నారాయణ రావు, షూల్మన్, ఈ పుస్తకాన్ని, సెర్వాంటెస్ (Cervantes) నవల, డాన్ కిహోటెతో (Don quixote) పోల్చారు. ఈ రెంటికీ ఒక రకమైన సమకాలీనత ఉన్నది కూడాను. యూరోపియన్ సాహిత్యంలో డాన్ కిహోటె, మొట్టమొదటి నవలగా గుర్తిస్తారు. కళాపూర్ణోదయం[9] మన సాహిత్యంలో మొదటి నవల అని వీరి అభిప్రాయం.
బాఖ్తిన్ అనే రష్యన్ సాహితీవేత్త నవల ముఖ్య లక్షణం, బహుళార్థకం, బహుధ్వనితం (polyphonic), అని సిద్ధాంతీకరించాడు. నవలలో పాత్రలు ఒక రకంగా ‘స్వతంత్రులు.’ ఒకరితో ఒకరు మాట్లాడుతారు; అభిప్రాయాలు చెప్పుకుంటారు అనటం సమంజసం. రచయిత జోక్యం ఉండదు. అంటే రచయిత ఈ అభిప్రాయాలు ఎలా వుండాలో ముందుగా నిర్వచించడు. ఇక్కడ కథ సృష్టించినది, భగవంతుడే, అయినప్పటికీ, ఆయన ప్రమేయం లేకుండా, పాత్రలు కథని నడిపిస్తాయి. పాత్రలు నిజం మనుష్యులలాగా, స్వతంత్ర వ్యక్తులలాగా ప్రవర్తిస్తాయి. బాఖ్తిన్ సిద్ధాతం మరికొంత క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి అతని పుస్తకాలు[11] చదవాలి. ఈ నవలకి సంబంధించినంత వరకూ, నారాయణ రావు రాసిన వెనుకమాట శ్రద్ధగా చదవటం అవసరం.
పింగళి సూరన మరొక పుస్తకం ప్రభావతీ ప్రద్యుమ్నము.[10] ఇది ప్రేమకథ. హరివంశం నుంచి ఈ కథ తీసుకున్నాడు. ఈ పుస్తకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చాడు. ఉజ్జాయింపుగా 1570 ప్రాంతాన ఈ రచన చేసి ఉంటాడని తెలుగు సాహితీ చరిత్రకారుల ఊహ. హరివంశములో కథ మాతృక. దీనికి కొద్ది మార్పులు చేర్చి, ఒక నూతన బాణీలో సూరన ఈ కథ చెప్పాడు. అనువాదకుల దృష్టిలో ఈ కథ రోమియో జూలియట్ చిత్రణకు సరిపడుతుంది. ప్రభావతికి, ప్రద్యుమ్నుడికీ మధ్య రాయబారి శుచిముఖి అనే తెలివి గల హంస. ఈ హంస సరస్వతి దగ్గిర చదువులు నేర్చిన హంస. ప్రభావతిని గురించి చెప్పే పద్యం చాల అందమైన పద్యం. అసలు, అంతకు ముందుగా సూరన చెప్పిన మొట్టమొదటి దైవస్తుతి పద్యమే ‘ప్రబంధ’ సాహిత్యంలో ఒక కొత్త పోకడను సూచిస్తుంది.
శ్రీమదుమామహేశు లతిచిత్రవిలాసులు దారు మున్ వియో
గామిత చింత నొండొరులకై సగమౌటలు నిచ్చఁ దెల్పు కాం
క్షామహిమంబుచేఁ జెఱుసగంబుగ నొక్కయొడల్ ధరించు స
త్ఫ్రేమపుదంపతుల్ కృతిపతిన్ దనరింతురుగాతఁ గీర్తులన్
చాలాకాలంగా ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండటం మూలంగా కలిగిన వ్యథ చేత చిక్కి సగమై పోయి, ప్రేమాతిశయంతో కలిసినప్పుడు గాఢంగా కౌగలించుకొని ఒకటై పోయారు. మనకందరికీ తెలిసిన అర్థనారీశ్వర రూపం ఆదిరూపం కాదన్నమాట! ఈ వర్ణన కవి నూతన చమత్కృతి.
ప్రభావతి గురించి హంస చెప్పిన పద్యంలో, సాధారణంగా స్త్రీ సౌందర్యవర్ణనలో వాడే ఉపమానాలు ఏవీ ప్రభావతి సౌందర్యాన్ని చెప్పటానికి సరిపోవు అని చెపుతుంది. మాటలలో సౌందర్యం వర్ణించటానికి అంతకన్నా వేరు మార్గం లేదు కదా! అయితే, అంతమాత్రం చేత నాకు సంభాషణశక్తి లేదనుకోకు. నన్ను పెంచినది సరస్వతి. నాకు విద్యాబుద్ధులు నేర్పినది ఆ వాగ్దేవత. ఏదో రకంగా కష్టపడి చెప్పుదామనుకున్నా, ప్రభావతి సొగసులో ఒక కోటివంతు గూడా చెప్పలేక పోతున్నాను, మాటలతో! సూరన చూపించిన నవ్యత, నవలకున్న బహుళార్థకతనీ, బహుధ్వనిత్వాన్నీ అన్వేషించి మళ్ళీ తెలుగు నాటకంలో ప్రవేశపెట్టిన ఖ్యాతి గురజాడ అప్పారావుకే దక్కుతుందని అనువాదకులు, ఈ పుస్తకం వెనుకమాటలో ధైర్యంగా చెప్పుతున్నారు. ఆ విషయం ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.
అంతకు ముందుగా పాఠకులకు మరొక విషయం మనవి చేసుకోవాలి. నేను ఈ వ్యాసంలో మరొక రెండు పుస్తకాల గురించి చెప్పదలచుకోలేదు. ఆ రెండు పుస్తకాలూ ఇవి: Classical Telugu Poetry: An Anthology[4]; Hibiscus on the Lake: Twentieth Century Telugu Poetry from India[5]. వెయ్యి సంవత్సరాల తెలుగు పద్యసాహిత్యం నుంచి — నన్నయ నుంచి నేటి వరకూ వచ్చిన కవితలు — వీటిలో కొన్ని ఏరి, అనువదించి, రాసిన కవుల స్వీయచరిత్ర స్థూలంగా పదిలపరిచిన పుస్తకాలు, ఇవి. వీటిని మరొకసారి విచారించటానికి ప్రయత్నిస్తాను.
అన్నమయ్య తరువాత పదకవులలో ప్రసిద్ధి కెక్కిన మరొక తెలుగు కవి క్షేత్రయ్య. క్షేత్రయ్య పదాలని, మరికొందరి పదకవుల కవితలనీ కలిపి రామానుజన్, నారాయణరావు, షూల్మన్, ప్రచురించిన అనువాద గ్రంథం[12] గురించి క్లుప్తంగా ముచ్చటిస్తాను. క్షేత్రయ్యతో పాటు, ఐదు అన్నమయ్య పదాలు, రుద్రకవి జనార్దనాష్టకం, అరడజను సారంగపాణి పదాలు, కొంకణేశ్వర ప్రభువుపై ఒక పదం, ఈ సంకలనంలో ఉన్నాయి. మిగిలిన 37 పదాలూ క్షేత్రయ్యవి. అందుచేత క్షేత్రయ్య పదాలపై అనువాదకర్తల ఉపోద్ఘాతం, ఆముఖాలలో చెప్పిన విషయాలని క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.
పదాలు, శాస్త్రీయ లలిత సంగీత కవితలు. పాడుకోటానికి, నృత్యానికి ఉద్దేశింపబడ్డ ఈ కవితలు యావద్భారతదేశంలో ఉన్నాయి. సంస్కృతంలో ప్రసిద్ధికెక్కిన భక్తిగీతాలు పన్నెండవ శతాబ్దంలో జయదేవుడు రాసిన గీతగోవింద కావ్యం. దక్షిణ భారతదేశంలో ఈ ప్రక్రియ పదిహేనవ శతాబ్ద ఉత్తర భాగంలో తెలుగులో అన్నమయ్య పదాలతో ప్రమాణీకరించబడింది. అన్నమయ్య భక్తిగీతాలు దేవాలయ పూజలతో సంబంధించినవిగా పరిగణిస్తే, క్షేత్రయ్య పదాలు, దేవాలయాల వెలుపలే రాయబడినవి. అయితే, వీటిలో ముఖ్యపాత్ర, నాయకుడు మువ్వగోపాలుడు దైవమే.
దక్షిణ భారతదేశ భక్తిగీతాలలో ఆది నుండీ శృంగార (కామోద్దీపకమైన) ప్రస్థావన ఉంది. తమిళ భక్తి కవితలలో, దేవుడు తరచుగా ప్రేమికుడిగా కనపడతాడు. తెలుగు పదకవులు తమిళ భక్తి కవుల కవితలచే ఆకర్షించబడ్డారు. అయితే, తెలుగు పదకవితలలో ఉన్న విశిష్టత, వ్యత్యాసం ఏమిటి? అని ప్రశ్నించుకోవాలి.
ఎనిమిదవ శతాబ్దంలో ముఖ్య పదకర్త నమ్మాళ్వార్ రాసిన ఒక భక్తిగీతం అనువాదకులు ఉదహరించారు. ఈ గీతంలో గొంతు ఒక యువతి. ఆమె ప్రియుడు కృష్ణుడో, రాముడో, –నల్ల దేవుడు — అతని నుంచి యెడబాటు. ఇది ఇతివృత్తం. ఈ (దేవుడు-ప్రియుడు) ప్రియుడు ఆమె దరికి రావటానికి ఒప్పుకోడు. ఈ యువతి ఏకాకి. రాత్రి సమయం. నిద్ర పోలేదు; ఊరంతా నిద్ర పోయినప్పటికీ! మొత్తం మీద, ఆమెకు చివరకు మిగిలినది ఆశాభంగం. ఇది కేవలం విరహం-భక్తి. తమిళ ఆళ్వారుల ‘అకం’ కవితలకు కవితాజగత్తులో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదని, ఈ స్వతంత్ర ప్రతిపత్తికి అధిభౌతిక రూపకత్వం ఆపాదించటం కవితలకున్న సంపూర్ణతని, వాటి సంకేతశక్తితో సహా ధ్వంసం చెయ్యటమేనని ‘విరహ-భక్తి’ పై పరిశోధనలు చేసిన ముఖ్యుల అభిప్రాయాలతో ఈ అనువాదకులు ఏకీభవిస్తారు.
ఈ యువతి ప్రియుడి కోసం వేచి ఉండటం తప్ప వేరే గత్యంతరం లేదు. వేర్పాటు బాధని అనుభవించటం తప్ప వేరేమీ చెయ్యలేదు. ప్రియుడు ఇష్టమైతే రావచ్చు; లేకపోతే రాకపోవచ్చు. జాలిపడి రావచ్చు; లేదా ఆమె తన విరహబాధతో మరణించవచ్చు. స్త్రీ అవడం ఆమె పరాధీనతకి మూలం. ఈ రకమయిన బాధిత స్త్రీ వ్యక్తిత్వ ప్రదర్శన తమిళ భక్తి గీతాలలో ఉన్న విశిష్ట లక్షణం. నిరుద్ధమైన కోరిక, అంతులేని యెడబాటు, అంధకారబంధురమైన జీవనం,నిస్సహాయస్త్రీత్వం, శిధిలమైన వ్యక్తిత్వం –ఇవన్నీ మూర్తీభవించిన తమిళ భక్తికవితతో క్షేత్రయ్య రాసిన ఒక పదం పోల్చి వ్యత్యాసం ఏమిటో చూద్దాము. అనువదించబడిన పదానికి మూలం ఇది:
చెల్లబో పాలగిరి – చెన్నుడే వీడు కొమ్మా!
ఎల్ల లోకము లిత – డేలు ననగా వినవా. |చెల్లబో|
పరిగే వాని చేతి పైడి – పట్టిన దానవా యింటి
గురుతు చెప్ప వద్దా యెంత – సరసు రాలవె కొమ్మా!
గురిగాడు గనుక సి – గ్గున నెవ్వరి నడుగక
వెర చీ సందు కా సందుకు – తిరుగగా దోడి తెచ్చితివి. |చెల్లబో|
వచ్చిన దాక తల – వాకిట నీ వైనాను
నెచ్చెలు వైన నుండితే – నేర మటవె కొమ్మా!
యిచ్చిన పైడి చేతికి – వచ్చినదే చాలు నటవే
హెచ్చు కొద్దు లెరుగ వలదా – యెవరంట యున్నావే. |చెల్లబో|
బాలరో మువ్వ గో – పాలుడైన చక్కని
పాలగిరి చెన్నుడు నీ – పాల గల్గె కొమ్మా!
యేలి (ఏల) రేపు వచ్చే నంటే – యింతైన సమ్మ తించక
యేల రా వద్దంటివే ని – న్నే మందునే చెలియ! |చెల్లబో|
దేవుడే ఖాతాదారుడిగా వస్తే ఈ యువతి (వేశ్య) ఆయనతో అహంకారిగా వ్యవహరించింది. అందుకు గాను, వేశ్యమాత చీవాట్లు పెడుతూన్నది. డబ్బులు పుచ్చుకోని, తాను ఉండే చోటు చెప్పటానికి కూడా నిరాకరించింది. వేశ్యవాడలో దోవ అడగటానికి సిగ్గుపడుతూ, తారట్లాడుతున్న ఆయన్ని వేశ్యమాత చూసింది. పల్లవి లోనే ఖాతాదారుడెంత శక్తిమంతుడో తెలుసు, కానీ ఇక్కడ ఈ స్త్రీ దే పైచెయ్యి. ఈ వ్యవహారంలో, దుడ్డే ప్రథానం. దేవుడు ప్రేయసిల మధ్య అసౌష్ఠవం నమ్మాళవార్ పదం లోనూ ఉన్నది; ఇక్కడ కూడా ఆ అసౌష్టవం ఉన్నది. కానీ, ఇక్కడ తల్లకిందులైన అసౌష్టవం. అంతే కాదు. తెలుగు పదంలో ఉద్విగ్నధ్వని స్వభావసిద్ధంగా వేరు. విరహం కరిగి నీరైపోయింది.