ఉద్యమ కవితలని పక్కన పెడితే, సామాజికస్పృహ ఉన్నా లేకున్నా, అభివ్యక్తిలో సంక్లిష్టత ఉన్న కవితలని అర్థం చేసుకోడానికి పాఠకులనుండి కొంత సాధన అవసరమవుతుంది. ధ్వని, అధిక్షేపము, ప్రతీక, పదచిత్రం మొదలైన కవితా సామగ్రితో, శిల్పదృష్టితో రచించే కవితలని అర్థం చేసుకోడానికి, ఆ రచనా సామగ్రితో కొంత పరిచయం అవసరమవుతుంది. ఇందులో మళ్ళీ స్పష్టమైన పదచిత్రాలతో మూర్తమైన దృశ్యాలని వర్ణించే కవితలలో అస్పష్టత ఉండడు. ఆయా దృశ్యాలని మనసులో భావించుకొనే నేర్పుంటే చాలు, ఆ కవితలు చక్కగా అర్థమై మనసుకి హత్తుకుంటాయి. శేషేంద్ర పదచిత్రాలు రెండు దీనికి మంచి ఉదాహరణలు:
పైన చంద్రుడు
మబ్బుతునక వేలు పట్టుకుని
నడిపించుకుని పోతున్నాడు
కింద నా జీవిక నిశ్శబ్దంగా కురిసే వెన్నెట్లో
నిశ్చలంగా తడిసే అడవిలా నుల్చోనుంది
మబ్బుతునక వేలు పట్టుకుని సాగిపోయే జాబిలి, అది కురిపించే వెన్నెలా – ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే, అలాంటి ప్రకృతి రమణీయకతకి దూరమైన మన జీవితాలు ఎలా అడవికాచిన వెన్నెలై పోతున్నాయో మనకి స్పష్టంగా అనుభవానికి వస్తుంది. అలాగే,
భూమిలో ఉన్న
చిన్నారి గింజ
మెడ బయటపెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో
తనకి జీవమిచ్చిన రైతుకి అప్పుడే మొలకెత్తిన గింజ తెలిపే కృతజ్ఞత ఎంత మనోహరమైన దృశ్యమో ఊహించకోగల పాఠకునికే తెలుస్తుంది. ఇలాంటి కవితల్లో అస్పష్టత ఉండదు. సంక్లిష్టత చాలా తక్కువ. పాఠకుడు చెయ్యవలసినదల్లా, కవితలోని పదాల రేఖలతో, వర్ణాలతో, ఆ దృశ్యాన్ని తన మనస్సులో చిత్రించుకోవడమే.
కొన్ని కవితలు కొంతవరకూ చదివేదాకా అవి ఏ అంశాన్ని గురించి చెపుతున్నాయో అర్థం కావు. కాని కొన్ని పంక్తుల తరువాత అందులోని విషయం స్పష్టమై, ముందు చదివిన వాక్యాలని మళ్ళీ చదివించి, మనసులో ప్రస్ఫుటమైన ముద్ర వేస్తాయి. కాబట్టి కవితని ఆసాంతం ఆసక్తితో చదవడం పాఠకుని బాధ్యత. ఒక ఉదాహరణ మెహజబీన్ గారి ‘సరిహద్దు రేఖలు’ కవిత:
“అక్కడ
జీవితం గాయపరిచిన పక్షులన్నీ
పేదరికం మూటగట్టుకుని వాల్తాయి
బాధలు గాధలు సమానత్వం పాటిస్తాయి
పెదాలు మూగవోతే కన్నీళ్ళు మాట్లాడతాయి”
ఇక్కడ వరకూ కవిత దేని గురించన్నది స్పష్టం కాదు.
“బతుకు కోసం పాడే ఏకగ్రీవ జావళీలో
జార్చిన కొంగులు, పర్చిన పైటలు
నేపథ్య సంగీతమై భాసిల్లుతాయి
యవ్వనీకరించిన బాల్యం
వికసిస్తూ చేసే చప్పుళ్ళకు మొగ్గలు
విహ్వలంగా రాల్తాయి”
అన్న పంక్తులు కవిత విషయాన్ని ధ్వనించి మళ్ళా మొదటి పంక్తులని మనచేత చదివిస్తాయి. అలా స్పష్టత ఏర్పడ్డ తరువాత, మిగతా కవిత బలమైన పదచిత్రాలతోను చక్కని ధ్వనితోనూ మన మనసులని కుదిపేస్తుంది.
“కలలు తగలబడుతున్న దృశ్యం
దారుణంగా గుండెను తాకుతుందిఅమ్ముకునే ప్రవాహ సుఖాల మధ్య
ఇంకిపోయే ఒంటరి కన్నీటి చుక్కలు
సమాజానికి సవాల్ విసురుతాయిఅక్కడ తరాల విలాసాల చరిత్ర
మిగిల్చిన సాంఘిక అవశేషాలు
మనల్ని తలెత్తుకోనీకుండా చేస్తాయి
‘మెహందీ’ శిథిల శకలాలు
సరిహద్దు రేఖల్ని గీస్తాయి”
ఈ కవితని అర్థం చేసుకోవడానికి మనకి కవితా వస్తువుతో నేరుగా పరిచయం అవసరం లేదు. కవితా నిర్మాణంలో ఉన్న శక్తి వలన అది మనలని బలంగా హత్తుకుంటుంది. కలలు తగలబడే ఒక అమూర్తమైన దృశ్యాన్నీ, ఇంకిపోయే ఒంటరి కన్నీటి చుక్కలనీ ఊహించుకొనే శక్తి పాఠకులకి ఉండాలి. ఆ ఊహ, ఆ అనుభూతి ప్రతి పాఠకునికీ ప్రత్యేకమే.