సారా మానను

దారా

ఒక రహస్యము జెప్పెద నో సఖుండ
యుండ డెచ్చోట నా యీశ్వరుండు దప్ప
పేరు మారిన మాత్రము వేఱు కాదు
నీవు జూచున దెల్ల నా దేవు డొకడె

వెదకుచున్నావు ప్రతి చోట ప్రేమరూపు
వేఱు కాదు నీ వతడును వేఱు కాదు
నీవు జేయు యన్వేషణ నిజముగాను
సింధువందున వెదకెడు బిందు వేమొ

లేరు ముల్లాలు దివిలోన లేరు నిజము
వారి గొడవలు వినరావు స్వర్గమందు
ఉండనీ వినబడకుండ నుర్విపైన
వారి ఫత్వాలు చర్చలు వద్దు మాకు
ఉండడే జ్ఞాని ముల్లాయు నుండు యూర

జేబున్నీసా

నను జూడగ గులాబి నన జేరి పాడు యా
వనములో కోకిల స్వనము మఱచు
నను జూడ జందెమ్ములను దాల్చు బ్రాహ్మణుం
డును దాను మఱచునే తనదు దేవు
నను జూడవలె నన్న నా పద్యములయందు
తనరారు మాటలన్ గనగ వలెను
ననలోని తావియో యన యెప్డు దాగి యుం
దును నాదు పదముల వెనుక నేను

నే ముసల్మానుడను గాను నిజముగాను,
విగ్రహారాధకుడ నౌదు, విమల భక్తి
నాలయమ్మున బూజింతు నమిత దీక్ష,
బ్రేమమూర్తికి ప్రణమిల్లి ప్రీతి మీఱ

నేను బ్రాహ్మణుడ గాను నిజముగాను
జందెమును తీసివేసితి జంకు లేక,
నామె కురులను కొన్నిటి బ్రేమ తోడ
కంఠమున ధరించితిని హృత్కమల మలర

లెమ్ము హృదయమా యామని లెస్స వచ్చె
కొమ్మ కొమ్మయు కుసుమించె గ్రొత్త తావి
యీ వసంతపు మాయలో నెలమి దెచ్చు
సఖుడు మధువును గొల్చుచు జాల భక్తి

చూడకుండకు హృదయమా నేడు కనుల
నీ నిషిద్ధ పథమ్మును, నిర్ఘృణాంశ
నీకు బలియైన వారిని నిక్కి చూడు
చూపు నీదొక్కటియు చాలు సోలి రాల

కొందఱా మసీదున నిన్ను గొలుతు రెపుడు
కొందఱా మందిరమ్మున గొలుతు రెపుడు
ప్రేమమూర్తికి హృదయాన బీట వేయు
నీ ముదమ్మును నిభృతా గణించ దరమె

మోదపు మధువున బోయెను రుచియు
ఈ ధర మారిన దిప్పు డెడారి
పచ్చిక పెఱుగని బంజ రిదయ్యె
ఎచ్చట యామని యిక నీ బ్రదుకున

కనబడ దెక్కడ కమ్మని ముదము
కనబడ రెక్కడ కలువగ సఖులు
అధిపతి కరుణయు నగపడకున్న
వృథయయె బ్రార్థన తృణమున కన్న

వాసిగ చూడవె వదలక నిభృత
ఆశయు నుండు నిరాశల లోన
తత్తర ప్రేమపథమ్మున నడువ
క్రొత్తగ తోచును కోరిక శక్తి

గజల్

గజల్ ప్రక్రియను సుమారు 10వ శతాబ్దమునుండి మహమ్మదీయ కవులు విరివిగా వాడారు. రూమీ, హఫీజ్, ఫుజూలి మున్నగువారు గజల్ వ్రాసిన సుప్రసిద్ధ కవులు. ఉర్దూ భాషలో మీర్జాగాలిబ్ (1797-1869) గజలుకు మారు పేరు అని చెప్పవచ్చును. ఛందస్సు పరముగా ఈ గజళ్ళు ద్విపదల (షేర్ల) కూర్పు, అంత్యప్రాస అవసరము. మొదటి ద్విపదను మత్లా అంటారు. ఇందులో రెండుపాదాల్లోని చివరి పదాలకూ ప్రాస (రదీఫ్) ఉండాలి. అలాగే తరువాతి ప్రతి ద్విపదలోని చివరి చరణములోని చివరిపదానికి మొదటి చరణములోని చివరి పదముతో ప్రాస (రదిఫ్) చెల్లాలి. కొన్ని సమయాలలో దానికి ముందటి పదముతో కూడ ప్రాస నియతముగా ఉంటుంది. ఒక గజలులో ఐదునుండి పదిహేనువరకు ద్విపదలు ఉంటాయి. ప్రతి ద్విపద తనంతట తానే స్వతంత్రముగా మిగిలిన చరణాలతో సంబంధము లేక నిలబడాలి (దీనిని ముక్తకము అని కూడ అంటారు). చివరి ద్విపదలో రచయిత ముద్ర (తఖల్లూస్ – కలం పేరు, కవినామం) ఉండాలి, దీనినే మక్తా అంటారు. క్రింద మీర్జాగాలిబ్, మీనాకుమారి గజళ్ళను (ఇంచుమించు అదే మెట్టులో) చదివి పాడుకోడానికి ప్రయత్నించండి. తెలుగు సాహిత్యములో యక్షగానాలలో ఒక రెండు చోటులలో గజళ్ళను ఉపయోగించారని జోగారావు తెలిపారు. తెలుగులో నారాయణరెడ్డి ఈ ప్రక్రియను చక్కగా వాడారు. ఛందస్సు పరముగా తెలుగులో చతుర్మాత్రలు గజళ్ళకు బాగుంటాయి. బుల్లా షా కవితకు నా అనువాదములో దీనిని గమనించవచ్చును.