కోనసీమ కథలు: సత్తెవతి

లేచి మొహం కడుక్కుని నాలుగవుతూండగా సుబ్బారావుని కలవడానికి వీధి వైపు వచ్చాను.

నా అదృష్టం బావుండీ సుబ్బారావే కొత్త కృతి చెబుతున్నాడులా వుంది, పాడి వినిపిస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళకుండా వీధరుగు దగ్గరే చతికిల బడ్డాను. సీతాలు పాడే విధానం చూసి అక్కడే కూర్చుని వింటున్న సత్తెవతి కొడుకు తెగ నవ్వుతున్నాడు.

సూరమ్మ అది చూసి -“నీకిక్కడ పనేంటిరా? దొడ్లోకెళ్ళి మొక్కలకి నీళ్ళెట్టు. నువ్వేం పట్టించుకోకమ్మా! అలగా జనానికి సంగీతం ఏం తెలుస్తుంది చెప్పు? వెధవని ఈ సారి ఇక్కడకి రానీ చెప్తాను,” అంటూ కూతురికి చెప్పడం స్పష్టంగా వినిపించింది నాకు. సత్తెవతి కొడుకు స్కూలయ్యాక ఆ మండువాలోగిల్లోనే ఓ మూల కూర్చొని హోం వర్కు చేసుకుంటాడు. మధ్యలో సూరమ్మ పురమాయించిన చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు.

పాఠం ముగించే నన్ను చూసి బయటకు వస్తూండగా సూరమ్మ తగులుకుంది. రేపే వైజాగు వాళ్ళకి ఉత్తరం రాస్తాననీ, పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తాననీ మాటిచ్చి అక్కడనుండి తప్పించుకున్నాను. సుబ్బారావునీ ఒకటికి పదిసార్లు ఆ కుటుంబం వివరాలడిగింది సూరమ్మ.

సుబ్బారావు దగ్గర వైజాగు వాళ్ళ అడ్రసు తీసుకొని నా స్నేహితుడికి సూరమ్మ సంబంధం గురించి ఆ రాత్రే ఉత్తరం రాసాను.

ఓ రెండు వారాల తరువాత వైజాగు సంబంధం వాళ్ళు పెళ్ళి చూపులకొస్తామని కబురంపారు. పెళ్ళిచూపులనగానే రెచ్చిపోయి మరీ సంగీతం ప్రాక్టీసు చెయ్యడం మొదలు పెట్టింది సీతాలు. నాకు తెలిసి నా వైజాగు మిత్రుడింట్లో సినిమా పాటలు కూడా వినరు. అలాంటిది శాస్త్రీయ సంగీతం అంటే ఏమంటారోనని భయపడి చచ్చాను. వాళ్ళకెలా నచ్చచెప్పాలని నానా హైరానా పడ్డాను. ఇహ రేపే పెళ్ళివారొస్తారనగా దేవుడు నా నెత్తి మీద పాలు పోశాడు. సీతాలుకి జలుబు చేసి గొంతు పోయింది. అదే ఆమె పాలిట వరమయ్యింది. పెళ్ళి కొడుకు నచ్చిందన్నాడు. అంతే! క్షణాల్లో తాంబూలాలూ, పెళ్ళి ముహూర్తాలూ పెట్టేసుకున్నారు. కట్నాల మాటలూ అవీ సూరమ్మే మాట్లాడింది కానీ, విశ్వనాథం నోరిప్పితే ఒట్టు. మొత్తానికెలాగయితేనే సీతాలు మా ఆరు వాటల వాళ్ళనీ దయతో కరుణించి అత్తారింటికి వెళ్ళడానికి సమాయత్తపడింది. సంగీతాన్ని ఎంతగానో మిస్సవుతాననీ తన ముందు భోరున ఏడ్చిందని సుబ్బారావు చెప్పాడు. ఇన్నాళ్ళూ సీతాలు సంగీతం విని మేమూ అదే చేసే వాళ్ళం.

సూరమ్మ గారింట్లో సంగీతం మానేయడం సుబ్బారావుకీ బాధ కలిగింది. ఆరేళ్ళుగా చెబుతున్నానురా, అలవాటయిపోయిందని నా దగ్గర కాస్త బాధ పడ్డాడు. నిజం చెప్పద్దూ, నాకయితే వాణ్ణి చూసి జాలేసింది. తినగ తినగ వేము వరస తయారయ్యాడని అనుకున్నాను.

సీతాలుకి పెళ్ళయి కాపురానికి వెళిపోయింది. మా ఆరువాటాల వాళ్ళకీ కర్ఫ్యూ సడలింపు వచ్చినంత ఆనందం వేసింది.

అది క్షణ భంగురమని తెలవడానికట్టే కాలం పట్టలేదు. శ్రావణమాసమనీ, నోములనీ, బెంగనీ, పండగలనీ మొదటి ఆర్నెల్లూ పుట్టింట్లోనే ఉండిపోయింది. సీతాలు మొగుడుకీ ఇల్లరికం కాకపోయినా రమారమి అదే తీరులో ఇక్కడ తిష్ట వేసేవాడు. మామా అల్లుళ్ళకి బాగానే కుదిరింది. ఆదివారం నలుగు కార్యక్రమంలో అల్లుడూ వచ్చి చేరాడు. ఇదంతా సూరమ్మ చూసి చూడనట్లు వ్యవహరించేది. మరీ చికాకు వస్తే సత్తెవతి మీద గయ్యిమని లేచేది.

సీతాలు పుట్టింటి పంచనే వుండడంతో సుబ్బారావుకి మరలా సంగీతం క్లాసులు మొదలయ్యాయి. సుబ్బారావూ సంతోషించాడు, నాలుగు డబ్బులొస్తాయని ఆనంద పడ్డాడనుకున్నాను.

ఓ సారి సీతాలు బంగారు వంకీలు పోయాయని మా లోగిల్లో పెద్ద కలకలం రేగింది. చివరికి అది కాస్తా సత్తెవతి మీద పడింది. ఇదే అదననుకొని సూరమ్మ సత్తెవతింట్లో సోదా చేయించి సత్తెవతే దొంగిలించిందనీ నేరం మోపి పనిలో నుండి మానిపించేసింది. పన్నెండేళ్ళుగా మా ఆరువాటాల వాళ్ళకీ సత్తెవతొక్కతే పనిమనిషి. ఎప్పుడూ చెంచా కూడా పోవడం ఎరగరెవరూ. అలాంటిది బంగారం దొంగిలించిందంటే నమ్మ బుద్ధి కాలేదు. సత్తెవతి తనకే పాపం తెలీదని లబో దిబో మంది. సత్తెవతింట్లోనే దొరికాయని చెబుతూ సూరమ్మ సత్తెవతిని నానా మాటలూ అంది. అసలు విషయం వేరేనని అందరికీ తెలుసు. మేమవరమూ కూడా సత్తెవతిని పనికి పెట్టుకోకూడదనీ, కాదని చేస్తే ఇల్లు ఖాళీ చెయ్యమని మా అందరికీ తెగేసి చెప్పడంతో మేమెవరమూ నోరెత్త లేదు. వేరే పనిమనిషిని చూసుకున్నారందరూ!


నెల తిరక్కుండా ఓ రోజున మధ్యాన్నం భోజనం చేసి కునుకు తీద్దామని మేడమీద కెళ్ళిన విశ్వనాథం ఇహ కిందకి దిగలేదు. నిద్రలోనే గుండాగి పోయాడని డాక్టర్లు చెప్పారు. ఏనాడు పల్లెత్తు ముక్కనలేదనీ, ఎంతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపాడనీ సూరమ్మ భోరుమంటూ ఏడ్చింది.

విశ్వనాథం పోయినప్పుడు అందరూ వచ్చారు కానీ, సత్తెవతి రాలేదు. వస్తుందని నేనూ, సుబ్బారావూ అనుకున్నాం. అవమానం అభిమానం కంటే కర్కశమైంది. దానికి బంధుత్వాలూ, స్నేహాలూ అన్న దయా దాక్షిణ్యాలుండవు.

విశ్వనాథం పోయి పదో రోజు రాకముందే సత్తెవతి మొగుడు మిలటరీ యాక్సిడెంటులో పోయాడని మా ఆవిడ వార్త మోసుకొచ్చింది. వుండి పట్టించుకోని వాడు వుంటేనే, పోతేనే? నాకు తెలిసీ ఈ కూచిమంచి అగ్రహారంలో ఎవరూ సత్తెవతి మొగుణ్ణి చూళ్ళేదు. అసలు సత్తెవతి కొడుకయినా చూసాడాని అందరి అనుమానమూ!

సత్తెవతి మొగుణ్ణి చూడకపోయినా పోయాడని తెలిసి బాధ కలిగింది. ముఖ్యంగా సత్తెవతి నుదుట రూపాయి కాసంత బొట్టు గుర్తొచ్చి మరింత బాధ కలిగింది.

ఓ ఆర్నెల్ల తరువాత ఇంకో కొత్త విషయం తెలిసింది. సత్తెవతి కొడుకు పదో తరగతి ఫస్టు క్లాసులో పాసయ్యాడనీ, వాడికి కాకినాడ పోలిటెక్నిక్ కాలేజీలో సీటొచ్చి సత్తెవతి కాకినాడ మకాం మారుస్తోందనీ సుబ్బారావు చెప్పాడు. ఈ మధ్యకాలంలో మాకెవరికీ సత్తెవతెప్పుడూ తారసపడలేదు. సత్తెవతి కొడుకుని సూరమ్మింట్లో చూడ్డమే! నేనంటే వాడికెందుకో భయం. ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు.

ఓ సారి వేరే పనిమీద అంబాజీపేట వెళ్ళాల్సొచ్చింది. నా తోటి లెక్చరరు స్కూటరు అరువు తీసుకొని వెళ్ళాను. వెళుతూ వెళుతూ తోడుగా సుబ్బారావునీ తీసుకెళ్ళాను. పని ముగించుకొని తిరిగొస్తూండగా బస్టాండు దగ్గరకొచ్చే సరికి కమలేశ్వర టాకీసు దారిన వెళదామని సుబ్బారావన్నాడు. ఆ రోడ్డు గతుకుల రోడ్డు. నా కంత ఇష్టం లేదు. నన్ను బలవంతం చెయ్యడంతో సరేనన్నాను. కమలేశ్వరా టాకీసు వెనకాలనుండి నారాయణపేట మీదుగా కూచిమంచి అగ్రహారానికి వేరే దారుంది. తీరా నారాయణ పేటొచ్చాక, వేరే దారిన పోనివ్వమన్నాడు. నాకా దారే తెలీదు. అక్కడన్నీ గుడిసెలూ, పాకలూ ఉన్నాయి. అటుగా నేనెప్పుడూ వెళ్ళలేదు కూడా.