సంగీత సాహిత్య శ్రీనివాసుడు

తన కీర్తిప్రతిష్ఠలు ఇలా దిశావ్యాప్తం అవుతున్న తరుణంలోనే సంగీతశాస్త్ర ప్రవర్తకుడైన నారద మహర్షిని, ఆ మహర్షి భక్తాగ్రేసరుడైన వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని సన్నుతిస్తూ ఆయన ‘నవనీత సుమసుధ’ అనే అష్టరాగమాలికను నవీనంగా రూపొందించారు. (న)వరస కానడ, (వ)సంత, (నీ)తిమతి, (త)పస్విని, (సు)వర్ణాంగి, (మ)లయమారుతం, (సు)నాదవినోదిని, (ధ)న్యాసి అనే ఎనిమిది ప్రకృతి రాగాల సరస సమేళనం అది. ఆ రాగాల ఆద్యక్షరాల సమావేశమే నవనీతసుమసుధ అయింది.


డైమండ్ కీ

ఇదే కాలంలో శ్రీనివాస్ సంగీత మేళకర్త రాగాల స్వరలక్షణాన్ని, రాగస్వరూపాన్ని గుర్తుంచుకోవటానికి ‘వైర ఇసై’ అనబడే ఒక ‘డైమండ్ కీ’ సూత్రాన్ని రూపొందించారు. ఇది వారి రాగస్వరూపాభిజ్ఞతకు, గణితశాస్త్రకోవిదత్వానికి, స్వరగ్రామసంగ్రహాన్ని విద్యార్థులకు నేర్పి వారి విద్యార్థిత్వానికి ప్రాతిపదికను కూర్చాలని చేసిన ప్రయత్నం. ఇప్పటికే పెద్దదవుతున్న ఈ ప్రస్తావికలో దీని విపుల వివరణను ఇవ్వటంలేదు. శ్రీనివాస్ దీనిని ప్రకటించిన వెంటనే భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, పద్మవిభూషణ్ డి.కె. పట్టమ్మాళ్, మెల్లిసై మణ్ణన్ విశ్వనాథన్, సంగీత విద్వాన్ జి.యస్. మణి వంటి మహావిద్వాంసులు శ్రీనివాస్‌ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఆ సమయంలో ఆయనకి అభిమానుల నుంచి ఉత్తరాల వర్షం కురిసిందంటే అతిశయోక్తి కాదు. ఆనాటి ఒక ‘తలపు మెఱపు’ ఛందోరంగానికి విస్తరించి తన గాయత్రీ వృత్త నిర్మాణానికి, శ్రీనివాస వృత్త కల్పనకు కారకం అయిందని ఆయన అన్నారు.


డైమండ్ కీ

ఒక విధంగా శ్రీనివాస గాయత్రీ వృత్తములు శ్రీనివాస్ అఖండమైన కల్పనాశక్తికి, అపూర్వమైన పద్యనిర్మాణచాతురికి, ఛందోవైభవానికి నిజమైన తార్కాణం. ఆయన సారస్వతసర్వస్వంలో పాఠకులు, పరిశోధకులు చిరకాలం తలచుకొనే గ్రంథం అదేనని నా నిశ్చితాభిప్రాయం. సంస్కృతంలో భోజుడు సరస్వతీ కంఠాభరణంలో చెప్పిన ‘కల్పిత కల్పలతా బంధం’ ఒక్కటే కొంత దీనికి సాటికి, పోటీకి రాగలుగుతుంది. అప్పకవి ఒక్క ఉత్పలమాలలో నుంచి అంతర్లీనంగా ప్రస్తారక్రమాన కల్పింపగల శ్రీ – వాణి – పద్మ – అంబ – రతి – దరధ్వని తాళము మొదలైన పద్యాలతో శ్రీవాణీపద్మాంబా రతిదర ధ్వనితాళము అనే గర్భచిత్రాన్ని రూపొందించి, అప్పకవీయంలో దానిని నివేశింపజేశాడు. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో 808వ పద్యంగా ఒక అపూర్వమైన గర్భబంధచిత్రాన్ని ప్రకల్పించాడు. నాదెండ్ల పురుషోత్తమకవి తమ అద్భుతోత్తర రామాయణములో ఎన్ని వేల విధాలుగా అయినా చదవటానికి వీలుండే ఒక సీసపద్యాన్ని వ్రాసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే అవన్నీ ఒక ప్రసిద్ధమైన పద్యంలో ఎన్నో మఱికొన్ని ప్రసిద్ధమైన పద్యాలను గర్భితంగా కూర్చే చిత్రరచనలు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ అటువంటివి పదులకొద్దీ కావ్యాలున్నాయి. కానీ శ్రీనివాస్ రచన అటువంటిది కాదు. ఒక గాయత్రీ వృత్తంలో నుంచి, ఒక శ్రీనివాస వృత్తంలో నుంచి పాఠకుడు శ్రీ కళా స్తంభ సూత్రాన్ని అనుసరించి (దీనిని మఱొక వ్యాసంలో వివరిస్తానని ఇందాక అన్నాను) తెలుగు వృత్తము, ఉమర్ ఖయామ్ వృత్తము మొదలైన కొత్త వృత్తాలను తన ఇష్టానుసారం సృష్టించుకోవటానికి వీలుంటుంది. ఆ వృత్తాలకు పాఠకుడు పెట్టుకోవలసిన పేర్ల సూత్రం గుర్తుంటే వందలకొద్దీ పద్యాలను గర్భితంగా నిర్మింపవచ్చునన్న మాట. ఆ విధంగా ఇది చిత్రకావ్యవాఙ్మయానికి ఒక అపూర్వమైన అలంకారం.

“గాయత్రీ వృత్తము నవ్యము, భవ్యము, స్తవ్యము. ఇది యరసి చూడగా, బహుశః ఆనాటి వేంకటరత్నము ఈనాటి శ్రీనివాస్‌గా నవతరించెనేమో యని నా యనుమానము” అని పీఠికను వ్రాసిన శ్రీ రావూరి దొరసామిశర్మ అన్నారు.

దశగీత గీతసందేశం

శ్రీనివాస గాయత్రీ వృత్త రచనానంతరం శ్రీనివాస్ రచించిన మఱొక చిత్రకావ్యం ఇది. పేరుకు దశగీతమే కాని, నిజానికి ఇందులో మొత్తం పదకొండు గీతపద్యాలున్నాయి. గ్రంథ ముద్రణ సంవత్సరం లేదు కాని, వెనుక అట్టమీద 1978లో అచ్చయిన ‘లవ్లీ లవ్ సాంగ్స్’ ఆంగ్ల గీతాల సంపుటి ముద్రణ విషయం ఉన్నది. ఇది వీరి తృతీయ ప్రకటన అని ఉన్నది. 1980లో లవ్లీ లవ్ సాంగ్స్ ద్వితీయ ముద్రణ వెలువడింది. కనుక 1979 ఏప్రిల్ నెలలో శ్రీనివాస గాయత్రీ వృత్తములు ప్రకటించిన వెంటనే దీని ప్రకాశన జరిగినదని ఊహించాలి. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి దాశరథి, విద్వాన్ రావూరి దొరసామిశర్మ, ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఎం.ఎస్. రెడ్డి అభిప్రాయాలను వ్రాశారు. శ్రీనివాస్ ధర్మపత్ని “ఆత్మసఖి యైన నాదానికి” శ్రీమతి జానకికి ఇది అంకితం.

దశగీత గీతసందేశం ఒక ‘అంతర్లాపి’ వర్ణచిత్రకావ్యం. ఒక పద్యంలో గర్భితంగా కొన్ని అక్షరాలుంటాయి. ఆ అక్షరాలను కలుపుకొని చదివితే ఒక లఘువాక్యం అవుతుంది. అంటే, ఒక వాక్యాన్ని కవి ముందుగా కూర్చుకొని, దాని చుట్టూ పద్యపాదాలను అల్లుతాడన్నమాట. ఇది చక్రబంధం, నాగబంధం, రథబంధం మొదలైన బంధచిత్రాలలోనూ ఉన్నదే. చ్యుతక చిత్రాలలోనూ ఇటువంటి ఇటువంటి ధోరణి ఉన్నది. సంస్కృతంలో మేఘవిజయ గణి దిగ్విజయ మహాకావ్యంలోనూ, లోలింబరాజు వైద్యక రాజీయం లోనూ; తెలుగులో వావిలికొలను సుబ్బారావు కౌసల్యా పరిణయం లోనూ, అల్లమరాజు రంగశాయి కవి చంపూ భారతము లోనూ ఇటువంటి ‘అంతర్లాపి’ చిత్రరచన లున్నాయి. పద్యాలతో పాటు శ్రీనివాస్ ఇందులో గేయాలను కూడా వ్రాశారు. కావ్యం నుంచి పద్యాన్ని గాక ఒక గేయాన్ని మాత్రం చూపుతాను:

నియ[మా]లన్నీ పాటించాలి!
సమ[తా]గానము సాగించాలి!
భేద[పి]శాచము విజృంభించితే!
కుల[త]త్త్వాలకు శిరసువంచితే!
చన[రు] జను లైకమత్యపు దారిని!
కాకు[లు] నవ్వును చూసి వారిని!
మన[దే]శానికి సంఘటన బలము!
మాన[వ] ప్రగతి మన ఆదర్శము!
బాధ్య[త] అంతా సదా ప్రజలదే!
కొల్ల[లు]గ పండు పంట జనులదే!

ఇది గేయం. ఇందులో కవితాసౌందర్యానికంటే చిత్రకల్పనకే ప్రాధాన్యం ఉన్నా, తక్కిన చిత్రకవుల వలెనే శ్రీనివాస్ భావసౌందర్యానికి, వ్యర్థపదాడంబరం లేని సుందర భావచిత్రనిర్మితికి ప్రాధాన్యం ఇచ్చారు. దశగీత గీతసందేశం లోని పది గీతాలలో ఈ విధంగా శ్రీనివాస్ పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా ఆరాధించాలో పది సందేశవాక్యాలను అందించారు. కావ్యారంభంలో, తిరుమలేశ! శ్రీనివాస! నమో వేంకటేశ్వరా! అన్న గర్భాక్షర భక్తినివేదన ఉన్నది. కావ్యంలోని దశగీతాలలో

1) జననీజనకుల దీవన
2) మనిషికదే ఘనసాధన
3) మాతాపితరులు దేవతలు
4) ధాత రీతిగా జన్మదాతలు
5) వారల ప్రేమ సుధాజలధి
6) వారి సేవ నవరత్ననిధి
7) వారి పలుకులే వేదములు
8) భక్తిపాత్రములు పాదములు
9) వారి దయ కల్పభూరుహము
10) వారి పూజ వరదాయకము

అన్న గీతసందేశాలు ఉన్నాయి. ఇందాకటి ఉదాహరణలో వలెనే ఒక్కొక్క గీతమాలికలోనూ మధ్యాక్షరాలను వరుసగా కూర్చుకొంటే ఈ పై వాక్యాలు వస్తాయన్నమాట. చిత్రకావ్యాన్ని సమంజస భావగర్భితంగా, ఉత్తమ సందేశాత్మకంగా రూపొందించాలన్న ప్రయత్నం నిజంగా మెచ్చదగినది.

గొప్ప కళాకారులకు, విజ్ఞానవేత్తలకు, మహనీయులకు ఒక కళలో శిఖరాగ్రానికి ప్రయాణించి పరమావధిని చేరుకొన్నాక, ఆ కళలో ఆ శాస్త్రంలో పొందగలిగిన విజయాలేవీ లేవన్నంతగా విజయాన్ని సాధించిన తర్వాత తమకు సంబంధం అంతగా లేని వేఱొక రంగంలో గుర్తింపును పొందాలనే తహతహపాటొకటి ఉంటుంది. ఆ రెండవ రంగంలో వారి ప్రయత్నాలను చూసి జనం నవ్వుకోవటం కూడా ఉంటుంది. ఒక గొప్ప చిత్రకారుడు ఒక గొప్ప కవిని కూడా అని అనిపించుకోవాలని ప్రయత్నించటం, ఒక సంగీతవేత్త మఱొక శాస్త్రవేత్తగా రాణింపును కోరటం మనము చూస్తూ ఉన్నదే. అయితే, శ్రీనివాస్ విషయంలో అది అపవాదని చెప్పవచ్చు. ఆయన పెద్దగా కోరికలేమీ కోరుకోలేదు. తనకు అభిమానపాత్రమైన సంగీతాన్ని అభిమానంతో అభ్యసించి, పొందగలిగిన విజయాలన్నీ పొందారు. తెలుగుదేశంలో కవిగానూ, గాయనుని గానూ గౌరవాదరాలను పొందారు. తన అభివ్యక్తిని మెఱుగుపఱచుకొనే ప్రయత్నమే తప్ప ఆయన ఈ కవితాకళ మూలాన భేరీభాంకారాలను ఆశింపలేదు. ఆయన వ్యక్తిత్వంతో పరిచయం ఉన్నవారందరికీ తెలిసిన సంగతే ఇది.