కిరానా సంప్రదాయపు భీమబలుడు

భీమ్‌సేన్‌జోషీ సంగీతం గురించి నాకు చిన్నప్పుడే తెలుసు. 1960 ప్రాంతాలనుంచీ మా ఇంటికి రేడియో ప్రోగ్రాముల తెలుగు పక్షపత్రిక వాణి తెప్పించుకునేవాళ్ళం. (ఆ తరవాత అన్ని స్టేషన్ల వివరాలూ చూసేందుకని ఇంగ్లీష్ వారపత్రిక ఆకాశ్‌వాణీ తెప్పించుకున్నాం). ఆ రోజుల్లో ఏటా నవంబర్లో జరిగే రేడియో సంగీత సమ్మేళనంలో ప్రతిరాత్రీ తొమ్మిదిన్నరనుంచీ, ఆదివారాలు ఉదయమూ, రాత్రిళ్ళూ కూడా పేరుమోసిన సంగీతకారుల కచేరీలు ప్రసారం అయేవి. ఆ వివరాలన్నీ రేడియో పత్రికలో ముందుగానే ఫోటోలతోసహా అచ్చయేవి. అప్పట్లో బడే గులాంఅలీఖాన్, హీరాబాయి బడోదేకర్, అమీర్‌ఖాన్ మొదలైన ప్రసిద్ధులవి పెద్ద ఫోటోలు కాగా, భీమ్‌సేన్‌జోషీ వంటి ‘ప్రాంతీయ’ గాయకులవి చిన్నవిగా ఉండేవి. అటువంటివారి సంగీతానికి అప్పట్లో అభిమానులూ తక్కువేననిపించేది. 1957లో ఆయన పాడిన ముల్తానీ వింటే అప్పటి తీరు మనకు తెలుస్తుంది. ఆ కచేరీ వివరాలుకూడా ఈ లింకులో చదవవచ్చు. ఆయన పాటలోని వేగమూ, గమకాల (ఫిరత్) నిర్దుష్టతా, హిందూస్తానీ గాత్రశైలిలో సామాన్యంగా వినబడే సాధనకు (తయ్యారీ) అద్దంపడతాయి.

అయితే 1971లో నేను బొంబాయి జీవితం మొదలుపెట్టేనాటికి భీమ్‌సేన్‌జోషీ అక్కడ గొప్ప ప్రజాదరణ సంపాదించుకున్నట్టుగా తెలుసుకున్నాను. కొద్దిరోజుల తరవాత ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ నేను హాజరైన శంకర్‌లాల్ సంగీతసమావేశానికి భీమ్‌సేన్‌జోషీ కారణాంతరాలవల్ల రాలేకపోయాడనే వార్త విని, వచ్చిన వందలాది ప్రేక్షకులు హతాశులవడం గమనించాను. ఆయనకు దేశమంతటా ఎందరో అభిమానులున్నారనేది స్పష్టంగా తెలిసింది.

ఆ రోజుల్లో ఆయన పాడుతున్నప్పుడు చేసే చేష్టలు కాస్త విచిత్రంగా ఉండేవి. గమకాల విన్యాసాలను అనుసరిస్తూ రెండు చేతులూ బారచాపి, ఒక పెద్ద చక్రాన్ని గుండ్రంగా తిప్పుతున్నట్టూ, రెండు దారాల కొసలను రకరకాల పద్ధతుల్లో ముడివేసి, మెలిపెట్టి వాటిని విప్పుతున్నట్టూ ఎన్నెన్నో అభినయాలు చేసేవాడు. దీని గురించి 1972లో బాలమురళీకృష్ణ ఒకసారి ‘నరసింహావతారం’ అని చమత్కరించాడుకూడా! అయితే రాగ ప్రస్తారంలో నిమగ్నుడై పాడుతున్న భీమ్‌సేన్‌జోషీ మేటిగాయకుడు కనక ఎవరూ పెద్దగా ఈ పోకడలను విమర్శించేవారు కారు. ఇవన్నీ క్రమంగా తగ్గిపోయాయి.

భీమ్‌సేన్‌జోషీ పాడిన కచేరీలు నేను బొంబాయిలో డజన్లసార్లు విన్నాను. ఆయనకు కొంతకాలం తాగుడు వ్యసనం బాగా ఉండేది. ఒక కచేరీ మధ్యలో ఆయన పాడటం ఆపేసి, తమ సంప్రదాయం గురించిన ఉపన్యాసం మొదలుపెట్టాడు. పరిస్థితిని అర్థంచేసుకున్న ప్రేక్షకులు కొంత చనువుగా నవ్వుతూ అదంతా భరించారు. అయితే ఆయన గాత్రంలో మటుకు ఎటువంటి తొట్రుపాటూ తలెత్తలేదు. జలంధర్ ప్రాంతంలో జరిగిన మరొక కచేరీలో ఈ సమస్య ఒక పెద్ద రభసకు దారి తీసింది.

తరవాతి కాలంలో భీమ్‌సేన్‌జోషీ పాటకచేరీ చేసే పద్ధతి చాలా బావుండేది. ఆయనకు ప్రేక్షకులున్నారన్న సంగతి తెలుస్తోందా అని అనుమానం కూడా కలిగేది. తన ఆనందం కోసమూ, హార్మోనియం, తబలా కళాకారుల సాంగత్యం కోసమూ మటుకే పాడుతున్నాడా అనిపించేది. ఏనాడైనా ఆయనకు అభిమానుల్లో అన్ని వయసులవాళ్ళూ కనబడేవారు. హిందూస్తానీ ప్రేక్షకులు తమకు అభిమానపాత్రులైన కళాకారుల కచేరీలకు ఉత్సాహంతో వచ్చి, మనస్ఫూర్తిగా ప్రోత్సాహాన్నిస్తారు.

భీమ్‌సేన్‌జోషీకి సంగీతం గురించి చాలా వాస్తవికదృక్పథం ఉండేదని తెలుస్తుంది. బడే గులాంఅలీఖాన్‌ లాగా పాడబోయి తామంతా గొంతు చించుకున్నంత పని చేశామని ఒక సందర్భంలో ఆయన అన్నాడు. తన వంటివారు సామాన్యుల కోసం పాడితే ఉస్తాద్ అమీర్‌ఖాన్‌ వంటివారు సంగీతజ్ఞుల కోసం పాడతారని ఆయన అనేవాడు. అమీర్‌ఖాన్ చనిపోయాక చేసిన ఒక కచేరీలో మార్‌వా రాగంలోని ఆయన స్వీయరచన ఒకటి భీమ్‌సేన్‌జోషీ పాడి వినిపించాడు. అమీర్‌ఖాన్ స్వయంగా పాడిన ద్రుత్ ఖయాల్ రాజన్ పరీకర్ మార్వా రాగంపై రాసిన వ్యాసంలో ఇచ్చిన లింకులో చివరి రెండు నిమిషాలపాటు వినవచ్చు. భీమ్‌సేన్‌జోషీ దాన్ని పాడిన తీరు ఇది. ‘నాకు కరీమ్‌ఖాన్‌గారి కచేరీ వినే అవకాశం కలగలేదుగాని నేను శుద్ధకల్యాణ్ రాగం పాడుతున్నప్పుడు ఆయనే నన్ను ఆవేశించినట్టుగా అనిపిస్తుంది’ అన్నాడు భీమ్‌సేన్‌జోషీ.

భీమ్‌సేన్‌జోషీ గాత్రంలో తాను విని, అవగాహన చేసుకున్న విభిన్న గాయకశైలుల ప్రభావం శ్రోతలు గమనించవచ్చు. ఆ తత్వగ్రాహ్యత కారణంగా గ్వాలియర్ ఘరానాలోని బోల్‌తాన్ (సాహిత్యంలోని పదాలను రకరకాల గమకాల విన్యాసాలతో పాడే) పోకడలూ, ఆగ్రా ఘరానాలోని లయబద్ధమైన సంగతులూ, జైపూర్ పద్ధతిలో గొంతు విప్పి పాడే విధానమూ, కిరానా సంప్రదాయంతో కలిసి మనను అలరిస్తాయి.

భీమ్‌సేన్‌జోషీ వంటి ఉద్దండుణ్ణి సినిమారంగం గుర్తించకపోలేదు. 1956లోనే శంకర్-జైకిషన్ సంగీత దర్శకత్వంలో బసంత్‌బహార్ అనే సినిమాలో మన్నాడే భీమ్‌సేన్‌జోషీతో ఒక యుగళగీతం పాడాడు. ఇందులో భీమ్‌సేన్‌జోషీ బసంత్‌ రాగం పాడగా మన్నాడే బసంత్‌బహార్ రాగాన్ని పాడతాడు. భీమ్‌సేన్‌జోషీ చనిపోయాక మన్నాడే ఆ రికార్డింగ్ గురించి చెపుతూ ఆయనొక మహావిద్వాంసుడని గుర్తుచేసుకున్నాడు. అది సినిమా కథే అయినప్పటికీ తాను ఒక గొప్ప గాయకుణ్ణి పాటలో ఓడించడమేమిటని మన్నాడే తన అయిష్టతను వ్యక్తం చేశాడట. శంకర్-జైకిషన్ మటుకు కథలోని సందర్భాన్ని వివరించి పట్టుదలగా మన్నాడేను ఒప్పించారట. భీమ్‌సేన్‌జోషీ కూడా నెమ్మదిగా మన్నాడేను ప్రోత్సహిస్తూ నిజంగా తాను ఓటమి పాలయే సమస్య ఏమీ ఉండదని నచ్చజెప్పాడట. రికార్డింగ్ జరుగుతున్న సమయంలోకూడా భీమ్‌సేన్‌జోషీ దాన్ని గురించి ఏమీ పట్టించుకోకుండా రాగంలో లీనమై పాడాడని మన్నాడే ప్రశంసించాడు. సినీమాయలోకంలో ఒక్కొక్కప్పుడు భీమ్‌సేన్‌జోషీని మన్నాడే ఓడిస్తే, ఒక హాస్యగీతంలో కిశోర్‌కుమార్ మన్నాడేను ఓడిస్తాడు.

ప్రపంచవ్యాప్తంగా కీర్తి వచ్చినప్పటికీ తన రాష్ట్రంలో తనకు తగినంత పేరు రాలేదని భీమ్‌సేన్‌జోషీ బాధపడేవాడట. అందుకే బాలమురళీకృష్ణ చెన్నైలో స్థిరపడినట్టుగా ఆయన పుణేలో ఉండిపోయాడు. తన గురువు సవాయీగంధర్వ వర్ధంతి సందర్భంగా 1953లో పుణేలో భీమ్‌సేన్‌జోషీ మొదలుపెట్టిన సంగీతోత్సవం చిన్నస్థాయిలో ప్రారంభమై, ఈనాడు మనదేశంలోని అతిముఖ్యమైన సంగీతసమావేశాల్లో ఒకటిగా పేరు పొందింది. దీని కారణంగా అనేక ప్రముఖ సంగీతజ్ఞులతో భీమ్‌సేన్‌జోషీకి ఉండిన పరిచయాలు ఎంతగానో బలపడుతూ వచ్చాయి. పెద్ద పండగవంటి వాతావరణంలో డిసెంబర్ మొదటివారంలో పుణే నగరంలో జరిగే ఈ సంగీతకచేరీలు విని, ఆనందించడానికి, బొంబాయినుంచీ, ఇతర ప్రాంతాలనుంచీ శ్రోతలు వస్తూ ఉంటారు. మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవం మొదటి రెండు సాయంత్రాలూ 8 ప్రాంతాల మొదలై, రాత్రంతా కొనసాగి, ఉదయం 6 ప్రాంతాల ముగుస్తుంది. చివరిరోజు మాత్రం ఇది మధ్యాహ్నం 11 దాటాక పూర్తవుతుంది. 2002లో రిటైరయేదాకా చివరి కళాకారుడు భీమ్‌సేన్‌జోషీయే. ఆ తరవాత సవాయీగంధర్వ పాడిన బిన్‌దేఖే వంటి సింధుభైరవి రికార్డు వినిపిస్తారు (మ్యూజిక్ ఇండియా ఆన్లైన్ సైట్‌లో వినవచ్చు.) హాజరైన అయిదారు వేలమందీ, జాతీయగీతంలా లేచి నిలబడి ఆ పాటను వింటారు. ఎంతటి చలినైనా లెక్క చెయ్యకుండా టెంట్‌లాంటి ఆచ్ఛాదన మాత్రమే ఉన్న ఆ సంగీతసమావేశానికి వచ్చే వేలాదిమందిని చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది.

దేశంలో ఎక్కడైనా సరే, భీమ్‌సేన్‌జోషీ కచేరీ లేని సంగీతోత్సవం అంటూ ఉండేదికాదు. త్వరలోనే భీమ్‌సేన్‌జోషీ అభిమానులు అన్ని ప్రాంతాల్లోనూ కనబడసాగారు. వయసు పెరుగుతున్నకొద్దీ ఆయనకు మనదేశపు అగ్రగాయకులలో ఒకడుగా పేరు రాసాగింది. అరుదుగా ఆయన కొన్ని జుగల్‌బందీ కచేరీలు కూడా చేశాడు. బాలమురళితో ఆయన పాడిన కచేరీకి బాగా పేరొచ్చింది. వారిద్దరూ కలిసి పాడిన భైరవ్, మాయా మాళవగౌళ రాగాల్లోని ఈ గీతం ఎక్కువమంది విని ఉండక పోవచ్చు.

ఇదికాక, తనకన్నా 44 ఏళ్ళు చిన్నవాడైన రషీద్‌ఖాన్‌తో కలిసి పాడిన శంకరా మొదలైన రాగాలు వింటే ఆయనకున్న పరిపక్వత అర్థమవుతుంది. అవి పాడుతున్నప్పుడు తానెంతగా భయపడ్డాడో రషీద్ వివరిస్తూ, అబ్దుల్ కరీంఖాన్‌కు చెందిన తంబూరాను భీమ్‌సేన్‌జోషీ స్వయంగా శ్రుతిచేసి ఉపయోగించడానికి తనకిచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. తనకు జుగల్‌బందీ పాడుతున్న భావన కలగలేదనీ, కేవలం పెద్దాయన అన్న స్వరాలను తిరిగి పాడినట్టే అనిపించిందనీ రషీద్‌ఖాన్‌ అన్నాడు.

ప్రఖ్యాత తబలా కళాకారుడు జకీర్‌హుసేన్ భీమ్‌సేన్‌జోషీ కచేరీల గురించి చెపుతూ ఆయన తాదాత్మ్యం చెందుతూ పాడిన విధానం అద్భుతంగా ఉండేదని అన్నాడు.
భీమ్‌సేన్‌జోషీ లతా మంగేశ్కర్‌తోకూడా కలిసి కొన్ని భక్తి గీతాలు పాడాడు. ఆయనతో తనది చిరకాల పరిచయమేనని చెపుతూ లతా బసంత్‌బహార్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు తానుకూడా విని, ఆనందించానని చెప్పింది. ఒక సందర్భంలో చాలా ఏళ్ళక్రితం తాను పాటలు పాడటానికి కలకత్తా వెళ్ళినప్పుడు ఉదయం 4 గంటలకే ఎవరో తలుపు తడితే తాను కంగారుపడ్డాననీ, తీరా చూస్తే ఆ వచ్చినది భీమ్‌సేన్‌జోషీ అనీ ఆమె చెప్పింది. తీరా లోపలికొచ్చాక ఆయన తనకు ఆమె తండ్రి దీనానాథ్ మంగేశ్కర్ గాత్రమంటే చాలా ఇష్టమనీ, స్వయంగా విన్నాననీ ఆమెతో అన్నాడట. ఆ రోజు తన కచేరీలో ఆయన దీనానాథ్ నాటకంలో పాడిన ఒక గీతాన్ని పాడాడట కూడా. మరాఠీ నాటకసంగీతంలో శాస్త్రీయసంగీతం పాలు చాలా ఎక్కువ. పైగా వారికి తమ సాంస్కృతిక వారసత్వం అంటే వల్లమాలిన అభిమానం. ఇటువంటిది మనవాళ్ళలో కనబడదు. ఉదాహరణకు ఏ రఘురామయ్య పాటనో బాలమురళీకృష్ణ తన కచేరీలో పాడడం ఊహించుకోలేము!


భీమ్‌సేన్‌జోషీ, జస్రాజ్

ప్రసిద్ధ గాయకుడైన జస్రాజ్ భీమ్‌సేన్‌జోషీతో 1942నుంచీ తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ, తనతో 1966లోనే భీమ్‌సేన్‌జోషీ తన తరవాతి గాయకుల సంగతి చెపుతూ, ‘నువ్వు నా వెనకాలే వస్తున్నట్టనిపిస్తుంది’ అని తనను ప్రశంసించడం తనకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని చెప్పాడు. భీమ్‌సేన్‌జోషీ ఎక్కువ రాగాలు పాడకపోయినప్పటికీ, ఒక్క శాస్త్రీయసంగీతమే కాక మరాఠీ అభంగ్‌లు (భజనలు) అద్భుతంగా పాడగలిగేవాడనీ, అదొక బహుముఖప్రజ్ఞ అనీ జస్రాజ్ అన్నాడు. తాన్‌సేన్‌కు అక్బర్ ఆదరాభిమానాలున్నట్టే భీమ్‌సేన్‌జోషీకి కోట్లాది అభిమానుల అండదండలున్నాయని జస్రాజ్ అభిప్రాయం.

ప్రసిద్ధ నాటకప్రయోక్త గిరీశ్ కర్నాడ్ చెప్పినట్టుగా భీమ్‌సేన్‌జోషీ పాడుతున్నప్పుడు ఆయన శరీరమంతా గానంలో పాల్గొంటున్నట్టనిపిస్తుంది. ఆయన గాత్రానికి భీమబలం ఉన్నట్టనిపించడానికి కారణం అదే. ఆయన మరాఠీలోనూ, కన్నడంలోనూ పాడిన భక్తిగీతాలకు ఆశేషప్రజాదరణ లభించింది. మాల్కౌఁస్ రాగం మీద వ్రాసిన వ్యాసంలో రాజన్ పరీకర్ ప్రస్తావించిన తుకారామ్ భజన అందుకొక ఉదాహరణ.
ఆయన వారసత్వాన్ని కొడుకు శ్రీనివాస్, శిష్యుడు శ్రీకాంత్ దేశ్‌పాండే తదితరులు కొనసాగిస్తున్నారు. అనవసరమైన భేషజాలేమీ లేకుండా, నిజాయితీగా శుద్ధశాస్త్రీయ సంగీతాన్ని అనేక దశాబ్దాలు పాడి, ఎందరో అభిమానులను తయారుచేసుకున్న భీమ్‌సేన్‌జోషీ సంగీతం రికార్డింగ్‌ల ద్వారా విని మనం ఎన్నేళ్ళైనా ఆనందించవచ్చు. ఈ పరిచయవ్యాసం అందుకు దోహదపడే చిన్న ప్రయత్నం మాత్రమే.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి:

కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు.

 ...