సంగీత సాహిత్య శ్రీనివాసుడు

ఈ విధంగా అక్షరచ్ఛందస్సుల పరిధిని విస్తరించినంత మాత్రాన సరిపోదు. అది కేవలం వైనోదికప్రక్రియామాత్రవిశేషంగా పర్యవసిస్తుంది. పైగా గాయత్రీ వృత్తములో చెప్పుకోదగిన ‘గతి’ అంటూ ఏమీ లేదు. అందువల్ల శ్రీనివాస్ ఈ పరిధిని మఱింతగా విస్తరించి, 1979లోనే “సహనశక్తియును, కల్పనాప్రాభవంబును, భావాధిక్యతయు” కలిగిన అత్యంతాపూర్వమైన “శ్రీనివాస వృత్తము”ను ప్రకల్పించారు. వెనుక కరపత్రంగా ముద్రించిన గాయత్రీ వృత్తముతో కలిపి దీనిని శ్రీనివాస శ్రీ గాయత్రీ వృత్తములు అన్న పేరిట ఒక లఘుపుస్తకంగా ముద్రించారు. తెలుగు ఛందోరీతులలో ఇది ఒక అపూర్వమైన ప్రకరణం. అందుకు నైపథ్యానుసంజనగా కొన్ని నవీనవృత్తాలను కల్పించారు. ఆ కల్పన కొక్కొండ వేంకటరత్నం విరచిత బిల్వేశ్వరీయమును చూడటం వల్ల తీగసాగింది. ఆయన కల్పించిన ఆ నవీన వృత్తాలివి:

  • ర – స – మ – య – స – మ – య
  • జ – ల – జ –న – య – న
  • ర – మా – త – న – య
  • న – త – జ – నా – వ – న
  • న – గ – రా – జ – త – న – యా
  • సా – గ – ర – త – న – యా

ఈ వృత్తాల పేర్లన్నీ అందులోని గణాలే కావటం విశేషం. దీర్ఘం వచ్చిన చోట అది రెండు గణాలని గుర్తుంచుకోవాలి. రమాతనయ అంటే ర – మ – మ – త – న – య గణాలన్నమాట. ఈ క్రమప్రథతో శ్రీనివాస్-

ర – స – మ – య – రా – మ – నా – మ – భ – జ – న – ర – త – జ – న – తా – మా – న – స

అన్న గణాలతో 23 X 3 = 69 అక్షరాల ఒక సమవృత్తాన్ని చిత్రంగా ప్రకల్పించారు. ఆ పద్యానికి ‘రసమయరామనామ భజనరత జనతామానస’ అని పేరు పెట్టారు. ఈ చిత్రం ఇంతకు మునుపు లాక్షణికులు చేసినదే అయినా, ఒక పద్యానికి ఇంత పెద్ద పేరును పెట్టడం కూడా విశేషమే. ఇంత సుదీర్ఘమైన వృత్తం ఎన్నో ఛందస్సులో ఎన్నో వృత్తం అన్న విచికిత్స విద్యార్థులకైనా నిర్నిమిత్తమే అవుతుంది. ఇక పంచతాళ వృత్తాలలోనూ, శ్రీకళా స్తంభ కల్పన విషయంగానూ శ్రీనివాస్ చేసిన పరిశోధన సారాన్ని అన్యలాక్షణికుల నిర్వచనాలతో సరిపోల్చి తులనాత్మకంగా వేఱొక వ్యాసంలో వివరించటం బాగుంటుందనిపించి ఇక్కడ ఆ వివరణను కూర్చటం లేదు. ఈ కృషి సమస్తం శ్రీనివాస్ సరిక్రొత్తగా పింగళుడు, కేదారభట్టు మొదలైన ప్రాచీనుల పంక్తిపావనధోరణిలో ‘శ్రీనివాస వృత్తము’ అనే వృత్తసృష్టిని చేశారు.

శ్రీనివాస వృత్తము

శ్రీనివాస వృత్తములో పాదానికి 116 అక్షరాలుంటాయి. వాటి గణాల క్రమప్రథ ఇది:

UUU (మ) – IIU (స) – IUI (జ) – IIU (స) – UUI (త) – UUI (త) – UUU (మ) – UUI (త) – III (న) – IUU (య) – IUU (య) – IUU (య) – IIU (స) – UII (భ) – UIU (ర) – III (న) – UUU (మ) – IUU (య) – IUU (య) – IIU (స) – IUI (జ) – IIU (స) – IIU (స) – IIU (స) – IUI (జ) – UII (భ) – IIU (స) – IUI (జ) – IIU (స) – IIU (స) – IIU (స) – IUI (జ) – UIU (ర) – UUU (మ) – UII (భ) – III (న) – UUI (త) – UUI (త) – U (గ) – U (గ)

ఇవి 38 గణాలపై రెండు గురువులు అన్నమాట. మొత్తం [ 38 X 3]+2 = 114 + 2 = 116 అక్షరాలు. పద్యోదాహరణం ఇది:

మొదటి పాదం:

[శ్రీ] సప్తాచలవాస! శ్రీశ! వరదా! [శ్రీ] శ్రీనివాసా! స్ఫుర[చ్ఛ్రీ]వక్షా! వేంకటరమణ! సం[సే]వితాంఘ్రీ! మురారీ! [స్మి]తవక్త్రా! జితకోటిమన్మథ! హరీ! [శ్రే]యస్కరా! శ్రీధరా! [జీ]వనభాగ్యదాత! సర[సీ]రుహలోచన! లోకపావనా! [శ్రి]తజనపోష! నిర్గుణ! వ[శీ]కృతభక్తజనౌఘమానసా! [చి]దానందాత్మా! సర్వసుఖశుభదా! [శే]షపర్యంకశాయీ!

తక్కిన నాలుగు పాదాలూ ఈ విధంగానే ఉంటాయి. 1 – 13 – 20 – 30 – 37 – 50 – 57 – 66 – 77 – 87 – 98 స్థానాలలో యతి నిలుపబడింది. వృత్తం కనుక ప్రాస నియతి ఉన్నది.

అంతే కాదు. జాగ్రత్తగా గమనించి చూస్తే, ఈ శ్రీనివాస వృత్తం — 1) శార్దూల విక్రీడితం 2) మందాక్రాంత 3) మత్తేభ విక్రీడితం 4) ఉత్పలమాల 5) చంపకమాల 6) మేఘవిస్ఫూర్జితం, అన్న వృత్తాల సంయోగ సుయోగమని శ్ర్రీనివాస్ పేర్కొన్నారు. నేను ముందే చెప్పినట్లు ఇందులోని సాంకేతిక కళా స్తంభాలను గుఱించి వేఱొక వ్యాసంలో వివరంగా వ్రాస్తాను.

(ఈ శ్రీనివాస శ్రీ గాయత్రీ వృత్తములు 1979లో ఒకే సంపుటిగా వెలువడ్డాయి. ఇదే వారి తొలి పుస్తకం. మద్రాసులో శ్రీ ధనికొండ హనుమంతరావు క్రాంతి ప్రెస్‌లో ఇది అచ్చయినప్పుడు విజయవాడ ఆలిండియా రేడియోలో పనిచేస్తూ సెలవులో ఉన్న నన్ను శ్రీనివాస్ ప్రూఫులు సరిచూసిపెట్టమని అడిగారు. అది నిమిత్తంగా వారి ఛందఃపరిశోధనల గుఱించిన వివరాలు నాకు తెలిసివచ్చాయి.)


దర్శకుడు శ్రీధర్, పిబిఎస్

ఈ సాహిత్యకృషి విజయాస్పదంగా కొనసాగుతున్న తరుణంలోనే శ్రీనివాస్ చలనచిత్ర రంగంలో కూడా ఉత్తమ గాయనులుగా ఉన్నతశిఖరాలను అధిరోహిస్తున్నారు. తమిళ కన్నడ మలయాళ దేశాలలో లభించినంతగా వారికి తెలుగులో అవకాశాలు దక్కక పోవటానికి కారణాలు అందరికీ తెలిసినవే కనుక వాటి ప్రస్తావన ఇక్కడ నిర్నిమిత్తం అవుతుంది. 1951లో మిస్టర్ సంపత్ సినిమాతో ప్రారంభమయిన ప్రస్థానాన్ని గుఱించి ఈ సంచికలో విష్ణుభొట్ల లక్ష్మన్న, జెజ్జాల కృష్ణ మోహనరావు, పరుచూరి శ్రీనివాస్ సవ్యాఖ్యానంగా, సోదాహరణంగా చెప్పినదాని కంటె వివర్తించి నేను చెప్పగలిగినదేమీ ఉండదు. వారి గజల్ గీతరచనలోని ఛందఃప్రయోగ విశేషాలను గుఱించి, గానఫణితిని గుఱించి పరిశోధనలు అవసరం. ఆర్. నాగేంద్రరావు ‘జాతకఫలం’, మలయాళంలో ‘హరిశ్చంద్ర’, కన్నడంలో రాజ్ కుమార్‌కి పాడిన పాటలు, ‘ప్రేమపాశం’లో సుశీలతో, తమిళంలో జెమినీ గణేశన్, ఎం.జి. రామచంద్రన్, శివాజీ గణేశన్లకు పాడిన పాటలు, ‘పావ మన్నిప్పు’, ‘అడుత్త వీట్టు పెణ్’ పాటలు; సుశీల, జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, భానుమతి, జమునారాణిలతో పాడిన మధురగీతాలు, తెలుగువారికి ప్రియమైన పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి ఉన్నాయి. ఇవి గాక శారదా భుజంగ స్తోత్రం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, ముకుంద మాల, శ్రీ మల్లికార్జున స్తోత్రం, శ్రీ పురందరదాస కీర్తనలు, వంటి వాటిని గుఱించి నాకన్నా సమర్థులు వివరించగలరు. మదనకామరాజు కథలో ‘నీలి మేఘమాలవో’, భీష్మలో ‘మనసులోని కోరిక’, కానిస్టేబుల్ కూతురులో ‘చిగురాకుల ఊయలలో’, మంచిమనిషిలో ‘ఓహో గులాబీ బాలా’ వంటి గీతాలు అజరామరమైనవాటిని గుఱించి చెప్పవలసినది ఎంతైనా ఉంటుంది.

సంగీతోత్తుంగశృంగాలను అధిరోహిస్తున్న సంతోషమయ తరుణం లోనే శ్రీనివాస్ రచనాప్రతిభ దేశాంతరాలకు ప్రాకసాగింది. 1968లో అపోలో అంతరిక్ష నౌకాంతరం నుంచి ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రమండలంపై అడుగుపెట్టినప్పుడు శ్రీనివాస్ Man to Moon, Moon to God అనే కవితను మూవీలాండ్ పత్రికలో ప్రకటించారు. తమిళ చిత్రనిర్మాత వి. రాధాకృష్ణన్ దానిని గ్రామఫోను రికార్డుగా ముద్రించి, లూయీ ఆర్మ్‌స్ట్రాంగ్, అమెరికా అధ్యక్షులు నిక్సన్‌కు పంపించారు. వారి నుంచి ప్రశంసాత్మక లేఖలను అందుకొన్నారు.


ముఖ్యమంత్రి జయలలితతో

తమిళంలో జెమినీ గణేశన్, ఎం.జి. రామచంద్రన్, శివాజీ గణేశన్, తెలుగులో తాడేపల్లి లక్ష్మీ (టి.యల్) కాంతారావు, కన్నడంలో రాజ్ కుమార్ తదితరుల నటనాజీవితానికి వారి కంఠమాధురి ప్రాణం పోసింది. తనకాలం నాటి ప్రసిద్ధ గాయనీగాయనులు అందరితోనూ కలిసి పాడారు. వారిలో గీతా దత్, లతా మంగేష్కర్, పి. సుశీల, ఎస్. జానకి వంటి వారున్నారు. తనకాలం నాటి సంగీతదర్శకుల మెప్పు పొందారు. అసంఖ్యాకంగా అభిమానులను పొందగలిగారు. ఆంధ్రేతరప్రాంతాలలో లెక్కలేనన్ని గౌరవాలు వచ్చి వరించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్రప్రభుత్వ ఇయల్ ఇసై నాడగ మన్డ్రమ్ అధ్యక్షులుగా నియమితులై రెండు వందల మందికి పైగా కళాకారులకు సత్కారకార్యక్రమాలను నిర్వహించి అజాతశత్రువుగా మన్నన లందుకొన్నారు.

ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాదమణి బిరుదాలను స్వీకరించారు. స్వార్థం కోసం ఎంతకైనా దిగజారటానికి సిద్ధపడని నిర్మమునికి, స్వలాభం కోసం తలవంచే స్వభావం లేని స్వాభిమానికి, “మీఁదై నా కరంబుంట మేల్గాదే” అని నమ్మిన సర్వతంత్రస్వతంత్రునికి తెలుగుదేశంలో పురస్కారాలు ఎంతో అరుదుగా కాని దక్కలేదంటే ఆశ్చర్యమేమీ ఉండదు. ఈ పురస్కారపరంపరను అందుకొంటున్న తరుణంలో ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు.