ఇంక రాముడికి తలుపు తియ్యక తప్పలేదు. అమ్మా నీ కోడలిని ఇలా ముద్దు చేస్తే నా మాట ఇంక వింటుందా, అని ఫిర్యాదు చేస్తూ, తప్పనిసరి చిరునవ్వు తెచ్చుకుని తలుపు తీస్తాడు రాముడు. అత్త కోడలిని వెనకేసుకుని వొచ్చి, కొడుకుని తప్పు పట్టడం నిజంగా విడ్డూరం. తెలుగు కుటుంబాల్లో పెళ్ళాం చెప్పిన మాటల్లా వింటున్నాడని తల్లి కొడుకుని సాధించడం మనకి పరిచితమైన విషయం. ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా, కోడల్ని వెనకేసుకుని వొచ్చి తల్లి కొడుకుని తిడుతుంది. రాముడు తలుపు తియ్యగానే అత్తగారితో పని అయిపోయింది సీతకి. ఆవిణ్ణి మరియాదగా సాగనంపాలి.
మా మామ దశరథులు ఒక్కరున్నారు
అత్త మీరు పొండి మా మామ కడకు
అని సీత చక్కగా సాగనంపుతుంది కౌసల్యని. ఇంక మేం ఏకాంతంగా వుండవలసిన సమయం ఇది అని అత్తకి సుకుమారంగా చెప్పడం ఇది. వాల్మీకి రామాయణంలో దశరథుడు ఎక్కువ కైక దగ్గిరే గడుపుతున్నట్టు కనిపిస్తుంది. కాని ఈ రామాయణంలో దశరథుడు పెద్ద భార్య దగ్గిరే వుంటాడు. అంటే కౌసల్యకి తన జీవితంలో అసంతృప్తులు ఏవీ లేవు. తన జీవితంలో సుఖంగా వున్న అత్తగారే కోడల్ని సుఖంగా చూడగలదని ఒక సూచన ఇది.
కథ ఒక్కసారిగా నవ్వుతుంది. కథ చివరికి వొస్తోందని చెప్పే ఆఖరి దొంతర మొదలౌతుంది.
సిగ్గుతో శ్రీ లక్ష్మి విభుని సన్నిధికి
చేరగానే దివ్వె కల కలా నవ్వె
వరసగా ఊపిరి తీసుకోకుండా సువాసనలని వర్ణిస్తుంది కవయిత్రి.
ఆకుల వాసనా పానుపు మీద
పోకల వాసనా పానుపు మీద
పువ్వుల వాసనా పానుపు మీద
బుక్కాల వాసనా పానుపు మీద
అంటే సీత పానుపుమీద పడుకుందని మనం ఊహించుకోవాలి. మంచం పక్కనే తను తెచ్చిన పువ్వులు, ఆకులు వక్కలూ, ఇతర పరిమళద్రవ్యాలూ పెట్టిందని అనుకోవాలి. రాముడికోసం తెచ్చానని చెప్పినవి ఏవీ రాముడికి తన చేత్తో ఇవ్వలేదు. అంటే తన కోపానికి అది సూచన అన్నమాట. ఇంతవరకూ సీతని బయట నించోబెట్టిన రాముడు ఆవిడ అలక తీర్చడానికి తనే ఏదో ఒకటి చెయ్యాలి. కాని అంత మాటకారిలా కనిపించడంలేదు రాముడు.
ఆడవారి కోపము ఎట్టిదో యనుచు
మళ్ళి పరుండెను రవివంశజుండు
ఆడవాళ్ళ కోపం గ్రహించగలగడం, దాన్ని తీర్చగలగడం చేతనైనవాడు కాడన్న మాట ఈ భర్త గారు. ఇక్కడ ఈ సమస్యని సరిదిద్దగలిగింది మళ్ళ సీతే.
అగ్గి చెంతను వెన్నెంత తడవగు నోడ
ఆడవారి కోపము అట్టిదే యనుచు
శీఘ్రాన కలిసెను శ్రీ లక్ష్మి యంత
ఎవరు నిప్పు, ఎవరు వెన్న? ఇది సంస్కృతంలో తరుచుగా చెప్పే ఉపమానానికి సరిగ్గా తల్లకిందులు. ఉదాహరణకి వరాహపురాణంలో ఈ శ్లోకం చూడండి.
అగ్నికుండ సమా నారీ ఘృతకుండ సమః పుమాన్
ఘృతకుంభో గ్నియోగేన ద్రవతే నతు దర్శనాత్
పుమాన్ స్త్రీ దర్శనాదేవ ద్రవతే యద్ విమోహితః[10]
ఆడది నిప్పుకొలిమి లాంటిది, మొగవాడు వెన్నకుండ లాటివాడు. వెన్న నిప్పు తగలగానే కరిగిపోతుంది, కాని నిప్పును చూసినంత మాత్రాన కరగదు. కాని, మొగవాడు ఆడదాన్ని చూడగానే కరిగిపోతాడు, స్త్రీ అంటే మోహం కొద్దీ.
మగవారికి వర్తించే ఈ ఉపమానాన్ని తిప్పి ఆడవాళ్ళకి వర్తింపజెయ్యడంలో వుంది ఇక్కడ విశేషం. సరిగ్గా అలాటిదే ‘శీఘ్రాన కలిసెను శ్రీ లక్ష్మి యంత’ అన్న చరణంలో ‘కలిసెను’ అన్న పదం. ‘కలియు’ అనే మాట స్త్రీ పురుషుల సంయోగానికి మృదువైన పర్యాయ పదంగా బహువచన పదం కర్తగా వున్న వాక్యాలలో వాడుకలో వుంది. పురుషవాచక పదం కర్తగా ఉన్న వాక్యంలొ కలియు అనే మాట వాడడం కూడా వుంది. కాని ఈ క్రియ స్త్రీ కర్తగా ఉన్న వాక్యంలో వాడడం తరుచు కనిపించదు.
ఈ పాటలో కొస మెరుపు: ఫల శ్రుతి.
పుడమిలో ఈ పాట పాడినా విన్నా
ఐశ్వర్యవంతులై అతివలుండెదరు.
మామూలుగా ఫలశ్రుతిలో స్వర్గమో, మోక్షమో ఉంటాయి. అందుకు భిన్నంగా ఇందులో కేవలం ఐశ్వర్యం మాత్రమే ఉంది. ఒక విలక్షణమైన ప్రాపంచిక దృక్పథానికి గుర్తుగా.
ముగింపు
ఈ పాట మొత్తం అంతా చూస్తే దీనిలో రాముడూ, సీతా ఆలంబనాలే అని తెలుస్తుంది. నిజానికి ఇది ఆడవాళ్ళ నిత్యజీవితాన్ని గురించిన పాట. ఇది కుటుంబ వాస్తవికతకి ప్రతిరూపం అని అంటే కవిత్వంగా దీని పటిమని తగ్గించినట్టవుతుంది. తన కాలం కన్న ముందుండగల కవులూ కవయిత్రులూ ఊహ ద్వారా జీవితాన్ని రమణీయతరంగా చూపిస్తారు. ఇది యధార్థానికి కల్పనాజనిత ప్రతిరూపం. ఇది నిజం కాదు. నిజం ఇలా వుంటే బాగుంటుందనిపించేది. మంచి కవిత్వం జీవితానికి పరిపూరకం, పరివర్థకం. ఈ ఊహని నిత్య జీవితం కన్న దూరంగా వుంచడం కోసం ఇందులో పాత్రల పౌరాణికత పనిచేస్తుంది. అయినా సంఘటనలు నిత్యజీవితంలో సమిష్టి కుటుంబలో ఎదురయ్యేవి కాబట్టి, ఈ పాత్రలు దగ్గిరగా వొస్తాయి. ఇలాటి కవిత్వం రాయగల స్త్రీలు ఉండడం ఈ సమాజంలో ఎలా జరిగింది? ఈ కుటుంబాలు ఎలాటివి? అందులో స్త్రీల జీవిత పరిస్థితులు ఏమిటి? అనే ప్రశ్నలకి ఈ కవిత్వం సమాధానం చెప్పదు. కాని ఇలాటి కవయిత్రి పుట్టి పెరగడానికీ, ఇలాటి రచన చెయ్యడానికీ, దానికి తోటి ఆడవాళ్ళ మెప్పుదలా, ఆదరణా ఉండడానికీ కావలిసిన పరిస్థితులు ఉన్నాయని మాత్రం నిబ్బరంగా చెపుతుంది.
- ఇందులో [చెప్పుడీ] నేను మార్చిన మాట, అచ్చులో, నోటి పాటలో ఈ చరణం రెండు మూడు రకాలుగా ఉంది. ఇల్లిందల సరస్వతీ దేవిగారు ఈ చరణాల్ని చదివిన తీరూ, నేను చదివిన తీరూ ఒకటేనని ఈ మధ్యే గుర్తించాను.
- ఇది సంపూర్ణ రామాయణం సినిమాలో చివర వుందని కె వి.ఎస్ రామారావుగారు చెప్పారు.
- ‘రాసిన’ అని, ‘చదువుకున్న’ కవయిత్రి అని ఉద్దేశ్యపూర్వకంగానే అంటున్నాను. అయితే, రాసిన అనే మాటకున్న అర్థచ్చాయలు వేరే వ్యాసంలో చెప్తాను, ఇప్పుడవి ఈ వ్యాసం విషయానికి అడ్డొస్తాయి.
- ఇందులో ఉన్న నగల పేర్లనిబట్టి ఇవి ఎలాంటి నగలో, ఏ కాలపు నగలో గుర్తించొచ్చు. కాని నేను గుర్తించలేకపోయాను. కోలవెన్ను మలయవాసినిగారూ, మొక్కపాటి లలితాదేవిగారూ కొన్ని నగల గురించి చెప్పారు, వాళ్ళకి నా కృతజ్ఞతలు. కాని ఇంకా చాలా తెలియాల్సింది వుంది. వాటిని బట్టి ఈ పాట రాసిన కాలం సుమారుగా చెప్పొచ్చనుకుంటాను.
- కీలు కడియాలంటే సీల వుండి, కావలసినప్పుడు పెట్టుకుని, అక్కర్లేనప్పుడు తీసెయ్యాడనికి వీలుండే కడియాలు. మామూలు వెండి కడియాలలా కాళ్ళకి పట్టుకుని, తియ్యడానికి వీల్లేని నిర్బంధం కలిగించేవి కావు. పైగా ఇవి నీలాలు తాపినవి, కాబట్టి విలువైనవి. బహుశా బంగారంవి కూడా. తెలుగు దేశంలో ఒక్క రాజవంశాల ఆడవాళ్ళే బంగారం కాళ్ళకి కూడా పెట్టుకుంటారు మిగిలిన వాళ్ళు నడుముకి కింది భాగంలో బంగారం పెట్టుకోరు.
- ఊర్మిళాదేవి నిద్ర లో కవయిత్రి సరిగ్గా ఈ పనేచేస్తుందని ఇంతకుముందు వ్యాసంలో చెప్పాను. నిద్రలేచిన వెంటనే ఊర్మిళ
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చె
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండెఅని లక్ష్మణుడి చేతకాని తనాన్ని సున్నితంగా, అయినా చురుగ్గా ఎత్తి పొడిచినా – సరిగ్గా పడకగదిలో అతని శౌర్యాన్ని ప్రకోపింపజేస్తూ
సింహవిక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ
అని అంటుంది. అవసరమైన భావాల్ని సమయాన్ని గమనించి కలపడం మంచి కవులకి మాత్రమే తెలిసిన విద్య.
- ఈ చరణాలు అచ్చులో లేవు, మలయవాసినిగారు పాడుతూంటే విన్నవి. అవి ఆవిడే పెన్సిల్తో నా అచ్చుపుస్తకంలో రాశారు.
- పచ్చల బాలుడు అన్నది విలక్షణమైన మాట. పచ్చ అంటే బంగారం, బంగారు బాబూ అంటామే, అలాటి మాట.
- ఇందులో చదరపు కుండలీకరణాలలో ఉన్న మాటలు నేను మార్చినవి. అచ్చుపాఠంతో పోల్చి చూడండి. మలయవాసిని గారు తమ పుస్తకంలో ఈ పాటని గురించి రాసిన వ్యాసంలో చాలా చోట్ల వేరే చరణాలు వున్నాయి. ఆవిడ ఆంధ్ర సారస్వత పరిషత్తు ముద్రణంలో వున్న పాఠాన్ని కాక వేరే పాఠాన్ని అనుసరించారు. “మా నాన్నగారు సేకరించిన పుస్తకాలలొ ఉన్న రామాయణపు పాటలు, కృష్ణశ్రీగారి స్త్రీల రామాయణపు పాటలూ, మా బామ్మ దగ్గిర, బామ్మ కోసం వచ్చే బామ్మగార్ల దగ్గర వ్రాసుకుకున్నవీ ఈ రచనకు ఆధారాలు.” అని తన పుస్తకానికి తొలిపలుకులో రాసినదాన్ని బట్టి ఈ సంగతి గ్రహించొచ్చు. చూ. మలయవాసిని. ఆంధ్ర జానపద సాహిత్యము: రామాయణము. విశాఖపట్నం, 1986. పుటలు. iv, 28-33. ‘సీత గడియ’కి ఆవిడ ఆధారంగా తీసుకున్న పాఠం చూసే అవకాశం నాకు కలగలేదు.
- వరాహపురాణమ్ సం. హృషీకేశ శాస్త్రి. కలకత్తా, 1893, 146:38-39. ఈ శ్లోకం తెలుగుదేశంలో సంస్కృత పండితులు తరుచు ఉదాహరిస్తారు. బహుశా ఇది ఇతర పురాణాల్లో కూడా ఉండొచ్చు.