అర్థంకాని కవిత్వం

ఈ తత్త్వం తెలిసిన పాఠకునికే ఈ కవిత్వం అర్థమవుతుంది. ఒక రకంగా చూస్తే ఇలాంటి కవిత్వ సృజనలో కవి పాత్ర నూరుశాతం, పాఠకుని పాత్ర కూడా నూరుశాతమే! ఉదాహరణకి మూలా సుబ్రహ్మణ్యంగారి ‘మంచు’ కవిత చూడండి:

చలికాలపు సాయంత్రం
ఎవ్వరూ లేని బాట మీద
ఏకాకి నడక.

రాలిన ఆకుల కింద
ఎవరివో గొంతులు

ఎక్కడో దూరంగా
నిశ్శబ్దపు లోతుల్లోకి
పక్షి పాట

లోయంతా సూర్యుడు
బంగారు కిరణాలు పరుస్తున్నా
కాసేపటికి ఆవరించే చీకటి మీదకే
పదే పదే మనసుపోతోంది

కర్రపుల్లల కొసన నర్తించే
ఎర్రని చలిమంటలోకి
ప్రవేశించాలనిపిస్తోంది.

కురిసే మంచు
నా గొంతులో
ఘనీభవిస్తోంది.

ఈ క్షణం నా పాటకి
మాటల్లేవు!

కొన్ని దృశ్యాలని కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఒక సన్నివేశంలో తనకి కలిగిన ఒకానొక అనుభూతికి అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేశాడు. ఇందులో అస్పష్టతకి తావులేదు. ఆలోచనకీ విశ్లేషణకీ కూడ తావులేదు. చదివిన పాఠకులకి ఎవరి అనుభూతి వారిదే, పూర్తిగా. అయితే, యీ కవితలో కవి గొంతు కొంత ఉంది. అంటే, కేవలం దృశ్యాన్ని పదచిత్రాలతో వర్ణించి ఊరుకోకుండా, తను పొందిన అనుభూతిని కూడా పదాలలో పెట్టే ప్రయత్నం కవి చేశాడు. అనుభూతికవిత్వంలో పదచిత్రాలు మాత్రమే ఉండాలన్న నియమం లేదు. కవి పొందిన అనుభూతిని వ్యక్తం చెయ్యడానికి పదచిత్రాలు ఒక సాధనం మాత్రమే. అయితే కొన్నిసార్లు కవి పూర్తిగా మౌని అయిపోయి, కేవలం అతను చూసిన దృశ్యాలు మాత్రమే ఉండటం కూడా జరుగుతుంది. అలాటి కవితల్లో పాఠకునికి పూర్తి ఏకాంతం దొరుకుతుంది. ఉదాహరణకి సుబ్రహ్మణ్యంగారిదే మరో కవిత:

ఎగురుతూ ఎగురుతూ
చటుక్కున కొలను బుగ్గని
ముద్దు పెట్టుకుంది తూనీగ

తెరలు తెరలుగా….
సిగ్గు.

ఇలాంటి కవిత్వానికి హైకూ పరాకాష్ఠ. ఉదాహరణకి:

గుడిగంట మీద
సీతాకోక చిలుక
నిదురిస్తూ

అన్న హైకూ అర్థమేమిటి? కవి ఏం చెపుదామనుకుంటున్నాడు? అనే మీమాంస అసమంజసము, నిష్ప్రయోజనమూను. కవి ఒకానొక దృశ్యంలో లీనమై, మమేకమై ఆ దృశ్యాన్ని అతి క్లుప్తంగా, స్వచ్ఛంగా, నిశ్శబ్దంగా, పదాలలో వ్యక్తపరచాలని ప్రత్నించినపుడు హైకూ పుడుతుంది. అలా మమేకమైనప్పుడు కవి పొందిన అనుభూతి ఏమిటో కవి కూడా చెప్పలేడు, చెప్పే ప్రయత్నమూ చెయ్యడు. ఆ పదాల వెనక కనిపించే దృశ్యాన్ని పాఠకుడు కూడా దగ్గరగా చూడగలిగినప్పుడు, అందులో అంతో ఇంతో లీనమవ్వగలిగినప్పుడు, ఆ పాఠకునిలో ఆ హైకూ పునర్జన్మ పొందుతుంది. చదవగానే అలాంటి మమైక్యం కలగకపోవచ్చు. దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించినా అది కలగదు. దాన్ని మరల మరల చదువుకొని, మనసులో ఆ దృశ్యాన్ని రూపుకట్టుకొనే ప్రయత్నం చెయ్యగా చెయ్యగా ఎప్పటికైనా కలగవచ్చు. అదొక యోగం!

ఇలా, ఒకో రకమైన కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి ఒకో రకమైన సాధన అవసరమవుతుంది. కొంతమంది విమర్శకులకి కవిత్వాన్ని యిలా రకరకాలుగా విభజించడం నచ్చదు. కాని అలాంటి విభాగం వలన కూడా ప్రయోజనాలున్నాయి. కవిత్వంలో ఒకో విభాగాన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలతో గుర్తుపట్ట గలిగినప్పుడు, అలాంటి కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి అవసరమైన ప్రత్యేక సాధనాలని గుర్తించే అవకాశం ఉంటుంది. కవిత ఒక బీజమైతే, అది పండే క్షేత్రం పాఠకుని మనసు. కవిత్వపఠనం ఒక కృషి, వ్యవసాయం. ఒక్కొక్క రకమైన విత్తనాలు ఒక్కొక్క రకమైన నేలలోనే మొలకెత్తుతాయి. ఒకో పంటని సాగు చెయ్యడానికి ఒకో రకమైన వ్యవసాయ విధానం అవసరమవుతుంది. కవిత్వపఠనమూ అంతే!

ఈ వ్యాసం కేవలం పాఠకుని దృష్టికోణం నుండి వ్రాసినది. అందుకే యిందులో పాఠకుడు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి చెయ్యవలసిన కృషిని మాత్రమే ప్రస్తావించాను. అంత మాత్రం చేత కవికి ఎలాంటి బాధ్యత లేదని అనుకోడం పొరపాటు. మేమెలాంటి కవిత్వం వ్రాసినా దాన్ని పాఠకులు అర్థం చేసుకోవాలి, లేకపోతే అది పూర్తిగా వారి లోపమే అని కవులు అనుకుంటే అది వాళ్ళ నిరంకుశత్వం అవుతుంది. కవిత్వం చదవడంలో పాఠకునికి ఎంత బాధ్యత ఉందో, వ్రాయడంలోనూ కవికి అంతే బాధ్యత ఉంది. తను ఎన్నుకున్న వస్తువుకి తగిన రూపాన్ని, శైలిని ఎన్నుకొనే నేర్పు కవికి తప్పనిసరిగా ఉండాలి. తాము ఎందుకు, ఎలాంటి కవిత్వం వ్రాయదలుచుకున్నారు అన్న విషయం మీద స్పష్టత ఉండాలి. ఉదాహరణకి, యీ మధ్య ఇంటర్నెట్ ప్రభంజనంతో చాలామంది కొత్త కవులు పుట్టుకు వచ్చారు. తాము వ్రాసిన కవితలని ఏదో పత్రికకి పంపించి అందులో పడుతుందా లేదా అని వేచి చూడనక్కర లేకుండా, తమ స్వంత సైట్లలోనో, బ్లాగులలోనో ప్రచురిస్తున్నారు. ఇంటర్నెట్లో సాహిత్యాన్ని ఆ మధ్య నిడదవోలు మాలతిగారు జానపద సాహిత్యంతో పోల్చారు. ఆ పోలిక ఒక రకంగా సమంజసమైనదే. ఇందులో చాలావరకూ కవితలు అప్రయత్నసిద్ధాలుగా (spontaneous) అనిపిస్తాయి. శైలీ, శిల్పాల మీద దృష్టి తక్కువగా కనిపిస్తుంది. ఇవి జానపద కవిత్వ లక్షణాలే. పత్రికలు సాధారణంగా శైలీ శిల్పాలకోసం చూస్తాయి. విమర్శకులు కూడా అంతే. మరి తమ కవితలు పత్రికలలో ప్రచురించడం లేదనో, విమర్శకులు మెచ్చి మేకతోలు కప్పడం లేదనో విచారించడం అవివేకమే అవుతుంది. తాము వ్రాసేది అటువంటి వారి మెప్పుకోసం కాదన్న స్పష్టత వారికి ఉండాలి.

కవికీ పాఠకునికీ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా, తప్పనిసరిగా ఉండాల్సింది నిజాయితీ.

గోమెజ్ దవీలాదే మరొక వాక్యోక్తితో యీ వ్యాసం ముగించడం సమంజసం.

 The modernist thirst for originality makes the mediocre artist believe that the secret of originality consists simply in being different.