తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట

ఈ విధమైన సాహిత్యానికి రకరకాల వ్యాఖ్యానాలివ్వడానికి తావు ఉండబట్టే కాబోలు, ఈ సాహిత్యాన్ని కాలానుగుణంగా తిరిగి రాయడం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో తిరిగి అనువదించడం, పదేపదే వ్యాఖ్యానించడం పరిపాటి అయింది. రచయితల సంస్కృతి, అనుభవం, విద్యాధిక్యతలపై ఆధారపడి, ఈ వ్యాఖ్యానాలు, వివరణలు కూడా వేర్వేరు స్థాయిలలో ఉంటాయి.

పాక్షిక దృష్టి, రాజకీయ అవసరాలు పక్కకు నెట్టి, నారాయణ రావు అనువాదంలో వెనుకమాట చదివి, బాఖ్తిన్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని మళ్ళీ తెలుగు కన్యాశుల్కం వేరే దృక్పథం నుంచి చదివితే, ఈ నాటకం polyphonic లిటరేచర్ అని బోధపడుతుంది. అప్పుడు ఈ నాటకం ఏకైక ఆధునిక ‘ఎపిక్’ అని గుర్తిస్తాం.


చాసో (చాగంటి సోమయాజులు 1915 – January 1994) తన 78 సంవత్సరాల జీవితంలో రాసిన కథలు మొత్తం నలభై. వీటి నుంచి ఇరవై కథలు ఏరి వాటిని ఇంగ్లీషు[18] లోకి నారాయణ రావు, షూల్మన్, అనువదించారు.

చాసో తెలుగునాట అగ్రశ్రేణికి చెందిన కథారచయిత. ఆథునిక కథారచయితలలో ఉత్తమ కథకుడనీ ఒప్పుకోక తప్పదు. ఆయన తన కథలపై ‘సరైన విమర్శ రాలేదు,’ అని అత్తలూరి నరసింహారావు, 1995లో చాసో డెబ్భైవ జన్మదిన సందర్భంగా చేసిన ముఖాముఖీలో చెప్పాడు. (చూ; జననీరాజనం, తిరుపతి : చా.సో. స్ఫూర్తి 1995.) చాసోని, ‘మార్క్సిస్ట్ రచయిత’గా వర్గీకరించటం అలవాటయి పోయింది. సాధారణ ప్రజల జీవితంపై సాంఘికచైతన్యంతో ఆయన కథలు రాశాడు. పొరపాటున, తను మార్క్సిస్ట్ అనే భ్రమ ఆయనకి ఉన్నది. అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం) వ్యవస్థాపకులలో ఒకడు, చాసో. ఆంధ్ర కమ్యూనిస్టులు అ.ర.సం. రచయితల్ని వెనువెంటనే తమలో కలిపేసుకున్నారు. తరువాతి రోజుల్లో చాలామంది భావకవులు కూడా అ.ర.సం. లో చేరారు — కష్టపడి పనిచేసే పేద ప్రజలని బాధల నుంచి వాళ్ళ విమోచన కోసం కవిత్వం — అన్న భావనతో!

అయితే, తాను అభ్యుదయవాదిగా చెప్పుకున్నప్పటికీ అతని కథలపై ‘మార్కిస్ట్’ ప్రభావం ఏమీ లేదు. చాసో స్థిరబుద్ధి గల వాస్తవికవాది. గురజాడ లాగానే, మానవ సంబంధ ప్రేరణలని తీక్షణమైన దృష్టితో పరిశీలించి, వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నవాడు, చాసో. అతని కథల్లో, పాత్రలు సజీవ పాత్రలు. ఆ పాత్రలకి , నైతికత, స్నేహభావం, న్యాయం, ధర్మం, వగైరాలు సత్వవిచార సత్యాలు కావు. జనం అప్పుడప్పుడు వీటిని నమ్ముతారు కాబట్టి, ఇవి ఉన్నాయి. మనం సమాజాన్ని సంస్కరించలేము. ఏ సమయానికి ఏది అవసరమో అది చేస్తూ, నీతి, అవినీతి లాంటి వాటిని గురించి అనవసరంగా వ్యాకులపడ నక్కరలేదు. అదే వాస్తవికమైన గమ్యం.

ఈ పై విషయాలు, అనువాదానికి ఉపోద్ఘాతంలో రాశారు. (చాసో గురించి నారాయణ రావు ఈమాటలో ఒక వ్యాసం రాశాడు. అందులో కొంత తెలుస్తుంది.) చాసో మార్క్సిస్ట్ కాదని చెప్పటం, తెలుగుదేశంలో ‘మార్క్సిస్ట్’లమని చెప్పుకునే విమర్శకులకి నప్పలేదు. దానితో, ఒక చిన్న దుమారం రేగింది. అయితే, వీళ్ళెవ్వళ్ళూ ఆయన కథలు ఎందుకు మార్క్సిస్ట్ కథలుగా పరిగణించాలో ఎక్కడా రాయలేదు.

ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్నవాడు కాబట్టి మార్క్సిస్ట్ అనే లేబిల్ అంటించారు. అ.ర.సం. లో ఇదివరకు ఎవరున్నారో ఎవరికీ ఖాతరు లేదు. ఒకసారి ఒక లేబిల్ వేస్తే, అది శాశ్వతం అని ఆంధ్రా మార్క్సిస్ట్లులు నమ్ముతారు. అది మారకూడదని, మారటానికి వీలు లేదనీ వాళ్ళ ధృడనమ్మకం. పేదల బాధల గురించి రాసినంత మాత్రాన ఆ రచయిత మార్క్సిస్ట్ అయి పోడు, అని అంటే వీళ్ళకి పడదు. అసమానత, ఆకలి, పీడన, ధర్మాగ్రహం, పేదరికం, దోపిడీ, అణిచివేత — ఈ రకమైన సాంఘిక అనర్థకాల గురించి రాయటానికి ‘మార్క్సిజం’ తెలియవలసిన అవసరం లేదు. ‘మార్క్సిస్ట్’ కానవసరం లేదు కూడా. సంఘంలో అవినీతి గురించి ఏ కథకుడైనా రాయగలడు.

మరొక విషయం. చాసో అనుసరించిన ఆధునికత వలసవాదకాలపు ఆధునికత కన్నా భిన్నమైనది. గురజాడ ఆధునికత కన్నా కొత్తదీనూ. అంటే, తెలుగు మార్క్సిస్టులు చేసే నేలబారు చట్రానికి లొంగే ఆధునికత కాదు. చాసో కథల్ని పడికట్టు పదాలతో కట్టి పడేసి కథకుడి ఉద్దేశం అదే సుమా అని చెప్పడం గొప్ప కథకుడిగా చాసోకి అన్యాయం.

“అభ్యుదయ రచయితల సంఘంలో అందరూ ఉండవచ్చు. ఏ రాజకీయాభిప్రాయాల ప్రభావం పొందిన వారయినా ఉండవచ్చు. సమస్త మానవకోటి ఒకానొక నూతన లక్ష్యం వైపు నడుస్తున్నది. పాత ప్రపంచం శిథిలమయి ఆ స్థానంలో మరో కొత్త ప్రపంచం ఉద్భవిస్తున్నది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని చైతన్యంతో, ప్రసన్న బుద్ధితో ఎవరు దేన్ని గురించి ఏది వ్రాసినా అభ్యుదయ రచనే అవుతుంది. ఏ విషయాన్ని గాని ముందుగా కొన్ని అపోహలు పెట్టుకొని ఆలోచించడం మంచిది కాదు. పీడింపబడేవాళ్ళు, పీడించేవాళ్ళు ఉన్న ఈవర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరరు. రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుటధారి. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటింప జూచేవారు ఎప్పుడూ అభ్యుదయవాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలనుకోవడమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకొని వ్రాసేదే అభ్యుదయ రచన.

ఆకలి దప్పులకు, అనేక బాధలకు గురి అయిన కోటానుకోట్లమంది పీడితప్రజలు, శ్రమజీవులు నా కండ్ల యెదుట కనిపిస్తుండగా, నేను వారికి ప్రతికూలంగా ఎలా వ్రాయగల్గుతాను? వారి కష్టమే నా కష్టం గాను, వారి సమస్యే నా సమస్య గాను తీసుకొని తీరుతాను. నేను ప్రజల్లో లీనమై పోగలిగినప్పుడు వారి భాష లోనే వారి సమస్యలనే చిత్రిస్తాను.”

దేవులపల్లి కృష్ణశాస్త్రి, 1946లో రాజమండ్రిలో జరిగిన అభ్యుదయ రచయితల తృతీయ మహాసభలో ఇచ్చిన అధ్యక్షోపన్యాసంలో చెప్పిన మాటలు ఇవి.

అయితే, కృష్ణశాస్త్రి మార్క్సిస్టేనా? మార్క్సిస్టు రచయితేనా? పేదవారి గురించి, వారి బాధల గురించీ సురవరం ప్రతాపరెడ్డి, వేలూరి శివరామ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి వాళ్ళు ఎందరో రాశారు. వీళ్ళూ మార్క్సిస్టులు కారు. మార్క్సిస్టు రచయితలసలే కారు. పైకి కనిపిస్తున్నాయని భ్రమించే ఆలోచనలే సాహిత్యంలో ఉంటాయని, సాహిత్యానికి ఇంకే రకమైన లోతు, గాఢత, క్లిష్టత ఉండవని చెప్పడం సాహిత్యానికి అపచారం చెయ్యడమే. గొప్ప రచయితల అభిప్రాయాలు వేరు, గొప్ప రచనలు వేరు. ఈ రెండూ ఒకటే కానక్కరలేదు; సాధారణంగా కావు కూడా!

చాసో ఒక సిద్ధాంతానికి, ఒక కాలానికీ పరిమితమై పోయే రచయిత కాడు. అన్నమయ్య కాడు, పింగళి సూరన కాడు. గురజాడ అప్పారావు కాడు. ఇదే మాట నారాయణ రావుకి కూడా వర్తిస్తుంది. నా వ్యాసంలో అందుకు సరిపోయినన్ని ఉదాహరణలు ఇచ్చాననే అనుకుంటున్నాను.


నారాయణ రావు స్నేహితుడు, సహ రచయిత అయిన డేవిడ్ షూల్మన్ మాటల్లో చెప్పాలంటే: “నారాయణ రావు విప్లవాత్మకమైన సాహిత్య వివేచన, అవగాహన, ప్రపంచ సాహిత్య విమర్శకులను, విశ్లేషకులను ఎంతగానో ప్రభావితం చేసినా, ఇప్పటి దాకా తెలుగు సాహిత్య పరిశోధకులు — ప్రత్యేకించి సాటి తెలుగు వారిగా అందరి కంటే ముందుగా గుర్తించాల్సిన వీరే — ఈ కృషిని ఏమాత్రమూ గుర్తించక పోవడం, నాకు అర్థం కాని ఒక వైపరీత్యం.”

విమర్శకుల (భావకులు) గురించి రాజశేఖరుడు (900 – 950 AD) రాసిన కావ్యమీమాంసలో, మంగళుని అభిప్రాయము ఇలా ఉన్నదని చెప్తాడు: విమర్శకులు నాలుగు విధములుగా ఉంటారు. ఆరోచకుడు, మత్సరి, తత్వాభినేశి, సతృణాభ్యవహారి, అని. ఆరోచకుడికి సహజంగా ఏ రచనా నచ్చదు. అయితే, రకరకాల గ్రంథాలు చదివిన జ్ఞానంతో ఉత్తమ విషయాలు ఏదన్నా పుస్తకంలో వుంటే, ఆ పుస్తకాన్ని మెచ్చుకొనటానికి సందేహించడు. మత్సరి, ఈసు గలవాడు, ఇతరులు రాసినది ఏదీ ప్రశంసించడు. అతనికి మనసు ఒప్పదు. తత్వాభినేశి, అంటే యథార్థము తెలుసుకోవాలనే ఆశ వుండే వివేకశాలి ‘నూటికో కోటికో’ ఒక్కడుంటాడు. ఇకపోతే, సతృణాభ్యవహారి, గడ్డి తినేవాడు (పశువు), సర్వసాధారణుడు అని భావం. విపరీతమైన ఉత్సుకత మూలంగా ఒక రచన లోని మేలిమికి, దోషానికీ వున్న వ్యత్యాసం గుర్తించలేడు. వీళ్ళు ఏ పుస్తకం గురించి చెప్పినా ఒకే రకంగా మాటల పోగుల్లా వుండటం మామూలు. ఒకప్పుడు, తత్వాభినేశులు, ఆరోచకులు ఉండేవారేమో! కాని, ఇప్పుడు మాత్రం మనకి మత్సరులైన విమర్శకులే ఎక్కువగా వుండటంతో, సద్విమర్శ పూర్తిగా కుంటుపడుతున్నది. ఇక, సతృణాభ్యవహారుల గురించి చెప్పకుండా ఊరుకోవడమే మంచిది.

గొప్ప రచయితలకి సిద్ధాంతాల చట్రాలు పట్టవు అని విమర్శకులు (ప్రత్యేకంగా తెలుగు వారు) గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. దక్షిణ భారత సాహితీ సంస్కృతి, చరిత్ర అవగాహనలో ఒక విప్లవం తీసుకొని వచ్చిన నారాయణ రావు వంటి సాహిత్య మేధావి విషయంలో మరీ మరీ అవసరం. ఈ నిజాన్ని గుర్తించకుండా, తమ తమ సిద్ధాంతపు చట్రాలలో బిగుసుకొని పోయి నారాయణ రావును విమర్శించే వారి వ్రాతలు నిజంగానే సురవీధీలిఖితాక్షరాలు, గాలిలో రాసిన రాతలు. సువర్ణాక్షరాలుగా మిగిలిపోయేవి నారాయణ రావు చేవ్రాలులు మాత్రమే. ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన నిషే సూక్తి తోనే ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

“A serpent which is unable to strip off its skin will perish. So will all those intellectuals that are prevented from changing their opinions: They cease to be intellectuals.”

– Nietzsche


గ్రంథసూచి

  1. Syllables of Sky: Studies in South Indian Civilization In honor of Velcheru Narayana Rao, Edited by David Shulman. Oxford University Press, Delhi, 1995.
  2. తెలుగులో కవితావిప్లవాల స్వరూపం, విశాలాంధ్ర ప్రచురణ, 1978. (ద్వితీయ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1987. తృతీయ ముద్రణ తానా ప్రచురణలు, 2008.
  3. For the Lord of the Animals – Poems from the Telugu: The Kalahastisvara Satakamu of Dhurjati. Hank Heifitz and Velcheru Narayana Rao. and Hank Heifetz. University of California Press, Berkeley, 1987.
  4. Twentieth Century Telugu Poetry: An Anthology. Velcheru Narayana Rao, Oxford University Press, 2002.
  5. Hibiscus on the Lake: Twentieth-Century Telugu Poetry from India. Velcheru Narayana Rao, University of Wisconsin Press, 2003.
  6. A Poem at the Right Moment, remembered verses from pre-modern south India, collected and translated by Velcheru Narayana Rao and David Shulman, University of California Press, Berkley, 1998.
  7. Srinatha: The Poet who Made Gods and Kings, Velcheru Narayana Rao and David Shulman, Oxford University Press, USA; Bilingual edition, 2012.
  8. The Sound of the Kiss, or The Story That Must Never Be Told. kalapurnodayaM of Pimgali Surana. Tr. Velcheru Narayana Rao and David Shulman, Columbia University Press, 2002.
  9. The Demon’s Daughter: A Love Story from South India. Prabhavati pradyumnamu of Pimgali Surana. Tr. Velcheru Narayana Rao and David Shulman, SUNY series in Hindu studies, 2006.
  10. For example: The Dialogic Imagination: Four essays. M. M. Bakhtin, University of Texas Press Slavic Series, 1982.
  11. When God is a Customer: Telugu Courtesan Songs by Ksetrayya and Others. Tr. A. K. Ramanujan, Velcheru NarayaNa Rao, and David Shulman, University of California Press, 1994.
  12. Girls for sale – kanyasulkam, A play from colonial India, Gurajada Apparao, Tr. VelchEru Narayana Rao, Indiana University Press, 2007.
  13. Penumbral Visions : Making Polities in Early Modern South India, Sanjay Subrahmanyam, University of Michigan Press, 2001.
  14. Textures of Time : Writing History in South India 1600-1800, Velcheru Narayana Rao, David Shulman and Sanjay Subrahmanyam, Permanent Black publ., 2001.
  15. Symbols of Substance: Court and State in Nayaka-Period Tamilnadu, Velcheru Narayana Rao, David Shulman and Sanjay Subrahmanyam, Oxford University Press, 1993.
  16. Mikhail Bakhtin: Creation of a Prosaics, Gary Morson, Caryl Emerson, Stanford University Press, 1990.
  17. Dolls’ Wedding and other Stories by Chaso, Velcheru Narayana Rao and David Shulman, Penguin Books of India, 2012.