వేటూరి పాట

వేటూరికి శబ్దం ముఖ్యం అని ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఎలాటి సందర్భంలోనైనా అందంగా అనిపిస్తే ఎంత గ్రాంధిక శబ్దాల్నైనా వాడటానికి అతను వెనకాడలేదు. శంకరాభరణం లో పాటలు ఇందుకు ప్రబల సాక్ష్యాలు అనేది అందరికీ తెలిసిన విషయమే ఐనా ఆ సినిమా కథకి అలాటి పాటలే సరిపోతాయని సరిపుచ్చుకోవచ్చు. కాని, ఛాలెంజ్ సినిమాకోసం రాసిన ఈ పాటని ఏమనుకోవాలి?

ఇందువదన కుందరదన
మందగమన మధురవచన
గగనజఘన సొగసులలనవే
తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్యూ ఓ హారికా
నీ ప్రేమకే జోహారిక

దీన్లోనూ పైన చెప్పుకున్న రకరకాల పదవిన్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. చివరికి హారికకి జోహారికకి ప్రాస కూడ ! శ్రోతల శ్రద్ధ అర్థం మీద కాదు శబ్దం మీదే అని తెలిసిన రచయితే ఈ పని ధైర్యంగా చెయ్యగలిగేది.

అదివరకు సినారె ధర్మదాత సినిమా కోసం ఇలాటి ఒక చిన్న ప్రయోగం చేశాడు “జగదీశ్వరి పరమేశ్వరి” అన్న పాటలో. ఐతే అది ఒక తమాషా సందర్భం కోసం రాసింది. వేటూరి అలా కాదు, సందర్భంతో సంబంధం లేకుండా బావుంటుందనుకుంటే ఎక్కడైనా ఎలాటి పదాల్నైనా వాడటానికి జంకలేదు. పెళ్ళిసందడి ఈ పాట కూడ ఇలాటిదే –

సౌందర్యలహరీ స్వప్నసుందరీ నువ్వే నా ఊపిరి
శృంగారలహరీ స్వర్ణమంజరీ రావే రసవాహిని

అదివరకు ఇలాటి పాటల్ని పౌరాణిక చిత్రాల్లోనే విన్నాం. వేటూరి వాటిని అన్ని సినిమాలకీ పంచిపెట్టాడు.

పాటల్లో రాగాల పేర్లు చొప్పించటంలో కూడ వేటూరి అంతకుముందు ఎవరూ వెళ్ళని దూరాలకు వెళ్ళాడు. అదివరకు, సంగీతప్రధానమైన పాటల్లోనో లేక ఒక రాగం పేరుకు కథలో ముఖ్యపాత్ర ఉన్నప్పుడో మాత్రమే ఎప్పుడైనా కనపడేది ఈ లక్షణం. ఉదాహరణకు సినారె రాసిన “శివరంజనీ నవరాగిణీ” అనే పాట. అలాగే మేఘసందేశం కోసం రాసిన “పాడనా వాణి కల్యాణిగా” అన్న పాట. వేటూరికి అలాటి పట్టింపులు లేవు. సీతారామయ్యగారి మనవరాలు లో పైన చెప్పిన పాట ఒక చరణంలో

“అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే” అంటాడు. మరొక చోట “కన్నుల పొంగెను కావేరి / గొంతులో పలికెను సావేరి” అంటాడు. ఇలా ఎన్నో.

అలాగే, వేటూరి చేసిన భాషాపరమైన ప్రయోగాలు వాన పాటల గురించి చెప్పకుండా ముగించటానికి లేదు. అంతకుముందు ఆత్రేయ రాసిన “చిటపటచినుకులు పడుతూ వుంటే” అన్న వానపాట జగత్ప్రసిద్ధం. ఆయనే తర్వాత చాలాకాలానికి రాసిన “ఏం వానో తడుపుతున్నది / ఇది ఏం గాలో తరుముతున్నది” అన్న పాట కూడ బాగానే ప్రచారం పొందింది. ఐతే వేటూరి వానపాటల్లో కూడ సొంత ముద్రని సాధించాడు. “ఆకుచాటు పిందె తడిసె / కోకమాటు పిల్ల తడిసె” కొత్తతరం వానపాటలకి ఒరవడి ఐన పాట. కుందుర్తి “నగరంలో వాన” అన్న దీర్ఘకవితని స్ఫురణకి తెచ్చే ఈ పాట చిటపటచినుకులకి సరితూగే పాట. హద్దులు లేకుండా ఎగిరే స్వేచ్ఛాభావాల్ని ఆవిష్కరించే మాటలు దీనికి ప్రాణం పోశాయి. ఈ ఒరవడిలో వచ్చిన “వానా వానా వందనం”, “వానా వానా వెల్లువాయె”, “వానజల్లు గిల్లుతుంటే”, “స్వాతి చినుకు సందెవేళలో”, “స్వాతి ముత్యపు జల్లులలో” లాటి అనేక గీతాల్లో తన పదచమత్కారాలు చూపాడు వేటూరి.

బాధని విరహాన్ని వేటూరి ఎక్కువగా ప్రతీకల ద్వారా సూచించి విజయం సాధించాడు. అదివరకు ఆత్రేయ ఇలాటి అవకాశం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టేవాడు – “దేవుడికేం హాయిగ వున్నాడు / ఈ మానవుడే బాధలు పడుతున్నాడు”; “మనిషికి మనసే తీరని శిక్ష / దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష”; “మనసు లేని దేవుడు / మనిషికెందుకో మనసిచ్చాడు”; “దేవుడనే వాడున్నాడా అని / మనిషికి కలిగెను సందేహం”; “దేవుడు మనిషై పుట్టాలి” – ఇలా ఎన్నో. వేటూరి తను మిగిలిన రచయితల కన్న విలక్షణమైన పాటలు రాయాలని పట్టుదలతో వచ్చినవాడు కనక బాధకి కూడ కొత్త సంకేతాల్ని ఎంచుకున్నాడు. వీటిలో ముఖ్యమైంది కోకిల (యధాప్రకారంగానే దాని లలితరూపం “కోయిల”నే చాలా ఎక్కువగా వాడాడు).

“ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
మంచుతాకి కోయిల
మౌనమైన వేళల”

“ఎడారిలో కోయిల
తెల్లారని రేయిలా”

“వానకారు కోయిలనై
తెల్లవారు జాబిలినై”

నిజానికి ఒక్క “ఎడారిలో కోయిల” అన్న పాటలోనే తను ఎంచుకున్న బాధల ప్రతీకల్ని పుంఖానుపుంఖాలుగా గుప్పించాడు. వేటూరి పాటల తొలిదశలో వచ్చిన ఆ ఒక్క పాట ఆ తర్వాత వచ్చిన బాధల పాటలన్నిటికి మాతృక అని చెప్పొచ్చు.

ఎడారిలో కోయిల
తెల్లారని రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటి పాట

ఎదవీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నాదేవత
కల ఐతే శిల ఐతే మిగిలింది ఈ గుండెకోత

నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూత
విధిరాత చేత నా స్వర్ణసీత

ఆ రూపమే నాదీపమై
వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా
వెలిగించి తన కంటిపాప

చలిమంటలే చితిమంటలై
చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతికంటే
చేదైన ఒకతీపిపాట
చెలిలేని పాట ఒక చేదుపాట

వానకో, ఎండకో, చలికో బిక్కచచ్చిన కోకిల; తెల్లారని రేయి; వేసవో శిశిరమో ఐన ఆమని; గోదారైన పూదారి; రాలే పూత; చితిమంటైన చలిమంట; చేదైన తీపిపాట; ప్రేయసి / ప్రియుడు కల కావటం, శిల కావటం – ఇవి పదేపదే వినిపించిన ప్రతీకలు.

ఈ ప్రతీకలు కృష్ణశాస్త్రికి కొంత దగ్గరగా ఉంటాయి. ఐతే ఇందులో ఆశ్చర్యం ఏం ఉండకూడదు – వేటూరి మీద ఎంతో ప్రభావం ఉన్న భావకవిత్వానికి ఆద్యుల్లో ఒకడైన కృష్ణశాస్త్రికి ఇలాటి ప్రతీకల్తో పాతపరిచయం వుంది. అందుకే వేటూరికి ముందే –

“రానిక నీ కోసం చెలీ రాదిక వసంతమాసం
రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకొని”

“ఇది మల్లెలవేళయని ఇది వెన్నెలమాసమని
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది”

అని కృష్ణశాస్త్రి అంటే ఆ ప్రతీకల్ని సొంతం చేసుకుని ఇంకా విస్తరించాడు వేటూరి.

రానురాను ఇలాటి పాటల అవసరం తగ్గుతూ వచ్చింది కాని అవి వున్నంతకాలం ఈ ప్రతీకల్ని విరివిగా వాడాడు.

“రాగం తీసే కోయిల
కోయకు గుండెను తీయగా
రాతిరి వేళల రగిలే ఎండలా”