తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట

మహదేవుడు కథ చెప్పడానికి సుముఖుడై ఉన్నాడని, అతని ‘ఇంగితంబెఱింగి,’ పార్వతి అడుగుతున్నది:

అభవ! నీ కంఠ మూలంబునందుఁ దెలిసి
కాననయ్యెడు నిది యేమి కప్పు? సెప్పు
మఖిల లోక విలోచ నాహ్లాద కలన
కందమై యందమయ్యె శృంగార రేఖ.

ఆనతిమ్ము మహదేవ! యభవ! నీదు
కంఠమూలము నలుపైన కారణంబు
నన్ను మన్నించి ఈ కారణంబు నాకు
నానతీఁ దగు నీకు లోకాభి వంద్య!

అలాగని, పార్వతి అడగంగానే, శివుడి చేత శ్రీనాథుడు మొత్తం కథ మనకి మొట్టమొదటిసారి వింటున్నట్టుగా చెప్పిస్తాడు. అందరికీ తెలిసిన కథే! అయినా ఈ కథ హరవిలాసంలో చదువుతే మొట్టమొదటిసారి ‘వింటున్న’ భావం కలుగుతుంది. వస్తువు పాతదే! చెప్పే విధానం సరి కొత్తది; అందమైనది. ఒక రకంగా, శ్రీనాథుడు తెలుగులో చిన్నకథకి అంకురార్పణ చేశాడని చెప్పవచ్చు. కాదు. ‘కాల్పనికసాహిత్యా’నికి పునాది వేశాడని అనవచ్చు. పార్వతికి తెలియదా, శివుని గరళకంఠం, ఆయన గొంతుపై అందమైన నలుపు? శివునిలో సగశరీరం ఆవిడదే కదా! కథ, అడగడంలోని లాలిత్యం, సౌమ్యత; కథ చెప్పించడంలో చమత్కారం! అవి కొత్తదనాన్ని చూపిస్తున్నాయి. శ్రీనాథుడు మౌఖిక సాహిత్యానికి, లిఖిత సాహిత్యానికీ వంతెన వేసి, తరువాత 16వ శతాబ్దంలో రాబోయే ప్రబంధకవులకి సుగమమైన కవితామార్గం, ఒక వరవడి, చూపించాడని చెప్పవచ్చు.

శ్రీనాథుడి ఐదు పుస్తకాలూ అనువాదంలో వివరంగా చర్చించబడ్డాయి. ఆ పుస్తకాల వెనుక ‘చారిత్రక’ కథలు రమ్యంగా చెప్పబడ్డాయి. శ్రీనాథుడి చాటువులపై చివరి భాగంలో ఒక చిన్న వ్యాఖ్యాన వ్యాసం కూడా ఉన్నది. నిజం చెప్పాలంటే, ఈ ఒక్క పుస్తకాన్నీ వేరుగా సమీక్ష చెయ్యవలసిన అవసరం ఉన్నది.


ఇక్కడితో శ్రీనాథుడిని వదిలి క్రీడాభిరామము[8] అనువాదం గురించి మాట్లాడుకుందాం.

శ్రీనాథుడిని వదిలి పెడదామనుకున్నా శ్రీనాథుడు మనలని వదిలి పెట్టద్దూ? చాలా కాలం పాటు, ఎంతోమంది తెలుగు సాహితీ వేత్తలు, క్రీడాభిరామము శ్రీనాథుడు రాసినదే అని చెబుతూ వచ్చారు. అప్పట్లో, ఈ పుస్తకంపై పండితులు చేసిన తర్జన భర్జనలు, ముఖ్యంగా కర్తృత్వంపై ఇంకే పుస్తకం పైనా రాలేదు. కాశీఖండము, హరవిలాసము, భీమఖండము, శృంగార నైషధము రాసిన మహా పండితుడు, కవిసార్వభౌముడు ‘ఇటువంటి చెత్త పుస్తకం,’ రాస్తాడా అని సంశయించిన సాహితీవేత్తలు లేకపోలేదు.

ఇప్పుడు, క్రీడాభిరామము శ్రీనాథుడి శైలికి హాస్యానుకరణంగా (Caricature), లేదా వ్యంగానుకరణంగా (Parody) ప్రసిద్ధికెక్కిన వీధి నాటకం అని ధ్రువపడింది.

హాస్యానుకరణం అనే ప్రక్రియ గురించి మూడు మాటలు చెప్తాను. పేరడీ ఒక సాహిత్య ప్రక్రియ అని అరిస్టాటిల్ మొదటగా గుర్తించాడు. ఛాసర్ (Geoffrey Chaucer) కాలం నుంచీ ఇంగ్లీషులో పేరడీకి ఉదాహరణలు అక్కడక్కడ కనిపిస్తాయి. కాని, 19వ శతాబ్దం, ఆ తరువాత కాలంలోనే ఈ హాస్యానుకరణం ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా నిలదొక్కుకున్నది అని పాశ్చాత్య సాహిత్య చరిత్రకారులు చెప్పుతారు. ఈ సందర్భంలో, క్రీడాభిరామము ‘కావ్య’పరంగా మనం గర్వించదగ్గ విషయం — మన సాహిత్యంలో ఈ ప్రక్రియ 15వ శతాబ్ద ప్రారంభంలోనే ఉన్నదన్న మాట!

మూలగ్రంథం బాగా తెలిసినప్పుడే, అంటే మూలగ్రంధం లోని కవితలకున్న సూక్ష్మత తెలిసినప్పుడే, పేరడీ రక్తి కడుతుంది. మూల గ్రంధంలో కవితలో గంభీరత ఉంటే, ఆ గంభీరతని గంభీరంగా ఎగతాళి చెయ్యటం, పేరడీ ముఖ్య లక్షణం. పేరడీ మూలగ్రంథంపై అసూయతో చెయ్యవచ్చు; అభిమానం, గౌరవం, వాత్సల్యంతో చెయ్యవచ్చు. వల్లభరాయుడికి శ్రీనాథుడంటే గౌరవం. హాస్యానుకరణం అతి చాకచక్యంగా చేశాడు. (మొత్తం 295 పద్యాల క్రీడాభిరామం ఈమాట గ్రంథాలయంలో ఉన్నది.)

ఈ పుస్తకంలో కథ అత్యల్పం. గోవింద మంచనశర్మ అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు, తన వైశ్య స్నేహితుడు టిట్టిభశెట్టితో కలిసి ఓరుగల్లులో వేశ్య, కామమంజరిని కలవడానికి వస్తూ దారి పొడుగునా చూసిన విషయాల అద్భుత రసిక వర్ణన, చేసిన పనులు, అంతే!

నారాయణ రావు, షూల్మన్‌, వాళ్ళ అనువాద గ్రంథంలో శ్రీనాథుడి పద్యాలు, వల్లభరాయుడి పేరడీ పద్యాలు చక్కగా ఉదహరించి, వ్యాఖానించారు. శ్రీనాథుడిపై పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన తెచ్చి అందులోనూ కొన్ని ఉదాహరణలు — ముఖ్యంగా శ్రీనాథుని చాటువులని పేరడీ చేసిన పద్యాలు — ఇచ్చారు. మచ్చుకి కొన్ని ఉదహరిస్తాను.

శృంగారనైషధములో పూజ చెయ్యటానికి వెళ్ళుతున్న నలుడు వేసుకున్న దుస్తుల వర్ణన: గన్నేరుఁ బూచాయఁ గనుపట్టు జిలుఁగైన సలిల కాషాయ వస్త్రంబు గట్టి… కొద్దిగా మార్చి, వేశ్యని చూడటానికి వెడుతున్న గోవింద శర్మ వేషం దుస్తుల వర్ణన: గన్నేరుఁ బూఁజాయ కరమొప్పు నీర్కావి మడుగు దోవతి పింజె విడిచికట్టి… అని హాస్యానుకరణ.

అలాగే భీమఖండంలో వ్యాసుడు మొదలైన మహాఋషులు దాక్షారామం లోకి ప్రవేశించటానికి శుభసమయం కోసం ‘గార్గ్య సిద్ధాంత’ పద్యాన్ని, కొద్దిగా మార్పు చేసి, వేశ్యల ఇళ్ళకి వెళ్ళటానికి శుభసమయం పరంగా పద్యం చెపుతాడు:

గార్గ్య సిద్ధాంత మత ముషః కాల కలన,
శకున మూనుట యది బృహస్పతి మతంబు
వ్యాస మతము మనఃప్రసా దాతిశయము
విప్ర జన వాక్య మరయంగ విష్ణు మతము

ప్రయాణంలో దోవ పొడుగూతా చూసిన సాధారణ విషయాలు, విపరీత వర్ణనలు, శ్రీనాథుని వర్ణలకి అనుకరణలుగా కనిపిస్తాయి. ఉదాహరణకి కోడిపందెపు వర్ణన చూడండి: ఒక పెద్ద వచనం, వెనువెంటనే ఒక సీసపద్యం. వచనంలో రెండు కోళ్ళు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవటం, వాలి సుగ్రీవులు, వింద అనువిందులు, మురారి చాణూరుల పోరాటాలతో పోలుస్తాడు. పద్యం ఆఖరున, యుద్ధంలో మరణించిన యోధులకి స్వర్గంలో రంభామేనకతిలోత్తమలతో సంభోగం ప్రాప్తిస్తుందన్న సుప్రసిద్ధ విశ్వాసం తీసుకొని, పోరులో చచ్చిన కోళ్ళకు కూడా ఆ అదృష్టం పడుతుందా, అని ప్రశ్నార్థకంగా హేళన చేస్తాడు. నారాయణ రావు, షూల్మన్, ఈ కోడిపందెపు వర్ణనని ఇలా అభివర్ణించారు: …almost as if a modern sports commentator were describing a local Little League baseball match in terms of Achilles’ feud against Hector. ఈ పరిశీలన చక్కని హాస్య పరిశీలన అని నేను మీకు మూలంలో చెప్పినట్టుగా ఉదహరించాను.

ఈ పుస్తకంలో పచ్చి శృంగారం ఉన్నదని, ఒక్కొక్కచోట జుగుప్స కలిగించే అశ్లీల వర్ణనలు ఉన్నాయన్న ఆక్షేపణలు, అసందర్భ నైతిక వాదనలు అవతలకి నెట్టి చదివితే, ఈ పుస్తకం హాయిగా ఆనందించవచ్చు. అనువాదం, అందులోని వ్యాఖ్యానం చదివిన తరువాత మూలాన్ని చదివితే, మూలం మరింత రుచికరంగా ఉంటుందని నా అభిప్రాయం.

ఈ సందర్భంలో ఒక్క విషయం నిష్కర్షగా మనవి చెయ్యాలి. ఇప్పుడు ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలలో అధ్యయనం చేసే కొద్దిమంది గురించి నాకు అంత బాగా తెలియదు. పోతే, తెలుగు మాతృభాష అని చెప్పుకునే చాలామందికి (అంటే నాబోటి వాళ్ళకి) ప్రాచీన సాహిత్యంలోకి ప్రవేశం, ఇంగ్లీషు అనువాదాల ద్వారానే సాధ్యం. అంటే, ఇప్పుడు నారాయణ రావు, అతని సహచరులూ చేస్తున్న అనువాద గ్రంధాలు, పాశ్చాత్యులకే పరిమితం కాదు; మనకి కూడా అవసరం. అవి చదివిన తరువాత, మూలగ్రంధాలు చదివి ఆనందించటం సులభమవుతుందని స్వానుభవంతో నేను చెప్పగలిగిన అభిప్రాయం.


పదహారవ శతాబ్దపు రెండవ భాగంలో పింగళి సూరన తెలుగు సాహిత్యం లోకి తెచ్చిన ఒక కొత్త ప్రక్రియ, ఒక కొత్త జాన్ర, భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి ‘నవల’ అని చెప్పదగిన కళాపూర్ణోదయం, దాని ఆంగ్లానువాదం[9] గురించి, ఆ తరువాత పింగళి సూరన చెప్పిన చక్కని ప్రేమకథ, ప్రభావతీ ప్రద్యుమ్నము, దాని అనువాదం[10] గురించి క్లుప్తంగా ముచ్చటిస్తాను.

కళాపూర్ణోదయం పేరుతో ఎలాటి కథ రాద్దామనుకున్నాడో ప్రారంభంలో సూరన చెపుతాడు: “… యత్య పూర్వకథా సంవిధానవైచిత్రీ మహనీయంబును, శృంగార రసప్రాయంబును, బుణ్యవస్తు వర్ణనాకర్ణీయంబును…” అనే మూడు విషయాలు: ఇంతకు పూర్వము లేనిది, ఆశ్చర్యము కలిగిస్తూ, శృంగార రసభరితమై, దేవుళ్ళ గురించి అందంగా వినిపిస్తూ చెప్పే ఒక చక్కని కథ నేను చెపుతానని, అన్నాడు.

ఈ కథ రకరకాల మెలికలు తిరిగే జటిలమైన కథ. టూకీగా కథా ప్రారంభం ఇది: సృష్టి కర్త బ్రహ్మ ఈ కథ చెబుతున్నాడు. అంటే, అది నిజం అవ్వాలి; జరగాలి కదా! బ్రహ్మ చెప్పే కథ సరస్వతి పెంపుడు చిలుక వింటూన్నది. సరస్వతి ప్రణయకోపంతో పెడముఖం పెట్టినా శ్రద్ధగా కథ వింటూన్నది. “అనగా అనగా కాసార పురం. ఆ పట్టణాన్నేలే రాజు కళాపూర్ణుడు. ఆ రాజు తల్లి, మణి స్థంభుడు; తండ్రి సుముఖాసత్తి.” సరస్వతి ఫక్కున నవ్వింది. ‘తల్లి మగవాడు, తండ్రి ఆడదీనా?’ అని సరస్వతి అడగ్గానే, బ్రహ్మ తన నాలుగు ముఖాలతో సరస్వతిని ముద్దాడాడు. ఆ తరువాత ఏమయ్యింది? సరస్వతిని ముద్దాడినప్పుడు ఆమె కంఠంలో నుంచి అపూర్వమైన మణితస్వరం వచ్చింది. ఆ స్వరాన్ని చిలుక నెమరు వేసుకుంటున్న సమయంలో రంభ వస్తుంది. ఆ స్వరం విని దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పమని అడుగుతుంది. చిలుక రంభతో చెప్పటం, సరస్వతి చిలుకకిచ్చిన శాపం, ఇలా అంచెలు అంచెలుగా మెలికలు తిరిగి, అసలు కళాపూర్ణుడి కథ ఐదవ ఆశ్వాసం వరకూ మొదలవదు. అయినా, ఈ కథ చెప్పకూడదు గదా! (మొత్తం కథ వచనంలో ఈమాట లైబ్రరీలో దొరుకుతుంది.)