వేటూరి పాటల రచనా విధానాన్ని అవధానంతో పోల్చి కూడ అర్థం చేసుకోవచ్చు. నిజానికి చాలా సందర్భాల్లో ఆయన చుట్టూ అసిస్టెంట్ డైరెక్టర్లు పాటలు రాసుకోవటానికి ఆత్రంగా కూర్చునివుంటే ఒక చెట్టు కింద ఆశీనుడై ఒక్కొకరికి ఒక్కో పాదం చెప్తూ అవధానం లాగానే చేస్తుండేవాడని చూసినవాళ్ళు చెప్తారు. కనక ఈ పోలిక నిజానికి దగ్గర. అవధానంలో అవధాని ఎలా మాటల్ని పేర్చుకుంటూ ఏ పాదానికి ఆ పాదాన్ని తయారుచేసి ముందుకు సాగుతుంటాడో అలా వేటూరి పాటలు కూడ సాగుతాయి సాధారణంగా (ఎక్కడన్నా మొత్తం పాటని మనసుపెట్టి కట్టిన సందర్భాలు లేకపోలేదు గాని బహు తక్కువ. ఈ దుర్యోధన దుశ్శాసన అన్న పాట, అన్నమయ్య జననం గురించిన పాట ఆ కోవలోవి). అలాగే అవధానాల్లో ముఖ్యం అర్థం కాదు, ధ్వని. పృచ్ఛకుడు అడిగిన దానికి ఎక్కడో అక్కడ ఎంతో కొంత సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తే చాలు. వేటూరి పాటలకు కూడ అదే ప్రమాణాన్ని వాడాలి.
ఎంతో పేరు తెచ్చుకున్న “తకిట తధిమి” అన్న పాట చూసినా ఈ గుణాలు చక్కగా కనిపిస్తాయి. తొలిచరణం –
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరస
ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి
గుండియలను అందియలుగ చేసి
శబ్దాల్తో చెయ్యగలిగిన చమత్కారాలన్నీ చేశాడిక్కడ. ఎక్కడా ఎలాటి ఒడుదుడుకులూ లేకుండా సూటిగా సాగిపోతుంది పాట. ఐతే ఏ పదానికా పదాన్ని తీసుకుని అర్థం విచారిస్తే ఏకసూత్రత దొరకటం కష్టం. కొంత వేదాంత ధోరణి, జీవితం అశాశ్వతం అన్న ధ్వని, ఏదో లోతైన విషయమే ఉన్నట్టుంది అనిపించే భావభ్రమ – ఇవీ ఇక్కడ ముఖ్యమైన విశేషాలు.
భాషా చమత్కారాలు
వేటూరి తన ప్రతిభను ధారాళంగా చూపించింది భాషాపరమైన కొత్తదనంలో అని పైన చెప్పుకున్నాము. ఇందుకు కొన్ని ఉదాహరణల్ని ఇప్పుడు చూద్దాం.
వేటూరికి ముందు “ఎన్నెల”, “పలకాల” లాటి “గ్రామ్య రూపాల్ని” కేవలం తక్కువరకం పాత్రల పాటల్లోనే వాడేవారు. మూగమనసుల్లో “నా పాట నీ నోట పలకాల సిలక” అన్నది ఒక మంచి ఉదాహరణ. ఆ సందర్భంలో పాత్రల సంభాషణ ద్వారా కూడ ఇలాటి మాటలు “శిష్టులు” మామూలుగా అనరని బల్లగుద్ది చూపించారు. హీరో హీరోయిన్ల పాటల్లో “వెన్నెల”ని “ఎన్నెల” అని రాసిన రచయితలు అంతకుముందు కనిపించరు. వేటూరి ఈ పని ఎంత తరచుగా చేశాడంటే, ఇప్పుడు “వెన్నెల” అనే పదమే సినిమా పాటల్నుంచి నిష్క్రమించినట్టుంది. “వెన్నెల” కన్నా “ఎన్నెల” వినటానికి బాగుంటుందని వేటూరి గ్రహించటమే దీనికి మూలం. ఆ రెంటిలో ఏదైనా సమానంగానే సరిపోయే సందర్భాల్లో కూడ అతను “ఎన్నెల” అనే వాడటం ఇందుకొక తార్కాణం. ఉదాహరణకు “ఎన్నెల్లొ గోదారి అందం” అన్న పాట.
అలాగే, మామూలుగా చివర “లి” అనే అక్షరం వుండే “పలకాలి” లాటి పదాల్ని వేటూరి “ల” అంతాలుగా చేశేశాడు. ఐతే ఇది మొదట్నుంచి ఉన్నది కాదు. ఉదాహరణకి “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్న తొలిరోజుల పాటలో తొలిచరణం –
నాలోని అందాలు నీకన్నుల ఆరేసుకోనీ సందెవేళ
ఈపూట నాపాట నీపైటలా దాచేసుకోనీ తొలిపొంగుల
నీచూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలిమంట కావాలి
తొలి రెండు చరణాల అంత్యాక్షరాలు “ల” ఐనా కూడ చివరి చరణాలు “లి” తో ముగుస్తాయి. దీనికి కొన్నేళ్ళ తర్వాత వచ్చిన అభిలాష కి రాసిన “సందెపొద్దుల కాడ” అనే పాట తొలిచరణం –
కొండాకోన జలకాలాడే వేళ కొమ్మారెమ్మా చీరే కట్టేవేళ
పిందే పండై చిలక కొట్టేవేళ పిల్లాపాప నిదరే పోయేవేళ
కలలో కౌగిలే కన్నులు దాటాల
ఎదలే పొదరిళ్ళై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వులబాట వెయ్యాల
అలాగే ఇంటింటి రామాయణం లో ప్రసిద్ధమైన పాట
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహ లాడల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాల ఈ వేళలో
ఆ తర్వాత వేటూరి ఇలాటి పదాలకి “లి” రూపం వాడిన పాటలే లేవేమో !
ఈ పాటలు వేటూరి తెచ్చిన మరోమార్పుకి కూడ మంచి ఉదాహరణలు. అది “మామూలు” పాటల్లో గ్రామీణభాషని వాడటం. అంతకుముందు రచయితలు ఇలాటి పాటలు హీరో హీరోయిన్ల “డ్రీం సాంగ్స్” లో అవసరమైతే వాడేవాళ్ళు తప్ప విద్యాధికులైన పాత్రలు మెలకువగా పాడుకునే పాటల్లో కాదు (ఉదాహరణకు ప్రేమనగర్ లో “కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల” అన్న పాట). సీతారామయ్యగారి మనవరాలు అన్న సినిమాకోసం రాసిన ఓ పల్లవి –
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
విషమసమాసాల్ని విస్తృతంగా వాడటంలో కూడ వేటూరే ఆద్యుడు. అదివరకు ఆరుద్ర లాటి వారు ఎప్పుడన్నా చేసినా అవి ప్రయోగాలుగానే వుండేవి, హాస్యపాత్రల పాటలకి పరిమితమయ్యేవి. వేటూరి వాటిని సర్వసాధారణాలు చేశాడు. ఉప్పొంగెలే గోదావరి అనే పాటలో “భూదారి” లాటి మాటలు మొహమోటపడకుండా వాడేశాడు. ఇక అన్నమయ్య సినిమా కోసం రాసిన “అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి / రంగరించు సంగమాలు భంగభంగారె భంగా” అన్న పాటలో మాటలు అర్థాల గృహనిర్బంధాల్ని తెంచుకొని వీధుల్లో వీరవిహారం చేస్తాయి.
వేటూరి ప్రవేశపెట్టిన మరొక కొత్తదనం పాటల్లో హీరోల పేర్లు, బిరుదులు చొప్పించటం. ఉదాహరణకి ఆర్య సినిమాలో “అ అంటే అమలాపురం” అన్న పాటలో “అల్లువారి పిల్లగాడ / అల్లుకోరో సందెకాడ” అంటాడు. ఇక చిరంజీవి గురించి ఎన్నో పాటల్లో చూస్తాం. చూడాలని ఉంది అనే సినిమా కోసం రాసిన “యమహా నగరి” అన్న పాటలో “చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి” అంటాడు.
వేటూరి చేసిన మరొక ప్రయోగం నామ, క్రియా రూపాలకి ప్రాసలు చెయ్యటం. ఉదాహరణకి గోరింటాకు సినిమా కోసం రాసిన పల్లవి
కొమ్మకొమ్మకో సన్నాయి
కోటిరాగాలు ఉన్నాయి
ఇక్కడ “సన్నాయి” కి, “ఉన్నాయి” కి ప్రాస. అదివరకు ఎవరూ ఇలాటివి చెయ్యలేదని కాదు గాని వేటూరి చాలా విస్తృతంగా చేశాడు. రెండు క్రియాపదాల మధ్య గాని రెండు నామవాచక పదాల మధ్య చేసే ప్రాస కన్నా ఒక నామరూపానికి ఒక క్రియకి మధ్య ప్రాస అందంగా, చెవికింపుగా ఉంటుందని గ్రహించి, ఆచరించాడు వేటూరి. అన్నమయ్య సినిమాలోని “తెలుగు పదానికి జన్మదినం” అన్న పాటలో
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయ
అన్న ప్రయోగం రసికశ్రోతల్ని తన్మయుల్ని చేసింది.