ఇక అన్నిటిలోకీ అసలు కొరుకుడు పడని కవిత్వం అధివాస్తవికత నిండిన కవిత్వం. దీనికి తెలుగులో ఆద్యుడని చెప్పదగ్గవారు శ్రీరంగం నారాయణబాబు. అతను అధివాస్తవికుల మతాన్ని గురించి చెప్పిన మాటలివి:
“యథార్థ జగత్తూ స్వాప్నిక జగత్తూ తారుమారయ్యాయి. యథార్థాన్ని గుర్తించము. కలలు మాకు యథార్థాలు. ఈ జగత్తుతో మాకు పనిలేదు. మాది స్వప్నజగత్తు. సంపన్నులూ, భాషాసంపన్నులూ మాకు విరోధులు. కావ్యలక్షణాలే అవలక్షణాలు. అందరం కవులమే. వ్యక్తాలని వదిలిపెడతాము. వ్యక్తావ్యక్తంలో ఈత కొడతాము. ఏదో విధమైన శక్తి మమ్మల్ని పూనుతుంది. ఎదేదో రాయిస్తుంది. అర్థమనర్థం. అదేది రాయిస్తే అదే కవిత్వం. ఇది అధివాస్తవికుల మతం. సాహిత్య వృక్షం మీద, చిటారికొమ్మన కూర్చొని ఊగిసలాడడం. ఇది సాహిత్యానికి గొప్ప ప్రయోజనం, అనర్థం కూడా సమకూరుస్తుంది. కేవలం ప్రయోజనాన్నే వినియోగించుకొని, అనర్థాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చెయ్యగలపని. అధివాస్తవికులు తీసుకువచ్చిన మార్పు రాజకీయమైందా? మనో ప్రవృత్తికి చెందినదా? Goerge Hugnet, “son ton destructeur” అన్న మాట నిజం!”
ఈ మాటలు చదివితే, అధివాస్తవిక కవిత్వం మరొకరు అర్థం చేసుకోడానికి ఉద్దేశించినది కాదని అర్థమవుతుంది. పైన చెప్పిన విషయాలే ఒక కవితా రూపంగా కూడా చెప్పారు నారాయణబాబు, నీ వెవరే! అనే కవితలో:
పాడే రేడియో!
నా చేతిని గడియారం
కనిపించని
కాలం గుఱ్ఱం
డెక్కల చప్పుడు
“టిక్కు! టిక్కు!”దరిద్రంతో
తాపత్రయాలతో
వెంటాడిన
వెఱ్ఱికుక్క
దినానికి
తిలోదకాలు!హాయిగా
అర్థరాత్రి
ఆడామగా
తడిమినా తెలియని
తాండ్రపాపారాయుడు
తమస్సు!బుద్ధి హృదయం
ధ్యానబద్ధులై
నిమీలిత నేత్రాలతో
నిద్రిస్తే
వ్యక్తావ్యక్త లోకంలోంచి
వెలుగుబాటలు
చూపించే
నీవెనరే!
నిజానికి యీ కవిత బొత్తిగా అర్థం లేనిది కాదు. మరికొన్ని కవితలతో పోలిస్తే కొంతలో కొంత అర్థమయ్యేది కూడాను. అయినా ఇది అర్థవివరణ అపేక్షించే కవిత కాదు. పైన ఉదహరించిన కవితల్లా దీనికి ఎవరో ఒక వ్యాఖ్యానము, ఒక అన్వయమూ చెప్పకూడదు. ఎవరికి వాళ్ళు చదువుకోవలసినదే. ఈ కవిత్వం పాఠకునిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చాలావరకూ పాఠకునిపైనే అధారపడి ఉంటుంది. కవి చెప్పినది పది శాతమైతే, పాఠకుడు పూరించుకోవలసినది తొంభై శాతం! అధివాస్తవికత అందరికీ అరిగే దినుసు కాదు. మనకు అరగని దాన్ని ఆరగించకపోవడమే శ్రేయస్కరం.
వ్యాఖ్యానాన్ని అపేక్షించని కవిత్వం, అధివాస్తవిక కవిత్వానికి పూర్తిగా వ్యతిరిక్తమని చెప్పదగినది, మరొకటి ఉంది. ఈ కవిత్వాన్ని అనుభూతికవిత్వం అన్న పేరుతో కొంతమంది పిలుస్తారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారితో మొదలయిన యీ తరహా కవిత్వం ఇస్మాయిల్ గారితో ఎక్కువ ప్రచారం పొందింది. ఇస్మాయిల్ గారి యీ మాటలు అనుభూతికవిత్వ తత్త్వాన్ని పట్టిస్తాయి:
“ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను ఉద్దేశించిన సంవేదనల్ని (feelings) మనలో రేపే పదచిత్రాల్ని (images) ఎన్నుకుంటాడన్నమాట. అనుభూతికి అవరోధమయే ఆలోచనా సామాగ్రిని దరికి జేరనివ్వడు. అనుభూతి ద్వారా మనిషికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ అనుభూతి స్వరూపం ఆనందం. ఇంతకన్నా పరమార్థం వేరే ఉందనుకోను.”