సంగీత సాహిత్య శ్రీనివాసుడు


పి.బి. శ్రీనివాస్ గారికి జయాశాస్త్రి కితాబు

శ్రీనివాస్ సతీమణి జానకి కున్నప్పాకం వింజమూరి వారింటి ఆడపడుచు. శ్రీనివాస్ ప్రత్యక్షరానికీ ప్రత్యక్షసాక్ష్యం ఆమె. “నా ఆత్మసఖియైన నాదానికి, నా ఆత్మ ఆరాధించే సప్తస్వరవేదానికి, నా ఆత్మస్వరూపమైన నిజానికి, నా ఆనంద కళారాధనకి” అని శ్రీనివాస్ ఆ మనస్వినికి తన దశగీత గీతసందేశము కావ్యాన్ని అంకితం చేశారు. ఆ దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కుమార్తె. నలుగురికీ తల్లిదండ్రుల సంగీతవారసత్వం అబ్బింది. కుమార్తె డా. నల్లాన్ చక్రవర్తుల లత శాస్త్రీయ సంగీత గాయని. అన్నమాచార్య కృతులలో ఆలయసంప్రదాయాన్ని అధికరించి అత్యుత్తమ పరిశోధన చేసి తెలుగులో పిహెచ్.డి. పట్టాన్ని పుచ్చుకొన్నారు. ఆమె అత్తమామలు ఇందిరా జగదాచారి, నల్లాన్ చక్రవర్తుల జగదాచారి గొప్ప విద్వద్దంపతులు. జగదాచారి సంస్కృతవిద్వన్మణి. ఇందిర చిలకమఱ్ఱి వారి ఇంటి ఆడపడుచు. ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని. డిల్లీ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగం ప్రొఫెసరుగా పనిచేసి రిటైరైనారు. ఢిల్లీలో వీరి శిష్యులు కాని సంగీతాభిమానులుండరు. వీరంతా విఖ్యాతులే. శ్రీనివాస్ చెల్లెలి వియ్యపురాలు చీమలకొండ జయాశాస్త్రి మంచి కవయిత్రి. శ్రీనివాస్ అశేషశేముషీవైభవాన్ని అభివర్ణిస్తున్న వారి రచన ఈ పక్కన చూడగలరు.

శ్రీనివాస్ గారి పార్యంతిక రచన Pranavam. అనేకవిధాల అది ఆయన అంతస్సారానికి, అంతర్ముఖీన కావ్యాలోకానికి అభివ్యంజకం. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఉరుదు, ఇంగ్లీషు భాషలలో వివిధప్రక్రియలలో ఆయన రచించిన రచనలను స్వహస్తలిఖితరూపకంగా అచ్చువేసిన ఉద్యత్నం. బహుభాషాకోవిదులైన తెలుగు కవుల పరిషత్తులో ఇది వారిని ముందు వరుసలో కూర్చొనబెడుతుంది. భాషాకోవిదత్వం అంటే ఎంతో కొంత లిపిపరిజ్ఞానం, పదసంపద తీరుతెన్నులు తెలిసి ఉండటం కాదు. సంస్కృతం రాకుండానే మంచి తెలుగు భాషాపరిజ్ఞానం వల్ల, సంస్కృతవిభక్తుల పరిచయం వల్ల సంస్కృతంలో శ్లోకాలను, స్తోత్రాలను ప్రకటిస్తున్న తెలుగు కవులు ఎందరో ఉన్నారు. ఆ కవితారచన వారి సంస్కృతభాషా పరిజ్ఞానానికి నిదర్శకం కాదు. సంస్కృతాన్ని చక్కగా అన్వయించుకొంటూ, శ్లోకాలకు అర్థం చెప్పగలిగిన శక్తి ఉండీ సంస్కృతం మాట్లాడలేనివాళ్ళు, వ్రాయలేనివాళ్ళు ఉన్నారు. అందువల్ల శ్రీనివాస్ గారు ఎనిమిది భాషలలో కవితారచనను చేయగలగటం విశేషంగానే భావించాలి. నాకు తెలిసి తెలుగువారిలో వేదం వెంకటాచలయ్యర్, మహానుభావులు వేదం వేంకటరాయశాస్త్రి తమ్ములు, పేరొకటి విన్నాను. వారు పద్దెనిమిది భాషలలో మహావిద్వాంసులట. ఆఱేళ్ళ క్రితం నెల్లూరులో వారి మనుమలు వేదం వెంకట్రామన్ ఇంటికి వెళ్ళినపుడు ఇప్పటికీ స్వస్థావస్థలో ఉన్న వారి గ్రంథాలనేకం చూశాను. నాకు తెలియని ఏవేవో లిపులలో ఉన్న ఆ పుస్తకాలను చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అయ్యరుగారి పేరు వినటం, వారి గ్రంథాలను చదవటమే కాని, వారిని చూడగలిగిన కాలంలో నేను లేను. నా సమకాలంలో అటువంటి మహాత్ములొకరు మహావిద్వాంసులు, మహాకవి కోట సుందరరామశర్మని మచిలీపట్నం వెళ్ళినపుడు చూడగలిగాను. వారు ద్వాదశ భాషాకోవిదులు. పన్నెండు భాషలలో రచనలు చేశారు. ఆ రచనలను ముద్రించారు. బహుశః లాటిన్ భాషలోనికి తెలుగు కవుల పద్యాలను అనువదించిన కవి వారు తప్ప వేఱొకరు లేరేమో. తిరుపతి వెంకటకవులు, త్రివిక్రమానంద భారతీస్వామిగా సన్న్యసించిన మహావిద్వాంసులు కానుకొలను త్రివిక్రమరావుల ప్రత్యక్షశిష్యులైన వీరు ఇటీవలే పరమపదించారు. తెలుగు పద్యం ఎంత అందంగా వ్రాస్తారో. తెలుగువాళ్ళ దురదృష్టం కొద్దీ అంతర్హితంగానే ఉండిపోయారు. ఆ మధ్య కొన్నాళ్ళ క్రితం హైదరాబాదులో ప్రసిద్ధ విదుషీమణి డా. యశోదారెడ్డి గారింటికి వెళ్ళినపుడు ఆమె తమ రచనలన్నింటిని నా చేతిలో పెడుతూ, ఒక కథాసంపుటి విషయంలో మాత్రం సందేహిస్తూ అన్నారు: బాబూ! ఇది పూర్తిగా తెలంగాణా మాండలికంలో రాసేను. నీకు అర్థమవుతుందో? లేదో? అని. ఒక్క తెలుగు విషయం అర్థం చేసుకోవటానికే ఒక జీవితకాలం చాలదే, ఇన్నిన్ని భాషలను నేర్చుకోవటానికి ఎన్ని జీవితకాలాలు కావాలో.

‘ప్రణవం’ ప్రత్యేకత కేవలం శ్రీనివాస్ బహుభాషాకౌశలి కానే కాదు. అందులో ఆయన చిత్రకవితలతో పాటు తమ సమకాలీకులను గుఱించి వ్రాసుకొన్న ఎన్నో విలువైన జ్ఞాపకాలున్నాయి. కొంగర జగ్గయ్య, టి.యల్. కాంతారావు, పి. భానుమతి, జెమినీ గణేశన్, పుహళేంది వంటి ఆత్మీయులు స్వహస్తాలతో శ్రీనివాస్‌ని అధికరించి వ్రాసిన సత్కారవాక్యాలున్నాయి. ఆయన అందులో తన సమకాలికులైన లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జిక్కి, ఎ.యం. రాజా, రావు బాలసరస్వతి, నౌషాద్, సి. రామచంద్ర, మెహదీ హసన్, ఘులామ్ అలీ, పర్వీన్ సుల్తానా, శంకర్ జైకిషన్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, టి.ఆర్ జయదేవ్ వంటి వందలాదిమంది సంగీత కళాకారులు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు, కవులు, రచయితల గుఱించి తనకేర్పడిన అభిప్రాయాలను ఎంతో అందంగా పొందు పఱిచారు. ఎనిమిది భాషల పీఠికను వ్రాశారు. ఎనిమిది భాషలలో కవితలను వ్రాశారు.

ఒకచోట పి.బి. శ్రీనివాస్ తన గుఱించి ఇలా వ్రాసికొన్నారు:

P.B. Sreenivos: A devout Singer-Poet believing especially in Melody and expression, with a flair for languages and creative as well as innovative compositor of Poems and Melodies!

అదే ఆయన జీవితానికీ, సంగీతానికీ, సాధనకూ, సిద్ధికీ సమస్తానికీ సమీక్షావాక్యం!

సహస్రచంద్ర దర్శనోత్సవం చేసికొని, పూర్ణపురుషాయుషాన్ని అనుభవించి, సంతతి సుఖసంతోషాలను చూసి, కర్తవ్యకర్మలన్నీ నెఱవేరి కర్మశేషం పూర్తయాక తమ 82వ యేట మొన్న ఏప్రిలు 14వ తేదీన ఇంద్రసభను అలంకరించటానికి ఐహికాన్ని త్యజించారు. లవ్లీ లవ్ సాంగ్స్‌లో ఆయనే వ్రాసుకున్నట్టు,

People say that love is blind

My life says that love is kind!


(పూజ్యులు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు పరమపదాన్ని చేరుకొన్న వార్తను వినగానే దిగ్భ్రాంతిని పొంది మాటలు తోచని నన్ను ఈ నివాళి వ్యాసం వ్రాయమని ఆదేశించిన మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు, రచనకు ప్రోత్సహించిన శ్రీ పరుచూరి శ్రీనివాస్, శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారలకు నా ధన్యవాదాలు. వ్యాసరచనకు తోడునిలిచి ఎనలేని సహాయం చేసిన శ్రీనివాస్ గారి కుమారులు శ్రీ ప్రతివాదిభయంకరం రాజగోపాల్ గారికి, మాన్య విదుషీమణి శ్రీమతి ఇందిరా జగదాచారి గారికి, శ్రీనివాస్ గారి కుమార్తె డా. నల్లాన్ చక్రవర్తుల లత గారికి, అల్లుడు డా. నల్లాన్ చక్రవర్తుల కృష్ణమణి గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి.)


ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి:

ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు ‘నయాగరా’ కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని సాహిత్య లక్షణ చిత్రకవిత్వాలపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి “తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం” అన్న ప్రశంస పొందారు. విజయవాడ ఆకాశవాణిలో నాలుగేళ్ళు, ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో 38 సం॥లు పనిచేశారు. ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ వ్యాస సంపుటి ఇటీవలి రచన.

 ...