మూడు లాంతర్లు -11
వేసంగి గురించి కవితను ‘వేసవి’ అని ప్రవేశపెడ్తున్నారు కవి; ఆదివారం మధ్యాహ్నాలు అని కవయిత్రి ఆదివారం మధాన్నాల్ని ప్రవేశపెట్టినట్లే.
కాలం కదలదు, గుహలో పులి
పంజా విప్పదు, చేపకు
గాలం తగలదు.
వేగంగా నడుపుకుంటూ వచ్చిన బండిని ఎదుట పెద్ద ఆటంకం ఉందని గ్రహించుకొని హటాత్తుగా బ్రేకులు వేసి ఆపినట్లుండే నడకను ఎంచుకున్నారు. ఆ బండరాయి వేసవి. ఇలా ఊహిస్తే మనసులో చప్పున స్ఫురిస్తుంది:
తానం తనతన, తందనాన
తానం తనతన, తకధిమి
తానం తనతన.
అతివేలము, పరాక్రమవంతమైన జాంతవ శక్తికీ, విజయానికీ ప్రతీక పెద్దపులి. ఆ పులి సైతం పంజా విప్పదు. ప్రపంచాన్ని, జీవితాన్నీ శాసించే కాలమే ఆగిపోయింది. గేలం వేసి చేప కోసం ఎదురుచూపులు చూసేది ఆశ. భవిష్యత్తు అగోచరం కాబట్టి మామూలు సమయాల్లో అయితే మానవ ప్రయత్నపు గేలానికి ఏ చేపైనా దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు అలాక్కాదు. కవి గేలానికి ఏ చేపా తగలదు సుమా అని ముందే ప్రకటిస్తున్నాడు. గొప్ప శక్తి, నిరంతరమైన ప్రయత్నం, కాల యంత్రం - ఈ మూడూ వేసంగి ధాటికి దాసోహమని కనీసం ప్రయత్నమైనా చెయ్యకుండా నిలబడిపోయేయి. ఈ కవితా శకలాన్ని మనో రంగం మీద మళ్ళీ నిర్మించుకుంటున్న దృశ్యానికి సరంజామా నా చిన్నప్పటి స్మృతుల్నుండే వస్తుంది. వందలేళ్ళు పాతది ఒక వీధి. అక్కడ బుగ్గి, మెట్లంగి దారి దూరానికి వెళ్ళి కాళ్ళు చుర్రుమనే తార్రోడ్డుతో కలుస్తోంది. ఆ దారి అలా మైళ్ళు మైళ్ళు పోతే అక్కడ బోర్లించినట్టు నిజంగానే ఒక ఎండల్లో మాడే బోడి కొండ, ఎండలో కాగిపోతూ ఆకాశం అంతా నిండిపోయి నున్నటి బండ, ఆ బండల కింద ఒక కొండ గుహ. ఆ గుహలో నిజంగానే పులుందని ప్రతీతి; అదే మాగన్నుగా పడుక్కున్నట్టుండి పంజా విప్పకుండా సోలిన పెద్దపులి. అడివికి వెళ్ళే దారిలో నీళ్ళు అడుక్కి ఇంకిపోతూ పెద్ద బంద. అక్కడ చెట్లకింద రోజంతా బుట్ట వలలు బోర్లించి జల్లిస్తూ చేపల కోసం పడిగాపులు పడుతున్న జాలారి గుంటలు.
ఈ పల్లవి కేవలం మూడు దృశ్య రేఖలతో మొత్తం కవిత ఔద్వేగిక ఆవరణను అద్భుతంగా నిర్మించి, కవిత పొడుగునా మళ్ళీ మళ్ళీ క్రమం తప్పకుండా ప్రత్యక్షమౌతూ చదువరికి వేసవి తెచ్చిపెట్టిన బలవంతపు నిలకడనూ, అతని అశక్తతనూ మరిచిపోనివ్వకుండా జ్ఞాపకం చేస్తుంది. మధ్యాన్నం మంటల జుత్తు విరబోసుకుని నగ్నంగా రోడ్లమీద తిరుగుతున్న పిచ్చిది. ఆ మంటల జుత్తు అదివరకటి పాదంలోని సూర్యుడి తలలో కదిలిన పెను మంటలనుండి అంటుకున్నది. ఆ మంటలు పల్లవిలో చరణాల్లో కవి వర్ణిస్తూ వస్తున్న నిశ్శబ్దాన్నీ, స్తబ్దతనూ పోనీ కనీసం వాటి మానాన్న వాటిని పడుండనివ్వకుండా ‘అంటించు’తున్నాయి. నిశ్శబ్దానికి అగ్గి అంటుకుంది. ఆ తరువాతి పాదంలో నిజంగానే ఇలాంటి పిచ్చి మనిషి కూడా ప్రత్యక్షమౌతుంది. ప్రతి ఊళ్ళో ఇలాంటి పిచ్చిది ఒకర్తే, వెర్రివాడొకడూ పరిచితమైన మనుషులు. బిచ్చగత్తె ఎండ దెబ్బకి వెర్రిగా అరిచింది. ప్రకృతిని శాసించే మానవ యంత్రాంగానికి ప్రతీక పంకా. ప్రకృతిని ధిక్కరించే మానవ ప్రయత్నానికి, వనరులకూ ప్రతీక శ్రీమంతుడు. సాక్షాత్తూ ఆ యంత్రం కింద అంతటి విజయుడూ వేసంగి పంజా దెబ్బకి చచ్చూరుకున్నాడు! సగటు కవికీ, అతని పాఠకులకూ మండు వేసవి తప్పనిసరిగా తీసుకువచ్చే బహుమతులు, ఆనందాలూ - శలవులూ, ఈతలు, మామిడి పళ్ళు, ఐసులు, తాటి ముంజెల్ని తిలక్ వేసవి తీసుకొని రాదు. ఆయన ఊహా వైచిత్రి, కల్పనా శక్తి అసాధారణమైనవి. వాటినుండి ఉద్భవించే తిలక్ వేసవి అశక్తతనూ, అర్ధంలేని నిశ్శబ్దాన్నీ, చావునూ, వెర్రి కేకల్నీ, మానవ ప్రపంచపు నిశ్చేష్టనూ ప్రతి పాదంలోనూ ‘ఎక్కడికక్కడ అలాగాగండి!’ అని అనుశాసిస్తూ ఎండ మంటల జుట్లు విరబోసుకుని, నగ్నంగా పిచ్చిదాన్లాగా వస్తుంది. ఇంతటి శక్తివంతమైన వేసవి వర్ణన ఇంకెక్కడైనా ఏ భాషలోనైనా ఉందా అని వెదుకుతున్నాను.
కాని ఇంత రమ్యమైన కవితలోను ఔచిత్య భంగం ఒకటి తోస్తుంది. తిలక్కు లయ చాల ఇష్టమని ఆయన కవిత్వం నుండి తెలుస్తుంది. పైన చెప్పినట్టు కావలసిన మూడ్కు అనువైన నడకను ఎన్నుకొని దానితో చాకిరీ చేయించుకుంటారు. కవితకు ఎంచుకున్న నడక ఏ కవికైనా ఏక కాలంలోనే గొప్ప వెసులుబాటు, గొప్ప ప్రతిబంధకం కూడా. ఈ భాగం:
కొండ మీద తారలు మాడెను
బండ మీద కాకులు చచ్చెను
అనేదాన్లో రెండు పాదాల్లోనూ, ముఖ్యంగా ‘బండ మీద కాకులు చచ్చెను’ అనే రెండవ పాదంలో ఇబ్బందిగా, కొట్టొచ్చినట్లు ధ్వనించేవి కవి తన వస్తువునూ, తన నిర్వహననూ తానే చులకన చేస్తున్నారేమా అని తోపించే నిర్మమత, ఒకలాంటి ఔద్వేగిక అశ్రద్ధ (cavalier attitude). ఈ చులకనపాటు అనవసరంగా ఎంతో సమున్నతంగా, ఉదాత్త గంభీరంగా నిర్మిస్తూ వస్తున్న ఔద్వేగిక ఆవరణను కవి చేజేతులా తనే ఫెడీమని తన్ని వికలం చేస్తున్నట్టు చిందర వందర చేస్తున్నాది. ఈ రెండు పాదాల్నీ అలా ఉంచెయ్యదానికి తిలక్ వంటి కవికి ఎలా మనసొప్పిందోనని ఆశ్చర్యంగా, అపనమ్మకంగా ఉంటుంది.
ఇప్పుడు తిలక్దే సంధ్య, ఏమీ ఎంచిపెట్టడానికి అవకాశం లేని కవిత. సాయంకాలపు సంధ్య చాల రమణీయంగా సంజె వన్నెల బాల అనే పాప పరికిణీ చెంగులా వచ్చి చీకటిని తాకిందట. రెండు కళ్ళూ విప్పార్చి చూస్తున్న ఆ బాల చెక్కిళ్ళు విరిసిన చెంగల్వ వన్నె ఎరుపు. ఆ సమయంలో గగనం ‘ఒక రేకు’. అది ఏం రేకు? ఎవరి కన్నుగవల సోకు? ఇవి కవి విడమరచి చెప్పరు. పాఠకుడే నిర్మించుకోవాలి. రేకు అంటే లోహంతో చేసిందనే కాదు; జలతారు, కాగితం, నేత బట్ట, పూల రెక్కా - ఇలా పల్చనిది ఏదయినా రేకే. నాకు - సంధ్యాకాశం ఒక రాగీ బంగారం కలనేసిన జలతారు రేకు. ఆ నేపధ్యంలో సూర్య చంద్రులను ఏకకాలంలోనే విప్పార్చుకొని చూస్తున్న సంధ్యా బాల రెండు కన్నుల సోకు. మండుటెండ, నీరెండ, మబ్బుటెండ, మబ్బు నీడ, క్రీనీడ, మునిమాపు, గుడ్డి వెలుతురూ, కటిక చీకటీ ఇలాగ చాల విభిన్నమైన దృశ్యాల్ని వాటితో పెనవేసుకొని ఉండే ఔద్వేగిక ఆవరణలనూ కొన్ని నిమిషాల వ్యవధిలో వెనువెంటనే తొందర తొందరగా ఆవిష్కరిస్తూ చీకటిగా తెర దింపడం కేవలం సాయంసంధ్యకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం. ఈ అనుభవాన్ని, contrastను యావత్తూ కొన్నే పాదాల్లో అందిపుచ్చుకొని, ఆవిష్కరించడం కవి సంకల్పం.
మొదటి పద్యం నెమ్మదైన నడకతో మొహమాటంగా సంధ్యా బాలను తెచ్చి పరిచయం చేసిన తరువాత, రెండవ పద్యం ఆ పాప పరికిణీ కుచ్చిళ్ళు ఎత్తి చెంగుచెంగున గెంతుతూ వస్తున్నట్టు:
వాలు నీడల దారి నీలి జండాలెత్తి
చుక్క దీపపు వత్తి సొగయు బాటలనల్ల
నిదుర తూలెడి నడక గదుము మైకపు కోర్కె
వచ్చు నిశిలో కరగి నవ్వు శశితో కలసి
సంజె వన్నెల బాల రంగు రంగు రుమాలవిసిరింది కలలల్లు
వెండి తోటల మధ్య
వ్రాలినది వ్రాలినది తావిగా
సోకినది సోకినది.
నిద్రకు తూలుతోందా అన్నట్టుండే నడకతో, అతిశయించిన మైకపు కోర్కెలతో వచ్చేది నిశి. ఆ రెండు చిత్రాల్లోనే కనుపట్టే రాత్రి ఒక మత్తురాలు. నక్షత్ర దీపం బాటల్ని వెలిగిస్తోంది. సంజె బాల నీలి నీలి నీడల జెండాలూపుతూ, రంగు రంగుల రుమాలు విసురుతూ ఆ బాటలవెంట పరుగెత్తి వచ్చి, అంతలోనే ఆ నిశిలో కరిగి - అంటే తానే నిశిగా పెద్దదైపోయి, నవ్వుతున్న శశితో కలసిపోతోంది. త్వరితమైన ఈ మార్పును సినిమాల్లో చాయాగ్రాహకులు పట్టుకునేటట్టుగానే సంధ్యా బాలను నిశి అనే యువతిలోనికి నెమ్మది క్రమంగా morph చేస్తూ, రంగు రంగుల వెలుతుర్లని నీడలుగా ‘వ్రాలినవి వ్రాలినవి సోలినవి సోలినవి’ అని అద్దినచోటే రంగులద్దుతూ పునరుక్తులతో పట్టుకుంటున్నారు కవి.
చాలు అంటే ధార. స్వర్ణది ఆకాశ గంగ. సంజె వన్నెల చాలు బంగారు గంగ (స్వర్ణ స్వర్ణది) ధారట. సంధ్య ఎర్రని పెదవుల ఎరుపు కడలి అంచుల్లో ప్రతిఫలిస్తోంది. ఆమె పరికిణి చెరగు చూపరుల గుండెల్లో మెరుస్తోంది. పొద్దుటంతా అలసిపోయి ఇళ్ళకు పోయే ఏటి కొంగల నిదుర కళ్ళ ఎరుపు సంజె ఎరుపు జీరల్లో కలసిపోతోంది. బాతులు ఎగరబోతే వాటి రెక్కల నీడ బరువు, బరువుగా నిశిలోకి వాలిపోతున్న సంధ్య నిష్క్రమణకు తెర తీస్తున్నాది. సంధ్య అనే చలాకీ అమ్మాయి కళ్ళు విప్పార్చుకొని రంగు రంగుల రుమాళ్ళతో ఆడుతూ త్రుళ్ళిపడుతూ వచ్చి చూస్తుండగానే పెరిగి పెద్దయిపోయి జాబిలి నవ్వుల్లో కలసి, నిశి అనే ప్రౌఢగా పరిణత అయ్యి చెప్పా పెట్టకుండా నిష్క్రమించింది. ఈ సంధ్యకు ఒక ఊరని లేదు. ఈమె అన్ని తరాలకూ, అన్ని కాలాలకూ మనుషులందరికీ బాగా దగ్గరగా పరిచయమైన సంజె బాల. రాత్రేమో నల్లగా వయసు మైకపు జీర కమ్ముకున్న మదవతి. ఈ బాల ఆ ప్రౌఢగా క్రమించి కళ్ళముందే నిష్క్రమిస్తే కవికి, ఆయన పాఠకుడికీ మిగిలేది చాల పరిచితమైన గుండె బరువు. ఇంట్లోన, చుట్టూ ఆడపిల్లలు ఇలాగే అమాయకంగా ఆడుతూ పాడుతూ అంతలోకే ఎలాంటి సూచనా లేకుండా పెద్దరికం లోనికి మాయం అవుతారు. అందరికీ పరిచితమైన ఈ జీవితానుభవాన్ని తను అల్లే సంధ్యా చిత్రపు ఔద్వేగిక ఆవరణకోసం నవ్యమైన ప్రతీకగా వాడుకుంటున్నారు. కవిత సాంతం స్పష్టాస్పష్టమైన చిత్రాలతో కట్టినది. మళ్లీ మళ్లీ చదివి లోతుగా ఆలోచించి, అన్వయం చేసుకుంటే తప్ప సంధ్యా బాల తెరచాటు స్నిగ్ధత, తుళ్ళిపడుతూ వచ్చే పెంకితనం గోచరించవు. పారదర్శకమైన పరదాల వెనుక వాస్తవంగానే పరిచితమైన సంధ్యా ‘బాలిక’ శిల్పం, ఆ తెరచాటు బాల పఠకుని కళ్ళెదుటే అలా పెరిగి పెద్దదయి కాంక్షల మైకపు జీరలు కమ్ముకున్న నిశిగా శలవు తీసుకొనే వైనాన్ని చెక్కి, ప్రాణ ప్రతిష్ట చేసి, సంధ్యా బాలను ప్రౌఢ నిశిగా క్రమంగా morph చేసే తీరు చాల హృద్యంగా ఉన్నాది. ఎన్నెన్ని కాగడాలు పెట్టి ఎంతగా వెదికినా ఈ అద్భుతమైన కవితలో ఎంచిపెట్టడానికి ఏమీ కానరాదు. ఈ తరహా కవితలు - అంటే కనీ కనపడనట్టు మెరిసి మాయమౌతూ వినీ వినపడనట్టు గుసగుసలు పోతుండే కవితా స్వరూపాలు - తెలుగులోన ఉన్నాయా అంటే ఏమీ తోచవు.
ఔచిత్య భంగాలు రెండు ప్రస్ఫుటంగా కనిపించే కవితకు ఇంగ్లిష్ నుండి ఒక ఉదాహరణ కార్న్ఫర్డ్ (Frances D. Cornford) కవిత Autumn Evening అని.
Just the shadows leaping up the wall,
The sparrows twittering; and that is all.
అని ఫ్రెష్గా ఉండే పద చిత్రాల్ని రెండిట్ని పక్క పక్కన పేర్చి, ‘అంతే, మరేం లేదు’ అని ముక్తాయించి, తిలక్ వేసవి కవిత మకుటం లాగానే ఈ రెండు వాక్యాల్నే మళ్ళీ మళ్ళీ వాడుకుంటూ శిశిరపు సాయంకాలాల్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. కాని రెండు చోట్ల కేవలం ప్రాస కోసమా అన్నట్టు అశ్రద్ధగా పాదాల్ని పూర్తి చేసి కవిత ఔద్వేగిక ఆవరణను భంగం కాదు కాని, బలహీనం చేస్తారు. ఇవి రెండవ పాదం And I upon the old red sofa lying అనేదీ, ఐదవది I thought to send my soul to far-off lands అని ఈ రెండూ. కవి పాత ఎర్ర సోఫాలో పడుక్కుని ఉండటం dying -lying అనే మాటలకు ప్రాసనయితే సాధిస్తున్నాది కాని, మిగతా మూడు పాదాల్లో వెలుతురు వాలిపోతూ నీడలు గోడల మీద పాకుతూ పిచికలు కిచకిచలాడుతూ రూపిస్తున్న దృశ్యపు ఉదాత్తతతో విభేదించి, moodని బలహీనం చేస్తాయి. కవి తన ఆత్మను దూర దేశాలకు పంపిద్దామని అనుకున్నాను అన్నది ఆ తరువాత వచ్చే మూడు పాదాల బలం వలన కొంత వరకు ఒప్పుతుంది కాని ఆ ఊహను ప్రకటించిన పద్ధతి send my soul to far-off lands అనేది ఎక్కడా కనీవినీ ఎరుగనిది, చులకనపాటుగా అనుచితమైన ప్రయోగం, కవితాత్మకంగా లేదు.
చివరిగా ఇంగ్లిష్ నుండి ఈ మూడు కవితలు, కవికి చాల వ్యక్తిగతం, ఆంతరంగికమైన దనిపించే ఔద్వేగిక ఆవరణను ప్రతిపాదించి, నిర్మించడంలో చాల నిపుణమైనవని అనిపించేవి: బ్రాడ్స్కీ కవిత The Song; డుగన్ కవిత Love Song: I and Thou అని; మూడవది ఇదివరకే చెప్పినది అడొనిౙయో కవిత What Do Women Want? అనీ. ఈ కవితలన్నీ నాకు మొదటిసారి చూడగానే మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిస్తాయి. బలంగా కుదిపే సృజనలని, ముఖ్యంగా కవితల్ని చదివి, వటిని మనసులో నిలుపుకునేటప్పుడు ఆ కవిత ఆత్మను అంటే spiritను పరిపూర్ణంగా ప్రతిబింబించేలా ఒకే ఒక్క మాటను కట్టుకోవటం సాధ్యమౌతుంది. అంటే మనకు నచ్చిన దినుసులు, సామాన్లూ అలమరల్లో పేర్చుకునే ముందు వాటి మీద ఒక లేబిల్లాగ రాసి పెటుకున్నట్టు. ఇలా ఈ మూడు కవితలకూ పేర్లు పెట్టుకోవాలంటే నాకు తట్టే పేర్లు మొదటిదానికి వియోగంలోని బెంగ; రెండవదానికి వివాహ బంధం; మూడవదానికి కాంక్ష.
(ఇంకా ఉంది)
indrani Palaparthy అభిప్రాయం:
May 10, 2012 12:31 pm
సృజనశీలికి జీవితం యావత్తూ ఉద్వేగ ప్రధానము, రస ప్లావితమైన అనుభవం - బయటికి తనకే స్పష్టాస్పష్టమైనా, లోలోతుల్లోన ఎల్లప్పుడూ తప్పనిసరి అయిన సృజన వేళ. సృజనశీలి జీవితాన్ని నిరంతరం ఇలా సృజనాత్మకంగా అనుభవిస్తూ, ఏ కొన్ని అనువైన ఘడియల్లోనో ఏవో కొన్ని అనుభవాల్నో మాత్రం సృజనగా వెలువరించుకోవటంలో కృతకృత్యమౌతున్నాడు. అంటే అతను తప్పనిసరిగా, తదేక ధ్యాసతో తలకెత్తుకున్న పని - సృజన లోన, దాదాపు ఎల్లప్పుడూ పరాజితుడు.
చాలా బాగా చెప్పారు కనక ప్రసాదు గారు.
ఇంద్రాణి పాలపర్తి .
Madhav అభిప్రాయం:
May 11, 2012 10:59 am
ప్రసాద్ గారూ,
అ. బండరాళ్ళ ప్రదేశాల్లో ఉండేవాళ్ళకి కొన్ని రాళ్ళ మీద చట్టులా ఉండి, అందులో నీరు నిలవడమూ, ఆ నీటి కోసం కాకులు ఆ బండ మీద చేరడమూ ఒక దృశ్యానుభవం. లేదూ ఆ బండ ఒక బావి బండగా, ఆ చట్టు బిందెలు, కుండల ఒరిపిడి వల్ల వచ్చినదీ కావచ్చును. ఆ చట్టులో నీరెండిపోయినా కూడా కాకులు అలవాటుగా దాహమేసినప్పుడల్లా ఆవైపుకు రావడం, బండ మీద వాలడం, లేకపోతే ఒకసారి బండ చుట్టు తిరిగి వెళ్ళిపోవడం కూడా పరిచయమైన దృశ్యమే. ఇంకెక్కడా నీళ్ళు దొరకని కాకి నీరున్నా లేకపోయినా ఈ బండమీదే చివరికి వాలిపోతుంది. ఈ అనుభవం ఉన్న పాఠకుడికి బండమీద కాకులు చచ్చెను అన్న పాదం వేసవి గురించిన కవితలో అసహజంగా కనిపించదు సరికదా ఎంతో ఔచిత్యంగా కనిపిస్తుంది. అంతే కాకుండా, పాదభావాల పునరుక్తితో గతిని సాధిస్తున్న కవి, ఎండనూ చావునూ ఆ తర్వాత వచ్చే పాదాల్లో మళ్ళీ కలిపే వాడుకోవటం ద్వారా కవిత నిర్మాణంలో కూడా ఎంతో శ్రద్ధ చూపించాడని అనిపిస్తుంది. ఇందువల్ల కవిత్వానుభవపు లేమి కవి లోపం కాక, పాఠకుని వైయక్తిక పరిమితిగా కూడా పరిశీలించవచ్చునని నాకనిపిస్తున్నది (ప్రత్యేకించి, ఇతరత్రా పకడ్బందీగా ఉన్న కవితలో.)
ఆ. ఇకపోతే, ఔచిత్య భంగానికి -
లౌక్యంగా బయటి సామాజికులు - అంటే విమర్శకులు, పాఠకులు, సంపాదకులు వంటివాళ్ళను దృష్టిలో ఉంచుకొని శిల్పాన్ని పూర్తిచేసేడా లేక కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్నాడా, అసలు శ్రద్ధ పెట్టి పని పూర్తి చేసేడా లేదా అనేది పట్టి చూస్తే తెలిసిపోతుంది.
- అన్న అభిప్రాయం పూర్తిగా సరి కాదని నాకనిపిస్తున్నది. బైటివారినెవరినో దృష్టిలో ఉంచుకొని సృజననీ, శిల్పాన్నీ ఎవరైనా ఎలా ప్రయత్నిస్తారు? (రిటైర్మెంట్ ఫంక్షన్లో అలవాటుగా ఇచ్చే గడియారపు ఫలకం మీద అచ్చేయడం కోసం మా బాబాయి చేత అందరూ రాయించుకునే పంచరత్నాలు అనే ఐదు వృత్త పద్యాలు మినహాయింపు, ఇందుకు.) ఈ కారణం వల్ల ఔచిత్య భంగం జరిగిందనే ఊహకు ఆధారమేమైనా ఉన్నదా?
లౌకిక కల్మషంలేని సృజనలో కూడా ఔచిత్యభంగానికి, ఉద్వేగపులేమికి నాకు కనిపించిన రెండు కారణాలు.
1. మీరు చెప్పినట్టు కాకుండా మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని అన్నది అసలు ఒకటుందనీ, అది చాలా శ్రద్ధతో చేయాలనీ తెలియకపోవడమే కాదు, అంతకు మించి ‘ఔద్వేగిక ప్రధానంగా దాదాపు అప్రయత్నంగా వెలువడినదే‘ నిజమైన కవిత్వమనీ, దానినేమాత్రం సవరించబోయినా, భావావేశం చచ్చిపోయి అది కవితే కాకుండా పోతుందనీ ఒక బలమైన అపోహ ఎంతోమందిలో (ఎంతో చదువుకున్న వారిలో కూడా) ఉండటం వల్లనే రచనలో అపరిపక్వత, దాని వల్ల ఔచిత్యభంగం కలుగుతున్నది. ఈ అపోహ మరీ అరుదైనది కాదని ఎక్కువ శ్రమపడకుండానే నిర్ధారించుకోవచ్చును.
2. ‘బైటివారి కోసం’ శిల్పాన్ని పూర్తి చేయడం కంటే ‘బైటివారికి దూరంగా’ అనేది ఇంకో కారణం. …కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్న కవి, ఆ సృజనపై ఒక మూఢానురాగాన్ని పెంచుకోవడం ఇది. గుడ్డిప్రేమ అని అంటారే అలా, తన రచనలో (తనలో) లోపాన్ని తనే గమనించలేకపోవడమూ ఉన్నది. నాకు పుట్టి నేను పెంచిన బిడ్డ బాగోగులు నాకంటే బాగా ఇంకెవరికీ తెలియవు అని బలంగా నమ్మే ఒక తండ్రి లేదా తల్లి మనస్తత్వం ఇలాంటిదే. విమర్శలకు, సలహాలకు వెఱపు ఇందువల్లేనని నా అభిప్రాయం. దానివల్ల, తన రచనను తాననుకున్న విధంగా మాత్రమే కాకుండా ఇంకోరకంగా కూడా ముస్తాబు చేయడానికి, ఆ రచనలో తానుద్దేశిస్తున్న ఉద్వేగాన్ని ఔచిత్యాన్ని, తానూహించినదానికి భిన్నంగా, మరింత బలపర్చడానికి వెసులుబాటు ఉండవచ్చునని నమ్మలేక పోవడం వల్ల, ఎంతో శ్రద్ధ పెట్టి చిత్రణ పూర్తి చేస్తున్నా కూడా ఔచిత్యభంగం కలుగుతూనే ఉన్నది. ఈ ప్రవృత్తి అహం లానే పైకి కనిపించినా నిజానికి కాదు. అహం కూడా కొంతమందిలో ఒక కారణమైనా, అది లౌకిక తత్వ సంబంధి కాబట్టి అప్రస్తుతం.
నాకు చాలా కాలం క్రితం సినిమాలకి ఎడిటర్, డైరెక్టర్ వేరే వేరే ఎలా ఉండగలరు, అని సందేహం పట్టి పీడిస్తుండేది. తీసే సినిమా మొత్తం (కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం) దర్శకుడి సృజన అయినప్పుడు, ఆ సృజనను ఎలా ఆవిష్కరించాలో, ఎలా సమర్పించాలో అతనికంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అందువల్ల డైరక్టరే ఎడిటర్ కూడా కావాలి కదా. మరి అలాంటప్పుడు, వేరే వ్యక్తి ఎలా ఆ సినిమాను ఎడిట్ చేయగలడు? కానీ ఎంతోమంది గొప్ప దర్శకుల సినిమాలకు కూడా ఎడిటర్లున్నారు. తన సృజనకు (దీటైన భాగస్వామిగా) చక్కగా మెరుగు పెట్టగలడన్న నమ్మకం తన సాధ్యాసాధ్యాలను తెలుసుకున్న దర్శకుడికి ఉండటం వల్లనే కదా ఇది సాధ్యం; లేని పక్షంలో పైన చెప్పిన మూఢానురాగం ఇందుకు అడ్డుపడి ఉండేది. సృజనకు, ఆ సృజన మూలాన్ని తత్వాన్ని గుర్తించి చక్కగా ముస్తాబు చేసి సమర్పించడం అనే ప్రక్రియకు ఉన్న నాజూకైన తేడా గమనికకు రావడంతో ఆ సందేహం నాకు తీరిపోయింది.
దిశానిర్దేశం చేయగలిగిన విమర్శకులు, పాఠకుల తోడ్పాటు లేకపోవడం అనే లోటుని కూడా నేను గమనించాను. ఉదాహరణకి, ఆదివారం మధ్యాహ్నం కవయిత్రికి మీలాంటివారు పరిచయమై ఉండి, (ఆమె కేవలం ఔద్వేగిక / అప్రయత్న కవి కాకపోయి ఉండి) మీ విమర్శ తోడ్పాటు ఆమెకు ఉండి ఉన్నట్టయితే, ఆ కవిత మరింత బలంగా ఉండేది కదా! అలా జరిగిందో లేదో (అంటే ఆ కవితను ముందుగానే చదివి ఆమెకు ఎవరైనా విమర్శ, సలహా ఇవ్వడం వంటివి) నాకు తెలియదు కాబట్టి, ఇది కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను.
మాధవ్
rama bharadvaj అభిప్రాయం:
June 13, 2012 3:24 pm
మాధవ్!! “మూఢానురాగం” అన్నదానిని మనం నిజంగా నిరూపించలేమని అనుకుంటాను. నాకు “ఆదివారం మధ్యాహ్నాలు” చదవడానికి అక్కడ క్లిక్ చేస్తే ఆ లింకు తెరుచుకోవడం లేదు. కారణం తెలీదు. ఏదైనా ఆ కవిత ఏమో ఏమిటో ..నేను చదవలేదు.
“ఔద్వేగిక ” అన్న పదాన్ని మరీ వ్యాసాల్లో అతిగా వాడి దాన్ని మోతాదుకి మించి అరగదీసేస్తున్న కనక ప్రసాదూ!! ఆ పదాన్ని మీ వ్యాసాల్లో మీరు వాడకుండా ఉండాలంటే మేము ..పాఠకులం ఏమి చెయ్యాలో కాస్త చెబుతారూ?? చదువుతూ ఉంటే పంటికింద రాయి కన్నా కటువుగా ఉంది మరి. అంతకన్నా “ఉద్వేగం” అనడం మెరుగు కదా?? నేను ఎడిటర్ ని అయ్యుంటే ముందు మీ వ్యాసం లోని వాక్యాలని చాలా వరకూ పదాలని సవరించి ఉందును :) మీ పదాల మీద మీకు “మూఢానురాగం” లేకపోతేనే సుమా!! :)
మాధవ్! సినీమా దర్శకుడికీ ..ఎడిటర్కీ ఉన్న సంబంధం లాంటిది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను కవిత్వానికి సంబంధించి. సినిమాకి ఒక కాల వ్యవధి ఉంది. దాన్ని మీరన్నట్టు తప్పనిసరిగా “ముస్తాబు” చేయాల్సి ఉంది. లేకపోతే డబ్బులు రావు మరి:) అందువలన అక్కడ దర్శకుడు తన ఊహని తగ్గించుకుని లేదా పక్కకి తప్పుకుని నచ్చో నచ్చకో [అది అటుంచితే..] విధిగా కత్తిరించే వాళ్లకి తన ఫిల్ముని తప్పనిసరిగా అప్పగించాలి. మంచి ఎడిటర్ ఆ దర్శకుని ఊహని “ముస్తాబు” చేసి ప్రదర్శనకి సిధ్ధం చేయాలి.
అయితే ఇదే ఇలాగే యధాతధంగా కవిత్వం విషయంలో నప్పదు. ఇందుకు కేవలం కవికి తన రచన మీద ఉండే “మూఢానురాగం” కారణం కాదు. తన ఉద్వేగాల లోంచి కవి తాను చూసే దౄశ్యాలని విమర్శకుడు చూడలేకపోవడమే! మనకి కవిత నచ్చవచ్చు లేదా ఇంకొక మాట వాడితే మరింత బాగుండునేమో అని అనిపించనూ వచ్చు. కానీ అలా ఎవరైనా చెయ్యి చేసుకుంటే అప్పుడు అది మరొక కవిత అవుతుందే తప్ప కవి రాసినదో లేదా ఊహించుకున్నదో కాలేదు. అలా మరొకరు సూచించే మార్పులతో కవి తాను తన రచనని మార్చుకోగలడా/దా?? ఈ సందర్భంలో కవి ఏమి చెయ్యాలీ అన్నది ముఖ్య మైన ప్రశ్న అవుతుంది. ఇందుకు కవుల జవాబు మనకి చాలా ముఖ్యం. వారి తోడ్పాటు లేకుండా చర్చించగలిగిన సంగతి కాదు ఇది. అది అలా ఉంచుదాం!! సృజనలో సామూహిక దృస్యాన్ని కాసేపు ఊహిద్దాం!!
అప్పుడు ఇంక ఒక కొత్త వరవడి మొదలవ్వాలి. అదెలాంటిదంటే సామూహిక రచన. ఇందులో మొదట ఒక ఊహని కవి ఆవిష్కరించగా, దానికి మొదట విమర్శకులో ఆ తరవాత పాఠకులో తమకి నచ్చే విధంగా కవి రాసిన దానికి మెరుగులు దిద్దుకుంటూ పోవడం. అప్పుడు అది ఎవరి ఊహ అవుతుందీ? కవి రచనగా అది మిగులుతుందా? ఇందుకు కవికి మనసు వొప్పుతుందా? మీరన్నట్టుగానే ఏ తల్లికీ తన పిల్ల మీద పరాయి వాళ్ళ అజమాయిషీ నచ్చనట్టే :) అది స్వాభావికం కదూ? పైగా కవి మాత్రమే అసలు “తొలిగా” ఎందుకని రచన చేయాలీ?? ముందుగా విమర్శకులే చెప్పి పాఠకులే పాల్గొని చివరగా కవే తన ఊహతో దానిని ఏల సరిదిద్ద రాదూ?? రచన అన్నది సామూహిక కృషిగా మారుతున్నప్పుడు తొలి అడుగు కవి మాత్రమే ఎందుకూ వేయడం?? మళ్ళా ఆ పాత్ర లేదా ఆ బాధ్యతా కవే నిర్వహించాలా ఏం? పోనీ కవే మొదటి ఊహ చేసి రచనని మిగిలిన వారికి అందించాదని అనుకుందాం. దాని మీద విమర్శకులు తమకి తోచిన మార్పులని చేశారనుకుందాం!
చివరికి ఇంతా చేసి అసలు విమర్శకుడు /రాలు చేసిన మార్పులు పాఠకులికి నచ్చక పోతేనో?? అంటే మళ్ళీ ఆ మార్పులు చేసే వాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక స్థాయీ ఒక అర్హతా ఉండాలన్నమాట. దాన్ని దేని ఆధారంగా నిర్ణయిస్తారూ?? ఎవరు నిర్ణయిస్తారూ?? ఇంతాచేసి అది ఏమన్నా సృజన విషయం లో అంతిమ తీర్పా?? అంటే ..చివరికి తేలేదేమిటీ?? సృజన ఎప్పుడైనా వ్యక్తి నిస్టమే కావాలి అనే!! మీరిచ్చిన సినిమా దర్శక ఎడిటర్ల పోలిక కవిత్వానికి నప్పదనే!! సౄజన అచ్చంగా పిల్లల్ని కనడం లాంటిదే!! వాళ్ళ రూపురేఖలు పక్కవాళ్లకి నచ్చడం కాదిక్కడ ముఖ్యం. దాన్ని సృస్టించిన వాళ్ళకే దాని మీద సర్వంసహా అధికారం ఉంటుంది. అది వాళ్ళ రక్త నిస్టమైనది.
సృజనే ముఖ్యం! సృజించే వారి శక్తి కొలది మాత్రమే కల్పన వర్ధిల్లుతుంది. బాగున్న ఊహ బాగుంటుంది. బాగులేనిది మరుగున పడిపోతుంది. అందరూ కల్పన చేయలేరు. కొందరే చేయగలరు. దాని రహశ్యం తెలిసిన వారే కవి శబ్దానికి తగుదురు. మిగిలిన వారు యధాశక్తి కవులు. ఇంక ఇటువంటి మాటలంటారా?? మాట్లాడుకోవడమే :)
రమ.
Madhav అభిప్రాయం:
June 15, 2012 9:31 am
పొద్దు పత్రిక వారి వెబ్సైట్ చిరునామా మారినందువలన రామతులసి గారి ఆదివారం మధ్యాహ్నాలు లింక్ కొంతకాలం పనిచేయలేదు. ఈ లింక్ ఇప్పుడు సవరించాము.
-సంపాదకులు.