వేటూరి పాట

ఈ దశలో వచ్చిన ఎన్నో పాటల్లో ఈ గుణాలు కనిపిస్తాయి. బాణీ ముందుగా ఇవ్వనప్పుడు నడక అస్తవ్యస్తంగా వుండటమూ, ఐనా చెవికింపైన మాటల పేర్పుతో ఆ లోపాన్ని కప్పెయ్యెటమూ సాధారణం.

ఇంకొక్క చిన్న ఉదాహరణ. శంకరాభరణం సినిమాకి రాసిన “శంకరా నాదశరీరా” అన్న పాటని వేటూరి రాసిన పద్ధతి ఇది-

శంకరా నాదశరీరా
పరా వేదవిహారా
హరా జీవేశ్వరా

ఇలా రాసిన పాటని మహదేవన్ సర్ది ఇలా తయారుచేశాడు –

శంకరా నాదశరీరా పరా
వేదవిహారా హరా
జీవేశ్వరా – శంకరా

ఇంత సరళమైన మూసతో పాట రాయటం అప్పటికి వేటూరికి పాట స్వరూపం మీద పట్టు దొరకక పోవటాన్ని సూచిస్తుంది.

ఈ తొలిదశకు సంబంధించిన సారాంశం ఏమంటే: ఒకటి – తొలిదశలో వేటూరి పాటల్లో ఎక్కువగా వినిపించింది భావకవిత్వపు భావాలు, ప్రబంధాల పదబంధాలు; రెండు – ఏ పాటని ఎలాటి మూసలో పొయ్యాలో అవగాహన చేసుకునే ప్రయత్నం, ఆ ప్రయాణంలో ఆటుపోట్లూ. ఈ రెండో కారణం వల్లనేనేమో బాణీలు ముందుగా ఇస్తే రాసిన పాటలు బాణీలు లేకుండా రాసిన వాటికన్నా స్థిరతలో నాణ్యంగా వుంటాయి.

పాటలో ఏకసూత్రత

మొదటి రెండు తరాల రచయితల్లో ఎక్కువమంది పాటను పూర్తిగా ఆలోచించి రాసినవారు. ఉదాహరణకు కృష్ణశాస్త్రి ఒకపాట మీద కొన్ని నెలలు వెచ్చించేవాడని చెప్తారు. ప్రతి పదాన్ని దాని స్థానంలో అది స్థిరంగా ఉండగలిగే వరకు కదుపుతూ ఇతర పదాల కోసం వెదుకుతూ సుదీర్ఘంగా ఆలోచించేవాడాయన. ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, సినారె అంతకాకపోయినా కొంతైనా పాట మొత్తానికి ఏకసూత్రత సాధించటానికి ప్రయత్నించారు. శ్రీశ్రీ ఒక్కడే ఇందుకు భిన్నంగా కనిపిస్తాడు.

వేటూరిది ఈ విషయంలో శ్రీశ్రీ దారి. అందువల్ల పాట మొత్తానికి ఏకసూత్రత ఉండటం అరుదు. చాలా చోట్ల ఒకే చరణంలో కూడ కనిపించదు. అతని దృష్టి ముఖ్యంగా ఉండేది పదాల పేర్పు మీద, పక్కపక్క పదాల మధ్య ధ్వని సంబంధాల మీద. శంకరాభరణం లోని పాటల విషయంలో ఇదెలా నిజమో పైన చూశాము. ముప్ఫై ఏళ్ళ తర్వాత ఇటీవల వచ్చిన కంత్రీ చిత్రంలో “వయస్సునామీ వచ్చెనమ్మా” అన్న ఒక పాట తొలి చరణం –

ఎరక్కపోయి యం యమా ఇరుక్కుపోయా ప్రియతమా
తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమచిమా

లేడివేటకు వేడిగవచ్చే వేటగాడివి నీవా
వేటకోసం వాడిగచూసే మాయలేడివి నీవా
చనువిచ్చాక మదనా నేనోపగలనా నిన్నాపగలనా

“ఇప్పుడొస్తున్న డూయెట్లలో అర్థాలూ పాదాల మధ్య సంబంధాలూ అంటూ చూడటం చాదస్తం” అనేది సహేతుకమైన వాదనే కాని అప్పుడైనా ఇప్పుడైనా రచయిత రాయదల్చుకుంటే బాణీల పరిధిలోనే అర్థవంతంగా రాయొచ్చు. ఏమైనా ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఈ చరణంలో అర్థం వుందా లేదా అని కాదు, చరణం మొత్తం మీద ఏకసూత్రత ఏదైనా అంతర్లీనంగా ఉందా అనేది. అలాటిదేమీ లేదనేది స్పష్టం. అలాగే మనం అనుకున్న సూత్రాలు ఈ పాటకీ చక్కగా వర్తిస్తాయనేదీ స్పష్టమే.

రొట్టె విరిగి నేతిలో

వేటూరికి దొరికిన ఒక అదృష్టం, ఇళయరాజా సంగీతదర్శకుడిగా రంగప్రవేశం చేసి చిత్రసీమని తల్లకిందులు చెయ్యటం, అక్కడినుంచి పాటకన్నా బాణీకే ప్రాధాన్యత అని అందరూ ఒప్పేసుకోవటం. బాణీకే పాట రాయాల్సి రావటం వేటూరికి అనుకూలంగా ఉండటమే కాదు, ఆత్రేయ లాటి పోటీదారుల్ని పక్కకు నెట్టేసింది కూడ. దాంతో వేటూరి రొట్టె విరిగి నేతిలో పడింది. మూస బాధల పంజరం నుంచి బయటపడి వేటూరి కలం రెక్కలు విచ్చుకుని ఎగిరింది. ఉదాహరణకి “గీతాంజలి” సినిమాలొ “ఆమనీ పాడవే హాయిగా” అన్నపాట మెత్తటి పదాల పేర్పుల్తో చాలా హాయిగా సాగిపోతుంది. “వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా / మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక / స్వరాల రాయగా పదాల సంపద / తరాల నా కథ క్షణాలదే కదా / గతించిపోవు గాధ నేనని” – ఇలా.

అర్థాన్ని ధ్వని ద్వారా సూచిస్తూ మెత్తగా సాగిపోవటం వేటూరి పాటల్లో ఒక ముఖ్య లక్షణం. శ్రోతల్లో అతికొద్దిమందే పాటల్లో ప్రతిపదార్థాల కోసం వెదుకుతారనే సత్యాన్ని గ్రహించి చరించినవాడు ఆచరించినవాడు వేటూరి.

ఇందుకు ఎన్నైనా పాటల్ని నిదర్శనాలుగా చూపొచ్చు. ప్రసిద్ధమైన ఒక పాట –

“రవివర్మకే అందని ఒకే ఒక అందానివో / రవి చూడని పాడని నవ్యనాదానివో” అన్న పల్లవిలో అందని – అందానివో, చూడని – పాడని, అందానివో – నాదానివో అన్న శబ్ద చమత్కారాలు అర్థాన్ని పట్టించుకోనివ్వవు. ఐతే ఈ చిత్రంలో నాయకుడి పేరు రవి అని తెలిస్తే, రెండో పాదంలో ఏదో అర్థం ఉన్న భ్రాంతి కలుగుతుంది. సినిమాపాటకు ఆపాటి చాలు అని గ్రహించటం వేటూరి చాతుర్యం. అదే అతన్ని విజేతని చేసింది.

ఇంకో ఉదాహరణ చూద్దాం. “అన్నులమిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే / తొలిసిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే” అన్నదీ పేరున్న పాటే. ఈ పల్లవిలో కూడ ఎన్నో శబ్దాలంకారాలున్నాయి. అన్నీ మెత్తమెత్తటి మాటలే. ఇందులో తొలిచరణం –

ఆదేవుడు ఆదేవితొ అలక పూనెనేమో
ఈరూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమొ
మోహనాల సోయగాల మేనకో
మరి దేవలోకపారిజాత మాలికో

లక్ష్మిగా “ఇలకు”వచ్చి మేనగ్గా మారటంలో ఔచిత్యం ఏమిటో?