ఛందస్సే యయె నీదు కోవెల

లక్షణసారసంగ్రహము

కూచిమంచి తిమ్మన లక్షణసారసంగ్రహమును, కూచిమంచి వేంకటరాయని సుకవిమనోరంజనమును పరిష్కరించే సమయములో ఆచార్యులవారు మంచి పరిశోధనా గ్రంథాలయాలు గాని, విషయములో ఆసక్తి ఉండే మిత్రులు గాని లేని జగిత్యాలలోని ప్రభుత్వేతర కళాశాలలో పని చేస్తుండేవారు. మంచి పండితునికి, పరిశోధకునికి మనసుంటే ఏదైనా అసాధ్యము కాదని ఈ పుస్తకాల పర్యవేక్షణ, పరిష్కరణ మనకు నిరూపిస్తాయి.

ఈ లక్షణ గ్రంథాల రచయిత లిద్దరూ కూచిమంచి వంశము వారు. తిమ్మన కాలము క్రీ.శ. 1684-1757. ఈ తిమ్మకవిసార్వభౌముని తమ్ముని మనుమని మనుమడే వేంకటరాయడు. లక్షణసారసంగ్రహము క్రీ.శ. 1740లో, సుకవిమనోరంజనము 1872లో ఆ కవులు రాశారు. లక్షణసారసంగ్రహములో మూడు ఆశ్వాసములు ఉన్నాయి. మొదటి ఆశ్వాసములోని భాగములు చతుర్విదాంధ్ర ప్రకరణము, సంజ్ఙా ప్రకరణము, విభక్తి ప్రకరణము, రెండవ ఆశ్వాసములోని భాగములు సమాస, క్రియావిశేష, ప్రాస, యతి, శబ్ద ప్రకరణములు, మూడవ ఆశ్వాసములో రేఫ, శకటరేఫ ప్రకరణములు.


తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు
కోవెల సంపత్కుమారాచార్య
అభినవ ప్రచురణలు 1993.

ఇతనికి ముందున్న పండితలాక్షణికులు తెలుగు భాషను ఐదు విధాలుగా (తత్సమ, తద్భవ, అచ్చ తెనుగు, దేశ్య, గ్రామ్య) విభజించారు. కాని ఇందులో అచ్చ తెనుగు, దేశి నిక్కచ్చిగా విభజించబడక పోవడమువల్ల తిమ్మన వీటిని పర్యాయపదాలుగా తీసికొని తెలుగు భాష నాలుగు విధములు అన్నాడు. తిమ్మన తనకు ముందు వెలువడిన లక్షణగ్రంథాలను కూలంకషముగా పరిశీలించి కొన్నిటిని అంగీకరించి, మరికొన్నిటిని నిరాకరించి, మరికొన్నిటిపై దీర్ఘ వ్యాఖ్యానాలను రాసాడు. ఉదాహరణగా కేతనాదులు మల్లె, లంజె, గద్దె, ఒల్లె లాటి ఎకారాంత పదాలకు బదులు మల్లియ, లంజియ, గద్దియ, ఒల్లియ లాటి పదాలను వాడాలని చెప్పినా, తిమ్మన వాటిని అంగీకరించాడు. అప్పకవీయమును తప్పు పట్టిన చోటులు కూడ ఈ గ్రంథములో ఉన్నాయి. నన్నయగారి ప్రసిద్ధమైన లయగ్రాహిలో (కమ్మని లతాంతములకుమ్మొనసి …) లతాతములకున్మొనసి సంధిని లతాంతములకుంమొనసిగా ఎలా మారగలదో అనే విషయానికి సూత్రాన్ని కల్పించాడు తిమ్మకవి. ఈ పద్యములోని ప్రాసయతిని సంపత్కుమార విపులముగా ఈ పీఠికలో చర్చించి, అదే విధముగా ద్విత్వ మ-కారమునకు (మ్మ) సంధి పూర్వకముగా వచ్చే బిందుపూర్వ బ-కారమునకు ఉండే ప్రాసను గురించి కూడా ఉదాహరణలతో విశదీకరించారు. ఈ పుస్తకములోని యతిప్రాసల ప్రకరణాలపైన కూడా కొన్ని విశేషాలను తెలిపారు (ఉదా. ర-లకు ప్రాస, స్నాన పదాన్ని స్త్నానముగా శ్రీనాథుడు వాడడము). రేఫ-శకటరేఫ సాంకర్యాన్ని, అరసున్న, నెరసున్నల ప్రయోగాలు, వాటికి ఉదాహరణలు కూడ ఉన్నాయి. ఈ పీఠిక అంతములో ఆచార్యులు రాసిన ఈ వాక్యాలు సర్వామోదమయినవి.

“భాష విశాలమైనది, నిత్య ప్రవాహిని. పలు విషయములలో లాక్షణికుల దృష్టి భిన్నభిన్నమయి ఆయా కాలముల ననుసరించి ఆయా లక్షణకర్తల అభిప్రాయములను సమన్వయము చేసుకొనవలసియుండును. వేరువేరు కాలములలో వేరువేరు ప్రాంతములందలి లాక్షణికుల గ్రంథములు – కనీస మీనాటికి లభ్యమగుచున్నంతవరకైన పరిష్కృతములై వెలువడినచో – తెలుగుభాషాచ్ఛందో లేఖన సంప్రదాయములు, మరి వాటి బహుముఖీనత, విశాల ప్రయోగ వైలక్షణ్యము, క్రమపరిణతి మొదలగు పలు విషయములు స్పష్టమగుటకు వీలు కలుగును.”

సుకవిమనోరంజనము

సుకవిమనోరంజనము ఒక ప్రత్యేకమైన లక్షణ గ్రంథమని – “లక్షణ గ్రంథ రచనారీతిలో ప్రాచీన పద్ధతికి భరతవాక్యముగా, ఆధునిక పద్ధతికి నాందీ వచనముగా గత శతాబ్దపు (19వ శతాబ్దపు) తృతీయ పాదాంతమున తెలుగు లక్షణగ్రంథ రంగమున కవతరించిన దిది” – సంపత్కుమార పేర్కొన్నారు. వీరు పరిష్కరించి అకాడెమీవారు ముద్రించేవరకు ఇది వ్రాతప్రతిగా మాత్రమే ఉండినది. ఐనా కూడా దీనిని చాలమంది చదివి ఉదహరించారు. ప్రాచీన ధోరణిలో లక్షణములను చెప్పి, ఆధునిక రీతిలో విమర్శించడము ఇందులోని ప్రత్యేకత. (అందుకే కూచిమంచి వేంకటరాయడికి లాక్షణిక చక్రవర్తి అనే బిరుదు ఉన్నది. ఈ కవి తల్లి వంకాయలపాటి వేంకటనారాయణుని పుత్రిక సుబ్బమ్మ, తండ్రి తిమ్మన. ఇతని గురువులు దేవులపల్లి సీతారామశాస్త్రి, బుచ్చయ్యశాస్త్రి సహోదరులు. ఈ బుచ్చయ్య శాస్త్రికి కుమారుడైన సుబ్బరాయ శాస్త్రి తమ్ముడు వేంకటశాస్త్రి కుమారులే మనకు సుపరిచితులైన దేవులపల్లి కృష్ణ శాస్త్రి.) సుకవిమనోరంజనములో వందలాది తెలుగు, సంస్కృత కావ్యాలనుండి లక్షణ లక్ష్యాలు ఉదహరించబడినవి. ఇందులో ఐదు ఆశ్వాసములు ఉన్నాయి. వీటిలో యతి ప్రాస భేదాలు, గుండు ర బండి ఱ నియమాలు, వ్యాకరణ దోషాలు మున్నగు విషయాలు చర్చించబాడ్డాయి. పోలిక యతికి (ప్రథమా విభక్తి ము-కారముతో అంతమయ్యె పదానికి పు, ఫు, బు, భు లకు యతి) చక్కటి యతికి (విభక్తీతర ము-కారమునకు పు, ఫు, బు, భు లకు యతి) గల భేదాన్ని పీఠికలో చక్కగా సంపత్కుమార వివరించారు. వేంకటరాయడు పూర్వ లాక్షణికులను సహృదయతో విమర్శించిన పద్ధతి చాల ఉదాత్తమైనదని ఆయన భావించారు.

తెలుగు ఛందస్సుపై వెలుగులు

ఆచార్యులవారు తమ కొన్ని పరిశోధనల సారాంశమును తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు అనే పుస్తకములో ప్రచురించారు. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ సంగ్రహముగా తెలుపుతాను:

  1. పదము, పాట, గేయము, పద్యము అనే మాటలకు ఉండే అర్థాన్ని విపులీకరించారు. ఊత పదాలతో (వెన్నెలా, తుమ్మెదా వంటివి) ఉండేవి పదాలు, జాగాలతో ఉండేవి పాటలు, ఊత పదాలు, జాగాలు లేక పాడుకోడానికి అనువుగా ఉండేవి గేయాలు, గణబద్ధమైనవి పద్యాలు అని వీటిలోని తేడాలను వివరించారు. ఒకప్పుడు ఛందస్సుకు సంగీతానికి అవినాభావ సంబంధము ఉన్నా తరువాత ఛందస్సు దానిని కోల్పోయి స్వతంత్రముగా నిలబడిందని అన్నారు. వైదిక కాలములో ఛందస్సు అక్షర సంఖ్యపైన ఆధారపడి ఉండగా, తరువాత లౌకిక ఛందస్సులో అది వర్ణాలపైన, హ్రస్వ దీర్ఘాలపైన, గురులఘువులపైన, వాటితో నిర్మించబడిన గణాలపైన ఆధారపడినది. దేశి ఛందస్సులన్నీ మాత్రా ఛందస్సులే. ఇది రగడలలో స్పష్టముగా కనబడుతుంది. ఇక్కడ నన్ను ఆకర్షించిన ఒక విషయము ఏమంటే, తొలి నాళ్ళలో ద్విపదలాటి దేశి ఛందస్సులో మిశ్రగణాలు – అంటే నాలుగు మాత్రల గణాలు, ఐదు మాత్రల గణాలు లేవని, అవి పూర్తిగా (చివరి త్రిమాత్రను తప్పిస్తే) చతుర్మాత్రలతోనో లేకపోతే పంచమాత్రలతోనో మాత్రమే ఉండేదని అనడం. ఇప్పుడు ఉండే కలగాపులగము తరువాత వచ్చిన మార్పు అని అన్నారు. సూర్యేంద్రచంద్రగణాల వ్యవస్థ ఒక విధముగా అప్పుడు ఉండే దేశి ఛందస్సును ఒక చట్రములో పెట్టడమే అన్నారు.
  2. ఇప్పుడు మనము చదివే లక్షణ గ్రంథాలలో అక్కరలు, ద్విపదలు, షట్పదులు, సీసము, తరువోజ, గీతులు సూర్యేంద్ర గణ యుక్తములని చదువుతాము. కాని ఆచార్యులవారు కవిజనాశ్రయ, కావ్యాలంకారచూడామణి కర్తలు అక్కర, ద్విపద, షట్పదులను వేరుగాను, సీస, తరువోజ, గీతులను వేరుగాను భావించారని చెప్పారు. అక్కరాదుల గణములకు మాత్రమే సూర్యేంద్రచంద్ర నామములు. అక్కరాదులలోని గణములలో కొన్నిటిని తొలగించి నల నామ గణములను సీసములకు, గీతులకు వాడారన్నారు. అనంతుని కాలములో వీటికి కూడా సూర్యేంద్రగణములని పేరు పెట్టారని అన్నారు.
  3. నాగవర్మ ఛందోంబుధిలో సీసపద్యమునకు లక్షణము చెప్పేటప్పుడు పురుహూత గణము అంటే ఇంద్రగణమని వ్రాసినాడు, కాని కన్నడములో ఇంద్రగణాలు లేవు, అవి విష్ణు గణాలు. కాబట్టి ఈ పద్యము బహుశా అందులో ప్రక్షిప్తమైనదేమో అని ఆచార్యులు సంశయాన్ని వెలిబుచ్చారు. కన్నడ తెలుగు ఛందస్సులకు మధ్య ఉండే సామ్యాన్ని, వ్యత్యాసాన్ని కొన్ని ఉదాహరణలతో చర్చించారు. కన్నడములో సీసము పంచమాత్రాబద్ధము, తెలుగులో మిశ్రము; కాని సర్వలఘువు సీసము మాత్రము పంచమాత్రాబద్ధము (న-ల-ల ఇంద్ర గణము కాదు)! తెలుగులో ఛందఃపరిశీలన, ఛందోబోధనలపైన కూడా రెండు అధ్యాయాలున్నాయి ఈ చిన్న పుస్తకములో.