ఆయుత నియుతుల కథ
తెలుగు భాషని సుసంపన్నం చేసిన మహానుభావుల్లో మహాకవి తెనాలి రామకృష్ణుడు ఒకడని నిస్సందేహంగా, నిర్ద్వందంగా చెప్పవచ్చును. ఆయుత – నియుతుల కథలోనుంచి మచ్చుకి రెండు పద్యాలు చూద్దాము. అగస్త్యమహర్షికి ఇద్దరు శిష్యులున్నారు. వారి పేర్లు: ఆయుతుడు, నియుతుడు. వాళ్ళు వేదాభ్యాసం ఎలా చేసేవారో చెబుతున్నాడు.
వాసోనిగ్రమెన్నరాఁకలియు నీర్వట్టున్ గణింపర్తలల్
మాసెంగా యన రంగముల్ బడలినన్ బాటింపరట్టుండనీ
యా సాయంబుగ నానిశాత్యయముగా నామ్నాయముల్ గ్రోల్చుచో
నాసీన ప్రచలాయితంబయిన లేదాహా వితర్కింపగన్
వాసస్ అంటే గుడ్డ. వాళ్ళు వేదాలు (ఆమ్నాయంబులు) అధ్యయనం చేసేటప్పుడు లేదా వల్లె వేసేటప్పుడు (గ్రోల్చుచోన్) వాళ్ళకి వొంటిమీద బట్టలు ఎలా వున్నాయో అనే ధ్యాస ఉండేది కాదట – అసలు ఉన్నాయా లేవా అనే స్పృహే ఉండేది కాదు; ఆకలియు, దప్పికయు (నీర్వట్టున్) లెక్క చేసేవారు కారట; జుత్తు బాగా పెరిగిపోయింది (తలల్ మాసెంగా) అనుకోరు – జడలు కట్టేస్తూన్న సరే ; అవయవాలు హూనం అయిపోయినా – అదే పనిగా కూర్చూడం వల్ల – పట్టించుకొనేవారు కారట; ఇవన్నీ అలా ఉండనీ – ఉదయం కూర్చుంటే సాయంకాలం అయ్యేవరకూ (ఆసాయంబుగన్) (ఆబాలగోపాలం, అసేతుహిమాచలం లాగ ఆసాయంబుగన్ అన్నాడు); రాత్రి కూర్చుంటే ఉదయం అయ్యేవరకు (ఆ + నిశః + అత్యయంబుగన్) కనీసం కూర్చుని కునుకిపాట్లు పడడం అనేది కూడా లేదే (అసీన ప్రచలాయితంబు అయినన్ లేదే) అహా చూడగా (వితర్కింపగన్). అంత శ్రద్ధగా చదువుకొనేవారట ఆ ఆయుత నియుతులు.
హుంకారములు లేవె యుప పురందర
హఠోత్పాటనంబునకుఁ బాల్పడవుఁ గాక
భ్రూభంగములు లేవె యాభీల
వింధ్య గర్వస్తంభనమునకు రావుఁగాక
చుళుకాకృతులు లేవె జలరాశి
నిశ్శేష శోషణకుఁ జొరవు గాక
జాఠరాగ్నులు లేవె జటితాపి వాతాపి
తనుదాహమున నెదుర్కొనవు గాకనిష్ట నీ మాడ్కి లోక ప్రతిష్ఠ గుఱిఁచి
దుష్టనిగ్రహ శిష్ట సంతుష్టి హేతు
రోషభీషణ రేఖా నిరూఢ గాఢ
లీలఁ గ్రీడించు ప్రోడలు లేరుఁ గాక!
అగస్త్యుడు ఆయుత-నియుతులకోసం తగిన వధువుల్ని కుదర్చడంకోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడి వద్దకే వెళ్ళాడు. బ్రహ్మ అగస్త్యుడికి అగ్రాసనమిచ్చి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సందర్భం లోనిది ఈ పద్యం.
లోకంలో ఎందరు హుంకరించడం లేదు? అవన్నీ ఇంద్రుడంతటివాణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి హఠాత్తుగా క్రింద పడేలా చేస్తాయా? (నూఱు యజ్ఞాలు చేసిన నహుషుడు ఇంద్రపదవిలో ఉండగా శచీదేవిని మోహించి, తదుపరి మహర్షులని అవమానించిన సందర్భంలో అగస్త్యుడు హుంకరించగా – శపించగా – కొండచిలువ అయి భూలోకంలో వచ్చి పడ్డాడు).
చుళుకాకృతి అంటే పుడిసిలి పట్టడం – అంటే అరచేతిలో పట్టేటంతటి జలాన్ని స్వీకరించడం. లోకంలో ఎందరు పుడిసిళ్ళు పట్టడంలేదు? అవన్నీ అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నాయా? (సముద్రంలో దాక్కొన్న కాలకేయులనే రాక్షసుల్ని బయట పడేయడం కోసం, అగస్త్యుడు సప్తసముద్రజలాలన్నిట్నీ పుక్కిట పుడిసిలి పట్టాడని ఐతిహాస్యం). అందరికీ ఆకలేస్తుంది, కానీ అందరూ అగస్త్యుడిలా వాతాపి లాటి మహా మంత్రశక్తులు కలిగిన రాక్షసుణ్ణి తిని హరాయించుకోగలుగుతారా?
ఇవన్నీ పేర్కొంటూ బ్రహ్మ అగస్త్యుడిని పొగుడుతున్నాడు. “మిత్రావరుణ కుమారా, ఓ అగస్త్యా! ఇలా నీవలె లోకకళ్యాణం కోసం దుష్ట శిక్షణ, శిష్ట సంతుష్టి కోరి రోషభీషణమైన పద్దతిలో క్రీడించే ప్రోడలు – ఇలాటి మహత్కార్యాల్ని క్రీడప్రాయంగా చేయగలిగే నేర్పరులు – లేరు గాక లేరు!
మంగళం
తెనాలిరామకృష్ణ మహాకవి గురించి ఆయన రచించిన కొన్ని ఆణిముత్యాల్లాటి పద్యాల్నీ, కవితా చమత్కారాల్ని మరికొంత మంది తెలుగు భాషాభిమానులతో పంచుకోవడమే ఈ చిరుప్రయత్నం. పాండురంగమాహాత్మ్యం అవతారికలో ఆయన ఇలా వ్రాసుకున్నాడు.
నను రామకృష్ణకవి గవి
జన సహకారావళీ వసంతోత్సవ సూ
క్తినిధి బిలిపించి యర్ధా
సనమున గూర్చుండ బనిచి చతురత ననియెన్
“కవులున్ బాఠకులున్ బ్రధానులు అలంకారజ్ఞులున్, ప్రాజ్ఞులున్” కొలువై ఉండగా నిండుసభలో విరూరి వేదాద్రి మంత్రి రామకృష్ణకవిని సగౌరవంగా పిలిపించి అర్ధాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ సందర్భంగా “కవిజన సహకారావళీ వసంతోత్సవ సూక్తినిధిని నేను” అని సగర్వంగా చెప్పుకున్నాడు రామకృష్ణుడు. కవిజనులు అనే మామిడితోపునకు వసంతోత్సవం కల్పించే సూక్తులకు నేను నిధిని అన్నాడు.
“సూక్తినిధి” అనే సమాసం నన్నయ్య తరవాత మళ్ళీ ఇక్కడే యథాతథంగా కనిపిస్తుంది. పాఠకహృదయాల్నే కాదు, కవిహృదయాల్ని కూడా ఆనందపరిచి చిగురింపచేసే సూక్తులకు నిధి ఆయన. సూక్తులు అంటే నీతి వాక్యాలు కావు. అలంకారమహితమైన ఉక్తులు. నన్నయ్యదగ్గరా ఇదే అర్థం. పరిపూర్ణ కవితామయోక్తులకు తాను నిధి కనుక కవి జనుల్ని పులకింప జెయ్యగలను అని ధీమాగా ప్రకటించాడు తెనాలి రామకృష్ణుడు. ఆయన కవులకు కవి. కవీనాం కవిః