త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు

ఇది కాకుండా ఒకే పదాన్ని వేరొక అర్థం వచ్చేలా చెప్పే భిన్న యమక ప్రయోగం చాలా కృతుల్లోనే వుంది. ఉదాహరణకి సౌరాష్ట్ర రాగంలో స్వరపరిచిన ఈ కృతి:

పల్లవి:
పాహి పాహి దీన బంధో మాం
పాహి పరానంద సింధో

చరణం:
తారకాసుర వైరి నుత రామ
తారక శుభ కర చరిత
చరణం:
రాఘవాన్వయ సుప్రదీప సు-
కరాఘ వన కుఠార రూప
చరణం:
శర శర జగదాధార అఖి-
లాశర శరదాశుగ ధీర
చరణం:
కువలయ దళ సమ నేత్ర పాలిత
కువలయ దళితామిత్ర
చరణం:
కమల హిత గుణ భరిత రామ
కమలాహిత ధర వినుత
చరణం:
త్యాగరాజ నుత చరణ
నిత్యాగ రాజ ధర సుగుణ

ఈ కృతిలో వాడిన పదాలే వాడం వల్ల శబ్ధ సౌందర్యం వచ్చింది. ఆ పదాలనే విడగొట్టడం వల్ల అర్థం సౌందర్యమూ వచ్చింది. పైన అనుప్రాసకి ఉదాహరణగా చెప్పుకున్న రాగ వర్ధిని రాగంలో ‘మనసా మన సామర్థ్యమేమి?’ కృతిని కూడా భిన్న యమక ప్రయోగంగా కూడా చెప్పుకోవచ్చు. మోహన రాగంలో స్వరపరిచిన ‘భవనుత‘ కృతిని పాదాంత యమక ప్రయోగానికి ఉదాహరణ. పాదాంత యమకం అంటే ప్రతీ పాదం చివరా ఒకే పదం వస్తుంది. సందర్భాన్ని బట్టి వేరే అర్థం స్ఫురిస్తుంది.

పల్లవి:
భవ నుత నా హృదయమున రమింపుము బడలిక తీర
అనుపల్లవి:
భవ తారక నాతో బహు పల్కిన బడలిక తీర
కమల సం |భవ|
చరణం:
పవన సుత ప్రియ తనకై తిరిగిన బడలిక తీర
భవనము జేరి నను వెరపించిన బడలిక తీర
కమల సం (భవ)
చరణం:
వరమగు నైవేద్యములను జేయని బడలిక తీర
పరవ లేక సరి పోయినట్టాడిన బడలిక తీర
కమల సం (భవ)
చరణం:
ప్రబల జేసి నను బ్రోచెదవనుకొన్న బడలిక తీర
ప్రభు నీవు త్యాగరాజునికి బడలిక తీర
కమల సం (భవ)

పాదం చివరన కాకుండా పాదం మొదట్లో వస్తే పాదాది యమకం అంటారు. లాలిపాట శైలిలో రీతిగౌళ రాగంలో స్వరపరిచిన ‘జో జో రామ ఆనంద’ కృతిని ఈ పాదాది యమకానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా లాలి పాటల్లో ఈ పాదాది లేదా పాదంత యమకం కనిపిస్తుంది.

పల్లవి:
జో జో రామ ఆనంద ఘన
చరణం:
జో జో దశరథ బాల రామ
జో జో భూజా లోల రామ
చరణం:
జో జో రఘు కుల తిలక రామ
జో జో కుటిల తరాలక రామ
చరణం:
జో జో నిర్గుణ రూప రామ
జో జో సు-గుణ కలాప రామ
చరణం:
జో జో త్యాగరాజార్చిత రామ
జో జో భక్త సమాజ రామ

ఒకే పదాన్ని పదే పదే వాడుతూ వేర్వేరు పాదాలలో చెప్పడాన్ని సముద్గ యమకం అంటారు. వచ్చిన పాదాలే మరలా పునరావృత్తమవుతాయి. శంకరాభరణ రాగంలో స్వరపరిచిన ‘బుద్ధి రాదు’ కృతిలో కేవలం పల్లవీ, అనుపల్లవిల్లో మాత్రమే సముద్గ యమక ప్రయోగం కనిపిస్తుంది. చరణాల్లో ఇది లేదు.

పల్లవి:
బుద్ధి రాదు బుద్ధి రాదు పెద్దల సుద్దులు వినక

అనుపల్లవి:
బుద్ధి రాదు బుద్ధి రాదు భూరి విద్యల నేర్చినహరికాంభోజి రాగంలో ‘లాలి లాలియని‘ అన్న కృతిని సంధాష్ట యమకానికి ఉదాహరణగా చూపించవచ్చు. ఈ సంధాష్ట యమకంలో కూడా ఒకే పదం వెనువేంటనే వస్తుంది. ఇందులో తేడా ఏమిటంటే ప్రతీ పాదానికీ వేర్వేరు పదాలు రావచ్చు.

పల్లవి:
లాలి లాలియని యూచేరా వన-
మాలి మాలిమితో జూచేరా
చరణం:
దేవ దేవయని పిలిచేరా
మహానుభావ భావమున తలచేరా
చరణం:
రామ రామయని పలికేరా
నిష్కామ కామ రిపు నుత రారా
చరణం:
కోరి కోరి నిన్ను కొలిచేరా మాయా
దారి దారి సద్భజనరా
చరణం:
రాజ రాజయని పొగడేరా త్యాగ-
రాజ రాజయని మ్రొక్కేరా

ముందు చెప్పిన యమకాలు కాకుండా, చక్రవల యమకం అనొకటుంది. ఇందులో ఒక పాదం చివరలో వచ్చిన పదమే రెండో పాదం మొదట వస్తుంది. హరికాంభోజి రాగంలో స్వరపరిచిన ‘ఎన్నగ మనసుకు రాని‘ కృతి ఈ చక్రవల యమకానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పల్లవి:
ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ కనుకొనని కన్నులేలే
కన్నులేలే కంటి మిన్నులేలే
చరణం:
మోహముతో నీల వారి వాహ కాంతిని కేరిన
శ్రీ హరిని కట్టుకొనని దేహమేలే
దేహమేలే యీ గేహమేలే
చరణం:
సరసిజ మల్లె తుళసి విరువాజి పారిజాతపు
విరులచే పూజించని కరములేలే
కరములేలే యీ కాపురములేలే
చరణం:
మాలిమితో త్యాగరాజునేలిన రామ మూర్తిని
లాలించి పొగడని నాలికేలే
నాలికేలే సూత్ర మాలికేలే