శ్రీపాదరాయలు

వృత్తమాలిక

శ్రీపాదరాయలు ప్రవేశ పెట్టిన మరొక కొత్త పంథా వృత్తమాలిక. వృత్తమాలికలోని విశేషమేమంటే మొట్టమొదట వృత్తములా ఒక పద్యము ఉంటుంది, దీనిని రాగయుక్తముగా పాడవచ్చును, కాని దీనికి తాళము ఉండదు. దీని తరువాత ఒక పదము ఉంటుంది, ఈ పదమునకు రాగము, తాళము రెండు ఉంటాయి. ఉదాహరణ కావ్యాలలో కూడ మొదట చంపకమాలలాటి ఒక వృత్తము ఉంటుంది, తరువాత తాళబద్ధమైన కళిక, అందులోని సగమైన ఉత్కళిక రగడ రూపములో ఉంటాయి. పాల్కురికి సోమనాథుని నమశ్శివాయ రగడ బహుశా ఇతనికి పరిచయమేమో? లేక ఆచార్యులు సంస్కృతమునుండి దీనిని గ్రహించి ఉండవచ్చును. ఉదా. ‘సా విరహే తవ దీనా’ పాడుటకు ముందు ‘యమునాతీర’ అనే శ్లోకాన్ని పాడాలి, తరువాతనే ‘నిందతి చందన’ అష్టపదిని పాడాలి. చాల మంది గాయకులు ఈ నియమాన్ని ఉల్లంఘించడము శోచనీయమే. కింద శ్రీపాదరాయలు వ్రాసిన రెండు వృత్తము, పదములను మీకు పరిచయము చేస్తున్నాను . రేగుప్తి రాగములో, ఝంపతాళములో ఉండే ఈ కీర్తనలో ఇలాటివి తొమ్మిది చేరి వృత్తమాలికగా మారింది.

వృత్తము:

వారిజాంబక, వారిజారివదన, వారాశిజావల్లభ
వారివాహనిభాంగ, వాసవనుత, వాకెమ్మదొం దాలిసో
వారిజోద్భవనయ్య, నిన్న విరహవారాశియొళు ముళుగిహ
నారీనిచయవ పారుగాణిసు కృపానావెయలిందెమ్మను

వారిజాంబక, వారిజారివదన, వారాశిజావల్లభ
వారివాహనిభాంగ, వాసవనుత, పలు కొక్క టాలించరా
వారిజోద్భవజనక, నీదు విరహవారాశిలో మునిగిన
నారీతతి నిదె దాట జేయర కృపానౌకలో మమ్మిప్పుడు

పదము:

మారనెంబవను బలు క్రూర నమ్మగలి నీ
ఊరిగ్హోదుదను కేళి
వారిజాస్త్రవను ఎదెగేరిసెమ్మను బిడదె
హోరువను అహోరాత్రియలి తపిసుత

మారు డెందమున దయ లేదు, మము వీడి నీ
వూరు వీడుటను వినెను
వారిజాస్త్రమును ఎద నెక్కుపెట్టెను విడక
పోరాడు నహోరాత్రములు తపించి

శ్లోకము:

పతి సుత పితృ ముఖ్య భ్రాతృ బాంధవరు ఎంబ
అతిశయ నమగిల్ల ఆలిసో మాతనెల్ల
రతిపతిపిత నీనే రాత్రియొళు కొళలనూదె
క్షితిపతి నిన్నెడెగె క్షిప్రదిం బందెవల్లో

పతి తలిదండ్రు లన్న బిడ్డ బంధువులు వీరి
యతిశయ మది లేదు వినవయ్య మాట నిపుడు
రతిపతిపిత నీ వే రాత్రిలో మురళి నూద
క్షితిపతి నీ దరికి వేగమే వచ్చితిమిగా

పదము:

బాలతనదలి యమునాతీరదలి నీ వత్స
పాలనెయ మాడుతిరలు ఆ
కాల మొదలాగి ఈ వ్యాళె పరియంతరవు
కాలుఘళిగగలదిహ కాంతెయర త్యజిసువరె

బాల్యమున నా యమునా తీరమున నీ వాల
పాలించుచుంటివిగదె యా
వేళ మొదలుకొని యీ వేళ వఱ కెప్పు డొక
కాలు గడియ విడువని కాంతలను వదలెదవె

దండకము

తెలుగులో నన్నయ కాలమునుండి దండకాలు ఉన్నాయి. కన్నడములో సుమారు క్రీ. శ. 1200 కాలములో బంధువర్మ అనే కవి హరివంశాభ్యుదయములో వ్రాసిన దండకమే మనకు లభించిన ప్రథమ దండకస్వరూపము. శ్రీపాదరాయలు శ్రీలక్ష్మీనృసింహ ప్రాదుర్భావము అనే దండకమును వ్రాసినాడు. ఇందులో 546 పంక్తులు ఉన్నాయి, రెండువేలకు పైగా గణాలు ఉన్నాయి. చాల పెద్ద దండకాలలో ఇదొక్కటి.

“శ్రీరమా మానినినీ మానసేందివరోత్ఫుల్ల సంఫుల్ల చంద్రా చిదానంద సాంద్రా సదా సన్నుతేంద్రా నమోపేంద్ర నిస్తంద్ర నీ కేళు” అని ప్రారంభమైన యీ దండకము “రంగవిట్ఠల్ల సన్నామియే శ్రీరమాకామియే ప్రేమియే త్వాన్నమస్తే నమస్తే నమస్తే నమః” అని అంతమవుతుంది. నిత్యపూజలో దండకమును కూడ ఒక పూజాస్తోత్రముగా ప్రవేశపెట్టినవాడు శ్రీపాదరాయలు.

భ్రమరగీతము

భాగవతములోని దశమ స్కంధములో భ్రమరగీతము అనే ఒక అధ్యాయము ఉన్నది. దాని ప్రేరణతో శ్రీపాదరాయలు ఒక భ్రమరగీతాన్ని రచించాడు. శ్రీకృష్ణుడు మధురానగరికి వెళ్ళాడు, ఎన్నాళ్ళైనా తిరిగిరాలేదు. ఇక్కడ రేపల్లెలో గోపికలు విచారముగా తిరుగాడుతుండగా, ఒక భ్రమరాన్ని చూచారు. అది శ్రీకృష్ణునికి స్నేహితుడని, అతని దగ్గరనుండి వచ్చిందని భావించి దానితో తమ విరహబాధను తెలియజేసికొంటారు, శ్రీకృష్ణుని సహవాసమువల్ల తుమ్మెదకు కూడా కృష్ణుడిలా మోసగాడి (కితవా) పట్టము తప్పలేదు. ఈ భ్రమరగీతము దేశి రాగములో అటతాళములో వ్రాయబడినది. నాలుగు పంక్తుల పల్లవితో, ఎనిమిది పంక్తుల తొమ్మిది చరణాలతో ఉండే ఈ గీతము చాల నిడివియైనది. ఈ భ్రమరగీతము శృంగార రసముతో నిండి ఉండే తరువాతి కాలపు పదములకు (ఉదా. క్షేత్రయ్య పదములు), జావళీలకు ఒక విధమైన మూస అని చెప్పవచ్చును. అందులోని మూడవ చరణమును మీకు అనువాదముతో సహా క్రింద అందజేస్తున్నాను:

మధుకుంజవనదల్లి మధువైరి కొళల నూదలు
మధుర నిస్వన కేళీ మదిరాక్షియరెల్ల ధా-
మద ధ్యానవ బిట్టు మృగమదగంపవిడి
దైది మదననయ్యన కాణుత శ్రీహరియ
ముదవేరి తలెవాగి మేదిని నిట్టిసలాగ
మృదువాక్యదొళెమ్మప్పి అధరామృతభోజన
క్కొదగువ సతత సన్నద్ధ నమ్మ నగలి క-
ల్లెదెయాదనెంతో కృపాళు హే కితవా

మధుకుంజవనములో మధువైరి మురళి నూదగ
మధుర నిస్వనము విని మదిరాక్షులు తాము స్వగృ-
హపు ధ్యానము వదలి మృగమద మలదికొని
యచట మదనజనకుని చూచుచు శ్రీనాథు
ముదమెక్క తల దించి మేదిని బె ట్టగ నపుడు
మృదువాక్యముల జుట్టుకొని అధరామృతపానము
నందించ నెపుడు సిద్ధుడు మనల వీడి యతి
కఠినాత్ముడయెనో కృపాళు డో వంచక

వేణుగీతము

రాసక్రీడకు ముందుగా శ్రీకృష్ణుని మోహనమురళీస్వరములను విన్న గోపికలు ఎలా సంభ్రమ పడ్డారో, ఎలా చిత్తభ్రమ చెందారో అనే విషయాన్ని ఒక వేణుగీతలో ఎంత మనోరంజకముగా వర్ణిస్తాడో శ్రీపాదరాయలు!

తందెయ కందనెందు కొంకుళొలిట్టు కందన కెళగిట్టు
అందిగె గెజ్జె కివిగళిగిట్టు ముత్తిన బట్టు
హొందిసి గల్లదల్లి తానిట్టు కస్తూరియ బట్టు
ముందాగి మూగిన మేలళవట్టు మనె బాగిల బిట్టు
కందర్పన శరదింద నొందు బహు
కంది కుందుతలిందువదనెయరు
ఇందిరేశ నానందగానకె
చంద్రముఖియరొందాగుత బరుతిరె

తండ్రిని తనయుడనుచు నెత్తుకొనిరపుడు, పాపను ధర దించి,
అందెల గజ్జె చెవులకు పెట్టి, ముత్యపు బొట్టు
సొంపుగ చెక్కిళ్ళ బెట్టేరు, కస్తూరి బొట్టు
ముందుగా ముక్కున పెట్టుకొనేరు, గృహ ద్వారము విడిచి
కందర్పుని శరముచే బాధపడి
వాడి కుందుచు నిందువదన లా
యిందిరేశు నానందరవళికి
చంద్రముఖులు గుంపులుగా వచ్చిరి