తిక్కన భారతంలో పలుకులపొందు

5. తిక్కనరచనాశైలి

తిక్కనరచనలో ప్రధానంగా రెండు రచనాప్రక్రియలు కనిపిస్తాయి. అవి కథనాత్మక శైలి, వర్ణనాత్మక శైలి. కథనాత్మక శైలిలో చిన్నచిన్న వాక్యాలుంటాయి పద్యానికి గద్యానికి అంత తేడా కనిపించదు అంటే పద్యపాదాంతంలో పదాలు తెగవచ్చు, తెగకపోవచ్చు.

వర్ణనాత్మక శైలిలో ప్రతిపాదం చివర పదం తెగుతుంది. వర్ణనాత్మక శైలి అలంకార సమ్మర్దంగా ఉంటుంది. కథనాత్మక శైలిలో కొద్దిమాటలతో ఎక్కువ విషయవ్యక్తీకరణ కనిపిస్తుంది ఉదా. కర్ణుడికి సారథిగా వచ్చిన శల్యుడు పాండవపక్షపాతి. ఎన్నిరకాల అతన్ని నిరుత్సాహపరచాలో అన్ని రకాల నిరుత్సాహపరుస్తాడు. దానిలో భాగంగా హంసకాకీయోపాఖ్యానం అనే కథ చెబుతాడు. ఆ ఉపాఖ్యానంలో మొదటి పద్యం:

5.1 కథనాత్మక శైలి

సీ.
అంబుధిలో నొక్క యలఘుతరద్వీప,
         మున ధర్మవర్తినాఁజను నరేంద్రు
పురమున నొకవైశ్యవరుఁడధ్వరాదిసత్,
        కర్మఠుఁడును శాంతిదాంతియుతుఁడుఁ
గరుణాపరుఁడు దాననిరతుండు ధనధాన్య,
        శోభియు బహుపుత్రలాభవిలసి
తుండు నై వర్తించుచుండఁగ నిలు సేరె,
        నొక కాకి యతనిపుత్రకులు దాని
తే.
కెంగిళులు పెట్టి కొనియాడ నెలమిఁబెరిగి
క్రొవ్వి కడు మీరి యెట్టిపకక్షులును దన్నుఁ
బోల వనియెడు దుర్మానమునఁ దృణీక
రించి యది పెక్కు భంగుల క్రీడ సలుపు (కర్ణ. 2.54)

ఈ పద్యంలో కథాకథనం ప్రధానం గాని అలంకారాలు (కొన్ని వైశ్యుని గురించిన విశేషణాలు తప్ప) ఏవీ లేవు. ఇలాంటి పద్యాలు కొల్లలు. మరో పద్యం, కురుక్షేత్ర యుద్ధం అంతా అయింతరవాత నారదుడు ధర్మరాజును చూడవచ్చి, కర్ణుడు తన సోదరుడని ముందుగా తెలియక పోవటంవల్ల వచ్చిన ప్రమాదాల్ని గురించి ధర్మరాజు బాధ పడుతున్నప్పుడు, కర్ణుడి మరణానికి ఎన్ని, ఎందరు కారణాలో నారదుడు చెబుతాడు:

చ.
వినుము నరేంద్ర విప్రుఁడలివెన్ జమదగ్నిసుతుండు శాప మి
చ్చె నమరభర్త వంచనముసేసె వరం బని కోరి కుంతి మా
న్చె నలుక భీష్ముఁడర్థరథుఁ జేసి యడంచెఁ గలంచె మద్రరా
జనుచిత మాడి శౌరి విధి యయ్యె నరుం డనిఁ జంపెఁ గర్ణునిన్ (శాంతి. 1.35)

ఈ పద్యంలో తొమ్మిది చిన్నచిన్న వాక్యాలున్నాయి. కర్ణుని చావుకు కారణాలన్నిటినీ ఒక గుక్కలో లయబద్ధంగా చెప్పటం ఉద్దేశం. ఇది కథను చెప్పటానికి తిక్కన అనుసరించిన శైలి. దీన్ని చంపకమాలగా చదివితే కథనం దెబ్బ తింటుంది కథన ప్రధానంగా చదివితే చంపకమాల ఛందస్సు ఎక్కడా గోచరించదు.

5.2 వర్ణనాత్మక శైలి

మరి వర్ణనాత్మక శైలి బహురూపాల్లో కనిపిస్తుంది. ఒక పద్ధతి: పద్యం వచనంలా కాకుండా పద్యంలానే నడుస్తుంది. పైనుదాహరించిన సీసపద్యానికి, ఈ కింది సీసానికి తేడా చూడండి. ఇది ద్రౌపది భీముడితో ధర్మరాజు గొప్పతనం తనకు తెలియనిది కాదని చెప్పుకొనే సందర్భం లోనిది.

సీ.
ఎవ్వనివాకిట నిభమదపంకంబు
        రాజభూషణరజోరాజి నడఁగు
నెవ్వనిచారిత్ర మెల్లలోకములకు
        నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
నెవ్వనికడకంట నివ్వటిల్లెడుచూడ్కి
        మానితసంపద లీనుచుండు
నెవ్వనిగుణలత లేడువారాసుల
        కటపటికొండపైఁ గలయఁ బ్రాకు
తే.
నతఁడు భూరిప్రతాపమహాప్రదీప
దూర విఘటితగర్వాంధకారవైరి
వీరకోటీరమణిఘృణవేష్టితాంఘ్రి
తలుఁడు కేవలమర్త్యుఁడే ధర్మసుతుఁడు (విరాట. 2.191)

సీసపద్యం నాలుగు పాదాల్లో మొదటిదిగా వచ్చే ‘ఎవ్వని’ అనే ప్రశ్నార్థక పదంతో తేటగీతి మొదటి పదంగా వచ్చే ‘అతఁడు’తో అన్వయం అతడెవరో పద్యం చివరి ‘ధర్మసుతుడు’ పదంతో అన్వయం. అన్ని సీసపద్య పాదాల చివర ఉన్న క్రియ తద్ధర్మార్థకం. ఇది సంస్కృతంలో ప్రసిద్ధమైన యత్తదర్థక ప్రయోగం.

మరో పద్ధతి: సీసపద్యంలో ప్రతిపాదం చివర వచ్చే అసమాపక క్రియతో తేటగీతిలోని మొదటి క్రియకు అన్వయం కల్పించటం కీచకుడి మనఃప్రవృత్తి తెలిసిన తరవాత అతన్ని చూసినప్పుడు ద్రౌపది పరిస్థితి ఎలా ఉన్నదో తిక్కన ఒక సీసపద్యంలో వర్ణిస్తాడు ఉదా.

సీ.
వెఱవక ననుఁజూచె వీఁడని యెడఁగలు
        షించిన నొండొండఁజెమట వొడమ
ననుచితకృత్యంబు లాచరించు
        విధాతృ బలిమికి నివ్వెఱపాటు దోఁప
నిచ్చట దిక్కులే రెవ్వరు నాకను
        భయమున మేనఁ గంపంబు వుట్టఁ
జేయంగ నేమి యుపాయంబు లేమి నా
        ననమున వెల్లదనంబు గదుర
తే.
నున్న పాంచాలి కనుఁగొని యన్నరాధ
ముఁడు వివేకవిహీనుఁడై ముదితుఁడగుచు
మదనవికృతియగాఁ దన మదిఁ దలంచి
రాగసాగరపూరనిర్మగ్నుఁడయ్యె (విరాట. 2.33)

సీసపద్యం నాలుగు పాదాల చివర ఉన్న అన్నంతక్రియలతో తేటగీతి మొదటి ‘ఉన్న’ అనే ధాతుజన్యవిశేషణానికి అన్వయం. ఇలాటివే విరాటపర్వంలోనూ ఇతర పర్వాలలోనూ చాలా సీసపద్యాలు కనిపిస్తాయి. (విరాట. 2.52, 2.118, 2.208, 2.315, 2.360, కర్ణ. 2.24).

ఇది వర్ణనాత్మక శైలిలో తిక్కన పాటించిన ఒక శిల్పప్రక్రియ. చెప్పదలుచుకొన్నదాన్ని కాస్త ఆలస్యం చేసి శ్రోతలకు పఠితలకు ఉత్సుకతను కలిగించటం ఈ రచనాప్రక్రియ లోని విశేషం. శ్రీనాథుడి సీసానికి పునాదులు తిక్కన ఇటువంటి వర్ణనాప్రధానమైన సీసాల్లో కనిపిస్తుంది. శ్రీనాథుడు సీసపద్యంలో ఎక్కువగా ఐదు మాత్రల ఇంద్రగణాలను ప్రయోగిస్తాడు. మరి కొన్ని ఇలాంటివే ఉన్నాయి. వర్ణనల్లో తిక్కన వాడే వాక్య నిర్మాణం వేరు కథనాత్మక శైలిలోనూ సంభాషణ శైలిలోనూ వాడే వాక్య నిర్మాణం వేరు. సంభాషణ శైలిని గూర్చి తరవాత వివరిస్తాను.

మరో ఉదాహరణం – లీలోద్యానంలో విహరిస్తూ కీచకుడు పడ్డ విరహబాధ:

సీ.
ఇంపైన ప్రియ కాన నిచ్చి నిల్చిన మధు
        వాదట నాను మత్తాలివిభుని
జెట్టుపల్ పచరించి చుట్టుఁ గ్రమ్మరి మనో
         రమ నియ్యకొలుపు మరాళవిభుని
ఫలరస మొండొంటి కెలమిఁ జంచుల నిచ్చు
         మెయి చొక్కెడు శుకమిథునములను
గమిఁబాసి తలిరుజొంపమునకు మెయి మెయిఁ
         దాకంగఁ జను పికదంపతులను
తే.
జూచిచూచి యుల్లంబున నేచి కోర్కు
లడరఁ జిడిముడిపడు మ్రానుపడు వెడంగు
పడు వెనుంబడుఁ దల్లడపడు దురంత
చింతబారికి నగపడు సింహబలుఁడు (విరాట. 2.306)

పునరావృత్తక్రియలలో ఉన్న లయ వల్ల పదం స్వరూపం లోని ధ్వని, ఉచ్చారణ, వ్యాకరణం ఏకకాలంలో అర్థస్ఫూర్తికి హేతువులౌతాయి. పై పద్యంలో తిక్కన తిర్యక్కులశృంగార వర్ణన కాళిదాసు కుమారసంభవాన్ని జ్ఞప్తికి తెస్తుంది. అటువంటిదే మరో ఉదాహరణ: ద్రౌపది కీచకుడి ఇంటికి మదిర కోసం అతని అక్క పంపితే ఇష్టం లేకపోయినా వెళ్తుంది ఆ సందర్భంలో:

సీ.
దైన్యంబు తలపోఁత తలకొన్నఁ జెలువ
        కాననమున వెల్లదనంబు గదిరె
భయరసవేగంబు పైకొని ముట్టినఁ
        గాంతకుఁ దనులత కంపమడరె
బెగ డంతకంతకు మిగిలిన నింతికిఁ
        బదముల నడఁ దొట్రుపాటు బెరసెఁ
దల్లడం బొందినఁ దన్వికి నవయవం
        బులనెల్ల ఘర్మాంబు కళిక లెసఁగెఁ
ఆ.వె.
దలఁకు పుట్టెఁ గొంకు కొలఁదికి మీఱె వె
న్బాటు దోఁచె ముట్టుపాటు దొడరె
వెఱగుపాటు దనికె నెఱనాడె నొవ్వు నె
వ్వగలు వగల నీనె దిగులు వొదివె (విరాట. 2.106)

ఈ పద్యంలో నాలుగు సీసపద్య వాక్యాల్లోనూ ద్రౌపది మానసికస్థితి వల్ల ఏర్పడ్డ శారీరకావస్థలను పెద్దవాక్యాలతో వర్ణించి ఆయా అవస్థలతో సతమతమౌతున్న మనస్సు పడే బాధను చిన్నవాక్యాలతో పునరావృత్తసమనిర్మాణక్రియలతో వర్ణించి ద్రౌపది మూర్తిని కళ్ళకు కట్టినట్టు చూపించటం ఒక శిల్ప విశేషం. మానసికస్థితి వర్ణనకు ఇన్ని దేశ్యశబ్దాలు ప్రయోగించిన మరొక తెలుగుకవి లేడు. ఈ పద్యం తిక్కన వాడిన వ్యాకరణలయ (grammatical rhythm) కు చక్కటి లక్ష్యం.

(3) సమపదనిర్మాణం (కాలార్థకప్రత్యయాలతుల్యత) కలిగి భిన్నక్రియలతో పునరావృత్తమయ్యే చిన్నచిన్న అసమాపకవాక్యాలను కూర్చటం మరో పద్ధతి సింహబలుడైన కీచకుడికి భీముడికి చప్పుడు గాకుండా జరిగిన మల్లయుద్ధాన్ని వర్ణించేటప్పుడు:

కం.
కదియుచుఁ బాయుచుఁబట్టుచుఁ
నదలుచుచుం బడుచు లేచుచడఁగుచు వడిగొం
చొదవెడు కినుకం గడు బె
ట్టిదముగఁ బెనఁగిరి చలంబు డింపక కడిమిన్ (విరాట. 2.348)

మొదటి రెండు పాదాల్లోనూ ఎనిమిది శత్రర్థకక్రియలున్నాయి పద్యం చదువుతున్నప్పుడు వాళ్ళు పట్టే కుస్తీ కళ్ళకు కట్టినట్టు పదగతిలోనే అర్థం ఇమిడి ఉంది. ఒక్కొక్కప్పుడు ధ్వనుల కలయికే అర్థస్ఫోరకమౌతుంది. దీన్ని sound symbolism అంటారు. పోతన గజేంద్రమోక్షంలో విష్ణుమూర్తిని అనుసరించిన లక్ష్మీదేవి సంకోచాన్ని, తొట్రుపాటును అక్షరలయతో ఉన్న పదాల ఎంపికలో చూపిస్తాడు:

కం.
అడిగెదనని కడువడిఁజను
నడిగినఁ దనమగఁడు నుడువ డని నడ యుడుగున్
వెడవెడఁ జిడిముడిఁ దడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమనడుగిడునెడలన్ (మహాభాగవతము. 8.103)

ఈ పద్యంలో లక్ష్మీదేవి నడక కనిపిస్తుంది గదూ! తిక్కన అట్టే ఇలాంటి శబ్ద చిత్రాల జోలికి వెళ్ళడు. అక్కడక్కడ ఉచ్చారణ, పదాల ఎంపిక, అర్థం అన్నీ ఒకే తాటి మీద వెళ్ళేట్టు సమీకరించిన (synthesize చేసిన) పద్యాలు కూడా ఉన్నాయి. ద్రౌపది సభలోకి వస్తున్నప్పుడు కీచకుడు ఆమెను తన్నిన సన్నివేశం చూసిన భీముడి స్థితిని వర్ణిస్తూ:

చ.
కనుఁగొని కోపవేగమునఁగన్నుల నిప్పులు రాల నంగముల్
గనలఁగ సాంద్రఘర్మసలిలంబులు గ్రమ్మి నితాంతదంతపీ
డనరటదాస్యరంగవికటభ్రుకుటీచటులప్రవృత్తన
ర్తనఘటనాప్రకారభయదస్ఫురణాపరిణద్ధమూర్తియై

విస్తృతవర్ణనలు అవసరమైన చోట తిక్కన సీసపద్యాన్ని ఎక్కువగా వాడతాడు.