తిక్కన భారతంలో పలుకులపొందు

5.3 సంభాషణ శైలి

ఈ రకమైన రచనను కొందరు నాటకీయ శైలి అన్నారు. కాని భాషావిషయంగా ఎవ్వరూ దీన్ని నిర్వచించలేదు. నాటకానికి కథనం కంటె సంభాషణలు ప్రాణం. సంభాషణల్లో సర్వనామాల ప్రయోగం ఎక్కువగా ఉంటుంది. సర్వనామాలకు సందర్భవిరహితంగా అర్థం నిరూపించటం సాధ్యంకాదు. నేను, నువ్వు, అంత, అప్పుడు, ఇప్పుడు, మొదలైన మాటలు మనకు నిర్దిష్ట సందర్భాలు తెలిస్తేగాని అర్థంకావు. ‘నేను’ అంటే తత్కాలంలో మాట్లాడుతున్న వ్యక్తి, ‘నువ్వు’ అంటే తత్కాలంలో సంబోధింపబడే వ్యక్తి అలానే త్రిక (ఆ-ఈ-ఏ) నిష్పన్నమైన అది-ఇది-ఏది, అక్కడ-ఇక్కడ-ఎక్కడ, అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు, మొదలైన శబ్దాల విస్తృతప్రయోగం వల్ల, తత్సంబంధి ప్రత్యయాలు, క్రియారూపాల వల్ల, తిక్కన అనితరసాధ్యంగా నాటకీయత సంపాదిస్తాడు, ఉదా. భీముడు కీచకుణ్ణి చీకటిగదిలో సంబోధించేటప్పుడు అన్న మాటల ప్రయోగం పరిశీలించండి:

తే.
ఇట్టివాఁడవు గావున నీవు నిన్ను
పొగడికొనఁదగు నకట నా పోల్కి యాఁడు
దాని వెదకియు నెయ్యెడ నైన నీకుఁ
బడయవచ్చునె యెఱుఁగక పలికితిట్లు (విరాట. 2.337)
కం.
నా యొడలు చేర్చినప్పుడు
నీ యొడ లెట్లగునొ దాని నీ వెఱఁగెదు న
న్నే యబలల తోడిదిగాఁ
జేయఁదలంచితివి తప్పు సేసితి గంటే (విరాట. 2.338)
కం.
నను ముట్టి నీవు వెండియు
వనితల సంగతికి పోవువాఁడవె యైనం
దనువే పడసిన ఫలమే
కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్ (విరాట. 2.339)

మన్మథవికారాల్లో చివరిది మరణం, ‘అది నీకు మూడింద’ని ధ్వని.

తిక్కనకు ‘ఇంతలు, అంతలు,’ అరుదుగా ‘ఎంతలు’ అనే శబ్దాలు చాలా ఇష్టమైనవి. ఇతరకవులు ఈ మాటలు వాడటం అరుదు. ‘ఇంతలు’ అంటే ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలు, ‘అంతలు’ అంటే భూతకాలంలో జరిగిన సంఘటనలు అని ఒక అర్థం. అసంఖ్యాకం, చాలా ఎక్కువ అనేది మరో అర్థం. మామూలు మాటలలో చెప్పటానికి సాధ్యంకాని, అనిర్వచనీయమైన (కష్టాలు, సుఖాలు, మంచి పనులు, చెడ్డ పనులు) అనేది ఇంకో అర్థం. ఉదాహరణలు:

‘దుష్ట చేష్టల సుయోధునుఁడింతలు సేసె…’ (ఉద్యో. 3.4) = ఇన్ని దుష్కృత్యాలు; ‘ఒడ్లకున్ గోచరమట్టె ఇంతలు పనుల్’ (కర్ణ. 1.266) = ఇంతకష్టమైన పనులు; ‘ఈ వెండ్రుకలు వట్టి ఈడ్చిన ఆ చేయి, తొలుతగాఁ బోరిలో దుస్ససేను తనువింతలింతలు తునియలై చెదరి రూ, పఱి యున్నఁగని యుడుకాఱుఁగాక…’ (ఉద్యో. 3.117) = తాను చూపిస్తున్నంత చిన్నచిన్న (ముక్కలు); ‘దుర్ణయవృత్తి దుర్ద్యూతంబు పుట్టించి, యంతలు సేసిన యట్టివారి…’ (ఉద్యో. 1.331), ‘అంతలంతలు దప్పులు సేసితి మని తలంకవలవ దెంతలు సేసినను గౌంతేయ పూర్వజుండు శాంతిసుధానిధి యగుటం జేసి శరణుసొచ్చినం గాచు నని…’ (ఉద్యో. 3.201); ‘అలిగిన భీమఫల్గునులకడ్డము లేమి యెఱుంగు దంతలంతలు పడి వానినీఁగవలదా…’ (ఉద్యో.3.201) = అంతంత కష్టాలు.

తే.
ధార్తారాష్ట్రు లున్మత్తులు, దగినపలుకు
లేల విని సంధిసేయుట కిచ్చగింతు
రెదిరిఁదమ్మున నెఱిఁగిర యేని వార
లంత లంతలు సేయుదురయ్య నాఁడు (ఉద్యో. 4.73)

ఈ శబ్దాలను విశేష్యాలుగానే గాక విశేషణాలుగా గూడా వాడవచ్చు. ‘అంతలంతలు దప్పులు…’ (ఉద్యో.2.244) = అంత చెయ్యరాని తప్పులు; ‘అంతలంతలు మానుసులు మడిసిరి గాని… (ద్రో. 2.187) = చాలాబలవంతులైన వీరులు; ‘అంతలంతలు మేటిమగలు’ (కర్ణ. 3.380) = అంతటి గొప్ప యోధులు.

పై ప్రయోగాలను బట్టి మంచి చెడ్డ అనే రెండురకాల అర్థాలకు ఈ పదాలను ప్రయోగించినట్టు తెలుస్తుంది. ద్రౌపది రాయబారానికి వెళ్తున్న కృష్ణునితో అన్న మాటల్లో సర్వనామాల ప్రయోగంతో సంభాషణ శైలి పరాకాష్ఠను సూచిస్తున్నది:

ఉ.
నీవు సుభద్రకంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం
భావన సేయుదట్టి ననుఁ బంకజనాభ ఒకండు రాజసూ
యావభృథంబునందు శుచియై పెనుపొందిన వేణిఁబట్టి యీ
యేవురుఁ జూడగా సభకు నీడ్చెఁ గులాంగన నిట్లొనర్తురే (ఉద్యో. 3.110)
ఉ.
ఆ సభ కేకవస్త్ర యగు నట్టి ననున్ గొని వచ్చి నొంచు దు
శ్శాసనుఁ జూచుచుం బతు లసంభ్రములై తగు చేష్ట లేక నా
యాసలు మాని చిత్రముల యాకృతి నున్న యెడన్ ముకుంద వి
శ్వాసముతోడ నిన్ గొలువ వచ్చె మనం బదియుం దలంపవే (ఉద్యో. 3.111)
ఉ.
నెట్టన నిట్టియల్క మది నిల్పితి…. (ఉద్యో. 3.118)

6. కృత్తద్ధితవిస్తృతప్రయోగం

క్రియాపదాలతో పర్యవసించే వాక్యాలకు, వాక్యభాగాలకు బదులు వాటి నుంచి ఏర్పడ్డ కృద్రూపాలు ఉపయోగిస్తాడు తిక్కన. కర్తను కర్మను ప్రత్యేకంగా చెప్పదలుచుకోనప్పుడు భావార్థంలో వచ్చే క్రియలను కృత్తులుగా ఉపయోగించటం ఒక చమత్కారం. సుదేష్ణ ద్రౌపదితో అంటుంది:

ఉ.
అక్కట యేను వేడ్కపడి యానెడునాసవ మర్థిఁ దేరఁగా
నొక్క నికృష్టఁ బంపుటకు నోపక చెప్పిన దీని నీవు గో
సెక్కగఁజేసి నిన్ను నతిహీనవిధాననియుక్తఁ జేఁతగా
నిక్కమ యుమ్మలించితిది నెయ్యము తియ్యము కల్మియే సఖీ (విరా. 2.98)

ఈ పద్యంలో ‘నీవు, నిన్ను, ఉమ్మలించితివి’ అని స్పష్టంగా వచ్చేట్టు చెప్పి ‘నేను’ అనేది క్రియాపదంలో ధ్వనించకుండా చూడటం లౌక్యం. నేను నిన్ను ‘అతిహీన విధాన నియుక్తను చేశాను’ అని బాధ పడ్డావు అనే అర్థం వచ్చే క్రియారూపం వాడలేదు. నిజంగా ఈ పనికి నియోగించటానికి కారణం కీచకుడు గాని తాను గాదు. ఆ సంగతి ‘నియుక్తఁజేఁతగా’తో దాటేసింది. ‘మరి ఇది మన మధ్య స్నేహం ఉన్నట్టా, కాదా’ అనే చోట ‘కల్మి’ వాడటంలో ఎవరి మనస్సులో స్నేహం ఉందో ఎవరికి లేదో తెలియని స్థితి ఏర్పడ్డది. తిక్కన పాటించిన శిల్పరహస్యాలలో ఇదొకటి. అలానే సుదేష్ణను కీచకుడు ‘నీకు ద్రౌపదితో ఎంత స్నేహం’ అనటానికి బదులు ‘దీనిపై, నెయ్యము కల్మియే కొలఁది నీమదికి’ అంటాడు ఇలాంటివే ‘పనులకేనుజాల కునికి’, లేకుండట బదులు ‘లేకునికి’, మొదలైనవి.

7. సంబోధనలు

సంబోధనలు చిన్న వాక్యాలు. సంబోధనల్లో శ్రోతకు వక్తకు ఉన్న సంబంధం వ్యక్తమౌతుంది. ఆదరం, గారాబం, ప్రేమ, కోపం లాంటి మనోభావాలు తెలుస్తాయి. వక్త సంబోధన లోనే శ్రోతను కొండెక్కించవచ్చు నేలకేసి కొట్టవచ్చు. సంబోధనలను సాభిప్రాయంగా రాసిన కవులు అరుదు. కాని, తిక్కన రచనాశిల్పంలో సంబోధనల ఎంపిక ఒక విలక్షణతగా స్పష్టంగా కనిపిస్తుంది. మనుచరిత్రలో ప్రవరుడు వరూధినిని మొదట చూసినప్పుడు, ‘ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ’ అని పిలవకపోతే అన్ని చిక్కుల్లో పడేవాడు కాదు. పెద్దన అతని చేత అలా అనిపించటం రాబోయే కథకు ప్రాతిపదిక అయింది. నన్నయకు ఆ దృష్టి ఉంటే గరుత్మంతుడు తల్లిని ‘చెప్పుము దీని పయోరుహాననా’ (భార.ఆది. 2.48) అనేవాడు కాదు. తిక్కన సాభిప్రాయంగానే సంబుద్ధివాచకాలు ఉపయోగిస్తాడు, ఉదా. శల్య సారథ్యం, శల్యుడు కర్ణుణ్ణి ఎలాగైనా నిరుత్సాహపరచాలని అర్జునుణ్ణి ప్రశంసించి కర్ణుణ్ణి తక్కువ చేస్తాడు. సీసపద్యం నాలుగు పాదాల్లో అర్జునుడితో కర్ణుణ్ణి పక్షపాత దృష్టితో పోల్చి, చివరకు

తే.
‘వినుమ సూతతనయ! మనబోటులాతనిఁ
జెఱుతుమనుట నోరి చేటుగాదె’ (కర్ణ. 2.24) అంటాడు.

కర్ణుడు క్రుద్ధుడై, శల్యుణ్ణి ‘క్షత్రియాధమ’ (కర్ణ. 2.47) అంటాడు. తన్ను తక్కువ చేసినందుకు దూషిస్తాడు. మదనోద్విగ్నుడైన కీచకుడితో ద్రౌపది అనే మాటలు:

కం.
నాయున్న బాము తలఁపవ
యీ యొడలీ చీర యిట్టి యేవపుఁ జందం
బో యన్న మదన వికృతిం
జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే (విరా. 2.49)

నేను నీ చెల్లెలి లాంటి దానిననే ధ్వని వచ్చేట్టు ‘ఓ అన్న’ అని సంబోధించి, చెల్లెలిపై కామవికృతి నిషిద్ధం గదా అంటుంది. ఆ తర్వాత ‘కీచకా’ (విరా.2.55) అనీ, అప్పటికీ మారకపోతే ‘వివేకవిహీనా’ (విరా.2.58) అనీ సంబోధిస్తుంది. సుదేష్ణ పని చెప్పినప్పుడు ద్రౌపదిని ‘సఖీ’ (విరా.2.98) అంటుంది. ద్రౌపది భీముణ్ణి ఉబ్బించేటప్పుడు ‘అనిలతనయ’ (విరా.2.175), ‘పావనీ’ (విరా.2.193), ‘వాయుపుత్ర’ (విరా.2.229) అని ప్రోత్సాహకరమైన పిలుపులు వాడుతుంది. ఒక్కొక్కప్పుడు ఏ సంబోధనా లేకుండా మాట్లాడటం గూడా అర్థవంతం అవుతుంది. ద్రౌపది కీచకుడి దగ్గరికి వెళ్ళి, ‘దేవి తృష వుట్టి వారుణిఁ దేరఁబనుప, నరుగుదెంచితిఁ బోయింపుఁడు…’ (విరా.2.116) అన్నది, అతన్ని సంబోధించకుండానే. అవమానపడి తిరిగి వచ్చిన తరవాత సుదేష్ణను సంబోధించలేదు. ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసపర్వంలో అరణ్యాలకు వెళ్ళే ముందు ప్రజలను ఉద్దేశించి, ‘పౌరవరులార’, ‘కృపాఢ్యులార’ అంటాడు, వాళ్ళు సందర్భోచితంగా ఆయన్ను ‘అమలినహృదయ’ అని పిలుస్తారు. అభిమన్యుడి చావు వార్త తెలిసిన అర్జునుడు, ‘హా యను, ధర్మరాజతనయా యను, …ఏగతిఁబోవువాఁడ నే, నో యభిమన్యుఁడా’ యను. ‘ధర్మరాజతనయా’ అంటంలో ఆయన కొడుకువైనా నిన్ను రక్షించుకోలేకపోయాడు అనే ధ్వని ఉంది.

పై రచనాప్రక్రియకు విరుద్ధంగా, హరిశ్చంద్రోపాఖ్యానంలో శంకరకవి, చంద్రమతి లోహితాస్యుడి మరణానికి విలపించిన తీరు చూడండి.

మ.
‘అకటా చేరెడు నేలకుం దగఁడె సప్తాంభోధివేష్టీభవత్
సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోత్పల
ప్రకటానర్గళ నిర్గళత్కిరణశుంభత్పాదుఁడైనట్టి రా
జకుమారుండు….’ (హరి. 5.86)

అని ఏడుస్తుంది. దీన్ని ‘ఈ తీరునే ఎల్లరామాయణములును వ్రాయఁబడి యున్నచో, నా గ్రంథముల యొద్దకు మనుష్యులననేల తుదకు చెదలు సైతము పోదనుట స్పష్టము’ అని కట్టమంచి రామలింగారెడ్డిగారు విమర్శించాడు (కవిత్వతత్త్వ విచారము, పుట 101).