అవీ ఇవీ
కేవలం శాస్త్రీయ సంగీతానికే కట్టుబడి పాటలు కట్టలేదు. మంగళాలూ, భావగీతాలూ, భక్తిగీతాలూ, తత్వాలూ, స్ఫూర్తి గీతాలూ, దేశభక్తి గీతాలూ, ఒకటేవిటి బాలమురళి చేయని పాట లేదు.
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన. ఇవన్నీ అందరికీ తెలియవు. ఎక్కడా విన్నట్టు కూడా గుర్తులేదు. వాటిల్లో మచ్చుక్కి కొన్ని చూద్దాం.
తెలుగు వారి మీదా, విజయవాడ మీదా కొన్ని కృతులు కట్టారు. కాంభోజి రాగంలో కట్టిన ఈ కృతిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వాసులపై ఆయన అభిప్రాయం నిక్కచ్చిగా అనిపించింది.
తెలుగు వెలుగు కిరణాలు మనకూ మన
దేశానికి నవరత్నాభరణాలువెలితిలేని కలిమిలో మెలకువగలిగిన పాలనలో
కలతలేని మనసుతో కలకాలం మెలగాలిఅన్నమునకు ఆంధ్రము – ఆదరణకు అరవము
కన్నతల్లి కన్నడము – మలయానిలము మలయాళముఆరంభమునకు ఆంధ్రము – ఆచరణకు అరవము
కన్నడకు కన్నడము – మరులు కొలుపు మళయాళము
మనమంతా ఒకటైతే మహినే మనమేల గలము
– ఇలా సాగుతుందీ పాట. తెలుగువారికి సంగీతం పట్ల అంత శ్రద్ధా, గౌరవమూ లేదని బాలమురళి పలుమార్లు వాపోయారు. తెలుగువరిని తెలుగువారు గుర్తించరు అని మొన్న కలిసినప్పుడు కూడా అన్నారు. అలాగే బెజవాడ మీద రాసిన పాటకూడా ఆసక్తి కరంగా ఉంది.
వినుమురా విజయ వాణి – కనుమురా కృష్ణ వేణి
ఆలకించు ఆంధ్ర బాల
లాలపించు మధుర వాణివిజయుని జయాలయం
విజయమాత విమల నిలయం
వికచ గాన కళా కవితా
విచక్షణుల శుభాలయం
బాలమురళి చాలా కాలం విజయవాడలో ఉన్నారు. ఆ వూరి మీద మమకారాన్ని అందంగా పాటలో పొదిగేరు. ఇటువంటి పాటలు నాలుగైదు రచించారు. ఇవే కాకుండా దేశభక్తి గీతాలక్కూడా కృతి రూపం కలిగించారు. తోడి రాగం, ఆది తాళంలో కట్టిన పాట ఇలా సాగుతుంది.
తెలుసుకున్నామన్నా స్వాతంత్ర్యమన్నా
తెలిసెనొక గాంధి – కలుగు సుఖ శాంతి
కలిసి మెలిసి మసలు కొనుటే మనకు నీతిసమ్మెల పేర ప్రగతి పధమ్ములను
వమ్ము చేయకురా స్వాతంత్ర్యమన్నాబ్రహ్మరాసిన వ్రాత కెదురు లేదానాడు
పత్రికల వ్రాతల కెదురు లేదీనాడుభూమిని మోయుట మిన్నా
భూమిపై పన్నుల భారము మోయుట కన్నా
ఇండియాకి కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు సైనికుల మీద ఒక పాట కట్టారు. ఇది ఢిల్లీలో మిలటరీ అకాడమీలో చేసిన కచేరీలోని పాటిది. ఆశువుగా కట్టానని చెప్పారు.
నవ హాయన మిది వచ్చెనులే – మా
నవులకు హాయిని ఇచ్చునులేసాయుధ సవ్వడి వాయు మూల విన
నాయె – భయము లేదని మురళి
మ్రోయగా మనదే జయమని
విజయ దుందుభి నినదించే
హిందీ గడ్డమీద, అందునా మిలటరీ సైనికుల మధ్య ఒక తెలుగుపాట ఆశువుగా కట్టి పాడడమే కాదు; దాని అర్థం కూడా వివరించారట. ఇది విని హిందీ వచ్చిన ఒక తెలుగాయన హిందీలోకి తర్జుమా చేస్తే అది హిందీలో పాడారని చెప్పారు.
తనపై ఎందుకో పత్రికల వారికి అంత సుముఖత లేదని చెబుతూ – “చాలా మంది నాపై అనేక కట్టు కధలు అల్లి పత్రికల్లో రాశారు. నిజానిజాలు తెలుసుకోకుండా చెడ్డ ప్రచారం చేశారు. నా సంగీతం మీద కన్నా, నా మీద గాసిప్ రాసేవారు ఎక్కువయ్యారు. వాళ్ళ కోసం ఒక కృతి కట్టాను,” అంటూ గట్టిగా నవ్వేశారు.
నిందలు మోపువారు కావలె
పందులు లేక మన సందులు బాగౌనా?మనము చేయు పాప పంకిలమును
తనివి తీర భుజియించువారు
– అంటూ ఆయన గోడు కృతిలో వెళ్ళబోసుకున్నారు. అయితే ఇది, “నిందక రిరబేకు హంది ఇద్దరే కేరి హేగె శుద్ధియో హాగె” అనే పురందదాసు కీర్తనకు అనువాదమని తెలిసిపోతుంది. అలాగే ఆయన తన కచేరీలలో ఇతర పురందరదాసు కీర్తనలకు తన తెలుగుసేతలు పాడడం శ్రోతలకు అనుభవైకవేద్యమే.
ఇవొక్కటే కాదు. ఆయన కొన్ని భావగీతాలు కూడా రాసారు.
ఒక్క నవ్వే చాలు
చాలదనిపించుటకుఒక్క చూపే చాలు
చాలదనిపించుటకుఒక్క స్పర్శే చాలు
చాలదనిపించుటకుఒక్క నవ్వే చాలు
ఈ బ్రతుకు మనుగడకు
అలాగే ఇంకోటి –
వలపులేలనే – వింత తలపులేలనే
మనసులోన తెలియ రాని
మధుర భావ జాలమాయె
అంటూ పహాడి రాగంలో పాట కట్టారు.
