తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట

పరపూరిత కవిత గురించి: ‘మృదుతల్పంబు వికార లీల దిగి…’ పెద్దనకి ఆపాదించబడిన పద్యం. ఆఖరి చరణం పెద్దన కూతురు పూర్తిచేసిందని ఒక కథ. నేను మౌఖికంగా విన్న కథ వేరు! ఒకే చాటువు చుట్టూరా, వేరువేరు కథలుండవచ్చును కదా! ‘పరపూరిత’ కవిత గురించి మహాభారత పరంగా ప్రసిద్ధి కెక్కిన నన్నయ, ‘శారద రాత్రులుజ్జ్వల…’ పద్యానికి సంబంధించినది. ఈ పద్యం పూర్తిపాఠం:

శారదరాత్రు లుజ్జ్వలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
దారసమీరసౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగపాండురుచిపూరము లంబరపూరితంబులై

పద్యం ఆఖరి చరణంలో చిన్నసంధి మార్పుతో ‘పరపూరితంబులై,’ అన్న మాటలు చాటు సంప్రదాయం లోకి వచ్చాయి. నన్నయకి ‘ఇదే తన ఆఖరి పద్యం,’ అని తెలుసునని, ఇతరులు మిగిలిన భాగాలు పూరిస్తారు అని చాటు కథ. (పాండురుచిపూరములున్ + పరపూరితంబులై, అని)

చాటువులు జనాలలో చెలామణీ చేసిన వాళ్ళు, ఒకే భాషకి పరిమితం కాలేదు. చాటువులు ఒక భాష నుంచి మరొక భాష లోకి సునాయాసంగా పోయాయి; వాటి కథలతో పాటు. అప్పట్లో ప్రాంతీయ భాషల నుంచి సంస్కృతం అప్పు తెచ్చుకొని ఉండవచ్చు. సంస్కృతంలో చాటువులు భోజప్రబంధ అన్న గ్రంధంలో ఉండటం, చాటుసంప్రదాయానికి ప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. అందులోని చాటువులు ఓరుగల్లు ప్రాంతంతో ముడిపడటం, తెలుగువారికి మరింత గర్వదాయకం!

సాహిత్య ‘చరిత్రకారులు,’ చాటువుల చుట్టూ ఉన్న కథలు చూసి, ఇవన్నీ నమ్మశక్యం కాని పుక్కిట పురాణాలని తోసిపుచ్చటం పరిపాటి అయ్యింది. అంతే కాదు; చాటు పద్యాలని సేకరించి పండితులు వీటిలో ‘దోషాలని’ నిషేధించి ప్రచురించారు. ముఖ్యంగా శ్రీనాథుడివని ఆరోపించిన చాటువులని పరిష్కరించారు. శ్రీనాథుడి కవితా ప్రతిభకి ఇవి కళంకం అని వాళ్ళు ఊహించి ఈ పని చేశారు. చాటు సంప్రదాయానికి దానిదైన ప్రత్యేకత ఉన్నది. ఎవరు, ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఫలానా చాటువు(లు) రాశారు? అని, అనుభవ పూర్వక చరిత్ర కోసం ప్రయత్నించడం కొంచెం హాస్యాస్పదంగా కనపడుతుంది. అచ్చుయంత్రం వచ్చిన తరువాత కూడా, ఈ సంప్రదాయం మరొక విధంగా కొనసాగుతూనే ఉన్నది. ఉదాహరణకి, తిరుపతి వెంకట కవుల పేరున ఎన్నో చాటువులున్నాయి. వాటి చుట్టూ సజావయిన కథలూ ఉన్నాయి. మచ్చుకి ఒకటి:

సమస్యా పూరణకి ఇచ్చిన నాల్గవపాదం. ‘మా కులదాస యెంత యభిమానము లేదుర చంద్రశేఖరా!’ ఈ సమస్యా పూరణ వెనుక ఉన్న కథతో ఇది చాటు సంప్రదాయం లోకి వచ్చింది. పూర్తి పద్యం:

నాకు విభూది రాయఁడొక నాయకుఁడా” యని నీదు భార్య ర
త్నాకరు చెట్టవట్టు టది యారసి యుండియు, సిగ్గులేక ర
త్నాకరుఁ జంకఁ బెట్టికొని యక్కులటన్ దలఁ దాల్చి తౌర! భా
మాకులదాస! యెంత యభిమానము లేదుర! చంద్రశేఖరా!

(ఈ పద్యం నేను చాటుపద్యసంపుటము, శ్రీతిరుపతివేంకటీయము, 1957 నుంచి తీసుకున్నాను. పరిచయం చేస్తున్న సంకలనంలో పద్యానికి, దీనికీ కొద్ది భేదం ఉన్నది – వేవే)

ఆ ఊరిలో చంద్రశేఖరుడనే అతను ఉండటం, అతని భార్య ఆ ఊరిలో ఒక ధనికునితో అక్రమ సంబధం పెట్టుకోవటం, ఆ పెద్దమనిషికి తెలిసి కూడా ఉరకనే ఉండటం — పురాణకథలో శివుడు గంగని నెత్తిన పెట్టుకోవడంతో పోల్చి, ఆ ఊరి చంద్రశేఖరుడి కథ బట్టబయలు చేయడంతో సమస్యా పూరణ పద్యం చాటు సంప్రదాయంలోకి వచ్చింది.

ఆఖరిగా మరొక్కసారి చాటువుల గురించి పునరావృతి అవసరం. పాశ్చాత్య విద్యాప్రభావం తెచ్చిపెట్టిన ‘పరిశోధన’ సంకెళ్ళు తెంచుకోలేని మన ఆథునిక పండితులు, అర్థరహితమైన ప్రశ్నలు అడగటం నేర్చుకున్నారు. చాటుకవుల చారిత్రకత, అప్పటి రాజుల శృంగారం వంటి ప్రశ్నలతో సతమతమవుతూ, ఒక సజీవ సంప్రదాయం, మన సంస్కృతికిచ్చిన వైభవాన్ని మరిచిపోయారు.

ఈ సందర్భంగా నాకు బాబ్ డిలన్ పాడిన ఒక పాత పాట, Desolation row, గుర్తుకొస్తున్నది:

And Ezra Pound and T. S. Eliot
Fighting in the captain’s tower
While calypso singers laugh at them
And fishermen hold flowers


ఈ వ్యాసంలో ముందుగానే చాటువుల ప్రసక్తి తేవడానికి ముఖ్య కారణం, శ్రీనాథుడి గురించి, శ్రీనాథుని పుస్తకాల గురించీ మాట్లాడటానికే! ఒక తెలుగు మహాకవి సాహితీ చరిత్ర, ఇంగ్లీషులోకి రావడం మొట్ట మొదటి సారి జరిగింది. అది శ్రీనాథుని సాహితీ ఆత్మకథ[7] అనవచ్చు. ఈ పుస్తకం గురించి ప్రస్తావించ బోయేముందు ‘చరిత్ర’ అంటే ఏమిటి? పూర్వం, పాశ్చాత్య సాహిత్యపరంగా ‘చరిత్ర’ స్థానం ఎటువంటిది? ఏ విధమైన అవగాహన ఉండేది? అని ప్రశ్నించుకోవడం అవసరమని నా అభిప్రాయం.

ఒక పుస్తకం చరిత్ర పుస్తకం ఎప్పుడవుతుంది? 18వ శతాబ్దంలో నవలాకారులు వాళ్ళ పుస్తకాలను ‘చరిత్రలు’ అని మొదటి టైటిల్ పేజీ మీదే రాసుకునే వారు. హెన్రీ ఫీల్డింగ్ 1749లో తన నవల History of Tom Jones, A Foundlingలో తన కలం నుంచి వచ్చినది ‘నిజమైన చరిత్ర’ అని రాయటమే కాకుండా, చరిత్రకారులు రాసినది ‘కాల్పనిక కథ’ అని కూడా అన్నాడు. బహుశా, ఫీల్డింగ్ వేళాకోళం చేస్తూ వుండచ్చు.

నవల అనే జాన్ర (Genre) 18వ శతాబ్దంలో పుట్టింది. చరిత్ర అనేది ఒక అనుభవసిద్ధ శాస్త్రంగా 16వ శతాబ్దంలో మొదలయి 19వ శతాబ్దంలో సురక్షితంగా పాదుకొన్నదని చెప్పవచ్చు. అయితే 1834 – 1874 మధ్యలో జార్జ్ బాన్క్రాఫ్ట్ (George Bancroft) అనే అమెరికన్ రాజ్యాంగవేత్త పది భాగాల ‘అమెరికన్ చరిత్ర’ అనే పెద్ద పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు చారిత్రక సత్యానికి చేసిన ద్రోహంగా పరిగణిస్తారు, చారిత్రకపరిశోధకులు. ఎందుకంటే, ఆ పుస్తకం ఒక కాల్పనిక కథగా, స్వబుద్ధి పక్షపాత సాహిత్యంగా రుజువు కావడమే కారణం.

18వ శతాబ్దంలో నవలలు రాసిన వాళ్ళే ‘చరిత్ర’ కూడా రాశారు. ఉదాహరణకి, వోల్తేర్, ఫీల్డింగ్, డేనియల్ డెఫో, విలియమ్ గోడ్విన్ మొదలైన వాళ్ళు. హ్యూమ్ (David Hume) ఉద్దేశంలో ఒకే పుస్తకాన్ని చరిత్ర గాను, కల్పన గానూ చదవవచ్చు. అతన్ని ఒక అందమైన అమ్మాయి, నవలలు పంపమని కోరితే, ఆ అమ్మాయికి ప్లూటార్క్’స్ లైవ్స్ (Plutarch’s Lives) పంపిస్తూ “ఇందులో ఒక్క మాట కూడా ‘చారిత్రక సత్యం’ కాదు,” అని చెప్పాడట! అలెగ్జాండర్, సీజర్ల విషయాలు పుస్తకంలో చదవగానే, ఆ అమ్మాయి హ్యూమ్‌ని ‘నువ్వు నన్ను మోసం చేసావని’ తిడుతూ ఆ పుస్తకం తిరిగి ఇచ్చిందట! నిజం చెప్పాలంటే, ప్లూటార్క్’స్ లైవ్స్ కాల్పనిక సాహిత్యంగా అద్భుతం అని, చరిత్ర పుస్తకంగా భరించరానిదనీ అంటారు.

గాడ్విన్ ఉద్దేశంలో నిజమైన చరిత్ర ఎప్పుడూ ఎక్కడా ఉండదు. వాస్తవ్యానికి సాక్ష్యం ఎప్పుడూ అసంతృప్తికరం గాను, అనిశ్చితం గానూ, వైరుధ్యాలతో నిండి ఉంటుంది. ప్రతి చరిత్రా అసంపూర్ణం. ప్రతి చరిత్రకారుడికీ తన దృక్పథం ఉంటుంది, అని అంటాడు గాడ్విన్. నిజం చెప్పాలంటే అద్భుతమైన చరిత్ర నవలలో ఉంటుంది, అని అతని అభిప్రాయం. ఎప్పుడో 1797లో రాసిన అతని వ్యాసం 20వ శతాబ్దం వరకూ అచ్చు కాలేదు! ఉత్తరాధునిక సాహితీవేత్తలు అన్నట్టుగా, ‘గతం అనేది మనం చెప్పుకునే కథ మాత్రమే,’ అయితే, మరి చరిత్ర అంటే ఏమిటి? (ఇంకా నిశితమైన విమర్శ, చరిత్ర గురించి హేళన, మరికొన్ని వివరణలూ కావాలంటే, Jill Lepore వ్రాసిన, Just The Facts, Ma’am, The New Yorker, March 24, 2008 చదవండి.)

ఇక్కడ నారాయణ రావు ఒకసారి అన్న వాక్యాలు, ‘వాస్తవాలు అని ఎంచబడ్డ వాటికి రూపాంతరాలుంటాయి; కాల్పనికకథలు నిర్దిష్టమైనవి,’ తిరిగి చెప్పడం అవసరం. ఈ వాక్యం మొట్టమొదటి సారి చదివినప్పుడు, నాకు ఈ కింది కథ గుర్తుకొచ్చింది. ఇదీ ఆ పిట్టకథ:

వాల్టర్ ర్యాలీ (Walter Raleigh) అనే ఒక రచయితని ఇంగ్లండులో జైలులో పడేసినప్పుడు అతను తీరిగ్గా జైలులో కూర్చోని ప్రపంచ చరిత్ర రాద్దామనుకున్నాడు. ఒక రోజున కిటికీ లోంచి జైలు బయట జరిగిన కొట్లాట చూసి వార్డెన్‌ని అడిగాడు, ఏమిటీ అని. అతనొక కథ చెప్పాడు. తనతో జైలులో ఉన్న ఇతర ఖైదీలని అడిగాడు, వాస్తవం తెలుసుకోడానికి! ఒక్కక్కడూ ఒక్కక్క కథ చెప్పాడు, ఈ కొట్లాట గురించి. అంతే! ప్రపంచ చరిత్ర రాయడం మానుకున్నాడట! కారణం? తాను కళ్ళారా చూశాననుకున్నదే రకరకాల వ్యాఖ్యానాలతో వస్తే, తను ఎరగని విషయాలు నిర్దిష్టంగా ఎలా రాయగలడు?

బహుశా ప్రాచీన సాహిత్యం జాగ్రత్తగా వేరొక దృక్పథం నుంచి చదివితే, చరిత్ర రాయటం సాధ్యమవుతుందేమో! దక్షిణ భారత చరిత్రకి సంబంధించి రెండు పుస్తకాలు Textures of Time, Symbols of Substance అవి జాగ్రత్తగా చదివితే, చరిత్ర రచనపై మన అవగాహన మారవచ్చు.