ఏడు గోరీల కథ

దక్షిణపు వీధి కెళ్ళే రోడ్డు గురించి చెప్పాను కదూ! ఆ ఊరి జనాభా అంతటికీ, పిల్లాజెల్లా అందరికీ, అది ఏడు గోరీల సందుగా తెలుసు. మీరు తూర్పు వీధికి వెళ్ళాలన్నా, పడమర వీధికి వెళ్ళాలన్నా ఏడు గోరీల సందు మీంచే వెళ్ళాలి. రైలు స్టేషనులో పేసింజరు బండి దిగి “తూర్పు వీధికెళ్ళాలి. నీకు తెలుసా?” అని ఏ రిక్షా వాడినన్నా అడిగి చూడండి. “అదేటి బాబూ! ఏడుగోరీల సందుకి ఎడం పక్క కెళ్ళే రోడ్డే తూరుపీధికి తీసికెళ్తాది! అంతమాత్రం తెల్దా బాబూ!” అని అనకపోతే, ఆ రిక్షా వాడు ఆ ఊరు వాడు కాదన్న మాటే! అసలు విషయం ఏమిటంటే, ప్రతి రిక్షా వాడికీ ఆ ఊళ్ళో ఏడుగోరీల సందు తెలుసు. ఆటో రిక్షాల వాళ్ళయితే ఆగరు కానీ, సైకిల్ రిక్షాల వాళ్ళు మాత్రం ఆ గోరీల దగ్గిరకి రాగానే బండి దిగి నడిపించుకొని పోతారు; తూర్పు వీధి కెళ్ళాలన్నా, పడమర వీధి కెళ్ళాలన్నా!

సుబ్బయ్య నాయుడు చైర్మన్ కాకపోతే ఏడు గోరీల సందు ప్రసక్తే వచ్చేది కాదు. ఏడు గోరీల సందుకి ఏ పేరు పెట్టాలీ అని తర్జన భర్జన మొదలయ్యింది. మూడు తరాల మోటూరు వారు ఆ సందులోనే ఉన్నారు, అందులోనూ సుబ్బయ్య నాయుడు చైర్మన్ అయ్యాడయ్యె! అందుకని ఏడు గోరీల సందు పేరు మోటూరు వారి వీధి అని మారిస్తే బాగుంటుందని కొందరు కౌన్సిల్ మెంబర్లు ప్రతిపాదించారు. మోటూరు వారి వీధి అని పెద్ద ఆకుపచ్చ రాటబల్ల పెట్టాలని తీర్మానించారు. ఈ మార్పిడి సుబ్బయ్య నాయుడికి సుతరామూ ఇష్టం లేదు. “ఊళ్ళో మీరు ఏ వీధి పేరు మార్చుకున్నా నేను అభ్యంతరం పెట్టటల్లేదు. ఏడు గోరీల సందు పేరు ఏడు గోరీల సందుగా ఉంచాలిసిందే. మార్చడానికి నేను చచ్చినా ఒప్పుకోను,” అని పట్టు బట్టాడు. చాలా మంది కౌన్సిల్ మెంబర్లకి ఆశ్చర్యం వేసింది. తన ఇంటి పేరుతో సందు పేరు మారుద్దామనుకున్నా వద్దంటున్నాడేమిటా అని అనుమానం కూడా వచ్చింది.


ఏడు గోరీల గురించి మరి కాస్త పూర్వ కథ చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచీ ఆ గోరీలు అక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఎవడికీ తెలియదు. సుబ్బయ్య నాయుడు ముత్తాత ఇల్లు కట్టుకోక పూర్వంనుంచే అక్కడ ఏడు గోరీలు ఉన్నాయని వాదు. ఎందుకంటే అప్పట్లో దక్షిణపు వీధి అనే పేటే లేదు. జనాభా పెరిగింది, దానితోపాటు ఊరు తూర్పుకీ, పడమరకీ పెరిగింది. అటు వెళ్ళటానికి వేసిన రెండు రోడ్డులూ, అంటే తూర్పు వీధికెళ్ళే రోడ్డూ, పడమర వీధికెళ్ళే రోడ్డూ, ఆ గోరీల పక్కనుంచే వేశారు. అంతే కాదు. ఏడు గోరీల సందులో కాపరం ఉన్నవాళ్ళెవరో ఒకళ్ళు పనికట్టుకొని ఆ ఏడు గోరీల చుట్టూ గడ్డి కోయించడం, అడపా తడపా గోరీలకి వెల్ల వేయించడం చేసే వాళ్ళు. అప్పుడప్పుడు ముందు గోరీ ఎదురుగా ఒక ఆముదం దీపం కూడా వెలిగించి పెట్టే వాళ్ళట! విశేషం ఏమిటంటే, ఆ సందులో గాని, ఆ చుట్టుపక్కల గానీ ముసల్మాను ఇల్లు ఒక్కటి కూడా లేదు. అదీ విచిత్రం. ఇదంతా 9/11కి ముందు రోజుల కథ.


ఈ మధ్య కాలంలో ఆ గోరీల బాగోగులు పట్టించుకున్న వాడులేడు. అశ్రద్ధ కాకపోయినా భయం అయి ఉండాలి. గోరీలని ముంచేస్తూ నిలువెత్తున గడ్డి పెరిగి పోయింది. అన్ని గోరీల మీదా ఎండిన వాన చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు గోరీల గోడల పైన బీటలు కూడా పడ్డాయి. చూడటానికి అసహ్యంగా తయారయ్యాయి. చైర్మన్ గారి ఇంటి సందులో, ఆయన ఇంటికి ఎదురుగా పాడు పడ్డ గోరీలు ఏమిటి? దిష్టి పిడతల్లా? అని అక్కడనుంచి ఆ గోరీలు తవ్వి తీసేసి ఉత్తరాన ఏటి పక్కన పెడితే బాగుంటుదని లోపాయికారీగా ప్రచారం చేస్తున్న కౌన్సిల్ మెంబర్లు కూడా లేకపోలేదు. అందుకు బయటనుంచి మార్వాడీల మద్దతు కూడా వస్తున్నదని పుకారు! అలా గోరీలు తవ్వి తీసి మరోచోట కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతుందేమోన్న భయం కూడా లేకండా ప్రచారం మొదలయ్యింది.

మోటూరు వారి వీధిగా ఏడు గోరీల సందు పేరు మార్చడానికి సుబ్బయ్య నాయుడు అభ్యంతరం పెట్టడంతో ఊరి జనాభాలో కొందరికి బాగా నచ్చింది. ముఖ్యంగా కుర్రకారుకి! వాళ్ళకి సుబ్బయ్య నాయుడి మీద గౌరవం పెరిగింది. “మా వోటు సుబ్బయ్య నాయుడికే” అని తెల్ల అట్టల మీద తారుతో రాసి, అక్కడక్కడ వీధుల్లో చెట్లకి కట్టారు కూడా! అయితే, వీళ్ళల్లో ఎవరికీ వోటుహక్కు ఉన్నట్టు లేదు. కానీ, ఆ సందు పేరు ఏడు గోరీల సందుగానే ఉంచాలని పట్టుబట్టిన సుబ్బయ్య నాయుడి తరహా పైచదువులు చదువు కున్న కొంతమందికి ఏ మాత్రం నచ్చలేదు. ఏడు గోరీల సందు పేరు తక్షణం మార్చాలని, ఆ పేరు ఉంచడం ఊరికే అప్రతిష్ట అని తెలుగు దిన పత్రికలకి, ఇంగ్లీషు దిన పత్రికలకీ ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితులని ఉదహరిస్తూ ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారు. దాంతో పేరు మార్చాలని మంకుపట్టు పట్టిన కౌన్సిల్ మెంబర్లకి, గోరీలు అక్కడనించి ఎత్తేయాలని ప్రచారం చేస్తున్న జనానికి ఈ ఉత్తరాలు బాగా మద్దతిచ్చాయి. రభస పెద్దదయ్యింది; అగ్నిలో ఆజ్యం పోసినట్టు! అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ఊళ్ళో గోరీల అలజడి మొదలైయ్యింది. ఏడు గోరీల గురించి తెలుగు దేశమంతా తెలిసిపోయింది. గోరీలు ఉన్నచోటే ఉంచాలా వద్దా అని రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల్లో వాదోపవాదాలు మొదలయ్యాయి. ఏడు గోరీలతో పాటు సుబ్బయ్య నాయుడు పేరు – సుబ్బయ్య నాయుడి బొమ్మతో సహా – సహా పేపర్లలోకి ఎక్కింది. సుబ్బయ్య నాయుడి అభ్యంతరాన్ని సమర్థిస్తూ ఒక ఇంగ్లీషు పత్రిక, సుబ్బయ్యనాయుడిని ఏకేస్తూ ఒక తెలుగు పత్రికా రంగంలోకి దిగటంతో గోరీల గోల జాతీయస్థాయికెక్కింది. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యింది.

సుబ్బయ్య నాయుడు ఊళ్ళో ఆడపిల్లల కాలేజిలో హిస్టరీ లెక్చరర్ లక్ష్మన్న గారితో మంతనాలు ప్రారంభించాడు. లక్ష్మన్న గారు ఆలిగర్ విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేటు పట్టా సంపాదించాడు. ఈ గోరీలు ఊళ్ళో ఎన్ని సంవత్సరాలనుంచీ ఉన్నాయో పరిశోధన చెయ్యమని లక్ష్మన్న గారిని పురమాయించాడు, సుబ్బయ్య నాయుడు. అప్పటినించీ ప్రతిరోజూ సాయంత్రం, క్లబ్బు కెళ్ళటానికి బదులు లక్ష్మన్నగారు సుబ్బయ్య నాయుడి ఇంటికి రావడం మొదలెట్టారు. ఈ వార్త ఊళ్ళో గుప్పుమంది. పరిశోధన సంగతేమోకాని, సుబ్బయ్య నాయుడు మాత్రం ధైర్యం పుంజుకున్నాడు. “ఏడు గోరీలు ఆ ప్రాంతంలో కొన్ని వందల ఏళ్ళ నుంచీ ఉన్నాయని, కేంద్ర పురావస్తు శాఖవారు గనక పరిశోధిస్తే ఈ గోరీలు బహుశా ఔరంగజేబు కాలంలోనే ఈ ఊరిలో వెలిసి ఉంటాయని రుజువవుతుందనీ, ఇప్పుడు వాటిని కదిలించడం ధర్మం కాదనీ,” పత్రికల్లో రాయించాడు. ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికల్లో! అంతటితో ఆగలేదు. “ఆ ఏడు గోరీలని బాగుచేసి, వెల్ల వేసి చుట్టూ శుభ్రం చేసి, అందంగా లింకుల గొలుసు ప్రాకారంగా కట్టడం మునిసిపాలిటీ బాధ్యత. ఏడు గోరీల సందు పేరు మార్చడం తప్పు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం, నైతికంగా అన్యాయం,” అని అని ప్రచారం చెయ్యడం ప్రారంభించాడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న స్థానిక పత్రికల వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలిచ్చాడు. కోర్ట్ ప్రకటనలు తప్ప మరింకేమీ అచ్చు వెయ్యని ఒక స్థానిక పత్రికలో వరసగా వ్యాసాలు రాయించాడు.

“ఊరి మధ్య వెలిసిన ఏడు గోరీలు – ఔరంగజేబు కాలం నాటి గోరీలు!” అని రైల్వే స్టేషను లోను, బస్సుస్టాండు లోనూ బల్లలు పెట్టి, పత్రికల్లో వేస్తే మన ఊరికి టూరిజం ముమ్మరంగా పెరుగుతుంది. ఇంతకు ముందు మన ఊరికి ఎవడూ వచ్చేవాడు కాదు; ఇప్పుడు లక్షలకొద్దీ జనం వస్తారు. వ్యాపారం ఎంతగా పెరుగుతుందో ఆలోచించండి,” అని పబ్లిక్ మీటింగుల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉపన్యాసాలు ఇవ్వడంతో, గోరీలు ఎత్తెయ్యమనే ప్రచారానికి మద్దతిచ్చే వ్యాపారస్తుల గొంతుల్లో వెలక్కాయ పడిందనే చెప్పాలి. సుబ్బయ్య నాయుడు తన స్వంత ఖర్చుతో ఆ గోరీల చుట్టూ స్థలం బాగు చేయించడం మొదలెట్టేడు. ‘ఏడుగోరీల సందు’ అని మొట్ట మొదటి రాటబల్ల, ఆకుపచ్చ పెద్ద రాటబల్ల, కూడా తయారు చేయించాడు. ఊరిలో మొట్టమొదటి రాటబల్ల ‘ఏడు గోరీల సందు’ వచ్చే నెల పదిహేనోతారీఖున ప్రారంభోత్సవం చేస్తున్నాం అని ఊళ్ళో దండోరా కూడా వేయించాడు. అల్లా చూస్తూ ఉండగానే, సుబ్బయ్య నాయుడి పేరు అమెరికా దాకా పాకింది. హఠాత్తుగా సబ్బయ్య నాయుడు ఇంటర్నేషనల్ సెలిబ్రిటీ అయ్యాడు.


ఇలా వుండగా ఒక రోజు సాయంత్రం జోగిపంతులు వయసు మళ్ళిన ముగ్గురు మీసాలు లేని గడ్డపు సాయిబ్బులని వెంటపెట్టుకొని సుబ్బయ్య నాయుడి ఇంటికి వచ్చాడు. అసలీ సాయిబ్బులెవళ్ళు? ఎక్కడినించి వచ్చారు? జోగి పంతులుకీ ఈ సాయిబ్బులకీ స్నేహం ఏమిటి? అని లక్ష్మన్నగారు, సుబ్బయ్య నాయుడూ ఆశ్చర్యపోయారు.

“ఇదిగో సుబ్బయ్య నాయుడూ! వీళ్ళు ముగ్గురూ నీతో మాట్లాడతామని మా ఇంటికొచ్చారు. నేను వీళ్ళ కథంతా విన్నా. నువ్వు కూడా వినడం మంచిది,” అని జోగి పంతులు మొదలెట్టాడు.

“నాయుడుగారూ! మీరంటే మాకు శానా గౌరవం ఉన్నాది. మరి ఈ గోరీలు…,” వాళ్ళ మాట పూర్తి కాకముందే సుబ్బయ్యనాయుడు అందుకున్నాడు.

“మీరు తంగెళ్ళపాడు తోళ్ళషాపుల లబ్బీసాయిబ్బులు కాదూ! మీకూ ఈ గోరీలకీ సంబంధం ఏమిటి?” అని నిలదీసి అడిగాడు.

“ఆ గోరీలు మా పూర్వీకులవేనట బాబూ! శానాకాలం కితం తోళ్ళషాపులు మీ పొలిమేరల్లోనే ఉండేవంట. ఇటుపక్క మీ జనాభా పెరిగింది. అప్పుడు మా వోళ్ళకి ఏటికవతల తోళ్ళ షాపులు కట్టుకోడానికి మునిసిపాలిటీ స్థలం ఇస్తే, మావాళ్ళు అక్కడకి పొయ్యేరు. ఇప్పుడు పంతులుగారు పదిమందితో మాటాడి మాకు ఏటి ఎడం పక్కన ఏడు ఎకరాల నేల ఇప్పిస్తావన్నారు. మావోళ్ళ గోరీలు అక్కడికెత్తికెళ్ళిపోతే అందరికీ బాగుంటుంది. గొడవలెందుకు బాబూ!” అని చెప్పారు ముగ్గురూ ముక్తకంఠంతో.

“ఏమిటీ? ఏటి ఎడం పక్కన ఏడెకరాల స్థలం ఎక్కడుంది? అక్కడ రెండు కిరస్తానీ చర్చీలున్నాయి కదూ? మీరు లబ్బీ సాయిబ్బులు. మీరు నిజమైన ముసల్మానులు కారు. మిమ్మల్ని నకిలీ సాయిబ్బులంటారు, మావాళ్ళు. తెలియక అడుగుతున్నాను, చెప్పండి. మీ తంగెళ్ళపాడులో ఎన్ని గోరీలున్నాయి? లబ్బీ సాయిబ్బులకి గోరీలు కట్టడం నేను ఎప్పుడూ వినలేదు. అసలు కట్టిన గోరీలు ఎత్తెయ్యడానికి ఏ ముసల్మానూ ఒప్పుకోడు. మీ నాటకం నాకు బోధపడటల్లేదు. ఇదేదో మోసం, కుమ్మక్కు. ఈ ఏడు గోరీలు కనీసం నాలుగువందల ఏళ్ళనుంచీ ఈ వీధిలోనే, ఇక్కడే ఉన్నాయి. అవి ఇక్కడే ఉండాలి. కదిలించడానికి వీల్లేదు. ఏమండీ లక్ష్మన్న గారూ! అవునంటారా?” అని ఆయన వేపు చూసాడు, సుబ్బయ్య నాయుడు. లక్ష్మన్నగారు కిమ్మనకుండా కుర్చున్నాడు.

జోగిపంతులు, లబ్బీసాయిబ్బులూ వచ్చిన దోవనే వెళ్ళారు.


ఈ కథ విన్న కౌన్సిల్ మోతుబరులకి వళ్ళు మండిపోయింది. సుబ్బయ్య నాయుడు ఏ రాయబారాలకి లొంగేట్టు లేడు. మొండి ఘటం. దండోపాయం ఖాయం. వెంటనే మునిసిపల్ కౌన్సిల్ మెంబర్లందరూ ఎమర్జన్సీ సమావేశం వేసుకున్నారు. సుబ్బయ్య నాయుడి మీద విశ్వాస రాహిత్య తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు. సుబ్బయ్య నాయుడిని చైర్మన్ పదవినుంచి దింపేశారు. సుబ్బయ్య నాయుడి మూణ్ణాళ్ళ ముచ్చటా తీరిపోయింది.

అయితే, కౌన్సిల్ వాళ్ళకి కొత్త చైర్మన్‌ని ఎన్నుకోవడానికి రాజీ కుదరలేదు. మామూలేగా! నెల తిరగకండా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్దార్జీని స్పెషల్ ఆఫీసర్‌గా వేసి కౌన్సిల్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటికీ ఆ ఊరికి మునిసిపల్ ఎన్నికలు లేవు; రోడ్లకి కొత్త రాటబల్లలు రానేలేదు. సరిగదా, ఏడు గోరీల చుట్టూ తుమ్మపొదలు మాత్రం విపరీతంగా పెరిగి చిన్న అడివిలా తయారయ్యింది. ఇప్పుడు, ఒక్క గోరీ కూడా పైకి కనిపించదు. కాని, ఇప్పటికీ ప్రతి రిక్షా వాడూ ఏడు గోరీల దగ్గిరకి రాగానే దిగి రిక్షా నడిపించుకొనే పోతాడు, తూరుపు వీధికి, పడమర వీధికీ!