తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట

ఇప్పుడు, మచ్చుకి సురవీధీలిఖితాక్షరంబుల్… అని పైన ఉదహరించి పూర్తి పాఠం ఇచ్చిన పద్యం అనువాదం చూద్దాం.

Waves, trembling leaves,
Glittering mirrors, lamps
In a wind, the flickering
Ears of an elephant, vision after vision
Of imaginary water, firefly light,
Letters written on air, a single breath,
Rice balls made of the milk of moonlight –
Such is wealth.
Then why do men go blind with pride
About it,
O God of Kaalahasti?

ఇంగ్లీషు మాతృభాషగా వచ్చిన వ్యక్తికి ఇది కవితగా వినిపించాలి.

ఈ పుస్తకం వెనుకమాటలో నారాయణ రావు ధూర్జటి గురించి ప్రత్యేకంగా చెపుతూ, తెలుగు సాహిత్య చరిత్ర సంగ్రహంగా చెప్తాడు. ధూర్జటి అన్న పేరు సహజమైన తెలుగు పేరు కాదు. ధూర్జటి అంటే ‘బరువయిన జటలు కలవాడు,’ అని అర్థం. ధూర్జటి అన్న పేరు కవి వీరశైవమతం పుచ్చుకున్నప్పుడు శివునిపై గౌరవంతో మార్చుకున్న పేరు అయి ఉండవచ్చు. ఈ కవి తన పూర్వీకుల గురించి, తన కులం గురించీ ఎక్కడా చెప్పలేదు. ఈయన, కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడనే ప్రాచీన కథ ఉన్నది. అయితే ఈ ‘అష్టదిగ్గజాలు’ అనబడే ఎనిమిదిమంది రాయలు కొలువులో ఉన్నారా అన్నదే ఒక ముఖ్యమైన ప్రశ్న.

ఈ శతకంలో చాలా భాగం దేవుని పొగడ్తల ప్రసంగాలే. అయితే, ఈ ప్రసంగాలలో మానసిక, తత్వజ్ఞాన సంబంధమైన జిజ్ఞాస, ఐహికసుఖాలు, భోగాసక్తుల ప్రసక్తి, మననం కనిపిస్తుంది. ధూర్జటి సామాజిక కవి (social poet). ఒక రకంగా ‘రాజకీయ’ కవి అని కూడా అనచ్చు. అప్పటి రాజకీయ వ్యవస్థాధికారాన్ని ఎదిరించిన వాడు. ఉదాహరణకి ‘రాజన్నంతనె బోవునా కృపయు… దుర్బీజ శ్రేష్ఠులుగా గతంబు కలదే…’ పద్యం చూడండి. అలాగే రాజులంటే అసహ్యత, ‘రాజై దుష్కృతి చెందె చందురుడు… నా రాజశబ్దంబు ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ!…’ అన్న పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.

వెనుక మాటలో నారాయణ రావు తెలుగు సాహిత్య చరిత్రలో కవికి, కవిపోషకుడైన రాజుకీ ఉన్న సంబంధం కాలానుగుణ్యంగా ఎట్లా మార్పు చెందుతూ వచ్చినదో వివరంగా రాస్తాడు. నన్నయ కాలంలో కవి, రాజుకి గురువు, రాజు కవికి శిష్యుడు. విజయనగర సామ్రాజ్య కాలంలో కవి, రాజు స్నేహితులు. నాయకరాజుల కాలం వచ్చేటప్పటికీ కవి రాజుకి గులాముగా తయారయ్యాడు. అది కాక, ఆస్థానకవులు, రాజుల పరస్పర ప్రశంసలతో సాహిత్యం వచ్చిన రోజుల్లోనే, దేవాలయాలతో సంబధం పెట్టుకున్న దేవాలయ కవులు కూడా వచ్చారు. ఈ చరిత్ర ఇంకా విశదంగా తెలుసుకోవాలనుకుంటే, ఈ ఆఖరి మాట పూర్తిగా చదవాలి.


నేను ప్రస్తావించే రెండవ అనువాదం, A poem at the right moment,[6] తెలుగు, సంసృత తమిళ చాటువుల అనువాదం. ఇంతకుముందు ఈ పుస్తకాన్ని స్థూలంగా నేను ఈమాటలో పరిచయం చేశాను. (కె.వి.యస్. రామారావు, సాయి బ్రహ్మానందం గొర్తి వేరువేరుగా పుస్తకం.నెట్‌లో ఈ పుస్తకం గురించి రాశారు.) ఈ పుస్తకం చాలా ప్రజాభిమానం పొందిన పుస్తకం! నేను నా పాత వ్యాసంలో కొన్ని అనువాదాలు కూడా ఉదహరించాను. ఇప్పటి ప్రస్తావనలో, ముఖ్యంగా వెనుకమాటలో విషయాల గురించి చెప్పదలచుకున్నాను. కారణం: చాటువుల గురించి పాతుకొని పోయిన పాత అభిప్రాయాలు మారుతాయన్న ఆశ. ఆ వ్యాసం నుంచి కొన్ని చాటువులు మళ్ళీ ఉదహరిస్తాను.

చాటువులకుండే లక్షణాలు ఏమిటి? చారిత్రకంగా వీటికి ఏదైనా విలువ, ప్రాముఖ్యత ఉన్నదా? చాటు పద్యాల కర్తృత్వ చర్చ చాటు సంప్రదాయ సంస్కృతికి ఏవిధంగా ఉపయోగిస్తుంది? ఇటువంటి ప్రశ్నలు ఈ పుస్తకపు మలిపలుకులో విస్తృతంగా చర్చించబడినాయి.

ముందుగా గుర్తు చేసుకోవలసిన విషయం: చాటుపద్యం పుస్తకంలో నిక్షిప్తంగా దాగి ఉండదు. చాటుపద్యాలు నిశ్శబ్దమైన వాతావరణంలో కూర్చొని చదువుకొనేవి కాదు. ఆ మాటకొస్తే ఏ పద్యమైనా సరే, మంచి పద్యమైతే, అది రసజ్ఞుల నాలికపైన, అనుభవజ్ఞుల స్మృతిలోనూ ఉంటుంది. ఈ సందర్భంలో బోర్హేస్ (Jorge Louis Borges) ప్రాచీన కవిత్వం గురించి అన్నమాటలు గుర్తుకొస్తున్నాయి: “మంచి కవిత్వం గట్టిగా పైకి చదవాలి. సన్నగా పైకి చదవబడటానికో, లేదా నిశ్శబ్దంగా లోపల లోపల చదువుకోవటానికో, మంచి పద్యం ‘ఒప్పుకోదు.’ కవిత్వం ముందుగా మౌఖిక కళ; అది పాట. ఆ తరువాతనే అది లిఖిత కళ అవుతుంది.”

చాటువుల విషయంలో ఇది తప్పనిసరిగా నిజం.

చాటుపద్యం తనంత తానుగా ఏకాకిగా నిలబడే పద్యం మాత్రమే కాదు. ప్రజల స్మృతిలో ఉండి, అంతర్గతంగా పొందిక కలిగి మౌఖికంగా చెలామణీ అవుతూ, దక్షిణ భారతదేశంలో, ఏదో ఒక చారిత్రక సమయంలో ఉద్భవించిన కవితలు చాటువులు, అని నిర్ధారణగా చెప్పవచ్చు. సాధారణంగా చాటు పద్యాలు ప్రఖ్యాత కవులకు ఆపాదించబడి ఉంటాయి. ఆ కవితో, ఆ చాటువుతో ఒక కథో, కొన్ని వేరువేరు కథలో ఉంటాయి. ఈ ఆరోపణల చుట్టూ ఒక విచిత్రమైన భాష్యం, విమర్శ ఉంటాయి. శ్రీనాథుడిదని ఆరోపించబడ్డ చాటువు చారిత్రకంగా మనమెరిగిన శ్రీనాథ కవిసార్వభౌముడు రాసినది కాకనే కాకపోవచ్చు. సాధారణంగా అది సత్యమే. ఆ చాటువు శ్రీనాథుడి శైలిలో, శ్రీనాథుడు వాడిన శబ్దసరణిలో చెప్పబడి ఉంటుంది. ఆ చాటువు శ్రీనాథుడి జీవితం, ఆయన కవితాలక్షణాలు, విశదపరిచే వ్యాఖ్య అవుతుంది. అయితే, మరొక్క విషయం. శ్రీనాథుడే శ్రీనాథుడి శైలిలో చాటువు చెప్పి ఉండడానికి కూడా అవకాశం ఉన్నది. ఈ సందర్భంలో మయకోవిస్కి (Vladimir Mayakovsky), యాకొబ్‌సన్‌ల (Roman Jakobson) కథ చెప్పటం అనుచితం కాదు. ఒకసారి మయకోవిస్కి కొన్ని కొత్త పద్యాలు రాసి యాకొబ్‌సన్‌ కిచ్చాడు. కొద్దిరోజులు పోయిన తరువాత, మయకోవిస్కీ యాకొబ్ సన్ దగ్గిరకు వచ్చి, ‘కవితలు నచ్చాయా?’ అని అడిగాడట! ‘ చాలా బాగున్నాయి. కాని, మయకోవిస్కి కవితలంత బాగా లేవు,’ అని యాకొబ్‌సన్‌ చెప్పాడట!

చాటు సంస్కృతీ సంప్రదాయంలో కాలక్రమానుగత చరిత్ర మటుమాయమవుతుంది. ఉదాహరణకి మధ్యయుగ సంస్కృత (చాటు) సంప్రదాయంలో కాళిదాసు (నాలుగవ శతాబ్దం) భవభూతి (ఎనిమిదవ శతాబ్దం) భోజుని కొలువులో కవులు! కాళిదాసు, భవభూతి, వీరిద్దరిమధ్య ‘ఎవరు గొప్పకవి,’ అని నిర్ధారణ పేరుతో ఉన్న కథలు చాటు సంప్రదాయంలో నలుగురి నోళ్ళల్లోనూ నలిగి పడి ఉన్నాయి. ఈ కథల్లో వైచిత్రి ఏమిటంటే, ఒక్కొక్కసారి, దైవిక జోక్యం కూడా ఉంటుంది. కాళిదాసు, భవభూతి మధ్య ఎవరు గొప్పకవి అని వచ్చిన వాదన సరస్వతి జోక్యంతో సద్దు మణగడం ఒక అద్భుతమైన కథ. వీళ్ళిద్దరి మధ్యా వైరుధ్యం ఉన్నట్టి కథలే కాదు; ఒకరిని ఒకరు సంప్రదించుకున్న కథ కూడా చాటు సంప్రదాయంలో ఉన్న ప్రఖ్యాతమైన కథ. భవభూతి రాసిన ఉత్తరరామచరిత్ర అంతా విని, కాళిదాసు ‘కావ్యం మొత్తంలో ఒకే ఒక్క ‘సున్న’ ఎక్కువయిందని — ఏవ, ఏవం కథ అందరికీ తెలిసినదే! అందులోనూ, కాళిదాసు తెలుగులో తమలపాకులో సున్నం ఎక్కువైనదని అన్నమాట, సంస్కృత శ్లోకంలో సున్నకి సరిగ్గా సరిపడటం చాటు సాంప్రదాయ విచిత్రం!

విజయనగర సామ్రాజ్య కాలంలో, ముఖ్యంగా కృష్ణ దేవరాయల ఆస్థానంలో కూడా అష్టదిగ్గజాలు ఉన్నట్టుగా ఆ కవులకు ఆపాదించిన చాటువులు, తెలుగు వారికి తెలియనివి కావు. తెనాలి రామలింగడని ఒకణ్ణి తెలుగు వాళ్ళు సృష్టించుకోవడం, అతని చుట్టూ ఎన్నోకథలు, చాటువులూ చెప్పుకోవడం పరిపాటే.

తమిళ చాటు సంప్రదాయంలో నత్కీరుడి కథలో, నత్కీరుడు శివుడు రాసిన పద్యాన్నే హేళన చేసి నానా అగచాట్లూ పడ్డట్టు చాటుకథ. ఇక్కడ దేవుడితో వైరం! తెలుగులో మనకి పోతన గురించి చాటువులు, వాటి చుట్టూ అల్లిన కథలూ ఉన్నాయి. పోతనకి ఆపాదించిన ఒక చాటువు, నేను చిన్నప్పుడు, మౌఖికంగా నేర్చుకున్న చాటువు మళ్ళీ ఉదహరిస్తాను.

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ
హాటకగర్భురాణి! నిను ఆకటికై కొనిపోయి అల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ

శ్రీనాథుడు పోతనకి, ఎందుకయ్యా మడి దున్నుకొని ఇన్ని కష్టాలు పడతావు? హాయిగా “కమ్మని గ్రంథం బొక్కటి ఇమ్ముగ ఏ నృపతికైన కృతి ఇచ్చిన కై కొమ్మని ఈ యరె అర్థం బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మహాత్ముల్?” అని సలహా ఇచ్చాడనీ, ఆ రోజు రాత్రి సరస్వతీదేవి పోతన కలలోకి వచ్చి కంట నీరు పెట్టుకున్నదనీ, ఆమెను ఓదారుస్తూ పైపద్యం చెప్పాడనీ చాటుకథ. శ్రీనాథుడు, పోతన సమకాలికుడవునో కాదో, వీళ్ళిద్దరికీ బాంధవ్యం ఉన్నదో లేదో అన్న ‘చారిత్రక’ చర్చ చాటు సంప్రదాయానికి శుద్ధ అనవసరం.

ఇంకొక కథ, గజేంద్రమోక్షం లోనిది. పోతన ‘అల వైకుంఠ పురంబులో…’ అని రెండు మాటలూ రాసి, తరువాత పద్యం ఎలాగ పూర్తి చెయ్యాలో బోధపడక గంటము, తాళపత్రాలు పదిలిపెట్టి బయటికి పోయడట! అప్పుడు, విష్ణువే పోతన రూపంలో వచ్చి, పద్యం పూరించాడు. కొద్ది సేపటి తరువాత నిజం పోతన తిరిగి వచ్చి, ‘అరె! ఎవరు ఈ పద్యాన్ని పూర్తిచేశారు?’ అని ఆశ్చర్యపోతూ వుంటే, పోతన కూతురు ‘నీవే కదా! మరిచిపోయావా?’ అని అడిగిందని చాటు కథ. ఒక కథలో దేవుడితో వైరం; మరొక కథలో దేవుడి సహకారం!