తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట

క్షేత్రయ్య పదాలలో ఎల్లప్పుడూ స్త్రీ గొంతుకే కాదు; ఒక్కొక్కప్పుడు ప్రేమికుడైన దేవుడి గొంతు కూడా వినబడుతుంది. అయినా పైచేయి స్త్రీదే. చాలా పదాల్లో తన ప్రియుడు మరొక స్త్రీతో సంపర్కం ఉన్నట్టు ఫిర్యాదు చేస్తుంది. చిరాకు పడటం, ఒకరిపై ఒకరికి కోపం రావటం, పదసాహిత్యానికి నిర్వచనంగా అగుపిస్తుంది.

అన్నమయ్య పదాలలో దేవుడిదే పైచేయి. ప్రేయసి ఫిర్యాదు చెయ్యచ్చు, కోపగించుకోవచ్చు, దెబ్బలాడవచ్చు, కానీ చివరకి ఇద్దరూ ఒకరినొకరు అనుభవించడం కద్దు. దేవుడే నెగ్గుతాడు, ఆఖరికి!

క్షేత్రయ్య కాలానికి పరిస్థితి వేరయ్యింది. విజయ రాఘవ నాయకుడి (1633 – 1673) కాలంలో క్షేత్రయ్య తన పదాలని రాశాడు. అప్పుడు, రాజే దేవుడయ్యాడు. రాజే దేవుడయితే, డబ్బున్నవాడే రాజవుతాడు. అంటే, డబ్బున్నవాడే దేవుడయ్యాడన్న మాట. అందుచేత క్షేత్రయ్యకి, రాజులని దేవుళ్ళుగా చిత్రించి పదాలు రాయటానికి అభ్యంతరం లేదు.

క్షేత్రయ్య ఒక పదంలో చెపుతాడు: రెండువేల పదాలు మధుర తిరుమల నాయకుడిపై , వెయ్యి పదాలు తంజావూరు విజయ రాఘవ నాయకునిపై, నలభై రోజుల్లో పదిహేను వందల పదాలు గోల్కొడ పాదుషాపై పాడానని చెపుతాడు. నాలుగు వందల పదాలు మాత్రం ప్రస్తుతం లభ్యం అవుతున్నాయి.

గత శతాబ్దంలో విక్టోరియన్ నీతుల ప్రభావంతో ఈ పదాలని, ‘సంస్కరించడానికి’ విద్యాధికులు ప్రయత్నించారు. వేశ్యావృత్తి నిర్మూలనకై జోరుగా ప్రచారం చేసిన రోజులవి. ఈ పదాలు శృంగార రస కవితలుగా పండితుల ఆమోదం పొందటానికి ప్రయత్నాలు జరిగినాయి. బహిరంగంగా ‘కామోద్దీపన’ చేసే పదాలని సంస్కరించడం, లైంగిక సంకేతాలున్న వాటికి ఉన్నతమైన ఆధ్యాత్మిక అర్థాలు ఆపాదించి తిరిగి నూతన వ్యాఖ్యానం చెప్పడం ఇప్పటి కొత్త ధోరణి.

వేశ్యాగృహం తోనే క్షేత్రయ్య పదాల మొట్టమొదటి సంబంధం. ఖాతాదారుడు దేవుడు; అతణ్ణి సంతోషపెట్టడమే ముఖ్యం. సంస్కృత ఆలంకారిక లక్షణాలను ఆపాదించి, ఆ విధంగా వర్గీకరించి ఈ పదాలకి వేరే పరమార్థం ఉన్నదని చెప్పటం ఈ పదాల్లో ఉన్న సౌందర్యం, సున్నితత్వాన్ని వికృతీకరించటమే అవుతుందని, అనువాదకులు పునరుద్ఘాటించారు.

ఆఖరిగా మరొక రెండు పుస్తకాల గురించి విచారించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. మొదటి పుస్తకం: గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. రెండవది, చాసో (చాగంటి సోమయాజులు) కథలు.


వెల్చేరు నారాయణ రావు చేసిన కన్యాశుల్కం అనువాదం[13], Girls for Saleపై, ఈమాటలో నేనొక పరిచయ వ్యాసంరాసి వున్నాను. పెంగ్విన్ (ఇండియా) సంస్థ ఈ అనువాదాన్ని 2011లో తిరిగి ప్రచురించింది. ఈ పుస్తకం విడుదలైన తరువాత ఈ మధ్యకాలంలో తెలుగునాట పత్రికలలో ముఖ్యంగా, అనువదించబడ్డ కొన్ని మాటలపై ‘హేళన’ చేస్తూ కొన్ని విమర్శలు వచ్చాయి. అవి చదివిన తరువాత కన్యాశుల్కం నాటకం, దాని అనువాదం, మరొకసారి చదివాను. అనువాదం కన్నా ముఖ్యం The Play in Context పేరున వ్రాసిన మలిపలుకు వ్యాసం. ఈ వెనుకమాటలో నారాయణ రావు ఒక సరికొత్త ప్రతిపాదన చేశాడు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. ఆ ప్రతిపాదన కన్యాశుల్కం వేరొక దృక్పథంతో చదవటానికి ముఖ్య ప్రేరణ. నేను రాసిన పాత వ్యాసం నుంచి కొన్ని వివరణలు తిరిగి చెప్పవలసిన అవసరం కనిపించింది. పాఠకులు పునరుక్తిని క్షమిస్తారని భావిస్తున్నాను.

కన్యాశుల్కం నాటకంపై గత 50-60 సంవత్సరాలలో వచ్చిన వాదప్రతివాద వ్యాసాలు కూడా గుర్తించడం అవసరం. అటువంటి కొన్ని వ్యాసాలలో వివరణలు క్లుప్తంగా నా పరిచయ వ్యాసానికి అనుబంధంగా పొందు పరచి ఉన్నాము. ముఖ్యంగా, నేటి విమర్శకులు నారాయణ రావు చేసిన ప్రతిపాదనలతో వ్యతిరేకించబోయే ముందు, కన్యాశుల్కం నాటకం, నారాయణ రావు రాసిన వెనుకమాట పూర్తిగా చదవమని కోరుతున్నాను.

గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో 19వ శతాబ్దం ఉత్తర భాగంలో విజయనగరం శివార్లలో వాడే మాండలికం వాడారు. నాటకంలో ప్రతీ పాత్ర మాట్లాడే మాటల్లో ఆ పాత్ర కులం, ఆర్థిక స్థితి, చదువు సంధ్యలు, లింగభేదం స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. వ్యావహారిక తెలుగు భాషకి, ఒక తియ్యని మాండలికానికీ అప్పారావుగారు కన్యాశుల్కం నాటకం ద్వారా చేసిన అమోఘమైన సేవ మరెవ్వరూ చేయలేదు.

గత ఐదు దశాబ్దాలలో కన్యాశుల్కం నాటకం పై కొన్ని వందల వ్యాసాలు, విమర్శలు ప్రతివిమర్శలూ, వివాదాలు ఉత్తరాలూ వచ్చాయి. ఈ వ్యాసాలు నాటక కర్తృత్వంతో మొదలు పెట్టి, నాటకంలో ప్రతి పాత్ర పైన, అప్పారావు అంకిత వాక్యాల పైన, పీఠికల పైన, పాత్రల ఔచిత్యం పైన, వాటి ఆవశ్యకత పైన, నాటక లక్షణాల పైన, లక్ష్యాల పైన, వస్తువు పైన, వస్త్వైక్యత పైన, నిర్వహణ పైన, సాంఘిక సంస్కరణల పైన, అటూ ఇటూ… ఎన్నో ఎన్నెన్నో! కన్యాశుల్కం నాటకం కొందరికి బ్రహ్మపదార్థం అయితే, మరి కొందరికి ప్లేడౌ (play dough!) అయ్యింది. ఒక్కొక్క విమర్శకుడికి ఒక్కొక్క రకంగా కనిపించింది, వినిపించింది. మరి కొందరు విమర్శకులకి వాళ్ళకి నచ్చిన పాక్షిక పద్ధతిలో మలచుకోబడ్డది! పైగా ఈ నాటకం కొన్ని వందలసార్లు తెలుగుదేశంలో ప్రదర్శించబడింది. అయితే, మూలంలో నాటకాన్ని కుదించి కత్తిరించి అప్పుడప్పుడు అప్పారావు వాడిన భాషని కూడా ‘సంస్కరించి’ ఈ ప్రదర్శనలు చేశారు. మూలంలో నాటకం ఏడు అంకాలు, ముప్ఫైరెండు రంగాల నిడివి గలది. అందుకనే కాబోలు, ప్రసిద్ధ, అప్రసిద్ధ నాటక ప్రయోక్తలందరూ ప్రదర్శనా సౌలభ్యం పేరుతో కుదించారు, కత్తిరించారు, సవరించారు.

నారాయణ రావు ప్రతిపాదనకి పూర్వ రంగం ఇది: కన్యాశుల్కం నాటకం పై ఇంతకు పూర్వం విమర్శకులందరూ అప్పారావు ఈ నాటకం రాయడానికి ప్రేరణ, కారణం, సంఘసంస్కరణే అని ప్రతిపాదించారు. నాటి సమాజంలో ముఖ్యంగా మూడు దురాచారాలని ఎత్తిచూపి వాటి నివృత్తికి ఈ నాటకం మార్గదర్శి అని విమర్శకులందరూ (ఒకరో ఇద్దరో మినహా!) పదే పదే నొక్కి వక్కాణించారు. ఈ మూడు దురాచారాలూ వరుసగా – కన్యాశుల్కం, అంటే ఆడపిల్లలని అమ్మడం, కొనుక్కోవడం; వితంతు వివాహానికి వ్యతిరేకత; వేశ్యా సమస్య. గత 50 సంవత్సరాలుగా వచ్చిన వ్యాస పరంపర, ఈ మూడింటినీ పూర్తిగానో, అర్థోక్తిలోనో, సమర్థించినవే.

నారాయణ రావు చేసిన ప్రతిపాదన సారాంశం ఇది: ఈ విమర్శకులలో ఏ ఒక్కరూ కన్యాశుల్కం నాటకాన్ని, రచనా వ్యూహాన్ని, సరిగా అర్థం చేసుకోలేదు. బ్రిటీషు వలసరాజ్యం అప్పటి సంఘం మీద తెచ్చిన వత్తిడి వారికి పూర్తిగా బోధ పడలేదనీ ఉదహరిస్తూ అప్పారావు లోని నవ్యతనీ, ఆయనదయిన ‘ఆధునికత’నీ సోదాహరణంగా వివరించారు.

ఆధునికత మన దేశంలో ఎప్పుడు మొదలయ్యింది అన్న ప్రశ్నకి సాధారణంగా మన ఆధునికులు చెప్పే సమాధానం — బ్రిటీషు వాడి వలస రాజ్య స్థాపన తరువాతనే అని. అది సరైన వాదం కాదని, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఆధునికత 16వ శతాబ్దంలోనే ఉన్నదనీ, వెల్చేరు నారాయణ రావు, సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్మన్, గత 15 సంవత్సరాలుగా తమ చారిత్రక సాహిత్య పరిశోధనల ద్వారా మనకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాటి సాహిత్యాన్ని సునిశితంగా, చారిత్రకంగా పరిశీలించి, నూతన పద్ధతుల్లో పరిశోధన చేస్తే బ్రిటీషు వలసకి పూర్వమే ఆధునికత స్పష్టం అవుతుందని వారి వాదం. బ్రిటీషు వాడి రాక మూలంగా వచ్చిన ఆధునికతని వాళ్ళు కాదనడం లేదు; వాడికి పూర్వమే ‘ఆధునికత’ ఉన్నది — అది చారిత్రక పరిణామంలో క్రమంగా సంప్రదాయకంగా వచ్చింది అని అర్థం. వలస రాజ్యం తరువాత వచ్చిన ఆధునికత సంప్రదాయ విరుద్ధం అని చెప్పవచ్చు. ఈ విషయాలపై నిశితమైన చర్చ Penumbral visions[14], Textures of Time[15], Symbols of substance[16] అనే పుస్తకాలలోను, పింగళి సూరన అనువాదాల[9][10] వెనుక మాటలలో చదవ వచ్చు. 16వ శతాబ్దపు చైతన్యాన్ని ‘ఆధునికత’ గానూ, 19వ శతాబ్దపు మార్పులను ‘వలసవాద ఆధునికత’ గానూ నారాయణ రావు పిలుస్తాడు.

ఇంతకాలం విమర్శకులు ఈ నాటకాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకోలేక పోయారు? ఈ నాటకం సమాజం కుళ్ళిపోయిందని, సంస్కరణే శరణ్యమని ఉద్బోధ చేస్తున్నదని ఎలా చూశారు?

ఇందుకు నారాయణ రావు నాలుగు ముఖ్య కారణాలు చెప్పుతున్నాడు. మొదటి కారణం: ఈ నాటకం మొదటి ప్రచురణ – దాని ప్రదర్శనకి (1892) సంబంధించిన సందర్భం. రెండవ కారణం: ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వలస రాజ్య ప్రాబల్యం వల్ల వచ్చిన సమకాలీన సాహిత్య రాజకీయ వాతావరణం. మూడవ కారణం: తెలుగు రచయితలపై, ఆధునిక విద్యావంతులపై టాగూరు ప్రబల ప్రభావం. నాలుగవ కారణం: మార్క్సిస్టులు వాళ్ళ సాంఘిక రాజకీయాల కోసం ఈ నాటకాన్ని స్వంతం చేసుకోవడం.

కన్యాశుల్కం నాటకం ఏకార్థకం (monologic) కాదు. అది బహ్వర్థకం, బహుధ్వనితం (polyphonic). అంటే ఏమిటి? ఏకార్థకంలో ఉన్న రచనల్లో రచయిత పాత్రల జీవన పద్ధతిని నిర్దేశిస్తాడు. వారందరి గొంతుకా అతనిదే! అట్లా కాకండా బహ్వర్థక రచనల్లో పాత్రల నుండి మనం రచయిత గొంతు వినం. పాత్రలు తమదైన స్వంత గొంతుతో తమ ప్రపంచంలో ఉండి మాట్లాడుతాయి. అంటే, రచయితకి ఏ విధమైన స్వతంత్రతా లేదని కాదు. ఈ పాత్రలన్నీ రచయిత తయారు చేసినవే! అయితే, ఈ పాత్రలన్నీ రచయిత వాక్కుతో సమాన స్థాయిలో మాట్లాడుతాయి. అంటే, స్థూలంగా, బహ్వర్థక రచనలో ఒకే ఒక్క సందేశం మాత్రమే ఉండదు. దేశవిదేశీ సంస్కృతు లన్నింటిలోనూ, పౌరాణిక సాహిత్యం, మతసంబంధ సాహిత్యం, బహ్వర్థక సాహిత్యం అని చెప్పవచ్చు. స్థూలంగా చెప్పాలంటే, ఈ పోలిఫోనిక్ సాహిత్యం — బహుస్వన, బహుస్వర, బహుళార్థక సాహిత్యం అని అర్థం.

ఈ రకమైన సాహిత్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? వివిధ రకాల వ్యాఖ్యానాలకి, దృక్పథాలకీ ఈ సాహిత్యం అనువునిస్తుంది. ఈ సాహిత్యం చదివిన ప్రతి ఒక్కసారీ వేరొక అర్థం స్ఫురించడం జరుగుతుంది. కారణం: కథల్లో పాత్రలు రచయిత దృక్పథానికి ప్రతిబింబాలుగా మాత్రమే ఉండరు. అంటే, కొన్ని ముఖ్య పాత్రలు వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు. రచయిత ఇది సబబా, కాదా అని నిర్ణయించడు; ఈ వ్యక్తులని, పాత్రలనీ తానే సృష్టించినప్పటికీ! బాఖ్తిన్ (Mikhail Bakhtin) బహుళార్థక రచనలపై వ్యాఖ్యాన వ్యాసాలు రాశాడు. మోర్సన్, ఎమర్సన్, రాసిన వ్యాఖ్యాన గ్రంధంలో[17] ఈ పోలిఫోనీ పై వివరణ పూర్తిగా చదువుకోవచ్చు.