అన్నమయ్య భావ వ్యక్తీ కరణలో పదాల ఎంపికనీ, సొగసునీ, నడకనీ, కవిత్వ శైలీ ప్రయోగాలనీ వివరించే ఈ కీర్తన చూడండి:
శిన్నెక తేవే శెలువుని తా
వెన్నలు సవిగొను వెన్నుని తా
మూటల్ మాటల్ మూరల్ బారల్
బాటల్ సదివే బాపలు తా
వేటల్ వీపుల్ వేలువు గుడుపుల్
తేటలు మరిగిన దేవుని తా
వాకుల్ చీకుల్ వాదుల్ పోదుల్
సోకపు తొల్గిటి సుద్దుల్ తా
పోకులు లోకుల్ పొగడగ మనిపెడి
కేకి గరుల తల కిష్టుని తా
ఇది చదివితే మనం ఎక్కడో ఇలాంటిది చదివినట్లూ, విన్నట్లూ అనిపించడం లేదా? గుర్తు తెచ్చుకోండి.

అన్నమయ్య పద పరిచయం
238 పేజీలు. రూ. 450/- ($13.50)
పోనీ, పోనీ పోతే పోనీ
సతుల్, సుతుల్, హితుల్ పోనీ – పోతే పోనీ
రానీ, రానీ!
కష్టాల్, నష్టాల్
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
మహాప్రస్థానంలో శ్రీశ్రీ కవితకీ పైన చెప్పిన దానికీ పోలికలు కనిపించాయా? ఇలాంటి విశేషాలు అన్నమయ్య కవిత్వంలో గాఢత గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో చెప్పారు. అలాగే, అన్నమయ్య వాడిన కొన్ని పద ప్రయోగాలని గురించి సోదాహరణంగా చెప్పారు జయప్రభ. వలపుల విడిది, పులకల పోగు, నవ్వుల పండుగ, సిగ్గులకొండ, చెమటల చెలమ – వంటి పదాలతో నాయకీనాయకుల మధ్య శృంగారాన్ని అతి చక్కనైన భావ ప్రకరణకి సరిపడా పదాలను ఎంతో తెలివిగా, చమత్కారంగా ఎంపిక చేసుకోవడం ఒక్క అన్నమయ్యకే చెల్లు అంటారు జయప్రభ.
ఈ పుస్తకంలో అన్నమయ్య సాహిత్యంలో ఇబ్బంది పెట్టే సందర్భాల గురించీ ఉంది. అన్నమయ్యలో ఉండే బలహీనతలు అన్నమయ్యకీ ఉంటాయని చెబుతూ – ఈ క్రింది కీర్తన ఉదహరించారు.
రావే కోడల – రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా – పొందులు నీతో చాలును
ఇది లక్ష్మీ, సరస్వతుల సంవాదంతో నిండిన శృంగార కీర్తన. ఇద్దరు స్త్రీలు నువ్వేం తక్కువంటే, నువ్వేం తక్కువ అన్న ధోరణిలో ఎకసక్కాలు చేసుకుంటారు. ఊరూ వాడల్లో ఉండే కొంతమంది పండితుల ఇళ్ళల్లో బడి నువ్వు కులుకుతున్నావు కదటే, – అని సరస్వతిని దెప్పిపొడుస్తూ లక్ష్మి అంటే – నువ్వు వాడకో పదిమంది ఎంచుకొని వారిచేత వలపించుకోని తిరగడం లేదా, అని సరస్వతి ఎగతాళి చేస్తుంది. ఈ కీర్తనలో లక్ష్మి, సరస్వతులని అల్పబుద్ధులుగానూ, రంకు చేసే వారిగానూ చిత్రీకరించాడు అన్నమయ్య. అదే శివుణ్ణీ, విష్ణువునీ ఎందుకు ఇలా తక్కువ చేస్తూ పదరచన చెయ్యలేదన్న ప్రశ్న కూడా మన ముందు రచయిత్రి వుంచుతారు.
మోవి తేనె బోనాలు, మోసునవ్వు మోనాలు, ఈసుజెమట పన్నీరు, చిమ్ముగోరి మేడేలు, భావరతి చప్పరాలు, పలుకుల కప్పురాలు, మందుల కొండ, చెంగుల ధార – వంటి అన్నమయ్య పద ప్రయోగాలు ఆయన ఊహకీ, కల్పనకీ మచ్చుతునకలుగా అభివర్ణించారు. చప్పరము అంటే భవనము లేదా మేడ. నాయిక ఊహనే మేడ చేసి అక్కడే భావరతి జరిపించాడు అన్నమయ్య. ఇవి 22వ సంపుటంలో 53 కీర్తన అయిన ‘ఆనతియ్య గదవయ్య ఆకడ ఈకడ నీకు’ కీర్తన లోనిది. అలాగే స్త్రీలపై అత్యాచారాలు చేసిన తురుష్కుల ఘాతుకాలు చెప్పే సందర్భంలో మానభంగం పదానికి ప్రత్యామ్నాయంగా అంగభంగం అనే పద ప్రయోగం చేసి స్త్రీల ఎడల గౌరవాన్ని చాటి చెప్పాడని అన్నమయ్యని కొనియాడారు జయప్రభ.
ఇలాంటి విశ్లేషణలూ, సందర్భోచిత వివరణలూ, కవి సమయాలూ చాలా ఉన్నాయి. అలాగే ఉమ్మిని నోటి కడవలోని నీరు అనడం , చంద్రుణ్ణి వెన్నెల వేసంగి మొగ్గ అనడం వంటి పదప్రయోగాలు అన్నమయ్య కీర్తనల్లో ఉన్నాయని చెబుతూ కవులందరూ ఈ కీర్తనలని అధ్యయనం చేయాల్సిన విషయాలుగా చెప్పారు. తి.తే.దే వారి అన్నమయ్య పుస్తక ప్రచురణల్లో అక్షర దోషాలు చాలా వున్నాయని బాధపడ్డారు. అలాగే అన్నమయ్య కీర్తనలు గానం చేసేవారు సంగీతానికిచ్చిన ప్రాముఖ్యత సాహిత్యానికివ్వడం లేదన్న నిర్లక్ష్య ధోరణిని దుయ్యబట్టారు.
పలుకుదేనియలనుపారమియ్యవే అని కలిపి పాడటానికి బదులు – ‘పలుకుదేనియలను పారమియ్యవే’ అంటూ విడగొట్టి మరీ పాడుతున్నారు. ఉపారం అంటే ప్రసాదం. పారము అంటే అర్థం లేదు. దౌర్భాగ్యం ఏవిటంటే సంగీతం కట్టే వారికి ఎవరిదయినా కావచ్చు, సాహిత్యం అంటే నిర్లక్ష్యం. ఎలా చేసినా చెల్లుతుందన్న నిస్సిగ్గు.
ఇలా రాసుకుంటూ పోతే చాలా విశేషాలు వున్నాయి. అన్నమయ్య సాహిత్యంపైనా, అలాగే అన్నమయ్య భార్య తిమ్మక్క రాసిన సుభద్రా కళ్యాణం రచన గురించి సవివరంగా రాశారు. పుస్తకం చదివితే మీకే తెలుస్తుంది. భక్తి, శృంగారమూ, ఆధ్యాత్మికమే కాకుండా భావ కవిత్వం కూడా అన్నమయ పదాల్లో కనిపిస్తుందన్న ఈ కీర్తన గురించి చెప్పి ఆపేస్తాను.
వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోని పలుమారు వెదకేవే గాలి
పండు వెన్నెలలకును బ్రాణమగు గాలి
నిండుగొలకులలోన నెలకొన్న గాలి
బొండు మల్లెల తావి బొడవైన గాలి
యెండమావుల బోలితేలయ్య గాలి
కొమ్మానిచవికెలో గొలువుండు గాలి
తమ్మికుడుకుల దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేడి గురిసేవే గాలి
తిరువేంకటాద్రిపై దిరమైన గాలి
సురకాంతముల జనుల జొక్కించు గాలి
తొరలి పయ్యదలలో దూరేటి గాలి
విరహాతురులనింత వేచకువె గాలి
ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయట నుండి లోపలికీ, లోపలినుండి బయటకీ వెలిలోనూ పలుమార్లు వెదికే గాలిని వర్ణిస్తున్నాడు అన్నమయ్య. పండు వెన్నెలకి ప్రాణం ఈ గాలి అంటున్నాడు. బొండు మల్లెల సువాసన ఎంత దూరం వ్యాపిస్తోందో అంతవరకూ మనం ఈ గాలి కొలవాలట. మామిడి చెట్ల కొమ్మలనే మేడల్లో కొలువుండే ఈ గాలి, తామర పూల పై తేనె తాగుతూ తిరిగేటి ఈ గాలి, అప్పుడప్పుడు వేడిగాలి కుమ్మరిస్తుందట. తిరుమల కొండలపై తిరిగే ఈ గాలి జనులను చల్లగా తాకుతుందట. ఆడవాళ్ళ పయిటలో దూరే ఈగాలి విరహాతరులను వేధిస్తుందట. ఎంత చక్కటి ఉపమ? ఎంత గొప్ప భావన? కవిత్వం రాసే వారూ, ఆస్వాదించే వారూ ఇటువంటి కీర్తనల జోలికి పోక పోవడం బాధాకరం.
ఇలా ప్రతి కీర్తననీ తనదైన శైలిలో చక్కగా వివరించారు జయప్రభ. స్వతహాగా కవయిత్రి కావడంతో తాను ప్రతి కవి సమయాన్నీ అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ వివరించడంతో పాఠకులకి ఆసక్తి కలుగుతుంది. మాధుర్యం తెలుస్తుంది.