ఆ లలితాంగి కనుంగొనె
ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండ మైన బ్రహ్మాండంబున్ (భా. ద. పూ. 339)
బాలుని నోట బ్రహ్మాండాన్ని చూసి సందేహంలో పడిపోయింది తల్లి. ఇది కలా? వైష్ణవ మాయా? అసలు నేను యశోదాదేవి నేనా? ఇది అసలు రేపల్లె కాదేమో? అంటూ కొంచం ఆలోచించుకుని, “బాలుని భంగిని ఇతడు భాసిల్లు గాని, సర్వాత్ముడాది విష్ణుడు అగుట నిజము” అని నిర్ణయించుకుంది. కప్పుకొన్న మాయతెరలు జారడం చూసి మళ్ళీ మాయ పన్నుతాడు ఆ పరమాత్మ. మోహపు పొరలు కమ్ముకోగానే ఆమె ‘సర్వాత్ముడు’ అనుకోవడం మానేసి, ‘నా బిడ్డ’ అని తొడపై కూర్చోపెట్టుకుని ఎంతో మమతతో ముద్దు చేసింది. ఆ యశోదమ్మ జ్ఞాని, భక్తురాలుగా కాకుండా తనని బెదరించి, బుజ్జగించి, ముద్దు మురిపాలలో తేల్చే అమ్మగానే తనకి ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించాడు బాల కృష్ణుడు. ఈ సందర్భంలో భాగవత కధను తనకు వినిపిస్తున్న శుకయోగితో పరీక్షిత్తుడు:
ప్రబ్బిన భక్తిని హరిపైఁ
గబ్బంబులు సెప్పి కవులు కైవల్య శ్రీ
కబ్బుదు రఁట హరి పోషణ
మబ్బిన తలిదండ్రు లెచటి కబ్బుదురో (భా. ద. పూ. 350)
భక్తితో హరినికీర్తన చేస్తూ కావ్యాలు వ్రాసే కవులకి మోక్షం ప్రాప్తిస్తుందట. మరి ఆ విష్ణుముర్తి ఆలనా పాలనా చూసే భాగ్యం కలిగిన వారికి ఏం లభిస్తుందో ? అని అంటాడు. శుకుడి సమాధానం ఎలా ఉన్నా, జన్మాంతం దాకా ఎందుకు? అప్పడే, అక్కడే, ఆవిడ ముంగిటి లోకే వచ్చి కూర్చుంది వైకుంఠం. ఈ జన్మలోనే ముజ్జగాలను పాలించే ఆ వైకుంఠాధీశుని ఒడిలో ఉంచుకుని లాలించే భాగ్యం ఆ గోపెమ్మకే అబ్బింది.
ఒక నాడు తల్లి యశోద కవ్వంతో పెరుగు చిలికి వెన్న తీస్తోంది. చేరవచ్చి, ఆకలి వేస్తోందని మారాం చేస్తాడు, గారాలు పోతాడు, పేచీలు పెడతాడు కన్నడు. కవ్వాన్ని విడిచి కుర్రవాడిని చేరదీస్తుంది. ఇంతలో పొంగిపోతున్న పాలదుత్తిని పొయ్యి మీద నుంచి దింపడానికి కొడుకుని కింద పెట్టి వెళుతుంది. ఆ పెంకెవాడు తన ఆకలి తీర్చకుండా వెళ్ళిన తల్లి మీద అలిగి కోపంతో కుండ తన్ని పగుల గొట్టి వెన్న తిని పోతాడు. తిరిగి వచ్చిన యశోద బిడ్డ కోసం వెదుకుతుంది. మరో ఇంట్లో రోటి మీద ఎక్కి వెన్న దొంగిలిస్తూ కనబడ్డాడు. యశోదాదేవికి బాగా కోపం వచ్చింది. నేను పిల్ల వాడిని గారాం చేసి పాడు చేస్తున్నాను. భయం పెట్టాలి అనుకుంది. దండించడానికి కర్ర పుచ్చుకుని తన కేసి వస్తున్న తల్లిని చూసి, రోటి మించి దూకి పరుగుతీస్తాడు గోపాలుడు. నీ వేషాలు నా దగ్గర చెల్లవు. నా చేతికి చిక్కకుండా ఎక్కడికి పోతావు అని వెంట తరిమింది. అతి ప్రయాస పడి పట్టుకుంది కొడుకుని.
చిక్కఁడు సిరి కౌఁగిటిలోఁ
జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్
జిక్కఁడు శ్రుతి లతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్ (భా. ద. పూ. 381)
లక్ష్మీదేవి కౌగిట గాని, సనకాది యోగిజనుల హృదయాల్లో గాని, వేదవేదాంగాలలో గాని ఇమడని ఆ హరి లీలగా తల్లి చేత చిక్కి పోయాడు. అలా చిక్కిన వాడిని నవనీత హృదయ ఆ యశోదకి కొట్టటానికి చేతులు రాలేదు. అందుకే తాటిని తెచ్చి ఱోటికి కట్టి పడేస్తాను నిన్ను అంది. ఎంత పెద్ద తాడు తెచ్చినా సరిపోలేదు. “పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టుట ఎరిగేనేని ఏల కట్టు?” తన కొడుకు పొట్టలో బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్నాయని తెలిసిననట్టు అయితే ఎందుకు కట్టాలనుకుంటుంది? ఎరగక పోవటం ఏమిటి? చూసిందిగా ఇంతకు పూర్వం. కాని ఏం లాభం? ఆ చూసిన విషయం తాలూకు వాసన లేకుండా ఇంద్రజాలం చేశాడు మరి బాల వాసుదేవుడు.
ఎలాగైనా కొడుకుని ఱోటికి బంధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న ఆ యశోదకి ఒళ్ళంతా చెమటలు పోశాయి, కొంగు జారిపోతోంది. తలలో పూలు నేల రాలాయి. తనని కట్టి పడేయ్యాలనే తాపత్రయ పడుతున్న తల్లి అవస్థని చూసి, ఆమెని కరుణించాడు కరుణాసింధువు.
బంధ విమోచనుఁ డీశుఁడు
బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ
ద్బంధుఁడు గావున జననీ
బంధంబునఁ గట్టువడియెఁ బాటించి నృపా! (భా. ద. పూ. 386)
అలా కట్టబడి ఱోలీడ్చుకుని మద్దెచెట్లని కూల్చి నలకూబర మణిగ్రీవులని శాపబంధ విముక్తుల్ని చేస్తాడు.
ఇంద్రుడు ఎడతెరపి లేకుండా కురిపించిన ఘోరమైన వర్షధారల నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన గిరినెత్తి లోకరక్షకుడైన గోపాలుడు, లోకధర్మాన్ని పాటించి, తల్లి దండ్రుల మీద భక్తి చూపుతూ, ”రా తల్లి! రమ్ము తండ్రీ !” అని ముందుగా యశోదను నందుడిని పిలుస్తాడు.
ఆ లోకైక రక్షకుడిని వేయికళ్ళతో కాపాడడమే ఆ మాతృమూర్తి కర్తవ్యం, అతడే ఆమె లోకం. తనను పసివాడిగా భావించి పరిరక్షించాలని నిరంతరం తాపత్రయ పడే ఆ యశోదాదేవిని తన నటనలతో, మభ్య పెట్టటము, మురిపించడమే తన కర్తవ్యం అన్నట్టు ప్రవర్తించేడు బాలకృష్ణమూర్తి.
సెలగోల పట్టుకుని జల
కలశము లోని నీడఁ జూచి కలశ గతుండై
సెలగోలఁ బాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట ననుచుఁ దల్లికి జెప్పెన్ (భా. ద. పూ. 418)
చేత కర్ర పుచ్చుకుని నీటిమడుగు ముందు నిలబడి తన నీడను చూసి, బెదరిపోతూ, అమాయకంగా తల్లితో, నీళ్ళలో ఉన్న ఆ బాలుడు కర్రతో నన్ను కొట్టటానికి వస్తున్నాడని చెప్పినప్పుడు, తనయుడిని గుండెల్లో పొదువుకుని, భయపడకు! అది వట్టి నీడే! అని బుజ్జగించక మరేం చేస్తుంది ఆ పిచ్చి తల్లి.
పిల్లలు పేచి పెట్టి ఏడిస్తే తల్లులు ఏదో సాకు చెప్పి, భయపెట్టి, ఊరుకో పెడతారు కదా. అందరు అమ్మల లాంటిదే యశోదమ్మ.
భిక్షులు వచ్చెద రేడ్చిన
భిక్షాపాత్రమున వేసి బెగడించి నినున్
శిక్షిం చెదరని చెప్పిన
భిక్షులఁ గని తల్లి నొదిఁగి భీతిల్లు నృపా! (భా. ద. పూ. 419)
నువ్వు ఏడ్చావంటే భిక్షువులు వస్తారు. నిన్ను వాళ్ళ భిక్షాపాత్రలో వేసుకుని పోయి శిక్షిస్తారు సుమా! అని భయ పెడుతుంది. నిజంగా వాకిటిలోకి భిక్షువు వచ్చినప్పుడు, భయపడుతూ తల్లి చాటున దాక్కున్నాడుట చిన్నారి కన్నయ్య. చరాచారాలన్నిటిలో తానే నిండి ఉండే వాడికి ఈ లీల ఏమిటి? ఈ మిషతో తన మాతృమూర్తిని సంతోషపెట్టి ధన్యురాలిని చెయ్యడం కాకపొతే. లోకాలన్నిటిని లాలించి పాలించి అలిసిన స్వామి బాలకృష్ణునిగా తల్లి యశోదాదేవి ఒడిలో తనివి తీరా సేద తీరాలనుకున్నాడో, లేక పూర్వ జన్మలో బ్రహ్మ ఆమెకు చేసిన వాగ్దానాన్ని మన్నించాలనుకున్నాడో – కారణం ఏదైనా, ఆ యశోదాదేవిని మాత్రం కలకాలం గుర్తుండిపోయే మాతృమూర్తిగా చేశాడు ఆ హరి.
పోతన్న భాగవతపీఠికలో “శ్రీ కైవల్య పదంబు చేరుటకు”, ఎవరినో కాదు “మహా నందాంగనా ఢింభకుని” (నందపత్ని చిన్ని కుమారుడిని) శరణు కోరడమే కాదు, ఆ తల్లి భాగ్యాన్ని ప్రశంసిస్తూ:
సంగడిఁ దిరిగెడు శంభుడు
నంగాశ్రయ యైన సిరియు నాత్మజు డై యు
ప్పొంగెడు పద్మజుడును
గోపాంగన క్రియ గరుణవడయ రఖిలేశ్వరుచేన్ (భా. ద. పూ. 387)
సఖుడైన శివుడు,అర్ధాంగి యైన లక్ష్మీ దేవి, పుత్రుడైన బ్రహ్మ కూడా గోపాంగన యైన ఆ యశోదాదేవి లాగ ఆ లోకాధీశ్వరుని కరుణని పొందలేదు – అంటాడు. ఆ కన్నడిని కనురెప్పల్లో దాచుకుని పెంచిన ఆ యశోదమ్మ, ఆ అమ్మని మనకందించిన ఆ పోతన్న, ఇద్దరూ ధన్యజీవులు.
