ఛందస్సే యయె నీదు కోవెల

వచనపద్యం

ఇరవైయవ శతాబ్దములో తెలుగులో ఆవిర్భవించిన ఒక నూతన కవితాస్వరూపము వచనకవిత. దీనికి ఎన్నో పేరులను పెట్టారు. మొదట పఠాబి, తరువాత సంపత్కుమార ఇలాటి కవితలను వచన పద్యములు అన్నారు. ఇక పద్య మన్నప్పుడు, వాటికి గణాలు ఉండాలిగా? చంపకమాలలాటి వృత్తాలను మ-భ-జ-స-న-య-ర-త లాటి గణాలతో, గురులఘువులతో, యతి ప్రాసలతో నిర్మించవచ్చు. కందము, రగడలాటి పద్యాలను మాత్రాగణాలతో, సీసాదులను సూర్యేంద్ర గణాలతో మనము విశదీకరించవచ్చు. కాని ఈ వచనపద్యములో ఉండే గణాలు ఎలాటివి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సందర్భములో ఆచార్యులవారు వచనపద్యములో ఉండే గణాలు భావగణాలు లేక భావాంశ గణాలు అని ప్రతిపాదించారు. చేకూరి రామారావు గారు ఈ భావగణ వ్యవస్థను నిరాకరించి వచన పద్యం పద్యము కాదు, గద్యమే అని తమ అభిప్రాయాన్ని తెలిపారు. చేరా, సంపత్కుమారల మధ్య ఈ విషయంలో జరిగిన వాదోపవాదాలు చదవడానికి ఎంతో బాగుంటాయి. వచన పద్యం పద్యమా, గద్యమా అన్నది కాదు ఇక్కడ ముఖ్య విషయము. వారి ఆలోచనాహర్మ్యాలను సైద్ధాంతిక రీత్యా ఎలా దృఢముగా నిర్మించారో అన్నది మనలను ఆకర్షిస్తుంది.

పద్యరచన

సంపత్కుమారాచార్యులు పండితుడు, పరిశోధకుడు మాత్రమే కాదు, కవి కూడ. నా ఉద్దేశములో ఈ కవి హృదయమే వారిని చివరివరకు యువ భావాలతో, నూతనపథాన్వేషకుడుగా ఉంచింది. వారి కవితకు కొన్ని ఉదాహరణలు –

1. సాంప్రదాయిక ఛందస్సులో అందమైన భావాలను ప్రదర్శించడములో వారిది అందె వేసిన చేయి. యశోద అనే ఖండికలోని మొదటి పద్యము మాతృహృదయాన్ని ఎంత చక్కగా చిత్రిస్తుందో చదివి ఆనందించండి –

ఈ చలిగాలిలో బయట కేగకురా పసితండ్రి! ఇంత ఈ
కాచిన ఆవుపాలను చకాచక త్రాగి మనింటిలోనె నీ
తోచిన ఆటలాడు మరి దుందుడుకుందనమిన్ని నాళ్ళుగా
సైచితిగాని, చూడుమిక సైచను సుంతయు నింక మీదటన్

2. వీరు వ్రాసిన కాలస్పృహ ఒక విధముగా ఋతుసంహారములాటిది. తేటగీతులను ఇలా కూడ వ్రాయవచ్చును అని క్రింది పద్యాలను చదివిన తరువాతనే నాకు అర్థమయింది. ఇది కచ్చితముగా ఒక నవీన పద్యశిల్పమే –

ఓసి తీవియ ముద్దరాల! సవురుల
నొలుకదేమిటి, క్రొత్తపూవులను విరిసి;
ఆ వసంతుడు విచ్చేయునట్టి వార్త
నీవరకు నప్పుడే వచ్చెనే!
– ఇదేమి
ఏమి? మోదుగు తానింత ఈడుపోయి
గూడ సింగారములు చేసికొనుచుండె
ఎండిపోయిన గుండెలో నింతవేడి
రక్తములు చిమ్మునేమొ ఈ ప్రభువు మధువు

ఇందులో మొదటి పద్యములో చివర ఇదేమి పదము తనంతట తానే ఒక పంక్తిని ఆక్రమించుకొని రెండవ పద్యముతో పాలు పంచుకొంటుంది!

అదే ఖండికలో మరో రెండు పద్యాలు –

శిశిర దౌర్జన్యరాజ్య విశిర్ణా పూర్వ
వైభవమ్ములు గల్గు పూవనితలార!
ఇంక మీరే స్వరాజ్యము నేలికొనుడు
ఇచ్చవచ్చిన రీతి పాలించుకొనుడు
– ఇంత మధుర
మైన మధుమాస యామినియందు ప్రేయ
సీ దరస్మితాధర సుధా సాధితమ్ము
శుష్కపూర్వమ్ము నాత్మ విశుద్ధజీవి
తమ్ము పూవులబాటలో వరలు నేడు

పై పద్యాలలో రెండవ పద్యము సంధిగత ‘మైన’ తో ప్రారంభమవుతుంది. రెండు పద్యాలమధ్య ఇంత మధుర అనే అన్వయ పదాలు ఉన్నాయి.

3. మాత్రాఛందస్సులో వీరు ఆరితేరిన దిట్ట అని తొలి యౌవనములో రచించిన అపర్ణ నిరూపిస్తుంది. అపర్ణ ఖండకావ్యమునుండి ఒక రెండు పద్యాలు –

కించిదుష్ణ గోక్షీరము
లించించుక నెట్లొ త్రావి
లేచుచున్న ఆ వ్యక్తిని
చూచుచున్న ఆచార్యుడు
కూరుచొనగ నియమించెను
తీరుబాటు కలిగించెను
(పాదానికి రెండు ఆరు మాత్రలు)

ఆమె ఆర్తవ సుమము పోలిక
ఆమె వర్షా వనిత పోలిక
ఆమె శంపాహేల పోలిక
ఆమె ప్రాకృతి కాంశ పోలిక
ఆ కుటీరము చేరె నావిడ
(మూడు, నాలుగు మాత్రలతో మిశ్రగతి)