వేటూరి పాట

ఇంక మరొక్కసారి వేటూరి వేసిన శ్లేషల్ని కూడ పరామర్శించి ముందుకు సాగుదాం.

శ్లేషల్లో వేటూరిది చేమకూర వెంకటకవి మార్గం – అంటే అతనికి శ్లేషలు అనాయాసంగా వస్తాయి. కావాలని తిప్పలు పడితే వచ్చేవి కాదు అతను చేసిన శ్లేష చమత్కారాలు. ఉదాహరణకి అర్జున్ అనే సినిమాలోని పాట –

మథుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి
జాజిమల్లెల ఘుమఘుమల జావళి
లేతసిగ్గుల సరిగమల జాబిలి
అమ్మా మీనాక్షీ ఇది నీ మీనాక్షి

వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా

దీన్లో శ్లేషలు గుప్పిళ్ళతో చల్లాడు వేటూరి. మథుర – మధురతర, దగ్గరగా వినిపించే మాటలు కాని అర్థాలు దూరం. ఐనా పక్కపక్కన వినిపించి ఆనందాన్ని కలిగిస్తాయి. కంచిపట్టున – కంచి అనే వూళ్ళో ఉన్న అని, కంచిలో నేసిన పట్టుచీర కట్టిన అని రెండర్థాల శ్లేష. ఇక చివరిభాగంలో “చిలక” అనే పదాన్ని రకరకాలుగా చిలికేశాడు. ఒక అర్థం చిలక పక్షి అని, మరో అర్థం చిలికించటం అని, ఇంకో అర్థం ఒక ప్రదేశంలో ఉండేదని, చివరి అర్థం చిలకటం అని. ఇలా ఒకే పదాన్ని ఇన్ని విధాలుగా ఒకే సినిమా పాటలో ప్రయోగించటం ఇంకెక్కడా చూళ్ళేదు.

ఒకప్పుడు ఆత్రేయ “కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి / కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి / పట్టుతప్పినంతనే పరువే తీస్తాయి / ఒళ్ళు దగ్గరుంచుకుంటె మంచిదబ్బాయి” అని పరువు అన్న ఒక్క మాటని శ్లేషార్థంలో ప్రయోగించటానికి చాలా కథ చెప్పాల్సివచ్చింది. వేటూరికి శ్లేష అప్రయత్నసాధ్యం కనక ఇలాటి తిప్పలు ఉండవు.

సంప్రదాయ భావాలు

వేటూరి పాటల్లో మంచి ప్రచారం పొందిన మూడు ప్రేమలేఖల్ని ముందుగా చూద్దాం. ఒకటి శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా కోసం రాసిన “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” అన్నది. రెండోది పెళ్ళిసందడి కోసం రాసిన “మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ” అన్నది. మూడోది గోదావరి లో “అందంగా లేనా అలుసై పోయానా” అన్నది. ఇవి షుమారు పాతికేళ్ళ కాలంలో వచ్చినవి. ఐతే మూడిటిలోని భావాలూ ఒకే మూసలోవి. పాత తరాలవి. మాటలపేర్పు మాత్రం శ్రోతల్ని ఆనందసాగరాల్లో ముంచెత్తింది.

అంతెందుకు, ఒక యువజంట గురించిన ఆర్ద్రమైన అనురాగగీతం రాయమంటే రాసేది, “అలివేణీ ఆణిముత్యమా, నీకంట నీటిముత్యమా” అనా?

పెళ్ళిసందడి చిత్రంలో మరో పాట “నవమన్మథుడా అతిసుందరుడా” అని మొదలయేది. అక్కచెల్లెళ్ళు తమ ప్రియుల గురించి సరదాగా మాట్లాడుకోవటం గురించి. అక్క సంప్రదాయంగా పెరిగిన పిల్ల, చెల్లి నవయువతి. చెల్లి “నవమన్మథుడా అతిసుందరుడా” అని ఆరా తీస్తే అక్క అడిగేది “శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నిను మెచ్చిన ఆ ఘనుడు” అని !

చివరికి “వేంప్ పాటల్లో” కూడ ఇలాటి భావాలే వినిపిస్తాయి. వేటగాడు లో అలాటి పాట “పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వొదిలేశాడు” అనేది. ఇలాటి వేంప్ పాట అంతవరకు ఎవరూ రాయలేదు. ఏదో “తీస్కో కోక కోల” అనో, ” లేలెలే నా రాజా” అనో పాడేవారు తప్ప ఇలా వదిలేసిన మొగుళ్ళ గురించీ తరిమేసిన తల్లిదండ్రుల గురించీ వేంప్ ల చేత పాడించటం వేటూరికే చెల్లింది.

దీనికి మరొక పార్శ్వం ఏమంటే, వేటూరి పాటల్లోని ఈ గుణాన్ని కొందరు దర్శకులు చక్కగా వాడుకుని మరిచిపోలేని పాటలు రాయించారు. పైన చూపిన “మథుర మధురతర మీనాక్షి” అలాటిది. ఇటీవలి గోదావరి, మాయాబజార్ లాటి చిత్రాలలోను (“సరోజదళనేత్రీ ఇదో లాహిరి”), అంతకుముందు విశ్వనాథ్ అనేక సినిమాల్లోను మనం ఈ విశేషం చూస్తాం. సప్తపది లో “వ్రేపల్లియ ఎద ఝల్లన పొంగిన మురళి” అన్న పాట ఈ కారణం వల్లనే చాలా పేరు తెచ్చుకుంది.

చివరి దశ

వేటూరి మొదలెట్టిన పాటల విప్లవం ఇరవై ఏళ్ళకు పైగా నిలకడగా నిలబడింది. శ్రోతలు మెచ్చుకున్నారు. పరిశ్రమ నెత్తికెత్తుకుంది. “కోటి రూపాయల పాట”లు ఎన్నో ఆ కలం నుంచి జాలువారాయి.

80ల మొదటి నుంచి 90ల మధ్య వరకు తన పాటలకు స్వర్ణయుగం అని వేటూరి చెప్పుకున్నాడు. ఇది నిజం. వేటూరి పాటల ప్రాధమిక సూత్రాలు ఆ కాలానికి అన్ని విధాలా అతికినట్టు సరిపోయాయి. ఇళయరాజా, వేటూరి కలిసి తెలుగు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఆడించారు. చెత్తసినిమాల్ని సైతం పాటల మహిమతో పాతికవారాలు ఆడించారు.

ఐతే 90ల చివర్లో తెలుగు సినిమా పాటకి మరోదశ వచ్చింది. లయకి మహర్దశ పట్టింది. శబ్దాన్ని చిన్నపీట మీదికి దించింది. అర్థానికి అర్థం లేకుండా చేసింది.

ఇలాటి స్థితిలో వేటూరి ఇంతకాలం సమర్థవంతంగా సంధించిన అస్త్రాల అవసరం తీరిపోయింది. మాట వినపడనప్పుడు అది ఏదైనా ఒకటేకదా ! పాట ఒక భాషలో ఉండాలన్న నియమం లేదు, అసలు అదేదో భాష అయుండాల్సిన అవసరం కూడ లేదు. “తను పాడిందే పాట” అన్నది సార్థకమై పోతుంది. ఎవరైనా పాట రాసెయ్యొచ్చు. దాంతో సంగీత దర్శకులే “ఆడా పాడా మద్దెల కొట్టా” అన్నట్టు పాటగాళ్ళు గానే కాదు, కూతల రచయితలుగా కూడా బహుపాత్రాభినయాలు ఆరంభించారు.

వేటూరి ఈ కాల ప్రభావాన్ని గుర్తించాడో లేదో చెప్పటం కష్టం. ఎందుకంటే ఈ మారుతున్న పాటకి అనుగుణంగా కొత్త అస్త్రాల్ని తయారుచేసుకోలేదు, కొత్త సూత్రాల్ని సిద్ధాంతీకరించుకోనూ లేదు. చాపకింద నీరులా వస్తున్న మార్పుల్ని అవలా వస్తున్న సమయంలో గమనించకపోవటానికి మంచి అవకాశాలున్నాయి. ఐతే మార్పుల్ని గమనించాక కూడ వాటిని విమర్శించటానికి పూనుకున్నాడే తప్ప ఈ కొత్త ప్రపంచంలో ఇమిడిపోవటానికి గట్టిగా ప్రయత్నించలేదు. అంటే ఈ మార్పులు తాత్కాలికాలనైనా అనుకుని వుండొచ్చు లేదా వాటితో పాటు తనూ మారటం సాధ్యం కాదని నిర్ధారించుకుని వుండొచ్చు. రెండోది నిజం కావటానికి ఎక్కువ అవకాశాలున్నాయి.

దీంతో వేటూరి పాటలో పదును తగ్గింది. ఎప్పుడన్నా ఒక “వినిపించే పాట” రాసే అవకాశం వచ్చినా అప్పటికే అతనికి నీరసం వచ్చేసింది. ఉదాహరణకి రామదాసు చిత్రం కోసం రాసిన భద్రాచలం గురించిన పాట గుర్తుంచుకోదగ్గది కాదు. అన్నమయ్య జననం గురించి రాసిన పాటకీ దీనికీ ప్రతిభలో హస్తిమశకాంతరం వుంది. అలాగే స్వరాభిషేకం సినిమా కోసం రాసిన “అనుజుడై లక్ష్మణుడు” అన్న పాట చాలా నీరసంగా సాగుతుంది. ఈ రెండూ వేటూరి అభిరుచులకు మంచి అనువైన సందర్భాలైనా వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఎందువల్లనో ఎప్పుడూ వాడే శబ్దాస్త్రాలు కూడ వీటి విషయంలో స్ఫురణకి రాలేదు. ఇటీవలి చిత్రాల్లో ఇలాటి ఉదాహరణలు చాలానే కనిపిస్తాయి – చివరికి చివరి దశలో పాత పాటల్ని మక్కికి మక్కి దించటం కూడ జరిగింది – ఒక ఉదాహరణ “ఆకాశంలో ఒక తార” అని ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్న పాట.

వేటూరి తర్వాత రంగప్రవేశం చేసిన రచయితల్లో సీతారామశాస్త్రి కొంతవరకు వేటూరిని అనుసరించాడు. ఐతే ఇద్దరికీ ఒక తేడా – సీతారామశాస్త్రి తీవ్రంగా ఆలోచించి పాటని రాస్తాడు. అందువల్ల అతని పాటల్లో కొంత అర్థ సమన్వయం ఉంటుంది. వీలైనప్పుడల్లా వేటూరిలా శబ్దవిన్యాసాలు ప్రయత్నిస్తాడు కాని అర్థాన్ని శబ్దానికి బలివ్వడు. ఐతే వేటూరికున్న శ్లేషాధిపత్యం కాని శబ్దపాండిత్యం కాని ఇతనికి లేవు. ఇప్పుడున్న మిగిలిన రచయితల్లో ఎవరూ చెప్పుకోదగ్గ విలక్షణతని చూపించేవారు కనిపించరు. ఐతే ఎవరూ వేటూరిని అనుకరించటానికి ప్రయత్నిస్తున్నట్టూ కనిపించరు. బహుశా వేటూరి మార్కు పాటలకు కాలం చెల్లిపోయిందని వాళ్ళ అభిప్రాయం అయుండొచ్చు కూడ.

ముగింపు

శబ్దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సినిమా పాటని రక్తి కట్టించిన వాడు వేటూరి. చెవికి ఇంపుగా ఉండటం సినిమా పాటకి ఉండాల్సిన ఏకైక లక్షణమని గుర్తించి అందుకు అవసరమైతే విషమసమాసాలు చేశాడు, మాటలకి గ్రామ్యరూపాలు వాడాడు, నోరుతిరగని గ్రాంధిక సమాసాల్ని అవలీలగా అతికించేశాడు. భాషాపరంగా ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఇవి వేటూరి పాటని చాలాకాలం నిలబెడతాయని అనుకోవటం ఉచితమే.