సీత గడియ

రామయ్య తనకోసం ఎదురుచూస్తున్నాడు కాని సీతకింకా చాలా పనులున్నాయి. అత్తగారు కౌసల్యకి అడుగులొత్తి, మామగారు దశరథుడికి తమలపాకుల మడతలు అందించి, సుమిత్రకి వింజామరలు వీచి, కౌసల్యకి పక్క వేసి – ఈ పనులన్నీ చేసేసరికి చాలా సేపు అయిందని మనకు బోధపడుతుంది. ఇంత వరకు ఇంటికి మంచి కోడలుగా, తన సుఖాలకన్నా అత్తమామల పరిచర్యలే ఎక్కువని భావించే ‘ఉత్తమ స్త్రీ’గా సీత మనకి కనిపిస్తుంది.

ఇక తరవాత దొంతర, సీత సావకాశంగా తనను తాను ముస్తాబు చేసుకోవడం గురించి చెప్పేది. దాదాపు నూటరెండు పంక్తులున్న ఈ పాటలో 24 పంక్తులు ఇందుకోసమే వినియోగిస్తుంది కవయిత్రి. సీత స్నానం చేసింది. పసుపు పూసుకుంటుంది. బంగారు పూల చీర కట్టుకుంటుంది. తల దువ్వుకుని పాపిట తీసి వరసగా రకరకాల నగలు పెట్టుకుంటుంది. ఆ నగలు వర్ణించిన తీరు చూడండి.

దువ్వి పాపిట తీసి తింత్రిణీ పెట్టి,
తింత్రిణిలొ ముత్యాల పతకంబు బెట్టి
రవ్వల ముత్యాల జల్లి దిగవేసి
[4]

ఇక అక్కడితో ఆగకుండా కవయిత్రి ఆ పెట్టుకున్న నగలని గురించి వాటి విలువతో సహా వేరువేరుగా చెప్పడం మొదలు పెడుతుంది.

వేయి జేయు కమ్మలు వెలయంగ బెట్టి
రెండువేలు జేయు హారములు వేసి
మూడువేలు జేయు ముక్కెర బెట్టి
నాలుగువేలు జేయు నాను మెడవేసి
పదివేలు జేయు పతకంబు బెట్టి

ఈ నగల విలువ పనిగట్టుకుని అంత గొప్పగా చెప్పాల్సిన అవసరమేమిటి? ఆడవాళ్ళకి ఆస్తిహక్కులు వేరే లేని సమాజంలో వాళ్ళ నగలే వాళ్ళ ఆస్తి. అది స్త్రీ ధనం కాబట్టి కుటుంబంలో మగవాళ్ళెవరూ వాటిని ముట్టుకోరు. వాటి విలువ వల్లే ఆడవాళ్ళకి నిబ్బరం, ధైర్యం, ఒకపాటి గర్వం కూడా. అందుకని ఆ నగల చక్కదనంతో పాటు వాటి విలువ, ఒకదానికన్నా ఒకటి ఎక్కువగా, విశృంఖలంగా వర్ణిస్తుంది కవయిత్రి.

ఆ తరవాత గంటల వడ్డాణం, నీలాలు తాపిన కీలుకడియాలు[5] పెట్టుకుంటుంది. వీటితో అలంకరించుకున్న తరవాత కన్నులకు కాటుక పెట్టుకుని అప్పుడు స్తిమితంగా నిలువుటద్దంలో తన రూపం చూసుకుని, తన అందానికి తానే ముచ్చటపడి చిరునవ్వు నవ్వుకుంటుంది సీత. ఈ అలంకరణ అంతా తన కోసం, తన ముచ్చట కోసం అనే సూచన వుంది ఈ వర్ణనలో.

ఇంక ఇప్పుడు సీత సావకాశంగా భోజనానికి కూచుంటుంది. ‘పంచభక్ష్యాన్నములు భుజించి’ లేచి చేతులు కడుక్కుని బంగారపు జరీతో చేసిన బుటేదారు శాలువ కప్పుకుని, బంగారు చెంబుతో మంచినీళ్ళు, ఒక పళ్ళెంలో ఆకులూ, వక్కలూ, అత్తరూ, పునుగూ, జవ్వాదీ, పన్నీరూ, గంధమూ, పళ్ళూ ఫలహారాలూ పెట్టుకుని, మల్లెలూ మొల్లలూ విరజాజులూ కొప్పులో ముడుచుకుని భర్త దగ్గరికి వెళుతుంది.

ఈ పాటికి రాముడు పడకగది తలుపు గడియపెట్టేశాడని సీత చూస్తుంది. ఇక్కడితో పాటలో మరో దొంతర మొదలౌతుంది. ఇందులో ఉన్న ఆలోచనల వరస చూడంది.

విరులను దెస్తినో వీరావతార
పుడమిలో వీరులకు తలనొగ్గకుండా
పరశురాముని భంగపరచితిరి మీరు.

‘మీకు పువ్వులు తెచ్చాను,’ అని భార్య అనడం ఏమిటి? మామూలుగా ఆడవాళ్ళ కోసం మొగవాళ్ళు పువ్వులు తెస్తారు. వాళ్ళని సంతోషపెట్టడం కోసం, వాళ్ళమీద తమకి ప్రేమవుందని తెలియపరచడం కోసం. ఆ పువ్వులు అలంకరించుకుంటే ఆ అందాన్ని చూసి ఆనందించడం కోసం. ఇక్కడ పరిస్థితి అందుకు వ్యతిరేకం.

ఇక తర్వాత రెండు చరణాలూ రాముణ్ణి పొగడడం. ఇక్కడ శ్రీరాముని వీరాన్ని పొగడడంలొ ఒక సుకుమారమైన సూక్ష్మం వుంది. శృంగారానికి పూర్వరంగం ఇది. శృంగార వీరాలని సమయోచితంగా కలపడం మంచికవులకి మాత్రమే తెలిసే ఒడుపు[6].

సరే ఈ పాచిక పారలేదు. శ్రీరాముడు తలుపు తియ్యలేదు. ఇక తనచేతిలో రెండవ ఆయుధం; శ్రీరాముడికి జాలి కలిగేలా తన అసహాయతని చెప్పడం;

నన్ను యేలే స్వామి కాకుత్సతనయ
తలుపేయ కోపంబు తాళంగ గలనా
నిలుచున్న పాదాలు చేతులును నొచ్చె
గడియ ఆలిసమైన గడియ బెట్టితిరా
తప్పులు పట్టక తలుపు తీయండీ
[7]

ఇక ఇది పని చెయ్యకపోతే, వాన వొస్తోందని, తను తడిసిపోతున్నాననీ (అబద్ధం) చెపుతుంది.

దంతంపు తలుపులూ తియవోయి నాథా
వొంటొంటి చినుకుకె ఒక చెంగు తడిసె
కాముడ తియవోయి కనకంపు గడియ,
పట పట చినుకులకు పై కొంగు తడిసె
పచ్చలబాలుడా[8] తియవోయి గడియ

ఇక్కడ అకస్మాత్తుగా ఒక విశేషమైన చరణం ఒకటి కనిపిస్తుంది.

రత్నహారంబిస్తు తియవోయి గడియ.

ఈ చరణం బహుశా ఇంకా ముందు ఉండి ఉండొచ్చు, లేదా దీని తరవాత ఇలాంటివే మరి కొన్ని చరణాలు ఉండి ఉండవచ్చు. కాని ఇది వొదిలెయ్యడానికి వీలులేని చరణం. భార్యలకి భర్తలు నగలు ఆభరణాలూ (లంచంగా) ఇవ్వడం అందుమూలంగా వాళ్ళ అభిమానం సంపాదించుకోవడం అప్పటి కుటుంబాలలో (కొన్ని ఇప్పటి కుటుంబాలలో కూడా) పాదుకున్న వ్యవస్థ. కాని ఇక్కడ భార్య భర్తకి లంచం ఇవ్వజూపుతుంది.

కాని, ఇవేవీ పనిచెయ్యవు. శృంగార విశేషంగా సున్నితంగా వుండవలసిన కోపం శ్రుతి తప్పుతోందా? పైగా,

[నీవు లేకుంటేను] నాకేమి సీత
గంటవలే దీపమ్ము అదినాకు తోడు
[నీవు లేకుంటేను] నాకేమి సీత
పువ్వులూ బుక్కాయి అది నాకు తోడు
[నీవు లేకుంటేను] నాకేమి సీత
గంధమూ కస్తూరి అదినాకు తోడు
[నీవు లేకుంటేను] నాకేమి సీత
పట్టెమంచము పరుపు అది నాకు తోడు
[9]

అని ఎదురు బుకాయిస్తాడు రాముడు. సీతని అవతలపెట్టి గడియవేశాడు సరే, కాని ఇంకోరకంగా తనని తాను గదిలో బంధించుకుని ఒంటరివాణ్ణి చేసుకున్నాడు. ఈ ఒంటరితనం పైమాటల్లో వినిపిస్తుంది. తిరస్కారపూర్వకంగా వినిపించే ఈ మాటల వెనకాతల ఒక దైన్యం వుంది, నిశ్శబ్దంగా. దీపమూ, పువ్వులూ, బుక్కాయీ, కస్తూరీ, పరుపూ, మంచమూ – ఇవా తనకి తోడుండేవి! కాని రాముడు పంతానికి పోతే పట్టు వదలడు అనే సూచన కూడా వుంది ఈ గొంతుకలో.

ఇక సీతకి మిగిలిన ఆఖరి ఆయుధం – తన అత్తగారు. అత్తగారు తన పక్షాన వుంటే రాముడి ఆట కట్టినట్లే. కోపంతో వెళ్ళి, సీత తన అత్తగార్ని పిలుచుకొస్తుంది.

అత్త కౌసల్యకు అన్ని దెల్పగను
తల్లి కౌసల్యొచ్చె రాము దగ్గరకు

సీత కౌసల్యకి ఏం చెప్పిందో ఊహించుకోవొచ్చు. అన్నీ చెప్పలేదనీ కూడ మనం ఊహించగలం. ఉదాహరణకి తాను అలంకరించుకోడానికి సావకాశంగా అంతసేపు తీసుకుందని చెప్పివుండదు. కౌసల్యకి తను శ్రద్ధగా సేవ చేసింది కాబట్టి, తన మాట ఆవిడ విని తన పక్షాన వుంటుందని సీత నమ్మకం.

దశరథుని పుత్రుడవు జనకులల్లుడవు
భూదేవి అల్లుడవు బుద్ధటర నీకు
సీత చేసిన తప్పు శీఘ్రాన చెప్పు
నాకు ఎరిగించరా నను గన్న తండ్రి

రాముణ్ణి నీకు బుద్ధిలేదా, అని రాముణ్ణి అనగలిగింది కౌసల్య ఒక్కర్తే. మళ్ళా ప్రేమగా నను గన్న తండ్రీ అనగలిగిందీ ఆవిడే.