8. సంస్కృతాంధ్ర పదప్రయోగం
నిర్వచనోత్తర రామాయణం అవతారికలో సుకవిత్వ లక్షణాలు చెప్పే సందర్భంలో తిక్కన ఇలా అంటాడు.
ఉ. జాత్యము గాని నొప్పయిన సంస్కృతమెయ్యడఁ జొన్ప….
ఈ వాక్యాన్ని చాలామంది విమర్శకులు అపార్థం చేసుకొన్నారు. ‘మన నుడికారం కాదు కాబట్టి సంస్కృతాన్ని ఎక్కడబడితే అక్కడ చొప్పించను, అంటే, సందర్భాన్ని బట్టే వాడతాను’ అని ఒక అర్థం. మరో అర్థం ‘ఎక్కడా (‘ఎయ్యెడన్’) చొప్పించను’ అని. ఈ రెండో అర్థం సరైంది కాదు, తిక్కన చాలా చోట్ల సంస్కృతం వాడాడు కాబట్టి, నాకు ఇంకో రకంగా తోస్తుంది. ‘జాత్యము గాని యొప్పయిన సంస్కృతమెయ్యెడఁ జొన్ప’ అన్నది సరైన పాఠమై ఉండవచ్చు. అంటే, తెలుగు నుడికారానికి సరిపడని, సందర్భశుద్ధి లేని (‘జాత్యముగాని’) సంస్కృతాన్ని అందంగా ఉన్నదని (‘ఒప్పయిన’) మాత్రం ఎక్కడా వాడను, అని.
తిక్కన నిర్దిష్ట సందర్భాలలోనే సంస్కృతసమాసాలు వాడతాడనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇదొక రచనాశిల్పవిశేషం.
అ) అద్భుతభయానక దృశ్యాలను వర్ణించటానికి దీర్ఘసంస్కృతసమాసాల ప్రయోగం తిక్కనలో కనిపిస్తుంది. కౌరవసేనను చూసిన ఉత్తరుడు సారథి బృహన్నలతో ఇలా అంటాడు.
శా.
గ్రీష్మాదిత్యపటుప్రతాపవిసరాకీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫారచతుర్విధోజ్జ్వలబలాత్యుగ్రంబు దగ్రధ్వజా
ర్చిష్మత్త్వాకలితంబు సైన్య మిది నేఁ జేరంగ శక్తుండనే (విరాట. 4.52)
ద్రౌపది కీచకుడికి తన భర్తల శౌర్యాన్నిగురించి చెప్పి బెదరగొట్టేటప్పుడు:
శా.
గర్వాంధప్రతివీరనిర్మథనదీక్షా పారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసన్ గిట్టి గం
ధర్వుల్ మానముఁబ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా (విరాట. 2.55)
ఈ బెదిరింపులకు జవాబుగా కీచకుడు (సింహబలుడు) సమాసరహితమైన తేట తెలుగు మాటలలో (తేటగీతిలో) ఇలా చెప్పాడు.
తే.
బలముఁజెనయంగ భవదీయ పతులుగాదు
మూఁడు లోకంబులందు నెవ్వారు లేమి
నిక్కువంబింత నమ్ముమో నీరజాక్షి (విరా. 2.56)
ద్రౌపది మాటలను తాను చాలా తేలికగా తీసుకొంటున్న కీచకుడి స్వభావాన్ని ఈ రెంటి పోలికలో పద్యాల ఎంపిక లోనూ మాటల ఎంపిక లోను చాలా అపూర్వంగా తిక్కన ప్రదర్శిస్తాడు.
మరో ఉదాహరణ. ద్రోణుడు బృహన్నలను అర్జునుడుగా గుర్తించి కర్ణుడు మొదలైన వీరులతో అన్నమాట, దుర్యోధన సేన ఓడిపోతుంది అన్న సూచన చేస్తూ:
శా.
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్ (విరా. 4.95)
ఆ) ఎక్కువ-తక్కువలకు, చిన్న-పెద్దలకు మధ్య ఉన్న భేదాలు పదవాక్యనిర్మాణంలోనే విశదమయ్యేట్టు సంస్కృతసమాసాలతో ఒకటి, అసమస్తపదాలతో గాని, తెలుగు మాటలతోగాని మరొకటి, నిర్దేశిస్తాడు తిక్కన.
కం.
స్ఫురితుఁడగు విచిత్రవీర్యపుత్రుఁ డొక తలో
దరి నూ ఁతగొనియె విధి యె
వ్వరిహీనులఁ జేయఁడకట వక్రుండైనన్ (ఆశ్రమ. 1.40)
వెయ్యి ఏనుగుల బలం గల ధృతరాష్ట్రుడు ఒక అబలను (గాంధారిని) ఊతగా చేసుకొన్నాడు! కర్ణపర్వంలో శల్యుడు అర్జునుడితో కర్ణుణ్ణి పోలుస్తూ చెప్పిన మాటలు:
సీ.
సమరంబునకు హరిణము గడంగి
దానధారాభీలదంతావళము తోడ
సంగ్రామమునకు శశంబు గడఁగి
చండస్వభావోగ్రపుండరీకము తోడ
నాజికి సారమేయంబు గడఁగి
దారుణతుండాతి ఘోరగృధ్రము తోడఁ
గలహంబునకు నురగంబు గడఁగి
ఆ. వె
జ్జ్వలుఁడు పార్థుతోడ సంగరమున
కీవు గడఁగి యడరుటెల్ల రాధేయ, నీ
కెట్టిబలము నమ్మ నెందు గలదు (కర్ణ. 2.42)
అజేయమైన వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఒత్తులున్న అక్షరాలతో దీర్ఘసమాసాలు, దుర్బలవ్యక్తిని గురించి చెప్పేటప్పుడు తేలిక ధ్వనులు, అల్పాక్షరాలు. ఇక్కడ సంస్కృతపద ప్రయోగం ఎంత హృద్యంగా, ఉచితంగా ఉందో ఆలోచించండి. రాధేయ అనే సంబోధన గూడా అర్థవంతం, తిక్కన కవితాశిల్పంలో ఇవి కొన్ని విలక్షణతలు మాత్రమే.