సంగీత సాహిత్య శ్రీనివాసుడు

రావూరి దొరసామిశర్మ ప్రభావం శ్రీనివాస్ కవిత్వాభిప్రాయాలను చాలా వరకు ప్రభావితం చేసిందని చెప్పవచ్చును. ఛందస్సులో కొత్త కొత్త ప్రయోగాలను చేయాలనే ఊహను ఉత్సవింపజేసింది వారి ప్రభావమే. నిజానికి ఛందస్సులో పూర్వులు చేయని పరిశోధనలంటూ దాదాపు ఏవీ లేవు. దొరసామిశర్మ వద్ద చాలా పెద్ద గ్రంథాలయం ఉండేది. ఛందోగ్రంథాలన్నీ ఉండేవి. స్వయంగా తామే కొన్నింటిని పరిష్కరించారు. ఎక్కడెక్కడి గ్రంథాలయాలలోని అపురూపమైన లిఖిత పుస్తకాలకూ ఆయన సొంతంగా ప్రతులు వ్రాసుకొన్నారు. వ్యాకరణంలో గొప్ప కృషి చేశారు. ఒక ఛందోవ్యాకరణ సంహితాసర్వస్వాన్ని రూపొందించాలని ప్రయోగాలను సేకరించారు. వాటిని చూస్తున్నప్పుడు శ్రీనివాస్‌కి దొరసామిశర్మ గుర్తించినవి కాక మఱేవో కొత్త విషయాలను కనుక్కోవాలని అనిపించటం సహజమే. అందువల్ల వర్ణ మేరువు, వర్ణ పతాక, మాత్రా మేరువు, మాత్రా పతాక, వర్ణ మర్కటి, మాత్రా మర్కటి, ప్రస్తారక్రమాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. కన్నడ భాషాభిమానం వల్ల అక్కడ ఛందస్సులో జరిగిన పరిశోధనలను తెలుసుకొన్నారు.


పి. బి. శ్రీనివాస్

టి. నగరులో పాండీ బజారుకు సమీపంలో ఆరుద్ర ఇంటి దగ్గఱే శ్రీ బి. నాగరాజారావని ఒక సుప్రసిద్ధ కన్నడ పాత్రికేయులు ఉండేవారు. సంస్కృత ప్రాకృత కన్నడాలలో ఏదన్నా పుస్తకం ఆయన వద్ద లేకపోతే అసలు అచ్చు కాలేదనే అనుకోవాలి. అంత పెద్ద గ్రంథాలయం వారిది. అద్దె యింటిలో ఆయన పుస్తకాలకు చోటు చాలకపోతే ఇంటాయన సహృదయంతో తమ ముందు గదిలో బీరువాలతో సహా చోటిచ్చినంత పెద్ద గ్రంథాలయం. శ్రీనివాస్ ఆయన సాంగత్యంలో షట్పదీ ప్రకరణాలలో కృషి చేశారు. నాగరాజారావు నీలకంఠయ్యతో కన్నడ సాహిత్యసమస్యలపై కేశాకేశిగా వివాదపడుతున్న రోజులవి. వారి వ్యాసాలను బట్టి శ్రీనివాస్ కన్నడం ఛందస్సులోనూ పరిశోధనలు చేశారు. మేరుప్రస్తారం ఉక్త నుంచి ఉత్కృతి వఱకు షడ్వింశతిచ్ఛందాలకే ప్రసిద్ధంగా ఉన్నా ఇరవై ఆఱుకు పైగానూ అక్షరచ్ఛందస్సులు అనేకం ఉన్నాయని గుర్తించారు. లాక్షణికులు ఇరవై ఏడు నుంచి నలభై అయిదు దాకా గుర్తించిన వాటిని పరిశీలించారు. త్రిభంగ్యాదులు, ఉద్ధురమాలలు, ఉపరివృత్తాలు, దండకాదులు ఉన్నాయి. ఆ కృషిని ఇంకా కొనసాగిస్తే ఎలాఉంటుంది?

గాయత్రీ వృత్తము

ఆ ఆలోచనే శ్రీనివాస్‌కి తెలుగు ఛందశ్శాస్త్రవిజ్ఞాతృమండలిలో అజరామరమైన స్థానాన్ని కల్పించింది. ‘గాయత్రీ వృత్తము’ అనే అపూర్వమైన ప్రయోగాన్ని చేశారు. షడ్వింశతిచ్ఛందాలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ప్రతీకగా 26 గణాలను తీసుకొన్నారు. ఈ ప్రక్రియను ఇంకా విస్తరించటానికి అవకాశం ఉన్నదని, అందుకు గురుస్థానం తమదేనని సూచించటానికి ఒక ‘గురువు’ను ఆ పైని నిలిపారు. మొత్తం 26 X 3 = 78 + 1 = 79 అక్షరాలతో భారతీయ పద్యసాహిత్యచరిత్రలో అపూర్వమైన గాయత్రీ వృత్తమును 1979లో రచించారు. 1979లో రచించినందువల్ల 79 అక్షరాలు కూర్చారనుకొంటాను. వాటిని ఆయన పరిభాషలో చెప్పాలంటే — ముందుగా నాలుగేసి గణాలతో పదహారు అక్షరాల చొప్పున ఆఱు గణపతాకలను కూర్చుకొన్నారు. అవి ఇరవైనాలుగు గణాలు అయ్యాయి. అక్కడికి డెబ్భైరెండు అక్షరాలు వచ్చాయి. ఆ పైని రెండు లఘువులను, ఒక గురువును, మూడు లఘువులను, ఒక గురువును నిలిపారు. అవి ఏడు అక్షరాలు. మొత్తానికి డెబ్భైతొమ్మిది అక్షరాలు.

ఆయన పేర్కొన్న గణాల క్రమప్రథ ఇది:

తస యమ; యజ యమ; యజ తమ; తస యమ; యజ యమ; తర యమ; II U III U

ఈ గురు లఘువుల అనుక్రమణి ఒక పాదానికి మాత్రం చూస్తే ఈ విధంగా ఉంటుంది:

UUI (త) IIU (స) IUU (య) UUU (మ);

IUU (య) IUI (జ) IUU (య) UUU (మ);

IUU (య) IUI (జ) UUI (త) UUU (మ);

UUI (త) IIU (స) IUU (య) UUU (మ);

IUU (య) IUI (జ) IUU (య) UUU (మ);

UUI (త) UIU (ర) IUU (య) UUU (మ);

II;

U;

III;

U.

ఇది గణక్రమం. తస యమ; యజ యమ అన్న క్రమం రెండు పర్యాయాలు రావటం వల్ల పద్యపాదం శ్రుతిసుభగంగా ఉన్న మాట నిజమే కాని పాదం చివఱను స – న – గ అని గణాలను వ్యపదేశించక, లేదా లల – గ – లలల – గ అని పేర్కొనక II U III U అని గురులఘుసంకేతాలను నిర్దేశించటం వల్ల శ్రీనివాస్ ఏమి వైచిత్రిని సాధింపదలిచారో తెలియదు. ‘నా చిత్ర రచనలు నావి గాన’ అనుకొన్నారేమో! లాక్షణిక పద్ధతి అనుసారం గణక్రమాన్ని ఈ విధాన ఉదాహరించాలి:

తస యమ; యజ యమ; యజ తమ; తస యమ; యజ యమ; తర యమ; సన గ.

నిజానికి వీటిలో త – స – య – మ గణాలది ‘అంభోజాలి’ అన్న సమవృత్తమని దుఃఖభంజనుడు తన వాగ్వల్లభంలో పేర్కొన్నాడు. దీనికి విశాలాంభోజాలి అని కూడా పేరున్నది. ఈ విధంగా ప్రస్తరిస్తే ఈ గాయత్రీ వృత్తము వివిధ లఘుచ్ఛందాల సమాహారవృత్త మవుతుంది. పరిశోధకులకు ఈ వ్యాసంగం ఒక క్రీడాక్షేత్రం. పద్యపాదాలలోని యతి స్థానాన్ని కూడా శ్రీనివాస్ నిర్దేశించారు. 79 అక్షరాల పాదంలో 1 – 13 – 25 – 37 – 49 – 61 యతి స్థానాలు. మొదటి అక్షరం కాక ఐదు యతులన్నమాట. వృత్తం కాబట్టి ప్రాస నియతం. దీనిని తమ తల్లిదండ్రులకు అంకితం చేస్తూ ‘జననీ జనక గాయత్రీ వృత్తము’ అని సంజ్ఞానించారు. తమ శ్రీమత్తకు, నేతృత్వ ధాతృత్వాలకు, క్షేమైశ్వర్యాలకు కారయిత్రి కాబట్టి తల్లిదండ్రుల రూపుగొన్న గాయత్రీ దేవిని సన్నుతించారు. ‘అపూర్వ ప్రాశస్త్యోద్ధృతి’ మూలాన ఈ వృత్తం ప్రసిద్ధికి నోచుకొనగలదని ఆకాంక్షించారు. పరిమాణంలో చిన్నదే అయినా, కరపత్ర గ్రంథరూపంలో శ్రీనివాస్ వెలువరించిన తొలి పుస్తకం ఇదే. 1979లో అచ్చయింది.

గాయత్రీ వృత్తము కరపత్రం లోని పద్యం ఇది:

మొదటి పాదం:

[శ్రీ]మంతుఁడను నేను శ్రీ గాయత్రీ స[త్కృ]పన్, దేవి పేర వినూత్నచ్ఛందంబుల్ [సృ]జింపంగ, నేఁడు నాచేత నౌటన్, నే[తృ]త్వం బొసంగి, దేవి, నాకీ రీతిన్ ధా[తృ]శక్తిన్ వరంబుగ నిచ్చెన్ శ్రీ గాయ[త్రీ] భవ్య భావ్య దివ్య మాహాత్మ్యంబున్, వర్ణన సేయఁదరమే?

రెండవ పాదం:

[క్షే]మార్థ బహుమానితైశ్వర్యంబుల్ పు[ష్టి]మీఱంగఁ బొంది, సదా దాసుల్ సంతు[ష్టిఁ] జేతమ్ము పొంగ, వేనోళ్ళఁ బాడంగా, [శ్రే]యస్కర కృపార్ద్రదృష్టిన్ సంరక్షిం[చి], విశ్వంబు నేలు నహోరాత్రంబుల్, పో[షిం]పంగ, జీవరాసులన్ దానై సన్నద్ధ యగున్ వరదయై,

మూడవ పాదం:

[భూ]మిన్ నిజదయా సుధావృష్టిన్ వేఁ ద[న్పు]చున్; గాన నా జననీ ధ్యానంబున్ స[ల్పు]చున్ బాదపద్మయుగ్మంబు భావాలన్ [బూ]జింపుచును భక్తి నర్పింతున్ గ్రంథం[బు], నా తల్లి శేషగిరమ్మన్ సాధ్విన్ స[త్పు]ణ్యార్థసంయుతున్ ఫణీంద్రస్వామిన్, నా జనకున్ దలఁచుచున్,

నాలుగవ పాదం:

[ధీ]మజ్జనఘన ప్రశంసార్హాలై, సి[ద్ధి]నందంగఁజాలు నపూర్వ ప్రాశస్త్యో[ద్ధృ]తిన్ సర్వభాగ్యముల్ గొన్న శ్రీ గాయ[త్రీ] వృత్తములు నా యశస్సామ్రాజ్యంబున్ [స్థి]రప్రాభవంబునఁ బాలింపంగా, వృ[ద్ధి]న్ జెందుచుండి, వారి యాశీర్వాదంబుల్ గొనుచున్ మెఱయఁగన్.