ఓ రోజు సత్యవతి ఇంకో పుకారు మోసుకొచ్చింది.
“ఏమండోయ్! మీకీ విషయం తెలుసా? పంకజానికి ఇంతకుముందే పెళ్ళయ్యిందట. ఆవిడకి ఓ కూతురు కూడా ఉందట. పంకజం పోయాకా చూడ్డానికని వస్తే అమలాపురం పొలిమేరల్లోనే అనసూయమ్మే వాళ్ళని వెనక్కి పంపించేసిందనీ అంటున్నారు.”
ఇదంతా విని ఒళ్ళు మండింది నాకు.
“నువ్వేమయినా ఆ పెళ్ళికెళ్ళి చూసావా? ఎందుకీ విషయాలంటే ఆసక్తి. బుల్లెబ్బాయీ, అనసూయమ్మా వాళ్ళ గొడవేదే వాళ్ళు ఏడుస్తారు? మనకెందుకు చెప్పు?” అంటూ నాలుగు చివాట్లు పెట్టాను. ‘మీరెప్పుడూ ఇంతే’నంటూ నన్ను తిట్టుకుంది సత్యవతి.
వాస్తవాలకీ, ఊహలకీ తేడా తెలీదు చాలామందికి. చూడని విషయలని నమ్మి వ్యక్తులకి లేని గుణగణాలని ఆపాదించేస్తాం. వ్యక్తిత్వాలని నిర్ణయించేస్తాం. పుకార్లకున్న చోటు నిజానికుండదు. ఈ విషయం సత్యవతికి చాలా సార్లు చెప్పి చూసాను. ఎక్కడా ఫలితం లేదు.
పంకజం పోయి ఏడాది తిరక్కుండానే బుల్లెబ్బాయి హార్టెటాకొచ్చి పోయాడు. ఆకాశం వారి మేడని ఎవరో కొనుక్కున్నారు. బుల్లెబ్బాయి బ్రతికున్నన్నాళ్ళూ ఎవరికీ అమ్మడానికి ఒప్పుకోలేదు. అలాని అతని దగ్గర డబ్బున్నా తనూ కొనలేదు. పంకజం గుర్తుగా అనుకున్నాడో ఏమో ఆ ఇంటిని అమ్మకం పెడదామని మద్రాసులో ఉన్న పంకజం అన్నగారు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు.
కొన్నేళ్ళ తర్వాత ఆకాశం వారి మేడని కోవట్లెవరో కొనుక్కున్నారు. ఆ మేడని కూలకొట్టేసి ఆ స్థలంలోనే కొత్తగా మరో రెండు చిన్న డాబా ఇళ్ళు కట్టారు. కొత్తగా ఇళ్ళుకట్టినా ఆ చోటు ఆకాశం వారి మేడగానే వాడుకలో ఉండేది. బుల్లెబ్బాయి పోవడంతో అనసూయమ్మ బట్టల వ్యాపారాన్ని అమ్మేసింది. పొలాలని కౌలుకిచ్చి ఉన్న ఆస్తిని కాపాడుకుంది.
ఓ పదేళ్ళు గిర్రున తిరిగాయి. చూస్తూండగా మా పిల్లలూ పెద్దవాళ్ళయ్యారు. మా అమ్మాయికి ఎవరో భీంవరం సంబంధం చెప్పారు. మా స్నేహితుడు వెంకటరత్నాన్ని కలిసి ఆ పిల్లాడి కుటుంబం గురించి వాకబు చేయమని ఉత్తరం రాసాను. ఈ లోగా ఓ రోజున వెంకటరత్నమే ఊడిపడ్డాడు.
“ఒరే మా అబ్బాయి పెళ్ళిరా! నువ్వూ, మీ ఆవిడా, పిల్లలూ అందరూ రావాలి. మా అక్కయ్య కూతుర్నే చేసుకుంటున్నాం.” అంటూ కొడుకు పెళ్ళి శుభలేఖతో నన్నూ సత్యవతినీ ఆహ్వానించాడు.
“బావుందిరా! మొత్తానికి మీ అక్కయ్య కూతుర్నే కోడలుగా తెచ్చుకుంటున్నావన్నమాట. బుల్లెబ్బాయి కూతురు చదివేది మా కాలేజీనే! మంచి పిల్ల. బాగా చదువుతుంది.” అంటూ అభినందించాను.
“అనసూయమ్మని వారం క్రితం కలిసినప్పుడు ఈ విషయం చెప్పలేదే? ఏంటి హఠాత్తుగా అనుకున్నారా? అవున్లే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు!” సత్యవతి తనదైన ధోరణిలో అంది.
మా మాటలు విని నవ్వాడు వెంకటరత్నం.
“మా అనసూయక్కయ్య కూతురు కాదు.” మెల్లగా అన్నాడు.
“మరి?” నేనూ, సత్యవతీ ఒకేసారి అన్నాం.
“ఇంకో అక్కయ్య కూతురు.”
నాకు తెలిసీ వెంకటరత్నానికి అనసూయమ్మొక్కతే తోబుట్టువు. ఎవరీ కొత్త అక్కయ్యన్నట్లు కనుబొమ్మలు ముడేసి చూసాను.
“పంకజం కూతురు.”
విస్తుబోయాం. మా ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. అసలు పంకజానికి కూతురున్నట్లే తెలీదు. ఊరంతా అనుకోడమే కానీ ఎవరూ చూళ్ళేదు కూడా. సత్యవతియితే నమ్మలేనట్లుగా చూసింది.
“మరి మీ అనసూయక్కకి ఈ విషయం తెలుసా? ఆవిడీ పెళ్ళికి ఒప్పుకుందా?” ప్రశ్నించాను.
“అసలీ పెళ్ళికి మా అనసూయక్కే కారణం! మీ కెవరికీ తెలీదు. పంకజం కూతుర్ని ఎవరికీ తెలీకుండా మద్రాసులో పెంచింది. చాలారోజుల వరకూ మాకీ విషయాలేవీ తెలీవు. మొదట్లో మా అక్కకీ తెలీదు. తెలిసాక బుల్లెబ్బాయిని నిలదీసింది. ఆ తరువాత మా బావతో దాదాపు ఆరేళ్ళు మాట్లాడ్డం మానేసింది. చిత్రం ఏమిటంటే బుల్లెబ్బాయిని తప్పు పట్టింది కానీ, ఇందులో పంకజం తప్పేమీ లేదనుకుంది. అందుకే తనెప్పుడూ పంకజాన్ని నిందించలేదు. ఈ విషయాలెవరికీ తెలీవు.” అని చెప్పాడు.
“మీ అక్కయ్యని అభినందించాలి. తోటి స్త్రీని గౌరవించడం నిజంగా గొప్ప విషయం.” మనసులో మాట పైకన్నాను. అనసూయమ్మని మనసులోనే అభినందించాను.
“మరామ్మాయిని ఈ వూళ్ళో చూసినట్లు లేదే?” మొదటి సారి ఈ కుతూహలం నా వైపునుండొచ్చింది.
“చెప్పానుగా మాకెవరికీ ఇదస్సలు తెలీదు. పదిమందికీ తెలిస్తే అనవసరంగా రాద్ధాంతమవుతుందని మద్రాసులోనే ఆ అమ్మాయిని పెంచింది. చూడాలన్నప్పుడల్లా పంకజమే వెళ్ళొచ్చేది. అలా ఆ అమ్మాయి అందరికీ దూరంగా మద్రాసులో పెరిగింది. మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎస్సీ చేసింది. ఇప్పుడామ్మాయి పెళ్ళికి మా అక్కే నడుంకట్టింది. మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నామని తెలిసి నన్ను అడిగింది. మా అబ్బాయి సరే నన్నాడు. అలా ఈ పెళ్ళి..” అంటూ జరిగినదంతా చెప్పాడు.
“పంకజానికి కూతురుందని ఊరంతా ప్రచారం జరిగితే పుకారనుకున్నాను. నిజమే నన్నమాట. మరి పంకజం పోయినప్పుడు కూడా వచ్చినట్లు లేదు.” నా సందేహాన్ని నోరు జారి పైకనేశాను.
“అవును. ఆ అమ్మాయి ఎప్పుడూ అమలాపురం రాలేదు. పంకజం పోయిన తరువాత ఆమె అన్నయ్య పంకజం కూతుర్ని తీసుకొస్తానంటే వద్దని మా అక్కే ఆపింది. అనవసరంగా ఆ చిన్న పిల్ల మనసుని ఈ ఊళ్ళోవాళ్ళు ఎక్కడ గాయ పరుస్తారోననీ, చెడిన దానికి పుట్టిందనీ ముద్ర వేస్తారనీ అసలీవూరే రానీయలేదు. మీకో విషయం తెలుసా? పంకజం పోయినప్పుడు కూడా దహనం చేయడానికెవరూ ముందుకు రాకపోతే మా బావనే చెయ్యమని పంపింది కూడా మా అక్కే! అలా చెయ్యకపోతే తనురేసుకు చస్తానని బెదిరించిందనీ మా బావే నాతో స్వయంగా చెప్పాడు.”
ప్రతీసారి ప్రశ్నలతో విసిగించే సత్యవతి సంభ్రమాశ్చర్యాలతో గుడ్లప్పగించి వింది. అవును మరి ఇది పుకారు కాదు కదా? వాస్తవాలెప్పుడూ ఘాటుగానే ఉంటాయి.
అప్పట్లో పంకజానికి దహన సంస్కారాలు చేసి బుల్లెబ్బాయి అమలాపురంలో హీరో అయిపోయాడు. నిజానికి తెర వెనుక హీరో అనసూయమ్మ. చేతులెత్తి ఆమె సంస్కారానికి మనసులోనే నమస్కరించాను.
“ఇంతకీ ఆ అమ్మాయి తండ్రి అదే పంకజం భర్తెవరూ?” అంతవరకూ మౌనంగా ఉన్న సత్యవతి నోరిప్పి ఆత్రంగా అడిగింది.
బుల్లెబ్బాయా? అంబాజీపేట మైనరా? డీలక్స్ ధియేటరు వాటాదారు గంగరాజా? బహుశా సత్యవతి మనసులో ఇదే ఉందేమో? కాస్త లౌక్యంగానే ప్రశ్నించింది.
“చాలారోజుల వరకూ మాకెవ్వరికీ తెలీదు. మా అక్కకీ బుల్లెబ్బాయి పోయిన తరువాతే తెలిసింది.” మెల్లగా వెంకటరత్నం అన్నాడు.
“అదేవిటి? ఆ అమ్మాయి బుల్లెబ్బాయికీ, పంకజానికీ పుట్టినమ్మాయి కాదా?” మరింత ఆశ్చర్యబోతూ అడిగింది సత్యవతి. ఇలాంటి విషయాల్లో మొదట్నుండీ ఆసక్తి ఎక్కువ. ఫక్తు మధ్యతరగతి ఇల్లాలు.
“వద్దురా? చెప్పద్దు. అది నీలోనే దాచెయ్యి. ఆ అమ్మాయికి తండ్రెవరన్నది కాదు ముఖ్యం. కాబోయే భర్తే మిగిలిన జీవితం. కొన్ని వాస్తవాలు బయటకు తెలీకపోడమే మంచిది. దయచేసి ఎవరికీ చెప్పద్దు.” అంటూ చేతులెత్తి వెంకట రత్నానికి నమస్కరించాను.
సత్యవతి ఏదో అనబోతే కళ్ళెర్రజేసి వారించాను. వెంకటరత్నం నా మాటలు అర్థంచేసుకున్నాడులా వుంది. ఇహ పొడిగించలేదు. పెళ్ళికి రమ్మనమని మరోసారి చెబుతూ వెళ్ళొస్తానని సెలవు తీసుకున్నాడు.
వెంకటరత్నం అక్కయ్య కూతురు పెళ్ళికి తప్పకుండా వస్తానని మాటిచ్చాను.