జైన కథనాలు
జైన కథనాల ప్రపంచంలోకి ప్రవేశిస్తే, రామకథలలో తరచుగా కనిపించే హిందూ విలువలు కనిపించవు. నిజానికి, జైన రామాయణాల్లో హిందువులు పనిగట్టుకొని రావణుని పాత్రకు అన్యాయం చేసారన్న భావనలు కనిపిస్తాయి. ఒక జైన రామాయణం ఈ ప్రశ్నలతో మొదలౌతుంది: “కోతులమూక రావణుని రాక్షస వీరులను హతమార్చడమేమిటి? పుణ్యాత్ముడు, జైన యోగి, యోగ్యుడు అయిన రావణుడు మాంసం తిని, రక్తం తాగడమేమిటి? కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోవడమేమిటి? అతడు సలసలకాగే నూనె చెవిలో పోసినా, ఏనుగులు చేత తొక్కించినా, యుద్ధభేరీలు మ్రోగించి, శంఖనినాదాలు చేసినా నిద్ర లేవకపోవడమేమిటి? రావణుడు సురరాజు ఇంద్రుణ్ణి బందీగా చేసి లంకకు ఈడ్చుకు వెళ్ళడమేమిటి? ఇవన్నీ కట్టుకథల్లా అనిపిస్తున్నాయి. హేతువుకు విరుద్ధంగా, అసత్య ప్రచారంగా గోచరిస్తున్నాయి.” అంటూ శ్రేణికుడనే రాజు ఈ కథలో అబద్ధాలను వేరు చేసి అసలు కథను తెలియజేయ వలసిందిగా గౌతమమునిని కోరుతాడు. గౌతమముని “నీకు జైనశ్రేష్ఠులు చెప్పిన కథ చెబుతాను. రావణుడు రాక్షసుడు కాదు. నరమాంసం తినేవాడు కాదు. కుకవులు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం ఇది.” అంటూ తన కథనాన్ని మొదలుపెడతాడు. పౌమ చరియ (సం. పద్మ చరిత) అనే ఈ జైన రామాయణం రాసిన విమలసూరికి వాల్మీకి రామాయణం బాగా తెలుసు. అందులోని తప్పులు దిద్ది అసలు కథను అందజేసే ఈ కావ్యాన్ని ప్రతిపురాణమని పేర్కొంటాడు. ప్రతి- అన్న ఉపసర్గ (prefix) చాలా జైనకావ్యాలకు వాడుకున్న ప్రత్యయమని ఇక్కడ గమనించాలి.
విమలసూరి (క్రీ.శ. 1) రామాయణం రాముని వంశవర్ణనతో మొదలుకాకుండా రావణుని గుణకీర్తనతో మొదలౌతుంది. రావణుడు జైన సంప్రదాయానికి చెందిన 63 శలాకపురుషులలో ఒకడు. అతడు ఉత్తమ వంశానికి చెందిన వాడు. బాగా చదువుకున్నవాడు. మహా తపస్సు ద్వారా మంత్రశక్తులను శస్త్రాస్త్రాలను సాధించుకున్నవాడు. జైనగురువుల పట్ల భక్తిభావం కలవాడు. ఒక జైన గురువు ఆజ్ఞ మేరకు ఇష్టపూర్వకంగా తనను ఆమోదించని ఏ స్త్రీని తాకనని ప్రమాణం చేసినవాడు. ఒకసారి యుద్ధంలో రాజును ఓడించినప్పుడు, ఆ రాణి రావణుని మోహించినా కాదని వారించి, ఆ రాణిని తన భర్త దగ్గరికి పొమ్మంటాడు. అయితే, తన మృత్యువు ఒక స్త్రీ ద్వారా కలుగుతుందని విని హతాశుడౌతాడు. అటువంటి రావణుడే సీత అందానికి సమ్మోహితుడై, ఆమెను అపహరించి ఆమె ప్రేమను గెలవడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథనాల్లో, రావణుని వంటి మహాపురుషుడు ఎలా స్త్రీవ్యామోహాన్ని గెలవలేక పతనమౌతాడో చెప్పడం జరుగుతుంది. నిజానికి, ఆధునిక దృక్కోణంతో చూస్తే రావణుడిది విషాద గాధే. జైనులు చెప్పిన కథలు వింటే మనకు రావణుని పట్ల ఆరాధనాభావం, జాలి కలగక మానదు.
మరికొన్ని జైన రామాయణాల్లో, సీత నిజానికి రావణుని కూతురు. ఆ విషయం రావణునికి తెలియదు. కూతురిపై వ్యామోహం కలిగినందువల్లే అతను పతనం చెందడం అన్న అంశం గురించి వచ్చే విభాగంలో చర్చిద్దాం.
మరో జైనకథ ప్రకారం వాసుదేవ, ప్రతివాసుదేవ అన్న నాయక, ప్రతినాయకులు ప్రతి యుగంలో జన్మించి శత్రువులై ఒకరితో ఒకరు పోట్లాడుతుంటారు. లక్ష్మణుడు, రావణులది ఈ జంటల ఎనిమిదో అవతారం. ప్రతియుగంలో ఎన్నో కష్టసుఖాలనుభవించిన తరువాత ఒకరినొకరు ఎదురుపడి యుద్ధం సాగిస్తారు. ప్రతీసారీ వాసుదేవుడు ప్రతివాసుదేవునిపై విజయం సాధిస్తాడు. ఈ కథలో రావణుడు చివరకు లక్ష్మణుడే వాసుదేవుడని గ్రహిస్తాడు. సంధి ప్రయత్నాలు విఫలమైన పిదప జరిగిన మహాయుద్ధంలో ఓడిపోతూ, తుది ప్రయత్నంగా తన అత్యంత శక్తివంతమైన చక్రాన్ని వదులుతాడు. అయితే, ఆ చక్రం లక్ష్మణుని రూపంలో ఉన్న వాసుదేవుని సంహరించక అతడి చేతిలో ఒదిగిపోతుంది. అతడు తిరిగి ఆ చక్రాన్ని వదలడంతో అది రావణుని తల ఖండించడంతో తన ప్రియమైన చక్రం వల్లే తను మరణిస్తాడు.
ఈ కథలో హిందూ రామాయణాల్లో లాగా రాముడు రావణుని సంహరించడు. రాముడు సిద్ధి పొందిన మహా జైన యోగి, విరాగి. జీవహింస చేయడు. ఈ కథలో చివరకు, రాముడు కైవల్యాన్ని అందుకుంటే లక్ష్మణుడు జీవహింస చేసినందుకు నరకానికి వెళ్తాడు.
ఇది కాక, పౌమ చరియలో జైనుల పుణ్యక్షేత్రాల గురించి, జైన గురువుల గురించి, జైన సంబంధమైన గాధల గురించి పిట్టకథలు, ఉపాఖ్యానాలు కనిపిస్తాయి. అయితే, జైనులు హేతువాదులుగా తమను చిత్రీకరించుకుంటారు కాబట్టి, మహిమలు, యజ్ఞయాగాదులు, రక్తతర్పణాలు మొదలైన అంశాలను ఎక్కడా ప్రస్తావించరు. రావణుని పదితలల గురించి కూడా ఓ చిత్రమైన కథ ఉంది. రావణుడు పుట్టినప్పుడు అతని తల్లి అతనికి తొమ్మిది రత్నాల మాల వేస్తుంది. ఆ తొమ్మిది రత్నాలలో అతని ముఖ ప్రతిబింబాలు తొమ్మిది కనిపించడంతో అతడు దశముఖుడయ్యాడు. ఇందులో వానరులు కూడా నిజానికి కోతులు కారు. వారు విద్యాధరులనే జాతి వారు. రావణునికి తాతల ద్వారా బంధువులు కూడాను. వారి పతాకంపై కోతి బొమ్మ ఉంటుంది కాబట్టి వారిని వానరులని అన్నారని వివరణ ఉంటుంది.
మౌఖిక కథనాలు
జానపదుల్లో ప్రచారంలో ఉన్న కథలు అంతా ఒకచోట కాకుండా ముక్కలు, ముక్కలుగా వినిపిస్తాయి. ఉదాహరణకు కన్నడ భాషలో ప్రచారంలో ఉన్న స్త్రీల పాటలలో సీత పుట్టుక, పెళ్ళి, అగ్నిపరీక్ష, ఆవిడ వనవాసం, లవకుశుల పుట్టుక, వారి తండ్రి రామునితో యుద్ధం మొదలైనవి విడివిడి పాటలుగా వినిపిస్తాయి. అయితే, తంబూరి దాసయ్యలు పాడే రామాయణగాథలో మొత్తం రామాయణ కథ కనిపిస్తుంది. ఈ కింది చర్చకు అవసరమైన ఆధారాలు గ్రహించడంలో రామే గౌడ, రాజశేఖర, బసవయ్యలు చేసిన పరిశోధనలకు నేను ఋణపడి ఉన్నాను.
అంటరాని కులానికి చెందిన వారు పాడే ఈ రామాయణగాథ రావణుని (వీరు రవుళ అంటారు) గురించి, అతని రాణి మండోదరి గురించిన ప్రస్తావనతో ప్రారంభమౌతుంది. వీరికి సంతానం లేక బాధ పడుతూ ఉంటారు. సంతానం కోసం రవుళుడు అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ, రక్తాలు కారేంతవరకూ నేలమీద పొర్లుతూ తనను తాను ఎన్నో రకాలుగా బాధలకు గురి చేసుకుంటాడు. అప్పుడు శివుడు జోగి రూపంలో ప్రత్యక్షమౌతాడు. అతడు రవళునికి ఒక మామిడి పండు ఇచ్చి దాన్ని భార్యతో ఎలా పంచుకుంటావని అడుగుతాడు. మామిడి గుజ్జు భార్యకిచ్చి నేను టెంక తింటాను అన్నాడు రవళుడు. అనుమానంతో జోగి అంటాడు “నువ్వు నాకు చెప్పేదొకటి. నీ మనసులో ఉన్నదొకటి. నువ్వు నాకు అబద్ధం చెబితే దాని ఫలం నువ్వే తినవలసి వస్తుంది” అంటాడు. రవళుని కలలో ఒక ప్రపంచం, యథార్థంగా మరో ప్రపంచం అంటాడు కవి ఇక్కడ. మామిడిపండుతో పాటు, పూజాసామాగ్రితో వచ్చిన రవళుని చూసి మండోదరి సంతోషపడుతుంది. శివునికి పూజలు, ప్రార్థనల తరువాత మామిడిపండు తినే సమయంలో రవళునికి దుర్బుద్ధి పుట్టి గుజ్జు మొత్తం తనే తినేసి పిక్క భార్యకిస్తాడు. ఆవిడ తిని పారేసిన తరువాత అది పెరట్లో పెద్ద మామిడిచెట్టయి పెరుగుతుంది. ఇంతలో భార్యకు బదులుగా రవళుడే గర్భం ధరిస్తాడు. ఆ గర్భం ఒక్కరోజులోనే నెలరోజలంత పెద్దదౌతుంది:
“ఒక్క రోజులో ఒక్క నెలాయే, శివుడా,
రెండవనాడే రెండు నెలలాయే
వేవిళ్ళే మొదలాయె, శివుడా!
వేరే మగవాళ్ళకు
నా మోమెట్లా జూపించేది శివుడా!
మూడోనాడు మూడో నెలాయె
నా మోమెట్లా జూపించేది శివుడా!
నాల్గోనాడు నాల్గో నెలాయె
నేనెట్లా భరించేది శివుడా!
అయిదోనాడు అయిదునెలలాయె
ఓ దేవుడా, ఎందుకీ కష్టం శివుడా!
తాళలేనురో, తాళలేనురో శివుడా,
నేనెట్లా బతికేది శివుడా!
ఆరోనాడు ఆరోనెలాయె, తల్లీ
ఏడోనాడు ఏడునెలలాయె
మరునాడేవచ్చె ఎనిమిది శివుడా!
రవళునికిప్పుడు తొమ్మిది నెలలు
నిండు గర్భము నిండుగ పెరిగి
పండంటి పాప పుట్టెను
ముక్కునుండి ఊడి పడ్డది
తుమ్మితే పుట్టిన సీతమ్మ”
కన్నడభాషలో ‘సీతా’ అంటే ‘తుమ్మినాడు’ అని అర్థం. తుమ్ము నుండి పుట్టింది కాబట్టి ఆ పాపకు సీతా అని పేరు పెట్టాడట. ఇది కన్నడ భాషలో జానపదులు సీతా శబ్దానికి ఇచ్చిన జానపదవ్యుత్పత్తి (folk-etymology). (సంస్కృతంలో కూడా ఇటువంటి కథలే కనిపిస్తాయి: సీత అంటే సంస్కృతంలో నాగటి చాలు అని ఒక అర్థం. భూమిని దున్నుతుండగా నాగటిచాలులో దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టారని సంస్కృత భాషలో కనిపించే లోకనిరుక్తి). రవళుడు జ్యోతిష్యుల వద్దకు వెళ్ళి జోగికిచ్చిన మాట తప్పిన విషయాన్ని వారికి వెల్లడిస్తాడు. వారు ఉపద్రవం ముంచిపోక ముందే ఆమెను ఎక్కడైనా వదిలివేయమని సలహా ఇస్తారు. రవళుడు ఆ పాపాయిని వస్త్రాభరణాలతో అలంకరించి ఒక పెట్టెలో ఉంచి జనకుని భూమిలో వదిలివేస్తాడు.
ఈ రకంగా సీత జన్మ వృత్తాంతం చెప్పిన తరువాతే, ఈ కవి రామలక్ష్మణుల పుట్టుక, బాల్యం గురించి క్లుప్తంగా వివరిస్తాడు. ఆ తరువాత సీతా స్వయంవరం, అక్కడ రవళుడు శివధనుస్సు ఎత్తబోయి భంగపాటు పడడం, రాముడు వచ్చి అవలీలగా ధనుస్సు విరిచి సీతను పెళ్ళాడటం వివరంగా ఉంటుంది. ఆ పిదప రవళుడు సీతను ఎత్తుకుపోవడం, రాముడు కోతిమూకతో దండెత్తి రావడం మళ్ళీ క్లుప్తంగా ఉంటుంది. ఆపై కవి మళ్ళీ సీత కష్టాలను విపులంగా వర్ణించడం కనిపిస్తుంది. సీతపై అపవాదు, ఆమెను అడవిలో వదలిరావడం, ఆమె కవలలకు జన్మనివ్వడం, వారు వీరులుగా పెరిగి పెద్దవారవ్వడం, రాముని యాగాశ్వాన్ని కట్టివేసి తండ్రితోనే తలపడటం, చివరకు తల్లిదండ్రులను ఒకటి చెయ్యడం అంతా వివరంగా వర్ణిస్తాడు కవి.
ఈ జానపదగాథలో కథనంలో మార్పులే కాక, ప్రాధాన్యత విషయంలో కూడా తేడాలు గమనించవచ్చు: ఇక్కడ కథ ఎప్పుడు సీత చుట్టూ అల్లుకొని ఉంటుంది. కథకునికి సీతదే ప్రధాన పాత్ర; ఆమె పుట్టుక, ఆమె జనకుని దొరకడం, పెళ్ళి, అపహరణం, తిరిగి అయోధ్యకు మరలి రావడం ఇవన్నీ ఒక్కో విభాగంలో విపులంగా వరించబడి ఉంటాయి. రామ, లక్ష్మణుల పుట్టుక, వనవాసం, యుద్ధం కలిపితే ఎంత పెద్ద విభాగమౌతుందో, సీతను అడవిలో వదిలివేయడం, ఆమె గర్భవతిగా అడవిలో గడపడం, భర్తను తిరిగి కలవడం గురించి వర్ణించే ఒక్కో విభాగం అంత పెద్దదిగా ఉంటుంది. అంతేకాక, రవళునికి సీత విపరీత గర్భం ద్వారా జననమందడం కొన్ని కొత్త కోణాల్ని సూచిస్తుంది: గర్భం గురించి పురుషులలో ఉండే మానసికపరమైన ఈర్ష్య, తండ్రులు కూతుళ్ళపై మోహాన్ని పెంచుకోవడం, ఆ రకమైన తండ్రి మరణానికి కూతురే కారణం కావడం వంటి జటిలమైన మానసిక స్వభావాలు ఇందులో కనిపిస్తాయి. రావణాసురుని కూతురుగా సీతను వర్ణించడం ఇతర రామాయణాలలో కూడా కనిపిస్తుంది: వసుదేవహిండి అన్న జైనరామాయణంలోనూ, తెలుగు, కన్నడ జానపదుల గేయాల్లోనే కాక, ఈ రకమైన కథ ఆగ్నేయాసియాలోని కొన్ని రామాయణాలలో కూడా కనిపిస్తుంది. ఇంతేకాక, కొన్ని రామాయణాలలో కామాంధుడైన రావణుడు, ఒక పుణ్యవతి అయిన స్త్రీని బలాత్కరించగా ఆ స్త్రీ అతని కూతురుగా పుట్టి అతని వినాశనానికి కారకురాలౌతానని ప్రతిన బూని మరణిస్తుంది. ఈ విధంగా వాల్మీకి కథలో కనిపించని కథలు, కథనాలు, స్వభావాలు, లక్షణాలు ఎన్నో మౌఖిక సంప్రదాయంలో కనిపిస్తాయి.