తిక్కన భారతంలో పలుకులపొందు

10.3. ఇంకొక సన్నివేశం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం, (225-268). అభిమన్యుణ్ణి అందరూ కలిసి చంపుతారు. ఆ సంగతి అర్జునుడికి తెలియదు, కృష్ణుడికి తెలుసు.

(225) వచనం: అట్లు మర్దించి మగుడనప్పుడు మాధవునాలోకించి…. సంశప్తకులను జంపి కృష్ణార్జునులు తిరిగి వస్తున్నారు. దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి. ‘నా మనస్సు వికలంగా ఉం’దని అర్జునుడు అంటాడు. (226).

(227) వచనం: అభిమన్యుడు ఎదురు రాలేదు. ఎవరూ మాట్లాడరు….

అలరుమొగముతోడ నభిమన్యుఁడే లొకో
యెదురురాఁడు నాకునెట్టివార్త
చెవులు సోఁకునొక్కొ చేవెట్టి కలఁచిన
భంగిఁ ద్రిప్పికొనఁదొడంగె మనము…. (230)

కృష్ణుడు జవాబు చెప్పడు. ధర్మసుతువిడి దలకరిగెను మోము వెల్లఁదనమునఁగదురన్…. (231)

(232) వచనం: ధర్మరాజు, ఇతరులు ఉన్నచోటికి వెళ్ళి అభిమన్యుడు లేడేమని ప్రశ్నిస్తాడు. జవాబు లేదు. వారి మౌనం వల్ల అభిమన్యుడు యుద్ధంలో హతుడయ్యాడని అర్థం చేసుకొంటాడు. అభిమన్యుని తలచుకొని అర్జునుడు దుఃఖిస్తాడు (233-240).

(241) వచనం: ‘అనుచుఁ జతికిలంబడి ఫల్గునుండు’…. శోకం ఎక్కువై ఇలా విలపిస్తాడు:

హాయను ధర్మరాజతనయా యను నన్నెడఁబాయ నీకుఁజ
న్నేయనుఁ దల్లినేపఁజనునే యనుఁ గృష్ణుఁడు వీఁడె వచ్చె రా
వే యను నొంటివోకఁ దగవే యను నేగతిఁబోవువాఁడ నే
నోయభిమన్యుఁడా యనుఁ బ్రియోక్తుల నుత్తరఁదేల్పవే యనున్… (242)

పై పద్యంలో మొదటి చివరి వాక్యాల్లో ఉన్న ఔచిత్యం తిక్కన రచనాశిల్పానికి గీటురాయి. ఈ పద్యం ఒక అపూర్వమైన కళాఖండం.

(243) వచనం: ‘అని మఱియు ననేకప్రకారంబులం బలవించి యుధిష్ఠురు నాననంబాలోకించి’… చాలా ప్రశ్నలు వేస్తాడు… అభిమన్యుడు చనిపోయిన విధం అడుగుతాడు (244-245).

(246) వచనం: ‘అనిపలికి నిట్టూర్పు నిగిడించి చింతించి….’ మళ్ళీ పాతకథలు గుర్తుచేసుకోని దుఃఖిస్తాడు, ‘ఎలుఁగు’లో గాద్గద్యం ఏర్పడుతుంది (247-252).

(253) వచనం: ‘కౌరవ సైనికుల సింహనాదం విన్నాను. యుయుత్సుడన్నమాటలు విన్నాను. వాసుదేవుడు కూడా విన్నాడు గదా అనుకొని పట్టించుకోలేదు. శోకం కాస్త శ్రుతి మించుతుంది. ఓదార్పు వల్ల దుఃఖం మరింత ఎక్కువై, ‘యుద్ధం ఎలా జరిగిందో చెప్పండి’ అని నిలదీస్తాడు (254-260).

(261) వచనం: ‘అని మఱియును.’ నిజంగా ఈ వచనం అనవసరంగా కనిపించినా భావావేశానికి ఒక హద్దు మాత్రమే. ‘మిమ్మల్ని నమ్మి కొడుకును కోల్పోయాను’ అని వాళ్ళను తూలనాడటం మొదలవుతుంది (262-264).

(265) వచనం: ‘అని యంతకంత కగ్గలించుచు నుమ్మలికంబునం గలంగి యంత నిలువక…’ ఇది ఆవేశం పరాకాష్ఠకు (climax) వచ్చినస్థితి. ఇక తిట్ల పర్వం (266-68). మాటలు మరీ దారుణమౌతాయి.

ఉక్కును నస్త్రబలము మీ
కెక్కడి యది….
(మిమ్మల్ని నమ్మి నాకొడుకును కొల్పోయాను)
…. సింగారమునకుఁగాక
మఱువులును కైదువులు మీకు మానమునకె

ఇంతకంటె పరుషమైన తిట్టు ఉండదు. అంచెలంచెలుగా పరాకాష్ఠ చేరిన ఈ ఘట్టం చదువరులను కలత పెడుతుంది.

10.4 మరో సన్నివేశం. ఆశ్రమవాసపర్వం, ప్రథమశ్వాసంలో 84-97. ఆశ్రమవాసానికి వెళ్ళే ముందు ముఖ్యులైన పురజనులను కొందరిని రప్పించి ధృతరాష్ట్రుడు వారి అనుజ్ఞ కోసం ప్రాధేయపడతాడు. 13 పద్యాల్లో 5 వచనాలున్నాయి. వృద్ధుడైన ధృతరాష్ట్రుడి మాటలకు పౌరులకు కన్నీళ్ళ పర్యంతం అయింది. పశ్చాత్తాపం, ఆత్మనింద, పాండవప్రశంస వల్ల ఇలా జరిగింది. తక్కువ మాటలైనా, ఎంతవారికైనా కనికరం కలిగే ధోరణి. అంతకు ముందు 35 పద్యాల్లో ధర్మరాజుకు ధృతరాష్ట్రుడు రాజనీతిని బోధిస్తాడు (55-80). గద్య లేదు. ఈ తేడా కవితా శిల్పంలో భాగం. పౌరుల్లో ముఖ్యులైన వాళ్ళంతా వస్తారు, వాళ్ళను సంబోధిస్తూ:

సీ.
కౌరవకోటియు మీరుఁబెద్దయుకాల
        మనఁగిపెనంగి యన్యోన్యసంభృ
తాధికస్నేహులరై ప్రవర్తించితి
        రనఘవర్తనులార వినుఁడు నాదు
పలుకు వృద్ధునకుఁ దపశ్చరణంబున
        కై వనంబునకేఁగు కటర్హ కర్మ
ముచితకృత్యంబుల యోజమీరెఱిఁగిన
        యదియ కా మది ముదమార మీర
తే.
లెల్ల నాకనుజ్ఞ యిచ్చికానకుఁబుచ్చుఁ
డనుడు సర్వజనులు నశ్రుపిహిత
దృష్టులగుచు గద్గదిక నెలుంగెడలఁగ
నార్తిఁ దోఁపనేడ్చి రధిపముఖ్య (85)

(86) వచనం: విని ధృతరాష్ట్రుడు వారికిట్లనియె.

సీ:
ప్రజ ముదమొందంగఁ బాలించెఁ బుడమి శం
        తనుఁ డనంతరము శాంతనవుచేత
రక్షితుఁడగుచు మీరలు ప్రీతిఁబొదల వి
        చిత్రవీర్యుండు నిద్ధాత్రి యేలెఁ
బదపడి పాండునృపాలుండు మీరు హ
        ర్షింపంగ భూమి రక్షించెఁ బిదప
ధర్మనందనుని చందము మీయెఱింగిన
        యది సత్యధర్మాత్ముఁడైన యితని
తే.
ననుసరింపక యన్యాయ మాచరించి
దుర్ణయంబున నిలయేలి త్రుంచెఁ గులము
నుర్విఁ గల భూపతులను దుర్యోధనుండు
వాని దుశ్చేష్టలకు మూలమేన కాదె (87)

పై రెండు పద్యాల్లో ధృతరాష్ట్రుడి వాక్చాతుర్యంతో పాటు నిజమైన పశ్చాత్తాపం వ్యక్తమౌతుంది. ఉపన్యాసం కొద్దిదైనా పౌరులను కదిలించింది.

(88) వచనం: అదిమీ మనంబులం బెట్టక

(89) పద్యం: మహి లెస్సగఁబాలించిన….

(90) వచనం: అనియప్పుడజ్జనంబులమనంబుల లేకున్నను దన కీళ్ళుగ్గడించి…

ఆ.
వృద్ధ కృపణ పుత్రవిరహిత గాంధారి
యీ నెలంతఁ జూచి యైన మీర
లకట కాననమున కరుగుట మేలని
మాకనుజ్ఞ యిండు మాన్యులార…. (91)

(92) వచనం: అని పలికి పాండవాగ్రజుం జూపి….

(93) పద్యం: ధర్మరాజు ప్రశంస…

కం.
ఆరయ నెన్నం డైనను
మీరలు నాకెగ్గు గాఁగ మెలఁగుటలేదో
పౌరవరులార నన్నున్
గారవమున పనుప రయ్య కాననమునకున్…. (94)

(95) వచనం: …అమ్మ హీశ్వరుండు మఱియును… మోడ్పుకేలౌదలఁ గదియించి మిమ్ము వేఁడెదఁ గృపాఢ్యు లార యనుమతి నీయుఁడు మీరు ననుడు వార లుత్తరీయంబులు వదనవినిహితములుగాఁ జేసికొని రోదనము రవంబు లెసఁగ జేసిరి విను ధరణీశవర్య…(96)

గద్య పద్యాలన్నీ కలిసి 13 వాటిలో నాలుగు వచనాలు. ఆ శక్తిమంతమైన చిన్న ఉపన్యాసం చివరకు అందరూ కన్నీళ్ళ పర్యంతమయ్యేట్టు చేసింది. ఇలాంటి సన్నివేశాలెన్నో ఆ దృష్టితో చూస్తే కనిపిస్తాయి.

పైన ఉదాహరించినవి తిక్కన కవితాశిల్పంలో నాకు తోచిన కొన్ని విశేషాలు. ఇంతకు ముందు చాలామంది తిక్కన అనువాద విధానం, పాత్రపోషణ, మనశ్చిత్రవర్ణన, ఛందస్సులు మొదలైనవాటిని గురించి విస్తృతంగా రాశారు. వాటిని గురించి నేనేమీ కొత్తగా రాయదలుచుకోలేదు. కానీ ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. కొద్ది మాటల్లోనే ఒక వ్యక్తి మనోభావాలను, ధైర్య స్థైర్యాలను అపూర్వంగా చిత్రించే శక్తి ఏ కొద్ది కవులకోగాని సాధ్యం గాదు. కర్ణుడి రథచక్రం ఒకటి శాపవశాత్తు భూమిలోకి సగానికి పైగా కుంగిపోతుంది. గుర్రాలు లాగలేకపోతున్నాయి రథం దిగి దాన్ని చేత్తో పైకి ఎత్తితే గాని మళ్ళీ యుద్ధం చెయ్యటం సాధ్యం గాదు. అర్జునుణ్ణి సంబోధిస్తూ కర్ణుడు అంటాడు:

సీ.
అరదంబు చక్రంబు ధరఁ జాలఁ గ్రుంగిన
        నెత్తెద నంతకు నేయకుండు
మేను భూమిస్థుఁడు నీవు రథస్థుఁడ
        వియ్యెడఁదగవగు నేయకునికి
విరిదలవానిని విరథుని నాయుధం
        బిడిన వానిని శూరు లేయ రెందు
మహిని శూరుఁడ వనుమాత్రగా దుత్తమ
        కులుఁడవు రణధర్మకోవిదుండ

విట్టినీవు తగినయట్టి భంగిన యని సేయవలయు(న్)….

పై మాటలన్నీ స్థూలంగా కర్ణుడి దైన్యాన్ని అసహాయతను సూచిస్తాయి. నిజంగా కర్ణుడు ఎప్పుడన్నా ఇంత దీనంగా మాట్లాడతాడా అనిపిస్తుంది కానీ ఆ చివరి మాటలు వినండి:

… ఇట్లు సెప్పు టెల్లఁ
బాడి యేర్పడంగఁ బలుకుట గాని గో
విందునకును నీకు వెఱచి గాదు (కర్ణ. 3.351)

‘కర్ణుడిపని అయిపోయిందని అనుకుంటున్నావో ఏమో, యుద్ధధర్మం చెప్పటానికి అలా అన్నాగాని, నిన్ను గోవిందుణ్ణి చూసి భయపడిగాదు’ అంటాడు. ఈ ఒక్క వాక్యంతో కర్ణుడి పాత్రను తిక్కన ఆకాశానికి ఎత్తేశాడు.

11. తిక్కన రూపురేఖలు

తిక్కనను గురించి తన శిష్యులు, ఇతర కవులు చెప్పిన మాటలు:

పుష్పాస్త్రరూపోపమారాజన్మూర్తి, కనకగిరితటీసంకాశవక్షస్థలీభాగుఁడు,
అభిరూపభావభవుఁడు …
సకలాగమార్థతత్త్వవిచారోదారుఁడు,
అనితరగమ్యవాఙ్మయమహార్ణవవర్తన కర్ణధారుఁడు,
మహాకళాకమనీయుఁడు,
నిరర్గళధీమంతుఁడు, అద్భుతమతి, అమితమత్విలాసుఁడు,
మంత్రిమాణిక్యుఁడు, నీతిచాణక్యుఁడు,
దేవేంద్రవిభవుఁడు, పరహితార్థి,
విద్వజ్జనామోదనిపుణుఁడు, సుకవీంద్రబృందరక్షకుఁడు,
సత్యప్రియభాషణుఁడు,
కావ్యకళాజనిభూమి, సారకవితానిర్మాణచాతుర్యుఁడు,
చిత్తనిత్యస్థితశివుఁడు, శ్రీకాంతచరణయుగళకోకనదమధువ్రతుఁడు,
వినయపరుఁడు, కరుణార్ద్ర స్వాంతుఁడు, సత్యభాషణుఁడు, ధర్మనిర్మలుఁడు

పై వర్ణనలను బట్టి తిక్కన ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, మహాకవి, మహాపండితుడు, మహామంత్రి అని అతన్ని అందరూ గౌరవించి ఆరాధించేవాళ్ళని తెలుస్తుంది. కాకతీయ ప్రతాపరుద్రుడి దగ్గరకివెళ్ళి ఆయనను మెప్పించి మనుమసిద్ధి రాజ్యం తిరిగి ఇప్పించాడని ఒక ఐతిహ్యం ఉంది.

తిక్కన లాంటివాడు తెలుగువాడై పుట్టి ‘ఆంధ్రావళిమోదముంబొఁరయునట్లు,’ ‘మహాకవిత్వదీక్షావిధి’తో అపూర్వంగా నిర్మించిన కళాఖండం ఆంధ్రమహాభారతం. ‘తనకావించిన సృష్టి తక్కొరుల చేతం గాదు’ కాబట్టే మరెవ్వరూ తెలుగులో మహాభారతం రాయటానికి పూనుకోలేదు. రామాయణాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. దీక్ష పూర్తి అయింది భారతరచన జీవిత పరమావధిగా పెట్టుకున్నాడు. అది నిర్వహించిన తర్వాత శేషజీవితంలో ఏం చెయ్యాలో పాలుపోని అసహాయస్థితి ఏర్పడుతుంది. అందుకనే చిట్టచివరి పద్యంలో చివరిపాదంలో ‘హరిహరనాథ సర్వభువనార్చిత నన్ దయచూడుమిత్తఱిన్’ అంటాడు.


భద్రిరాజు కృష్ణమూర్తి

రచయిత భద్రిరాజు కృష్ణమూర్తి గురించి:

ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన Dravidian Languages పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు.

 ...