంలో కవులు యెంత ప్రయత్నించినా ఆ మిగతా భాగాన్ని పూర్తి చేయలేరు. క్షేత్రయ్య తిరిగి వచ్చి “రామరామ ఈమేనితో వానిమోము చూడవలెనా మొదటిపొందే చాలు,” అని పూర్తి చేశాడట. ఇలాంటి కథే కాళిదాసుని గురించి కూడా చెప్తారు.
ఇదే క్షేత్రయ్యని గురించి విస్సా అప్పారావుగారు ఇంకో కథ10 చెప్పారు. వీరి కథలో క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఆయన కృష్ణాజిల్లా లోని మొవ్వ అనే గ్రామంలో వుండేవాడు. అతను ఒక వేశ్యను ప్రేమిస్తాడు. ఆ వేశ్య మువ్వగోపాల భక్తురాలు. ఆవిడ క్షేత్రయ్య ప్రేమను తిరస్కరించి, నువ్వు ఇంతవరకూ అన్ని పదాలు రాజుల మీదే రాశావు, దేవుడి మీద రాయమని ఉపదేశిస్తుంది. క్షేత్రయ్య ధ్యాననిమజ్ఞుడై మువ్వగోపాల పదాలు పాడుతూ, స్త్రీల పట్ల తన భావాలని మార్చుకుంటాడు. ఆ తరవాత ఆ వేశ్యతో కలిసి పాటలు పాడుకుంటూ క్షేత్రాలన్నీ తిరుగుతాడు. అప్పారావు గారు చెప్పిన కథ స్థూలంగా ఇది.
ఈ రెండు కథల్లో మొదటి కథ క్షేత్రయ్యని రాజకవి చేయడానికి చెప్పిన కథ. రెండవకథ క్షేత్రయ్యని భక్తికవి చేయడానికి చెప్పిన కథ. ఈ రెండు కథలకి మధ్య బోలెడు అంతరం వుంది. మొదటి కథ చెప్పుకున్న కాలంలో వేశ్యావృత్తికి, శృంగారానికి అగౌరవం లేదు. విస్సా అప్పారావుగారి కాలం నాటికి తెలుగు మధ్యతరగతి మేధావులు శృంగారాన్ని, ముఖ్యంగా దేవుడితో కలిపిన శృంగారాన్ని ఒప్పుకోలేక పోయారు. పైగా ఈ పదాలు అప్పటికీ వేశ్యలే పాడేవాళ్ళు. వాళ్ళ నుంచి ఈ పదాలని రక్షించి, వాటిలో మరీ ఇబ్బందిగా ఉన్న పదాలని తొలగించి క్షేత్రయ్యకి ఒక భక్తుడి స్థానాన్ని కల్పించే కథలివి. అంటే పాటల్లో అర్థం మారితే పాటల కవి కూడా మారాడన్నమాట.
చాటుకవులు
ఇకపోతే చాటుకవులు. వీళ్ళని గురించిన కథలు ఎవరు చెప్పారు, ఇవి ఎంత పాతవి, ఇవి ఎలా ప్రచారం లోకి వచ్చాయ్, వీటిని గురించి బోధపరుచుకోడానికి మనం సంస్కృతం లోను, తెలుగు లోను ఇతర భారతీయభాషలు కొన్నిట్లోను ఏర్పడిన చాటుసాహిత్య ప్రపంచాన్ని పరిశీలించాలి. మనకి చాటుపద్యాలు తెలుగు లోను, సంస్కృతం లోను చాలా ప్రచారంలో వున్నాయి. వాటి గురించిన కథలు మనం చెప్పుకుంటూ వుంటాం. అవి చాలా పుస్తకాల్లో, సంకలనాల్లో కనిపిస్తూ వుంటాయి. సి. పి. బ్రౌన్ ఈ పద్యాలు సేకరించి తనకు అలవాటైన పద్ధతిలో అన్నీ కలగలిపి కొన్ని సంపుటాలుగా చేశాడని, అవి ప్రాచ్య లిఖిత గ్రంథాగారంలో వున్నాయని మనకు తెలుస్తోంది. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు చాటుపద్యమణిమంజరి సంపుటుల్లో వీటిలో కొన్నిటిని వివిధస్తబకాలుగా విభజించారు కూడా. ఇటు తెలుగు లోను, అటు తమిళం లోను వీటికి ప్రచారం చాలానే వుంది.
విజయనగర సామ్రాజ్యం ముగిసిపోయిన తరువాత సాహిత్యం పతనావస్థకి చేరిందని, అక్కణ్ణించి క్రమంగా క్షీణించి, క్షీణించి క్రమంగా చితికిపోయిందని, ఆంగ్లేయ పరిపాలన ప్రభావం తోటే తెలుగులో ఆధునికతాపునరుజ్జీవనం మొదలయ్యిందని, తెలుగు సాహిత్యకారులు చెప్తుంటారు. నిజానికి ఆ కాలంలో సాహిత్యం చితికిపోలేదు సరికదా కొత్త రకాలుగా అభివృద్ధి పొందింది. అవన్నీ వివరించే అవకాశం ఈ వ్యాసంలో నాకు లేదు కానీ చాటుపద్య ఆవిర్భావం ఆ కాలంలో వచ్చిన గొప్ప మార్పు. సాహిత్యం రాజాస్థానాల్లో నుంచి పరిణత పాఠకుల చేతుల్లోకి వచ్చిందని చెప్పడానికి ఈ చాటువులు గుర్తు. ఈ చాటువుల కర్తలు రాజాస్థానాల్లో వున్నవాళ్ళు కాదు. అయినా ఈ చాటువులు రాజాస్థానాలని మరిచిపోవు. తెలుగులో ఈ పద్యాలు నోటిమాటగా ప్రచారం లోకి వచ్చినా సంస్కృతంలో మాత్రం ఒక పుస్తకంలో చేరాయి. భల్లాలసేనుడు సంకలనం చేసిన భోజప్రబంధం చాటుపద్యాల సంకలనమే. భల్లాలసేనుడు పదహారవ శతాబ్దపు చివరివాడు.
తెలుగులో చాటుపద్యాలు చెప్పినవాళ్ళు కృష్ణదేవరాయల ఆస్థానాన్ని మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు ఆ ఆస్థానాన్ని గురించి తమ అభిప్రాయాలని చెప్పడానికి అక్కడి కవుల్నే వాడుకున్నారు. ఈ చాటు పద్యాలన్నీ ఆ ఆస్థానాల చుట్టూ తిరుగుతూ వుంటాయి. దానితోపాటు చరిత్రలో యెక్కడా లేని తెనాలి రామలింగడు అనే వ్యక్తిని ఈ చాటుపద్యాలు కల్పించాయి. కృష్ణదేవరాయలకి, పెద్దనకి, ధూర్జటికి, తెనాలి రామలింగడికి, వాళ్ళు కల్పించిన తాతాచార్యుడనే పండితుడికి ఈ కథల్లో విలక్షణమైన పాత్ర వుంటుంది.
భల్లాలసేనుడి భోజప్రబంధంలో11 కూడా కాళిదాసుకి, భవభూతికి, భోజుడికి, దండికి ఇంకా ఒకే కాలానికి చెందని కవులకి జాగా వుంటుంది. వీళ్ళనందరినీ కలిపి ఒకచోట కథలు చెప్పడంలో మనం బోధపరుచుకోవలసింది — సాహిత్యాభిరుచి రాజాస్థానాల్లో లేని, పండితప్రపంచంలో లేని, విద్యావంతులైన సామాన్యపాఠకుల చేతిలోకి వచ్చింది అని. సాహిత్యాభిరుచి మారింది అని. ఈ ప్రపంచంలో కవి పాత్ర, రాజుపాత్ర, వికటకవి అనే పేరుతో వచ్చిన కొత్తకవి పాత్ర ఎలా వుందో చూడడానికి ఇప్పుడు ప్రయత్నిస్తాను.
ఒకసారి కాళిదాసు తనకి ఎంత దగ్గర స్నేహితుడో పరీక్షించి చూద్దామనుకుని భోజుడు తన వేషం మార్చుకుని సన్యాసి రూపంలో కాళిదాసు దగ్గరికి వెళ్ళి, ‘ఇవాళ భోజుడు చచ్చిపోయాడు, నీకు తెలుసా,’ అని అంటాడు. కాళిదాసు చాలా విచారంతో-
అద్యధారా నిరాధారా నిరాధారా సరస్వతీ
పండితాః ఖండితాః సర్వే భోజరాజే దివం గతే
అని అనగానే సన్యాసి రూపంలో వున్న భోజుడు హఠాత్తుగా చచ్చిపోతాడు. చచ్చిపోయినవాడు భోజుడే అని, తన వాక్బలం వల్ల అతడు మరణించాడని గ్రహించిన కాళిదాసు వెంటనే మాట మార్చి-
అద్యధారా సదాధారా సదాధారా సరస్వతీ
పండితాః మండితాః సర్వే భోజరాజే భువం గతే
అని అనగానే భోజుడు బతికి నిలబడతాడు. ఒక్కసారి ఈ శ్లోకాల నిర్మాణం చూడండి. అవి ఒకదానికొకటి పూర్తిగా పోలి వున్నాయి. అందులో వున్న దీర్ఘాచ్చులు మీరు చదివే గొంతుకను బట్టి అటు విషాదాన్ని ఇటు సంతోషాన్ని సమానంగా వ్యక్తపరుస్తాయి. వాటిలో వుండే అక్షరస్పష్టత వల్ల సరిగ్గా కావలిసిన చోట్ల మాట మారిస్తే రెండో శ్లోకం తయారవుతుంది. ఇంత స్పష్టమైన వాక్కు యదార్థాన్ని పరిమార్చగల, మళ్ళా పునరుజ్జీవింప చేయగల ఒక వశ్యవాక్కు గొంతుక ఇది — అని చెప్తుంది.
చాటుప్రపంచంలో కవి మనుష్యాతీతమైన శక్తులు గల విశేషవ్యక్తి. ఇలాంటి చాటుకవి విశేషమైన కథ లేకుండా తయారవడు. కాళిదాసుని గురించి చాటుప్రపంచంలో ఒక కథ వుంది. కాళిదాసు మొదట్లో ఒట్టి మూర్ఖుడు. గొర్రెలు కాసుకుంటూ బతుకుతుండేవాడు. ఒక రోజున తను తాను కూర్చున్న చెట్టుకొమ్మని తానే నరుక్కుంటున్నాడు. నిజంగా ఒక మూర్ఖుని కోసం వెతుక్కుంటూ వస్తున్న ఒక మహామంత్రికి ఈ కాళిదాసు కనపడతాడు. ‘నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే నరుక్కుంటున్నావు, పడి చచ్చిపోతావు సుమా,’ అని మంత్రి అతన్ని హెచ్చరిస్తాడు. పైనుంచి కాళిదాసు ‘నేను చావను, నువ్వే చస్తావు, తప్పుకో,’ అని అరుస్తాడు. వీడురా, నిజమైన మూర్ఖుడు! అని మంత్రి సంతోషించి అతన్ని కిందికి దింపుతాడు. అసలు సంగతి ఏమిటంటే, ఈ మంత్రిగారు మహారాజు కుమార్తెకి తన కుమారుణ్ణి ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నాడు. కాని, సకల విద్యాపారంగతురాలు అయిన ఆవిడ మంత్రికుమారుడు తగినంత చదువుకోలేదని తిరస్కరిస్తుంది.ఆమె మీద కక్ష తీర్చుకోవడానికి ఎలాగైనా ఒక పరమమూర్ఖుణ్ణి ఇచ్చి పెళ్ళి చేయాలని మంత్రి శపథం చేస్తాడు. అందుకు తగిన పరమమూర్ఖుణ్ణి వెతుకుతుంటే మంత్రిగారికి కాళిదాసు కనిపిస్తాడు.
ఆ మూర్ఖుణ్ణి తీసికెళ్ళి మంత్రి రాజుగారితో అతను మహాపండితుడని, ఒక ప్రత్యేక కారణం వల్ల చూడటానికి మూర్ఖుళ్ళా కనిపిస్తాడని మాయమాటలు చెప్పి నమ్మించి పెళ్ళి చేస్తాడు. ఆ రాత్రి పడకగదిలో రాజకుమార్తె తన భర్త మూర్ఖుళ్ళా నటించే పడింతుడు కాదని, నిజంగా మూర్ఖుడేనని గ్రహించి కాళిదాసుకి విద్య అనే మాట ఒక్కటి నేర్పి అర్ధరాత్రి కాళికాలయం లోకి వెళ్ళి లోపల తలుపులు వేసుకోమని చెప్తుంది. రాత్రి నగర సంచారానికి వెళ్ళిన కాళికాదేవి తెల్లవారు ఝామున తిరిగి వచ్చి తలుపు తడుతుందని, అయినా తలుపు తీయవద్దని ‘విద్య విద్య’ అని మాత్రమే అనమని చెప్పి పంపుతుంది. మూర్ఖుడైన కాళిదాసు అంత మూర్ఖంగాను వెళ్ళి కాళికాలయంలో తలుపు బిగించుకుని కూర్చుంటాడు. కాళికాదేవి తలుపు తడితే, ‘విద్య విద్య’ అని మాత్రమే అంటాడు. తెల్లవారి పోతోంది, జనం కంటపడతాను అని భయపడిన కాళికాదేవి తలుపు కొద్దిగా తెరిచి నాలిక మాత్రం బయట పెట్టమని చెప్పి కాళిదాసు నాలిక మీద బీజాక్షరాలు లిఖిస్తుంది. ఒక్కపట్టున కాళిదాసు అద్భుతమైన సంస్కృతంలో కాళీస్తవం మొదలు పెడతాడు. అలా పండితుడు, కవి అయిన కాళిదాసు ఇంటికి వచ్చి పరమానందంగా తలుపు తీయమని భార్యని అడుగుతాడు. ఆ మాటలో మార్పుని గ్రహించిన కాళిదాసు భార్య “అస్తికశ్చిద్వాగ్విశేషః” (ఈ మాటల్లో ఏదో తేడా వుంది) అని ఆశ్చర్యంతో తలుపు తీస్తుంది. ఆవిడ మాటలు సగౌరవంగా స్వీకరించిన కాళిదాసు ఆ మాటలతోటే తన మూడు కావ్యాలు మొదలు పెడతాడు. ‘అస్త్యుత్తరస్యాందిశిదేవతాత్మా’ అని కుమారసంభవము ‘అస్తి’తోనూ, ‘కశ్చిత్కాంతావిరహగురణా’ అని మేఘదూతము ‘కశ్చిత్’తోనూ, ‘వాగర్థావివసంపృక్తౌ’ అని రఘువంశము ‘వాక్’తోనూ మొదలు పెట్టి, తన భార్య మాటలకి సార్థకత కల్పిస్తాడు. కాళీవరప్రసాదం వల్ల కవి అయాడు కాబట్టి, ఆయన కావ్యాలకు మనుష్యాతీతమైన శక్తి వస్తుంది. దానితోపాటే ఆయనకి శాపానుగ్రహ శక్తి వస్తుంది.
చాటుప్రపంచంలో కవి మామూలు మనుషులకి కనిపించని (సూర్యుడికి కూడా దొరకని) విశేషాలు గమనించ గలవాడని కృష్ణదేవరాయల కాలంలో వున్న కథలు మనకి చెప్తాయి. సరిగ్గా ఇలాంటి కథలే తమిళంలో కంబన్ని గురించి కూడా వున్నాయి. సుమతీశతకంలో రెండు రకాలుగా ప్రచారం లోకి వచ్చిన రెండు పుస్తకాలకి కర్తలు ఎలా ఏర్పడతారో ఇంతకు పూర్వం రాసిన వ్యాసంలో వివరించాను. ఇంతకీ ఫలితార్థమేమిటంటే భారతీయ వాఙ్మయప్రపంచంలో కవి పుస్తకంలో అర్థాన్ని బట్టి యేర్పడతాడు. పుస్తకంలో అర్థం మారితే కవి మారతాడు. అంటే కవి పుస్తకాన్ని రాయడు. పుస్తకమే కవిని రాస్తుంది.
అక్షరాలా ఎవరు పుస్తకాన్ని రాశారు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తెలుగు సాహిత్యం కాని, సంస్కృత సాహిత్యం కాని, ఇంకా చాలా ఇతర భారతీయ సాహిత్యాలు కాని చెయ్యలేదు. కవి అంటే పుస్తకానికి తన పేరుతో కవితా గౌరవాన్ని కల్పించేవాడు అని అర్థం. ఆ పుస్తకానికి పాఠకులు చెప్పుకున్న అర్థానికి అనువైన జీవిత చరిత్ర కలవాడు అని అర్థం. అంతేకాని అక్షరాలా ఆ పుస్తకాన్ని రాసిన వాడు అని అర్థం కాదు. నిజానికి నూటికి తొంభై పాళ్ళు ఆ పేరు ఉన్న వ్యక్తే ఆ పుస్తకాన్ని రాసి వుండవచ్చు. కాని అది కాదు మనకి ప్రధానం. అందుకే మనకి కవుల జీవిత చరిత్రలు లేవు. కవుల కథలే ఉన్నాయి. నన్నయ ఎప్పుడు పుట్టాడు, ఎవరి దగ్గర పని చేశాడు, ఎవరితో దెబ్బలాడాడు, ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆయన ఎలా వుండేవాడు, ఎలా బతికాడు, ఎలా మరణించాడు, ఆయనకీ రాజరాజనరేంద్రుడికీ ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలా వుండేవి? అనేవి మనకి తెలియవు. తెలియాలని మనం కోరుకోలేదు కూడా. మనకి కావలిసింది నిజజీవితంలో నన్నయ కాదు, భారతం గౌరవప్రదమైన పుస్తకం కావడానికి తోడ్పడే నన్నయ. మన మనస్సులో ఆ నన్నయ ‘నిత్య సత్యవచనుడు, మత్యమరాధిపాచార్యుడు,’ అంతే. అప్పకవి వొచ్చి నన్నయ అసూయతో భీమకవి రాసిన రాఘవపాండవీయాన్ని అణగదొక్కాడంటే, మనం ఒప్పుకోలేకపోయాం, మనకి నన్నయ అలాంటి పని చెయ్యడని నమ్మకంగా తెలిసినట్టు. హైదరాదు టాంక్ బండ్ మీద వున్న నన్నయ మన ఊహలకి తగినట్టుగా మనం తలపించుకున్న ఆకారం.