సిరియాళదేవి
“స్వామీ యేమందును? నా
స్వామిన్ బాసితిఁ గఠోరసమరమునందున్,
భీమాకృతియై భల్లహ
భూమీశుఁడు మాదురాజ్యమున్ హరియించెన్.
సారపరాక్రమార్కుఁడయి, సద్గుణభూషితుఁడై, యపారకం
దారపురీంద్రలక్ష్మి కధినాథుఁడు నై తగు సోమదేవ ధా
త్రీరమణుండె బంధుఁడు మదీయధవుండును, యుద్ధరంగదు
ర్వారుఁడు నయ్యుఁ బ్రాణములఁ బాసె నతం డపవిద్ధభాగ్యుఁడై.
ఆతఁ డనేకసత్రములు, యాగము లాగమశాస్త్రసూత్రవి
ఖ్యాతముగా నొనర్పఁ బతి కండగ నేనును సోమిదమ్మనై
పూతచరిత్రనై, విబుధపూజనతత్పరచిత్తనై, సదా
చేతును వేదధర్మహితజీవనమున్ ధరణీసురోత్తమా!
ధవుని వధించి బల్లహుఁడు దారుణభంగిఁ దదీయబంధులం
దెవరును జిక్కకుండ మడియింపఁగఁ జూచెడి పూన్కిఁ జూచి మం
త్రివరుఁడొకండు సాయమొనరింపఁగ నెట్లొ ప్రదుర్గమాటవీ
నివహము నెల్ల దాఁటి దయనీయదశం జనుదెంచితేనిటన్.
గర్భవతినైన ననుఁజంప సార్భకముగఁ
బాయు శత్రుశేషంబని బల్లహుండు
భటశతంబులతోడనీ ప్రాంతమెల్ల
మార్గణము సేయుచున్నా డనర్గళముగ.
సిరియాళ నాదు నామము
సురగురుసన్నిభ! సిరియును,సుఖమును జెడి నీ
శరణమె శరణంబని కా
తరనై వచ్చితి నిఁక నను దయతోఁగనుమా!”
అనియెడు నామె దైన్యభరితాలపనంబుల నాతఁ డాదరం
బున విని, వారిబిందుగణపూర్ణనభస్యఘనంబుపోలికన్
ఘనకరుణారసోర్మికణికాభరితంబయి పొంగు మానసం
బునఁ గని వత్సలత్వపరిపూర్ణమృదూక్తులఁ బల్కె నీగతిన్.
“వింటిని మున్నె సోమపృథివీపతి ధర్మహితైకవర్తియై
మింటినిఁదాఁకు కీర్తిమిసిమిం గనె నంచును, సోమిదమ్మవై
యుంటివి నీవుసైతము మహోజ్జ్వలధర్మపథానువర్తివై
వింటిని నీదు దైన్యదశ, వీడుము శోకము నింక మానినీ!
ఉండుము నాదు పుత్త్రివయి యుమ్మలికంబును బాసి యింక నా
యండను మద్గృహంబుననె యబ్జదళాక్షి! ధరాసురాంగనో
ద్దండపవిత్రవేషమును, దైనికచర్యను బూని కానరా
కుండఁగ నీదు క్షాత్రకులగోత్రము లేరికి బ్రాహ్మణింబలెన్.
కట్టుబొట్టులందున విప్రకాంత వగుచు,
కాళికాదేవిని హృదయకమలమందు
అవిరతము నిల్పి సేవింపుమమ్మనీవు
భక్తతారిణి యాదేవి భద్ర మొసఁగు.
ఎంత యదృష్టమో దుహిత లేరును లేని మదన్వయంబునన్
శాంతయు, సద్గుణాశ్రయయు, చారుతరాకృతి యైన చానమే
ల్బంతిని పుత్త్రిగాఁ గొనెడు భాగ్యము నేఁడొనగూడె,నింక నీ
యింతి మదీయగేహమును నిందిరగేహముగా నొనర్చుతన్.
నీదు గర్భస్థశిశువును నీరజాక్షి!
యోగదృష్టినిఁ జూడ విద్యోతమయ్యె,
నతఁడు చక్రవర్తిపదంబు నధివసించి
అరిదముండయి సత్కీర్తి నందు ననుచు.
ముక్కలుముక్కలై తెనుఁగుభూమి పరస్పరవిగ్రహంబులం
జిక్కిన నాయకబ్రువుల చేష్టలఁ జిక్కి యపాస్తభాగ్యయై
స్రుక్కెను నేఁడు, తత్ప్రతనశోభను వెండియు నుద్ధరింపఁగా
నక్కఱయయ్యె నిప్పుడు మహాధిపుఁ డొక్కఁడు తెన్గునేలకున్.
కావున నీదుగర్భమునఁ గ్రాలెడు నర్భకు డట్టి నాయకుం
డై వఱలంగలాఁ డనెడు జ్యౌతిషికాంకము నాకుఁ దోఁచెడిన్,
ప్రోవఁగలాఁడ నీదుశిశువు న్నినుఁ గష్టము లెన్ని కల్గినన్
భావి తెనుంగురాజ్యరమభాగ్యముకోసము నీరజాననా!
ప్రాణవిత్తమానభంగంబుఁ దప్పింపఁ
గల్లలాడ నఘము గలుగదండ్రు
గాన నీకు ప్రాణహానియే యెదురైనఁ
గల్లలాడియైనఁ గాతు నిన్ను.”
అని యా బ్రాహ్మణుఁ డా భయద్రుతను స్వీయాగారమందుంచి ర
క్షణగల్పింపఁగ నామెకుం గలిగె నొక్కం డాత్మజాతుండు శ
త్రునికాయానలసన్నిభుండు, సకలాంధ్రోర్వీవిజేతృండు, పా
వనుఁడున్ మాధవవర్మనామకుఁడు సంపద్దైర్యవర్ధిష్ణుఁడున్.
పితరుని జంపినట్టి పృథివీశుని బల్లహు నాహవంబునన్
హత మొనరించి, మండలధరాధిపులందఱ గెల్చి, సార్వభౌ
మతఁగని తెన్గుధాత్రిని సమస్తము నేలెనతండు, తద్ధరా
పతికులజాతులే పిదప పాలనసేసిరి కాకతీయులై.
[సిరియాళదేవి క్రీ.శ.300 ప్రాంతములో కందారపురము (ఇది నేటి గుంటూరుజిల్లా లోని చేజెర్ల, లేదా కాంతేరు కావచ్చునని చారిత్రకుల అభిప్రాయము) రాజధానిగా ఆంధ్ర,తెలంగాణ ప్రాంతములలో కొంతభాగము నేలిన సోమదేవరాజు ధర్మపత్ని. ఈ సోమదేవునికి, ధాన్యకటకము (అమరావతి) ముఖ్యపట్టణముగా నేలుచుండిన బల్లహునికి నిరంతర యుద్ధములు జరుగుచుండెను. చివరికి బల్లహుడు సోమదేవుని యుద్ధమునందు వధించి, ఆతని రాజ్యము నాక్రమించెను. ఆ సమయమున సిరియాళదేవి గర్భవతిగా నుండెను. ఆమె ఎట్లో తప్పించుకొని అనుమకొండలో నున్న మాధవశర్మయను నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుని శరణుపొందెను. ఆతడామెను కూతురుగా గ్రహించి ఆమెకు రక్షణమొసంగెను. బల్లహుడు భటులను బంపి, ఆమె యునికిని కన్గొనెను. కాని అనుమకొండ యందలి బ్రాహ్మణులందఱును, మాధవశర్మ యందలి గౌరవము చేత ఆమె అతని కూతురేయని వచించిరి. అదియే నిజమైన ఆమె చేతి వంటకము మీరు తిని నిరూపించుడని బల్లహుడనెను. అప్పుడు బ్రాహ్మణులందఱు ఆమె సోమిదమ్మ యగుటవలన, ఆమె చేతి వంటకము తినుటలో దోసము లేదని అట్లే చేసిరి. అప్పుడు విధిలేక బల్లహుడామెను వధింపక విడిచిపెట్టెను. తదనంతర మామె కొక పుత్త్రుడు జనింపగా, మాధవశర్మ యందలి గౌరవముచే ఆ శిశువున కామె మాధవవర్మ యను పేరిడెను. ఈతడు మాధవశర్మ వద్దనే పెరిగి,విద్యాబుద్ధులు నేర్చి, ఉద్దండుడై సైన్యమును కూర్చుకొని పితృహంతయైన బల్లహుని వధించి, ఇంకను అనేక మాండలికులను జయించి, హనుమకొండ రాజధానిగా తెనుగుదేశము నేలెను. ఈతని సంతతివారే తర్వాత కాకతీయ ప్రభువులైరి యని కాసె సర్వప్ప (16వ శతాబ్దము) సిద్ధేశ్వరచరిత్రమను ద్విపదకావ్యము తెల్పుచున్నది. 1962లో ప్రచురింపబడిన మహాసహస్రావధానులు బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రులవారు రచించిన ఆంధ్రసామ్రాజ్యము అను పద్యగ్రంథములో గూడ నీ చరిత్ర చక్కగా వర్ణింపబడినది. ఈ ఖండికలో వారిర్వురూ నామమాత్రముగా స్పృశించిన సిరియాళదేవి శరణాగతిఘట్టమును నేను కొంత వివరముగా వర్ణించితిని.]
t.sriranga swamy hanamakonda అభిప్రాయం:
January 18, 2012 2:49 pm
nenu siriyaladevi padyaalu chadivanu, rasasphorkanga undadamee kakunda charithranu chati cheppayi. yeppudo35 yendla kinda chadivina oka navala gurtuku vachinadi, kani naaku aa navala peru gurtuku ledu.kani katha matram ede.. oka brahamdi intiki oka raju satheemani taladaachu kovadaniki ravadam kaapadadam meeru cheppinattugane vundi.ite chinna ansham-ameku puttina koduku padmakshi devalayamlo aadukovadam, oka roju aa brahmadu ooriki velladam thalli okati edo marachipothe dannini thisukoniravadankik aa rathri padmmakshi kovelaku velathadu.appudu aa devatha pratyakshamyi neeku bahyam veyadamleda ani aduguthundi, naakemiti bhyam nenu ninnu roju chutunnanukada,neevundga naaku digulu ledu ani antadu aa baludu. aa balude mahadeva varma. hanamkonda ku moolapurushudu ani chadivaanu. Ippudu ee padyam chadivaaka okasarigurthuku vachhindi. Meeku aa navala telisthe cheppandi.Aa katha malli oka sari chadavalani undi. eka naa gurinchi–nenu telugu freeverse,katha,vyasalu rastuntaanu. nenu viswanatha vari krishna kaavyalu gurinchi Prof.Kovela sampathkumara charyula daggara Ph.D. chesaanu. nenu adminstrative side lo job chesi retire ayyanu. naaku oka manchi kavitha chadavadaniki avakaasham dorikinanuduka santhoshamga kooda undi. meeku naa abhinandanlu.
[దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్లో నేర్చుకోగలరు. - సం.]