గాన సూర్యకాంతి: బాలమురళి

బాలమురళి రచనల్లో ముఖ్యంగా కనిపించేది సరళత. త్యాగరాజూ, దీక్షితార్ కృతుల్లోలాగ ఎక్కడా విరివిగా సంగతులుండవు. చాలా సరళంగా పాడుకోవడానికి హాయిగా ఉంటాయి. ఈ కృతి చాలా గమ్మత్తుగా ఉంటుంది.

అయ్యా గురువర్యా
నీ యానతితో పాడుచుంటుమయ్యా

నీ మృదుపల్లవ వచో విలాసము పల్లవిగా
నీ అనుబంధము అనుపల్లవిగా
నీ చరణములే చరణముగా
నీ యాకృతియే మా కృతిగా

ఈ కృతిలో పల్లవీ, అనుపల్లవీ, చరణం పద ప్రయోగాలున్నాయి. పాటకి ఇవే రూపం. ఇవన్నీ కలబోసినవారే గురువన్న అర్థంలో రాసారు. ఈ సుషమ రాగం 20వ మేళకర్త కీరవాణి రాగ జన్యం. సుషమ అంటే మనోజ్ఞమైనదీ, సాటిలేనిదని అర్థం. గురువుని మించిన వారుండరన్న అర్థం ధ్వనించేలా ఈ రాగం పేరు ‘సుషమ’ అని ఎన్నుకున్నారు. బాలమురళికి ఆయన గురువు పారుపల్లి రామకృష్ణయ్యంటే ఎనలేని భక్తి ప్రపత్తులున్నాయి. ఒక్క గురువు గారి మీదే అయిదారు కృతులు స్వరపరిచారు. గురుప్రియ రాగంలో ‘సద్గురు దక్షిణా మూర్తిం నుహిరే చిత్త’ అన్న కృతిని సంస్కృతంలో రచించారు. గురుప్రియ రాగంలో కట్టడం మరో ప్రత్యేకత.

అందరూ అనుసరించే విధానానికి వేరుగా బాలమురళి ముద్ర ఉండడం ప్రయోగాల పట్ల ఆయనకున్న ఆసక్తి తెలుస్తుంది. తోడి రాగంలో లక్ష్మీ దేవి మీద ఒక కృతి భలే గమ్మత్తుగా రాశారు.

మా మానినీ – నీ ధామ గని –
నీ దాసరిని గాదా?

మా మా పాప మద దమనీ –
నీ నిగా నీ గరిమ మరి మరి నీ మ్మా

సరిగాని దారి మారి – గదా
ధరి – నీ నిగ నిగ గని – నీ మగని
సామ నిగమ గరిమ గని – నీ పాద
దరిని – పరి పరీ మురళీ రవళి
నిమ్మని – సదా కోరితినమ్మా

మొత్తం కృతిలో “స రి గ మ ప ద ని” స్వరాల కూడిక కల పదాలనే సాహిత్యంగా మలచి రచించారు. ఒక్క చివరి పాదంలోనే “మురళీ రవళి నిమ్మని సదా కోరితినమ్మ” తప్పించి మిగతా కృతిలో పదాలన్నీ సప్తస్వర పద సమూహమే! ఈ పాట బాల మురళి గొంతులోనే వినాలి. అసలే తోడిరాగం, దానికితోడు ఈ పదాల విరుపులూ. వినడానికి భలేగా ఉంటుందీ పాట.

రాగమాలికలు

కర్ణాటక సంగీతంలో రాగమాలికలకి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా మంది విద్వాంసులు ఈ రాగమాలికలు పాడడానికి ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే వివిధ రాగాలలో వారి గాత్ర ప్రావీణ్యత చూపించే అవకాశం వుంటుంది. సాధారణంగా ఈ రాగమాలికలు ఆది తాళంలోనే స్వరపరచడం కద్దు. వేరే తాళాల్లో ఈ రాగమాలికలు చాలా చాలా తక్కువ. గమనశ్రమ, ఆహిరి భైరవీ, ఆభోగి, మాయామాళవగౌళ, మధ్యమావతీ రాగాలనుపయోగించి కట్టిన గానలోల నీ లీల లెన్న జాలరా మురళీ అన్న వేంకటేశ్వర కృతిని రూపక తాళంలో బాలమురళి కూర్చారు.

హరియే గతి సకల చరా చరములకు అన్న రాగమాలికని బౌళీ, కాంభోజి, శుద్ధ ధన్యాసి, హంసానంది రాగాలతో స్వరపరిచారు. విడిగా సాహిత్యం కన్నా, వినడానికి ఈ పాట చాలా బావుంటుంది. ముఖ్యంగా ప్రతి చరణం తరువాత వచ్చే స్వరకల్పన వినసొంపుగా ఉంటుంది.


రాగమాలిక

కేవలం ‘రంజని’ పేరుతో వచ్చే రాగాలతో రంజని త్రయ రాగమాలిక అని ఒకటుంది. ‘అంబ మామవ’ అన్న ఈ సంస్కృత కృతిలో రంజని, నిరంజని, జనరంజని రాగాలతో పల్లవీ, చరణాలుంటాయి. సాధారణంగా రాగమాలిక పాడేటప్పుడు ప్రతీ రాగానికి ఉండే చివర్లో చిట్టస్వరాలు పాడడమనే ఒక ఆనవాయితీ ఉంది. కొన్ని రాగమాలికలకి చిట్టస్వరాలు ఉండకపోవచ్చు కూడా. ఉంటే మాత్రం ఆ రాగాంతంలోనే పాడుతారు. ఈ పద్ధతికి భిన్నంగా ఈ రాగమాలికలో చిట్టస్వరాలు చరణాలన్నీ ముగిసాక ఒకదాని తరువాతొకటి చేసారు.

అలాగే ఆరభి, బిలహరి రాగాలతో పుష్పాంజలి అన్న రాగతాళమాలిక చేసారు. ఈ రచన సగం సంస్కృతం, సగం తెలుగులో ఉంటుంది. ఇది భరతనాట్యం కోసం చేసిన రాగతాళమాలికలా అనిపిస్తుంది. పల్లవీ చరణమూ ఆరభి రాగంలో, ఆది తాళంలో ఉంటే, చరణం మాత్రం బిలహరి రాగంలో, ఝంప తాళంలో ఉంటుంది. ఎక్కువగా భరతనాట్య ప్రదర్శనల్లో ఇది వినిపిస్తుంది. కచేరీల్లో ఎవరూ పాడటం వినలేదు.


ఠాయరాగమాలిక

బాలమురళి రాగమాలికల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గది ఠాయ రాగమాలిక. ఠాయము అంటే స్వర స్థాయి. రాగానికున్న ఆధార షడ్జమం కాకుండా మరొక స్వరాన్ని ఆధార శ్రుతి చేసుకొని వేరే రాగచ్ఛాయల్ని తీసుకు రావడాన్ని గ్రహభేదం అంటారు. ఉదాహరణకి మాయామాళవగౌళ రాగ స్వరాలని ఆధారంగా చేసుకొని గ్రహ భేదంలో పాడితే రసికప్రియ, సింహేంద్రమధ్యమ రాగాలొస్తాయి. ప్రతీ రాగానికీ కొన్ని జీవ స్వరాలుంటాయి. పాడేటప్పుడు ఆ జీవ స్వరాలు కాకుండా వేరే స్వరాలపై గ్రహభేదం చేసి ఆ స్వరం ఆధారంగా వేరే రాగం పాడచ్చు. ఉదాహరణకి మోహన రాగాన్ని పాడుతూ అందులో ఆధార షడ్జమాన్ని రిషభ స్వరం వద్దకి మార్చి మధ్యమావతిగా పాడచ్చు. ఒక రాగం తీసుకొని గ్రహభేదం చేస్తూ మరొక రాగంలో పాడుతూ ఆ రాగంలో కొన్ని స్వరాలని వదిలేసి వేరొక రాగంలో పాడడాన్ని ఠాయమంటారు. ఈ పద్ధతిలో బాలమురళీ కృష్ణ కళ్యాణి రాగం ఆధారంగా ఠాయ భేద రాగమాలికని రచించారు. ఇందులో కళ్యాణి, శంకరాభరణం, మోహన, హిందోళ, దర్బారీకానడ రాగాలుంటాయి. ఈ ఠాయ రాగమాలిక ప్రత్యేకత ఏమిటంటే దీన్ని మామూలు కృతిలా కాకుండా తిల్లానాలో స్వరపరిచారు. ఇలాంటివి పాడటం బాలమురళి వంటి గాయకులకే చెల్లుతుంది.


గతిభేదప్రియ రాగమాలిక

ఇవి కాకుండా గతి భేద ప్రియ రాగమాలిక కూడా ఆయన కట్టారు. ఇదీ తిల్లానాయే! ఇందులో గురుప్రియ, రసికప్రియ, గాయకప్రియ, సునాదప్రియ, ఖరహరప్రియ రాగాలుంటాయి. ఒక్కో రాగం ఒక్కో గతిలో ఉంటాయి. అంటే గురుప్రియ చతుశ్ర గతిలోనూ, రసికప్రియ త్రిశ్ర గతి లోనూ, గాయకప్రియ మిశ్రగతిలోనూ, సునాదప్రియ సంకీర్ణ గతిలోనూ, ఖరహరప్రియ ఖండ గతిలోనూ ఉంటాయి.

కొత్త రాగాలు

తానే పని చేసినా నవ్యత, సరళతలకి ప్రాముఖ్యత ఇస్తానని చెబుతూ, సంగీత ప్రయోగాలంటే ఆయనకి చిన్నప్పటి నుండీ ఆసక్తినీ బాలమురళి చెప్పారు. తన ఇరవయ్యో ఏట 72 మేళకర్త రాగాల్లోనూ స్వరపరిచాననీ, అది చూసే సంగీత విద్వాంసుడు టి.ఎస్.పార్థసారధి తనని మరింత ప్రోత్సహించారనీ చెప్పారు. ‘జనకరాజ కృతి మంజరి’ అన్న పేరుతో అప్పట్లో పుస్తకం రాసారు. ఇలాంటి ఉత్సాహమే ఎదిగే కొద్దీ పెరిగిందనీ, ఆ తీరులోనే చాలా రాగాల్లో కృతులు స్వరపరిచానన్నీ చెప్పుకొచ్చారు.

కేవలం అందరికీ పరిచయమున్నా, వాడుకలో ఉన్న రాగాలే కాకుండా కొత్త కొత్త రాగాలు కూడా సృష్టించారు. ఆ కోవలోనే మహతి, గణపతి, లవంగి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, మురళి రాగాల రూపకల్పన జరిగింది. ఈ రాగాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ రాగానికయినా అయిదు స్వరాలు తగ్గకుండా ఉండాలని రాగలక్షణ శాస్త్రంలో ఉంది. దీనికి భిన్నంగా పైన చెప్పిన రాగాలన్నీ మూడు లేదా నాలుగు మించి స్వరాలున్న రాగాలు కావు.

మొట్ట మొదటసారి నాలుగు స్వరాలతో ఆశువుగా కట్టిన రాగం మహతి. ఇందులో స గ ప ని స్వరాలే ఉంటాయి. ముందు పాడేటప్పుడు ఆయనా గమనించలేదట. పాట మొత్తం అయ్యాక విన్న వారొకరు, ఇందులో నాలుగే స్వరాలున్నాయీ, ఇది ఏ రాగం అనడిగితే చటుక్కున మహతి అనేసానని ఆయన స్వయంగా చెప్పారు. నాలుగు స్వరాలతో ప్రయోగం త్యాగరాజు కూడా చేసాడు. వివర్ధని (ఆరో. స,రి,మ,ప) నవరస కానడ (ఆరో. స, గ,మ,ప) రాగాల ఆరోహణలో నాలుగు స్వరాలే ఉంటాయి. అవరోహణలో మాత్రం నాలుగు పైగా స్వరాలుంటాయి. త్యాగరాజు ఆరోహణలో నాలుగు స్వరాలు మాత్రమే వాడడం నిజమే అయినా, అవరోహణలో కూడా నాలుగు స్వరాలే వాడిన ఘనత బాలమురళి గారికే సొంతం.

ఈ మహతి రాగంలో కట్టిన కృతి మహనీయ మధుర మూర్తే కృతి సంగీత గురువులపైన రచించినది. ఇది చెన్నైలో ఒక కచేరీలో ఆశువుగా స్వరపరిచినదని చెప్పారు. తానెప్పుడు కచేరీల్లో ఏం పాడాలన్నది ముందుగా అనుకోననీ, ఏం పాడాలనిపిస్తే అది పాడుతాననీ చెప్పారు. ఒక్క జుగల్బందీలకి మాత్రం ఇది మినహాయింపనీ, ఒక్కోసారి ప్రేక్షకుల ఆసక్తీ, ఉత్సాహం బట్టీ కొత్తవి పాడుతాననీ అన్నారు.

ఈ పరంపరలో చేసిన రెండవ స్వీయ రచన ఉమా సుతం గణపతిం అన్న కృతి. ఇది కూడా ఆశువుగా కట్టిన కృతే. ముందు ఈ రాగానికి సర్వశ్రీ అని నామకరణం చేసారు. ఇందులో స, మ, ప మూడు స్వరాలే ఉంటాయి. రాగ లక్షణాలు బట్టి ఒక రాగానికి కనీసం నాలుగు స్వరాలుండాలి. మూడు స్వరాలతో రాగం ఏవిటని కొంతమంది విమర్శించారు. “స్వర లయాదులే రాగానికి శక్తి. ఎన్ని స్వరాలున్నాయన్నది కాదు ప్రధానం,” అని ఆయన సమాధానం. దాన్ని సమర్థించడానికే తర్వాత ఈ రాగం పేరు త్రిశక్తిగా మార్చారు.