ఇప్పుడు కవిసార్వభౌముడు శ్రీనాథుడి పై పుస్తకం గురించి చెప్పుకుందాం.
ఎవరీ శ్రీనాథుడు? ఏమాకథ? తెలుగుదేశ జనబాహుళ్యానికి శ్రీనాథుడు ప్రసిద్ధికెక్కిన చాటుకవిగా పరిచయస్తుడు. చాటువు శ్రీనాథుడు, కవిసార్వభౌముడిగా, డిండిభట్టు కంచుఢక్క బద్దలు కొట్టిన మహా కవి, పండితుడిగా పేరెక్కిన శ్రీనాథుడు, ఒకరేనా కారా అన్న ప్రశ్న నేను అడగను! కారణం చెప్పనవసరం లేదనుకుంటాను.
దక్షిణ ఆసియా సాహిత్య సంప్రదాయంలో మార్పు తెచ్చిన కవుల గురించి, వారి పుస్తకాల గురించి, వారి జీవనశైలి గురించీ పుస్తకాలు లేనే లేవు. భారత సాహిత్య చరిత్రలో అత్యున్నత స్థాయికి చెందిన కవుల్లో ఒకడని తప్పక చెప్పి తీరవలసిన కవి, తెలుగుకవి శ్రీనాథుడు. కోస్తా ఆంధ్రదేశంలో (1370 – 1450) పుట్టి, అద్భుతమైన ఐదు గ్రంధాలు (శృంగార నైషధము, భీమేశ్వర పురాణం అనే భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము — ఈ ఐదు గ్రంథాలే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి) తెలుగు వారికిచ్చాడు. ఈ పుస్తకం అతని సాహిత్య జీవిత కథనం. ఒక కవి జీవనశైలికి, సాహితీ ప్రత్యేకతకీ ప్రతిబింబం అని చెప్పదగ్గ పుస్తకం ఈ పుస్తకం.
ఎవరీ శ్రీనాథుడు? అన్న ప్రశ్నకి శ్రీనాథుడే తన ఆఖరి(?) కావ్యం శ్రీ కాశీఖండములో ‘ఆత్మ కథ’ అనబడదగు సీసపద్యంలో చెప్పుకున్నాడు:
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటి నాఁడు
రచియించితి మరుత్తరాట్చరిత్ర
నూనూఁగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నొడివితి
సంతరించితి నిండు జవ్వనంబున యందు
హర్షనైషధ కావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయః పరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమఁ
బ్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథమేను
దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్ట సుకవి.
మొదట చెప్పిన రెండు పుస్తకాలు ఇప్పుడు దొరకటల్లేదు. శ్రీహర్షుడు సంస్కృతంలో రాసిన నైషధకావ్యం శ్రీనాథుడు తెనుగు చేశాడు. అది లభ్యం. శ్రీహర్షూడి నైషధకావ్యం ‘విద్వదౌషధం’ అంటారు. అంటే పండితులకున్న వ్యాధులన్నీ పోగొట్టుతుందని భావం. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణగారి వ్యాఖ్యానం మహ సరసంగా ఉంది. పండితులకున్న ఒక వ్యాధి, ‘తమకు సర్వమూ తెలుసునన్నది.’ ఆ వ్యాధి దుమ్ము దులిపేది, శ్రీహర్షుని నైషధం!
హర్షుడి సంస్కృతం చాలా కఠినమైనదని, ఆయన శబ్దసరణి ఇంతకు ముందు ఎవరూ వాడనిదనీ అంటారు. అటువంటి కష్టమైన గ్రంధాన్ని, శ్రీనాథుడు తనకు ‘నిండు యవ్వనం’ రాగానే తెనుగు చేశాడు. తాను తెనుగు చేసిన ‘శృంగార నైషధము’ గురించి సంస్కృత పండితుల హేళన చెప్పటం అనుచితం కాదు. శ్రీనాథుడు హర్షుడు వాడిన దుర్లభ సంస్కృత నామవాచకాల చివర తెలుగు ప్రత్యయాలు (డు, ము, వు, లు) తగిలించి వాటిని ‘తెనుగు’ మాటలుగా తయారు చేశాడని, ‘నీ డు, ము, వు, లు, నువ్వు తీసుకొని మా హర్షనైషధం మాకు తిరిగి ఇచ్చెయ్యి’ అని వేళాకోళం చేశారట! మరో పిట్టకథ:
నైషధం కథ పాత కథే! నలదమయంతి కథ. ఇందులో రాజహంస తను దమయంతిని చూచిన విషయం చెపుతున్నప్పుడు పద్యం:
కమలేందీవర షండ మండిత లసత్కాసార సేవారతిన్
గమికర్మీకృతనైకనీ వృతుఁడనై కంటిన్ విదర్భంబునన్
రమణిం బల్లవపాణిఁ బద్మనయనన్ రాకేందు బింబాననన్
సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరిన్
శ్రీహర్షుడి సంస్కృత నైషధంలోని శ్లోకం:
సరసీః పరిశీలితుమ్ మయా గమికర్మీకృతనైకనీవృతా
అతిథిత్వమ్ అనాయి సాద్రోసోః సదసత్సంశయగోచరోదరీ
‘గమికర్మీకృతనైకనీవృతా,’ అన్నపదబంధం గురించి పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు శ్రీనాథుడిని, ఆ సంస్కృత పదబంధం ఎట్లాగ తెలుగు చేశావు? అని అడిగాడట. శ్రీనాథుడు, ‘గమికర్మీకృత నైకనీవృతుడనై,’ అని తెనుగు చేశానని చెప్పాడట! ఆఖరి పాదంలో హంస దమయంతి నడుము గురించి చమత్కారంగా చెప్పుతున్నది. ‘ఒక్కక్షణం, ఆమె నడుము చూశాను; ఖచ్చితంగా చెప్పలేను, నడుము ఉన్నదో లేదో, మరి!’ అని.
శృంగార నైషధము తెలుగు పంచకావ్యాలలో ఐదవది. సంస్కృతంనుంచి తెలుగు చేయబడ్డ కావ్యం ఇది ఒక్కటే! ఆ తెనుగు చేసిన ఘనత, శ్రీనాథుడిదే! శ్రీనాథుడు తెనుగు చేయడంలో కొంత స్వతంత్రించినాడు. కొన్ని భాగాలు అనౌచిత్యములని వదిలి పెట్టాడు. కొన్ని చోట్ల హెచ్చు చేశాడు. శ్రీనాథుడు యెంత గడుసువాడో భీమఖండములో ఈ పద్యం చదివితే బోధ పడుతుంది.
హరచూడాహరిణాంక వక్రతయు కల్పాంతఃస్ఫురచ్చండికా
పరుషోద్గాఢపయోధరస్ఫుటతటీపర్యంత కాఠిన్యమున్
సరసత్వంబును సంభవించెననగా సత్కావ్యముల్ దిక్కులన్
చిరకాలంబు నటించుచుండు కవిరాజీరత్నగేహంబులన్
కవిత ఎల్లా వుండాలో చెపుతున్నాడు: కఠినత్వం, కాస్త వక్రత కలిసిన కమ్మదనం వుండాలి. తన కవిత్వానికి ఈ లక్షణాలున్నాయని ఘంటాపథంగా, ధైర్యంగా చెప్పగలిగిన కవి శ్రీనాథుడు.
శ్రీనాథుడి ఒక చాటువులో తన కవిత్వం గురించి ఇలా చెపుతాడు:
పంపావిరూపాక్ష బహు జటా జూటికా రగ్వధ ప్రసవ సౌరభ్యములకు,
తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు,
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షా లతా ఫల స్తబకములకు,
కర్ణాట కామినీ కర్ణ హాటక రత్నతాటంక యుగ ధాళ ధళ్యములకు,
నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత
తెలుగునను, సంస్కృతబునఁ బలుక నేర్తు,
ప్రౌఢదేవేంద్ర రాయ భూపాలవరుని
సమ్ముఖంబున దయచూడ ముమ్మ సుకవి!
తెలుగులోను, సంస్కృతంలోనూ తను చెప్పగలిగే కవిత్వం లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు, పై కవితలో.
శ్రీనాథుడు కరణాలకి, చిన్న చిన్న మంత్రులకి తన గ్రంధాలని అంకితం ఇచ్చి, వాళ్ళకి ఎనలేని కీర్తి సంపాదించి పెట్టాడు. కాశీఖండం మాత్రం ఒక పెద్ద రాజుకి అంకితం ఇచ్చాడు, ఆఖరి రోజులలో! అందుకనే కాబోలు, The Poet who made gods and kings అని ఈ శ్రీనాథసాహితీ జీవిత చరిత్ర గ్రంధానికి సముచితమైన టైటిల్ పెట్టారు. భీమఖండంలో గోదావరి డెల్టా మండలంలో దాక్షారామంలో శివుని పురాణకథలు చెప్పాడు. కాశీఖండంలో ఉత్తరకాశీ కథ (ఇప్పటి బెనారస్), శివుడి కథ చెప్పాడు. హరవిలాసములో ఎన్నో శివుని కథలు, చిరుతొండనంబితో (తమిళంలో కూడా ఉన్న కథ) మొదలుపెట్టి, శివుని నీలకంఠహేతువు కథ అతి సుందరంగా చెప్పాడు. పుస్తకం పేరులో దేవుళ్ళని కలిపిన కారణం ఇదే కావచ్చు.