వేంకటంలో కొండలరాయడు

ఈ కథలో వ్యాపార ఒప్పంద పత్రాలు, అప్పుపత్రాలు, పెట్టుబడులు, సంస్థ యాజమాన్యం మొదలైన ఆధునిక అంశాలు కనిపించడం విశేషం. ఇటువంటి వ్యాపార నియమాలే వేంకటేశుని నిలయంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ నిర్వహణా చరిత్రలోనూ అవసరమై ఉంటాయని మనం ఊహించవచ్చు. అన్నమయ్య సంకీర్తనలలో కూడా ఈ విధమైన వ్యాపారాంశాలు చోటు చేసుకోవడం మనం గమనింపవచ్చు. ఉదాహరణకు, ఈ కింది శృంగార సంకీర్తనలో లాభము, వడ్డీ, కూడబెట్టుకోవడం వంటి అంశాల ప్రస్తావన చూడండి:

ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే
చెంతనుండి యాసతోనేఁ జెనకఁగాను

కలువకన్నులచూపు గాటేఁ బోసుకొనేవటే
పొలసి మోమెత్తి యిటు చూడఁ జాలవు
వలనైన చిరునవ్వు వడ్డి రెచ్చుకొనేవటే
వెలయ నీ వెంత నవ్వించినా నగవు

ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే

కొండలవంటి కుచాలు గూఁటఁ బెట్టుకొనేవటే
దండిగాఁ బయ్యద మూసి దాఁచు కొనేవు
పండిన జవ్వన మిదె పాఁతర వేసేవటే
వుండబో ముసుఁగు వెట్టు కూరకే వున్నదానవు

ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే

ముచ్చట మాటలాడక మూట గట్టుకొనేవటే
తచ్చన మోసముతోఁ బెదవు లెత్తవు
ఇచ్చటఁ జుట్టమ వైతి వేను శ్రీవేంకటేశుఁడు
మచ్చిక లన్నిటాఁ జల్లి మంతన మాడేవూ.

ఇక్కడ మరో అంశం గమనించాలి: తిరుపతి దేవస్థానపు ధార్మిక విషయాలలో నేతకు సంబంధించిన తోగట, కైకాల, దేవాంగ వంటి కులాల వారి ఆధిపత్యం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు, తోగటవారికి చౌడమ్మ, నందవరీకులకు సంబంధించిన అర్చక వృత్తి అనువంశికంగా వచ్చిందని చెప్పుకుంటారు. కైకాల వారు గంగమ్మ గ్రామదేవతకు, గోవిందరాజు ఆలయపు యాజమాన్య నిర్వాహణకు బాధ్యులు. అన్నమయ్య వేంకటేశుని ఒక సంకీర్తనలో ‘వాడల వాడల వెంట’ తిరిగే ‘నేత బేహారి’గా అభివర్ణించాడు. తిరుపతిలోని నేత వారందరూ అన్నమయ్య మనవడైన చిన్నన్నను తమ గురువుగా ఎన్నుకొని, ఈ స్థానాన్ని తాళ్ళపాక కుటుంబంవారు వంశపారంపర్యంగా స్వీకరించాలని అర్థించారట. ఇందుకు ప్రతిగా చిన్నన్నకు పదివేల వరహాలు సమర్పించుకున్నారట. నేత కులాల వారి ఆధిపత్యం, వ్యాపారాంశాలతో కూడిన ఆచార వ్యవహారాలు మొదలైనవి తిరుపతిలో మనం అంతకు ముందు చర్చించిన ‘ఎడమచేతి’ కులాల వారి ప్రాధాన్యాన్నే సూచిస్తుంది.

సంగ్రహంగా చెప్పాలంటే, మా దృష్టిలో తిరుపతి దేవస్థాన చరిత్ర ఇది: తొలినాళ్ళనుండి ఇప్పటి ‘వేంకటేశ్వరీకరణ’ వరకూ ఈ దేవాలయం ఎన్నో మార్పులు చెందింది. ఎప్పటినుండో స్థానిక దేవతలకు నిలయమైన ఈ ఆలయం క్రీస్తుశకారంభంలో ప్రాచీన వైఖానస మతానుయాయుల ఆధిపత్యం లోకి వచ్చింది. మొదటి స్థానిక దేవతలలో వరాహమూర్తి ఒక దేవుని రూపం కావచ్చు. ఇతర స్త్రీ గ్రామదేవతలకు కూడా ఇక్కడ స్థానం ఉండి ఉండవచ్చు. ఇక్కడి స్థానిక రాజుల ప్రాపకం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, 10వ శతాబ్దపు చోళ రాజుల కాలం నాటికి దైవం శ్రీమహావిష్ణు రూపంలో స్థిరపడి ఉండవచ్చు. 12వ శతాబ్దం నాటికి పాంచరాత్ర సంప్రదాయ ప్రభావంతో స్త్రీ దేవతలకు తిరిగి కొంత ప్రాతినిధ్యం లభించింది. కొండ అడుగున తిరుచ్చానూరులో అలమేలుమంగ-పద్మావతి దేవాలయం ఈ కాలంలోనే నిర్మించి ఉండవచ్చు. 12వ శతాబ్దం నుండి ఆగమ వైష్ణవ మత ప్రాబల్యంతో ఇది శ్రీవైష్ణవ దేవాలయంగా మారిపోయింది. తాళ్ళపాక అన్నమయ్య ప్రవేశించే నాటికే ఈ దేవాలయం ‘ఎడమచేతి’ కులాల వారి ఆధిపత్యంలో, వారి రాజకీయ, సంస్థాగత వ్యవస్థలతో ఎంతో సుసంపన్నమైతున్నది. ఆ శతాబ్దంలోనే ఈ సంస్థకు, మొదట స్థానిక రాజులతో, వారి ద్వారా విజయనగర రాజులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడే విజయనగర రాజ్యం మహాసామ్రాజ్యంగా విస్తరిస్తున్న రోజులవి. ఈ సామ్రాజ్య రాజుల అనుబంధంతో ఈ దేవాలయపు వేంకటేశ్వరీకరణ ప్రారంభమయ్యిందని చెప్పుకోవచ్చు. భగవంతునితో భక్తునికి సన్నిహిత సంబంధం నెలకొల్పే పలు మార్గాలను అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా ప్రబోధించడం కూడా ఇందుకు ఎంతగానో దోహదం చేసి ఉంటాయి. ఈ విషయంలో అన్నమయ్య వంశానికి అంతకు ముందు స్థానిక గ్రామదేవతలతో, నాథ సంప్రదాయంతో ఉన్న గాఢమైన అనుబంధం అన్నమయ్య దృక్పథంపై, తద్వారా తిరుపతి దేవస్థాన వ్యవస్థపై ప్రభావం చూపించింది. అన్నమయ్య పదాలను రాగిరేకులపై చెక్కి, ఆంధ్ర తమిళ దేశాలలోని దేవాలయాలకు వితరణ చేసే కాలానికి అన్నమయ్యతో పాటు, తిరుపతి దేవుడు కూడా పూర్తిగా రూపాంతరం చెందారు. ఒక రకంగా కొండలరాయడుగా మనకు తెలిసిన వేంకటేశ్వరుడు పూర్తిగా అన్నమయ్య రూపకల్పన. అన్నమయ్య వేంకటేశుని ఆస్థాన కవిగా, ఆ దైవాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి తన జీవితం అంకితం చేశాడు. అందుకు ప్రతిగా, వేంకటేశుడు అన్నమయ్యకు వారి కుటుంబానికి ఎనలేని ఆర్థిక సంపత్తిని కూర్చిపెట్టాడు.

7. ఆధ్యాత్మిక పదములు

అన్నమయ్య సాహిత్యాన్ని పరిశీలించే వారికి ఆయన సంకీర్తనలను ఆధ్యాత్మిక సంకీర్తనలుగా (మా దృష్టిలో ఇవి ఆత్మవిమర్శనా సంకీర్తనలు), శృంగార సంకీర్తనలుగా విభజించడంలో గల కారణాలు అంత సులభంగా బోధపడదు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఈ రకమైన విభజన రాగిరేకులలోనే ఉంది. కొన్ని సార్లు ఒక్కో సంకీర్తనను ఆధ్యాత్మిక సంకీర్తనగా గానీ, శృంగారసంకీర్తనగా గానీ నిర్ణయించడం అంత సమంజసం అనిపించకపోవచ్చు. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు: ఈ సంకీర్తనా వాఙ్మయంలో రెండు పూర్తిగా విభిన్నమైన గొతుకలు వినిపిస్తాయి. “ఇంత విభిన్నమైన పార్శ్వాలు నిజంగా ఒకే కవి మనస్సులో ఉండడం సాధ్యమా?” అని ఒక్కో సారి సందేహం కలగక మానదు. అయితే, ఈ రెండు రకాల సంకీర్తనలలో శైలిలోనూ, భాషలోనూ కనిపించే సారూప్యత ఇవి ఒకే కవిచే రాయబడ్డాయి అని నిర్ధారిస్తుంది.

అన్నమయ్యలో కనిపించే ఆధ్యాత్మికత బాహ్యప్రపంచానిది కాదు. అది అంతర్ముఖమైనది. తనలోకి తాను చూసుకుని తనని తాను ప్రశ్నించుకుంటున్నది. ఈ సంకీర్తనలలో వినిపించే గొంతుకలో వేదన, సంఘర్షణ, మరికొంత ఆత్రుత, కొన్నిసార్లు అపరాధ భావనతో కూడిన ఆత్మనింద, కొన్నిసార్లు స్త్రీల పట్ల ద్వేషభావం, కొన్నిసార్లు కేవలం గడిచిన సంఘటల పట్ల విచారం, దుఃఖం – వీటన్నిటితోపాటు గాఢమైన కవితాత్మకత. ఉదాహరణకు ఈ సంకీర్తన చూడండి:

కడలుడిపి నీరాడగా తలచువారలకు
కడలేని మనసుకు కడమ యెక్కడిది

దాహ మణగిన వెనుక తత్వ మెరిగెదనన్న
దాహ మేలణగు తా తత్వ మే మెరుగు
దేహంబుగల యన్ని దినములకు పదార్థ-
మోహ మేలణగు దా ముద మేల కలుగు

ముంద రెరిగిన వెనుక మొదలు మరచెద నన్న
ముంద రేమెరుగు దా మొద లేల మరచు
అందముగా తిరువేంకటాద్రీశు మన్ననల
కందువెరిగిన మేలు కలనైన లేదు

ఎన్నో ఆధ్యాత్మక సంకీర్తనల్లో లాగే ఈ సంకీర్తనలో కనిపించే ఆత్మాశ్రయమైన భావాలు మనందరికీ సుపరిచితమైనవే. కవి అడిగే ప్రశ్నలు మన నిజజీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎదురుపడ్డ భావాలే. ఇందులోని కవి తన మనస్సుతో తానే జరిపే సంవాదాన్ని రెండు గొంతుకల సంభాషణగా మనకు వినిపిస్తున్నాడు. ఒక గొంతుక మనుష్యులు సాధారణంగా ఒక పని చెయ్యడానికి తమ అభద్రతాభావంతో విధించే నిబంధనలను, “అది చేజిక్కితే, ఇది వదిలేస్తాను” అంటూ జరిపే బేరసారాలను వినిపిస్తుంటే, మరో గొంతుక ఆ వాదనలోని అజ్ఞానాన్ని ఎత్తిచూపుతూ పరిహాసం చెయ్యడం కనిపిస్తుంది. అంటే మనిషికి ఈ నిబంధనల్లో, బేరసారాల్లో ఉండే డొల్లతనం పూర్తిగా తెలుసు. అయినా తన సహజమైన లౌకిక ధోరణిని వదులుకోలేకపోతున్నాడు. ఫలితంగా, దేవుడిని చేరుకొనే మేలైన మార్గాన్ని చేరుకోలేకపోతున్నాడు. అందుకే, ఈ ధోరణిని మానవుడు కొనసాగించినంతకాలం “కందువెరిగిన మేలు”ను కలలో కూడా సాధించలేకపోతున్నాడు.

తేలికైన పదాలతో, అందరికి అర్థమయ్యే భాషలో అన్నమయ్య ఇంత సున్నితమైన భావాలు వెలిబుచ్చగలగడం ఈ కీర్తన విశేషం – ఇందులో వాడుకున్న హల్లులు కూడా వినసొంపుగా ఉండే సరళాలు, అనునాసికాలు. ఇందులో చాలా చిన్ని, చిన్ని ప్రశ్నలు మననే గుచ్చి ప్రశ్నిస్తున్నట్టు, సమాధానాలు ఎత్తిపొడుస్తున్నట్లు ఉండి మనను అపరాధభావంలో పడేస్తాయి. ఈ సంభాషణకు ఎత్తుగడగా పాట ప్రారంభంలోని ఉపమానమైన సముద్రం: హృదయ ఘోష లాగే సముద్ర ఘోషకు ఎప్పటికీ తెరిపి లేదు; ఈ ఆలోచనల అలలు ఎప్పటికీ కడతేరవు. ఈ సంభాషణ కూడా తెలుగువాక్యంలోని పదాలలాగే ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఎడతెగకుండా కొనసాగడం మనం ఊహించవచ్చు. అసలు సమస్య ఎప్పటికీ తృప్తి పడని మానవుని మనస్సు – ఈ ఆలోచనల ఘోష నరజన్మ ఎత్తిన ప్రతి వాడికి తప్పదు అని మనం తెలుసుకోవాలి.

కొన్నిసార్లు అన్నమయ్య ఈ విషయాన్నే సూటిగా చెబుతాడు:

హీనదశల బొంది యిట్ల నుండుటకంటె
నానావిధులను నున్ననాడే మేలు

అరుదైన క్రిమికీటకాదు లందు బుట్టి
పరిభవముల నెల్ల బడితి గాని
యిరవైన చింత నా డింతలేదు యీ
నరజన్మము కంటె నాడే మేలు

తొలగక హేయజంతువుల యందు బుట్టి
పలువేదనల నెల్ల బడితి గాని
కలిమియు లేమియు గాన నే డెరిగి
నలగి తిరుగుట కంటె నాడే మేలు

కూపనరకమున గుంగి వెనకకు నే
బాపవిధుల నెల్ల బడితి గాని
యేపున దిరువేంకటేశ నా కిటువలె
నా పాల గలిగిన నాడే మేలు

శ్రీవైష్ణవ మత సిద్ధాంతాల ప్రకారం ఇటువంటి నరుని వేదనలకు పరిష్కారం శరణాగతి. అన్నమయ్య కూడ ఎన్నో కృతుల్లో చిట్టచివరి చరణంలో వేంకటేశుని శరణు పొందటమే ఈ వేదనలన్నింటికీ పరిష్కారమని సూచించడం కనిపిస్తుంది. శరణాగతిలో ఆత్మ తానే తానై ఉండడం ద్వారా పరమాత్మతో ఏకత్వం పొందుతుంది. ఈ ఏకత్వ సిద్ధితో నరజన్మలోని నెరుసులన్నీ తొలగిపోతాయి: