కోనసీమ కథలు: విలేకరి

ఆ తరువాత నన్ను తిరిగి కలుస్తానన్న రాఘవ రాలేదు. ఆర్నెల్ల తరువాత దమయంతికి పెళ్ళి కుదిరిందని తెలిసింది. ఈ సారీ వెంకట్రామయ్య నన్ను పిలవలేదు. అసలు పెళ్ళి కుదిరిందన్న సంగతి కూడా చాలా గుట్టుగా వుంచాడు. బహుశా నేను రాసిన వార్త గురించి తెలిసి ఎవరైనా ఈ పెళ్ళి చెడగొడతారనుకున్నాడో ఏమో? మొత్తానికి దమయంతికి పెళ్ళి కుదిరిందని సంతోషించాను.

దమయంతీ మా పెద్దమ్మాయి ఈడుదే! నేనూ మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను. మంచి సంబంధం దొరకడం కష్టంగానే అనిపించింది. మా అమ్మాయి రాధ బియ్యెస్సీ చదివింది. ఇహ పై చదువులకి పంపలేక ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ సీటొచ్చినా స్తోమత లేక చదువాపించేసాను. సంక్రాతికి జగ్గన్నతోట తీర్థంలో దమయంతి కనిపించింది.

“మావయ్యగారూ బావున్నారా?” అంటూ పలకరించింది. కుశల ప్రశ్నలయ్యాక తనే చెప్పింది.

“మావయ్యగారూ, వచ్చే మాఘ మాసంలో నా పెళ్ళి. మీరందరూ తప్పకుండా రావాలి.” అని పెళ్ళికి పిలిచింది. అలాగేనని పైకి అన్నాను కానీ విషయం మా ఇద్దరికీ తెలుసు.

“బావుంది. చాలా సంతోషం! కట్నమూ, లాంఛనాలూ అవీ ఎంతేవిటీ?” అని పూర్ణ ఆసక్తిగా అడిగింది. ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి చాలా ఆసక్తి.

“కట్నవాఁ? అది తీసుకోని వాణ్ణే చేసుకుంటానని మా నాన్నకి తెగేసి చెప్పేసాను. నాకీ కట్నాలూ అవీ అంటేనే అసయ్యం. కట్నం వద్దన్న వాణ్ణే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. అంతే! మావయ్యగారికి నేను చేసింది నచ్చుతుంది. కదండీ?” అంటూ నా వైపు తిరిగి అంది.

దమయంతి అదృష్టవంతురాలు. అనుకున్నది సాధించింది. అదే చెప్పాను.

“మా నాన్నకీ, మీకూ… అదెందుకులెండి. మీరు తీర్థానికొస్తారని తెలుసు. అందుకే మీకోసం ఈ శుభలేఖ పట్టుకొచ్చాను. నాకోసమయినా మీరు పెళ్ళికి రండి,” అంటూ శుభలేఖ చేతిలో పెట్టింది.

మేం ఎవరూ ఏం మాట్లాడ లేదు. శుభలేఖ తీసి ఎవరా పెళ్ళికొడుకని చూసాను. పెళ్ళి కొడుకూ వాళ్ళది మధ్య ప్రదేశ్ అని చెప్పింది. తెలుగువాళ్ళేనని, అతని పేరు ప్రసాదు అనీ, బి.హె.ఈ.ఎల్లో పని చేస్తున్నాడని చెప్పింది. రాఘవ గురించి అడుగుదామా అనుకొని ఆగిపోయాను. అతని ప్రసక్తి ఇప్పుడనవసరం.

పెళ్ళికొడుకు పేరు “సత్య సూర్య సుబ్రహ్మణ్య నాగ శ్రీరామచంద్ర వరప్రసాద్” అంటూ పైకి చదువుతూ – “ఏమే దమయంతీ! మీ కాబోయే వాణ్ణి పూర్తి పేరుతో పిలిస్తావా? కొల్లేటి చాంతాడంత ఉంది. మొత్తం చదివితే ఆయాసం వచ్చేటట్లే ఉంది.” మా పెద్దమ్మాయి రాధ వేళాకోళం చేసింది. నిజానికి మా పెద్దాడి పేరు కూడా అక్షరం పొల్లు పోకుండా ఇలాగే ఉంటుంది. ఇదే విషయం పూర్ణ చెప్పి రాధని తప్పని కసురుకుంది.

దమయంతి మా అమ్మాయి రాధతో కబుర్లలో పడిపోయింది.

నేను దమయంతిని చూడ్డం అదే ఆఖరిసారి. ఫిబ్రవరిలో దమయంతి పెళ్ళయ్యింది. మేమెవరమూ వెళ్ళలేదు.


మా అమ్మాయి రాధకి పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టాను. రెండు మూడు సంబంధాలు వచ్చాయి కానీ కుదర్లేదు. పిల్ల నచ్చలేదని ఒకరూ, మాకు ఆస్తులూ గట్రా లేవని ఇంకొకరూ, మాకిష్టమయితే రెండో అమ్మాయిని చేసుకుంటామని ఇంకొకరూ ఇలా చాలా ప్రహసనాలు జరిగాయి. నేనూ విసిగి వేసారి పోయాను. ఈలోగా ఎవరో దూరపు బంధువుల ద్వారా తిరపతి నుండి ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి మద్రాసులో బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాళ్ళు పిల్ల నచ్చిందనీ, కానీ కట్నం వద్దనీ అన్నారు. నాకూ వారి ఆదర్శం నచ్చి, ఈ పెళ్ళి ఖాయం చేద్దామనుకుంటూండగా వాళ్ళు చివర్లో చిన్న మెలిక పెట్టారు. అది – మా అమ్మాయి డిగ్రీ చదివింది కాబట్టి, పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఉద్యోగం చెయ్యాలని.

ఇంతలో మా ఆవిడ తరపు బంధువొకరు వైజాగు బీ.హెచ్.పీ.వి సంబంధం ఒకటి తీసుకొచ్చాడు. వస్తూ వస్తూనే చెప్పా పెట్టకుండా అమలాపురం బస్సు స్టాండునుండి పెళ్ళికొడుకుని తీసుకొచ్చానని కబురంపాడు. గత్యంతరం లేక సరే నన్నాను. పెళ్ళికొడుకు ఇంజనీరు. అప్పటికప్పుడు హడావిడిగా పెళ్ళి చూపులు ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ ఆ పెళ్ళికొడుక్కి పిల్ల నచ్చిందనీ, మర్నాడే తాంబూలాలు పుచ్చుకుందామనీ అన్నారు. నేను కాస్త తటపటాయించాను. అమ్మాయినడిగి చెబుతాననీ అన్నాను. వచ్చిన మా బంధువు ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ పెళ్ళి చూపుల్లో ఒక తమాషా ఉంటుంది. అన్నీ అతిశయోక్తులే ఉంటాయి. ఎవరెవరెంత మంచివారో, గుణవంతులో ఉలవలూ, పలవలూ చేసి చెప్పుకుంటారు. ఇంటికొచ్చి పూర్ణనడిగితే మద్రాసు సంబంధం పిల్లాడు బావున్నాడనీ, పైగా కానీ కట్నం లేకుండా చేసుకుంటున్నాడనీ, వైజాగు పిల్లాడు ఓ మోస్తరుగా ఉన్నాడనీ ఆవిడ వైపు లాజిక్కు లాక్కొచ్చింది. ఈ వైజాగు వాళ్ళు కట్నం మాత్రం పదిహేను వేలడిగారు. కాస్త ఎక్కువే అనిపించింది. మా అమ్మాయినడిగితే కాస్త ఆలోచించుకొని చెబుతానంది. ఇందులో మా అమ్మాయి నిర్ణయం ఏమీ ఉండదు. నికార్సుగా చెప్పాలంటే మా ఆవిడ మాటనీ నేను తోసిరాజంటానన్న విషయం వాళ్ళకి తెలుసు. నేనూ సందిగ్ధంలో పడిపోయాను. మర్నాడు చెబుతానని అంటే వాళ్ళు రాత్రికి అమలాపురంలోనే ఉండి మర్నాడు వెళతామన్నారు. స్నేహితులింట్లో విడిది ఏర్పాటు చేసాను.

రాత్రంతా ఆలోచన్లతో నిద్ర పట్టలేదు. తెల్లారి లేచి వంటింట్లో కాఫీ తాగుతూ పూర్ణతో పెళ్ళి విషయం చర్చిస్తూండగా రాధ వచ్చింది.

“నాన్నా! రాత్రంతా ఆలోచించాను. నాకు వైజాగు సంబంధమే నచ్చింది,” అంటూ మెల్లగా బాంబు పేల్చింది. నిజానికి నేను మద్రాసు సంబంధం మనసులో ఖాయం చేసేసుకున్నాను. ఒక్కసారి ఏమనాలో తెలీలేదు.

“అదేవిటే! మద్రాసు వాళ్ళు కానీ ఖర్చులేకుండా చేసుకుంటానంటే వైజాగు సంబంధం నచ్చిందంటావు? ఈ వైజాగు పిల్లాడు మోస్తరుగా ఉన్నాడు. పైపెచ్చు పదిహేను వేలడుగుతున్నారు. మీ నాన్న పదివేలు మించి ఇచ్చుకోలేరు. నీ తరువాత చెల్లెలొకత్తుంది. మద్రాసు పిల్లాడు బంగారంలా ఉన్నాడు,” అంటూ పూర్ణ గదవాయించింది.

పూర్ణ మా అమ్మాయిని ఒప్పించాలని ప్రయత్నిస్తోంది. నేనూ సమర్ధించాను. చివరకి రాధ మా వాదనలతో విసిగిపోయి, “నా ఇష్టం అడిగారు కాబట్టి చెప్పాను. అయినా పెళ్ళి చేసుకునేది నేను. మీరు కాదు. మద్రాసు అబ్బాయికి కట్నం అక్కర్లేదు. కాదనను. కానీ ఉద్యోగం చెయ్యాలన్న కండీషనే నాకు నచ్చలేదు. నాన్నా! అతనికి నాతో సంసారమే కాదు; సంపాదన కూడా కావాలి. పెళ్ళికి ముందే ఇన్ని షరతులుంటే పెళ్ళయ్యాక ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో? మద్రాసు సంబంధం చేసుకోను,” అంటూ మొండిగా అనేసి వెళిపోయింది.

చాలాసేపు మౌనంగా ఉండి లేచి వెళ్ళబోతూండగా “ఏం చెయ్యబోతున్నారని?” పూర్ణ అడిగింది. రాధ మనసుకి వ్యతిరేకంగా పెళ్ళి చెయ్యదల్చుకోలేదు. కట్నం ఇవ్వడం నాకిష్టం లేకపోయినా కూతురి ఇష్టాన్ని కాదనలేను. ఇష్టంలేని పెళ్ళీ, నమ్మకం లేని వైద్యమూ పట్టివ్వవు.

ఎందుకో అప్రయత్నంగా దమయంతి గుర్తుకొచ్చింది. డిగ్రీ చదివిన మా అమ్మాయికీ, అంత చదువుకోని దమయంతికీ ఆలోచన్లలో ఎంతో వ్యత్యాసం ఉంది. కాసేపు పూర్ణతో చర్చించి, నా నిర్ణయం చెప్పాను.


మా పెద్దమ్మాయి పెళ్ళికి నేనూ వెంకట్రామయ్యింటికెళ్ళి పిలవలేదు. వాడు చేసినట్లుగానే పోస్టులో శుభలేఖ వేసాను. దమయంతి అడ్రసు కనుక్కొని కార్డ్ పోస్టు చెయ్యమని మా అమ్మాయికి చెప్పాను. చూస్తూండగా మూడేళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్యలో దమయంతి విషయాలే తెలీలేదు. మా రెండో అమ్మాయికీ పెళ్ళయ్యింది. రైతు సంఘం పనిమీద ఇందిరా గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్ళాల్సొచ్చింది. దాదాపు మూడు నాలుగు వారాలు అక్కడే ఉండిపోయాను. తిరిగొచ్చాక వెంకట్రామయ్య పోయాడని తెలిసింది. వెళ్ళి వెంకట్రమయ్య భార్యని పలకరించి వచ్చాం నేనూ, మా ఆవిడా. అప్పుడే తెలిసింది దమయంతి తండ్రి పోయినప్పుడు చూడ్డానికి రాలేదని. దమయంతి అత్తవారికీ, వెంకట్రామయ్యకీ ఏవో స్పర్ధలొచ్చాయని చెప్పారు. బహుశా అందువల్లేనేమో దమయంతిని పంపలేదనుకున్నాను. ఎత్తెత్తి కాలు ఎంగిలాకులో వేసినట్లుగా అయ్యింది దమయంతి స్థితనిపించింది నాకు. పెళ్ళికి ముందు జగ్గన్నతోట తీర్థంలో చూడ్డమే మరలా దమయంతిని చూళ్ళేదు.