అంటే విశ్వనాథ కవిత్వాన్నే తపస్సుగా భావించి, ఆ తపస్సు ద్వారా ముక్తిపొందాలని తపన చెందారన్న మాట. ఈ తపస్సు గురించి ‘విశ్వనాథ సత్యనారాయణగారి బ్రాహ్మీమయత’, ‘విశ్వనాథ’ మొదలైన వ్యాసాలలో అద్భుతంగా విశ్లేషించారు సంపత్కుమార. మనస్సంయమాది విధానములు చేతగాలేదు విశ్వనాథకు. అందుకే కవిత్వ రూపంలో తపస్సుని సాగించారు. దీనికి బీజం కవిత్వం ప్రారంభించిన తొలి రోజుల్లో ఆయన వ్రాసిన ‘భ్రష్టయోగి’లోనే మనకి కనిపిస్తుంది! ఒక భక్తునిగా రాముడినీ, శివుడినీ, కృష్ణుడినీ ఆరాధించినా ఒక కవిగా వాక్కును, శబ్దబ్రహ్మాన్ని, శారదాదేవిని ఆరాధించారు. ఇది విశ్వనాథలోని విలక్షణత. దీని గురించి సంపత్కుమార చాలా లోతైన విశ్లేషణ చేశారు. కొద్దిగా సుదీర్ఘమయినా దానిని ఇక్కడ కొద్దిగా రుచి చూపించక తప్పదు:
ఈ మహాసంధ్యలో శారదామయూరి
రమ్య కింకిణి కిణకిణ రభస పాద!
మంజుల విలాసనృత్య సామ్రాజ్య లక్ష్మి!
యగుచు కచ్ఛపీ మృదుగీతులనుసరించునన్నారు. ఈ జపాశోణసంధ్య ఆ సంధ్యాదేవియే. అర్చిర్గూఢమయిన శబ్దం ఆవిష్కృతం కావాలి. వాక్కుకు అగ్ని అధిష్ఠానదేవత. కవిలోని అగ్ని జీవునివేదన. కార్యకారణాలకు అభేదభావన చేస్తే వాగగ్నులు అభిన్నమయినవి. నిత్యప్రజ్వల జ్జీవుని వేదన వాక్కుగా అభివ్యక్తమవుతుంది. అట్లాంటివాడు కవి. మరి, నిజానికి కావ్యవాక్కు అంటే అది. సాధారణవాక్కు కవి వేదాగ్నిలో పుఠం పెట్టబడి కావ్యవాక్కుగా ప్రజ్వలిస్తుంది. అదట్లా ఉంచి –
మన్మహాయోగ నిష్ఠాసమాధి నుండి
బ్రహ్మ బదులుగ వాక్స్వరూపంబు నెంచి
బ్రహ్మకును వాక్కునకభిన్న భావమెంచి
భ్రష్టయోగిని కవిజన్మ బడసినాడనన్నారు సత్యనారాయణగారు. వాక్కును – శబ్దాన్ని బ్రహ్మముగా భావించి ఉపాసించటం భారతీయ కవి సంప్రదాయం. ఆ ఉపాసనలో అనంతమయిన అంతరువులు ఉండవచ్చు. పరాకాష్ఠ దశకు చెందిన ఆ ఉపాసన ఆ కవికి బ్రహ్మీభావాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ‘శబ్దబ్రహ్మ స్తుతి’ చివరి పద్యంలో –
మానుగ నాకాశంబున
ప్రాణములన్ మలచి తన్మయత్వము పొందున్
నేనే శబ్దబ్రహ్మ
మ్మై నాలో నాకె నందనాదికమయ్యెన్అని చెప్పబడింది.”
ఈ కవితారూప తపస్సు గురించి ఆలోచిస్తూ ఉంటే, జెన్ కవిత్వ తత్త్వంతో దీనికి కొంత పోలిక ఉన్నట్టుగా అనిపించింది నాకు. జెన్ కవికి ధ్యానంనుండే కవిత్వం పుడుతుంది. పూర్తిగా ధ్యానమగ్నుడయిపోతే మిగిలేది నిశ్శబ్దం. మరి నిశ్శబ్దం నుండి కవిత్వమెలా పుడుతుంది? విశ్వనాథ వాక్కునుండి బ్రహ్మను వెతికినట్టు జెన్ కవులు శబ్దంనుండి నిశ్శబ్దాన్ని వెతుకుతారు. “అస్మదీయ కంఠమున యందాడుచుండె, నొక ఏదోగీతి బయటకు నుబికి రాదు. చొచ్చుకొని లోనికింబోదు వ్రచ్చిపోయె నా హృదయమీ మహాప్రయత్నమందు” అని తన వాక్కుకున్న పరిమితిని, అనిర్వచనీయమైన లోపలి గీతిని వ్యక్తపరిచడంలోని అశక్తతని చెప్పుకుంటారు విశ్వనాథ. జెన్ కవులలాగే విశ్వనాథకు కూడా వాక్కు పరిమితులు తెలుసు. తేడా ఏమిటంటే, జెన్ కవులు వాక్కు నిష్ప్రయోజకత్వాన్ని తెలుసుకొని దాని విచ్ఛిత్తినుండి నిశ్శబ్దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. విశ్వనాథ వాక్కు యొక్క పరిపూర్ణ శక్తిని తెలుసుకొని, అనుభవించి దాని ద్వారా వాగతీతమైన పరబ్రహ్మాన్ని చేరాలని ఆకాంక్షిస్తారు. ఈ పోలిక కేవలం అనాలోచితంగా స్ఫురించిన ఒక భావన. దీని గురించి లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అది అలా ఉంచితే, సత్యనారాయణగారు కవిగా శబ్దాన్ని ఉపాసించి, సిద్ధిపొంది ‘బ్రాహ్మీమయమూర్తి’ అయ్యారని సంపత్కుమారగారి నిశ్చయం. అందుకే అసలు కవిత్వం చెప్పకుండా విశ్వనాథ బతకలేరని అంటారు వారు.
“అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి” అని కల్పవృక్షావతారికలో తనని తాను చెప్పుకోవడం విశ్వనాథ అహంభావానికి పరాకాష్ఠగా ప్రచారం జరిగింది. కవి వాక్కును అర్థం చేసుకోవాలంటే అతని కవిత్వసర్వస్వాన్నీ గాఢంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కల్పవృక్షానికి ఎంతో ముందుగానే వ్రాసిన ‘శబ్దబ్రహ్మ స్తుతి’ అనే ఖండ కావ్యంలోనే తాను శబ్దబ్రహ్మమయినానని చెప్పుకున్నారు కదా విశ్వనాథ. ఆ శబ్దబ్రహ్మమే యీ బ్రాహ్మి. ఈ ‘బ్రాహ్మీమయత’ గురించి సంపత్కుమార,
“ఈ ‘బ్రాహ్మీమయ మూర్తి’కి ముందు – ‘అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల’ అని దీర్ఘసమాసరూప విశేషణం ఉంది. మనో బుద్ధ్యహంకార చిత్తరూపం అంతఃకరణం. ధిషణ (బుద్ధి) – అహంకారాలు మనస్సును అధిగమించిన స్థాయిల్లోని అహంకారాన్ని ‘రస’మన్నాడు భోజుడు. కాగా, ‘స్వాదురసావతారం’ కావ్యప్రపంచంలో అవతరించే పరమేశ్వర తత్త్వం.”
అని వివరించారు. అంటే కావ్యంలో, బుద్ధి అహంకారాలని అధిగమించిన రసస్థాయి బ్రాహ్మీమయత అన్న మాట. అందుకే రసానందానికి బ్రహ్మానంద స్థాయిని ఇచ్చారు మన అలంకారికులు.
కవి తపస్సంతా ఆ రసస్థాయిని చేరుకోడానికే. అది లభించినప్పుడే కవి జన్మకి సాఫల్యం. అదే విశ్వనాథ చెప్పిన బ్రాహ్మీమయత.
విశ్వనాథ బ్రాహ్మీమయతని దర్శింపజేసే దిశగానే సంపత్కుమార పరిశీలనంతా సాగింది. అయితే ఇది కేవల మూఢభక్తిగా కాకుండా, విషయ వివేచనతో, తార్కిక విశ్లేషణతో సాగడం విశేషం. విశ్వనాథ కవిత్వ పటుత్వం పూర్తిగా తెలుసుకున్నాకనే విశ్వనాథని ‘మహాకవి’గా నిరూపించే వ్యాసాన్ని కూడా ప్రకటించారు. ఇది కూడా కేవలం పొగడ్తలతోనూ నినాదాలతోనూ కాకుండా శాస్త్రీయ పద్ధతిలోనే ఉంటుంది. మహాకవికి ఆనందవర్ధనుడు చెప్పిన నిర్వచనం ఆధారంగా తీసుకొని, దాన్ని విశ్వనాథవారే తన విమర్శలో నిర్వచించిన కవుల స్థాయీభేదాలకి అన్వయించి, విశ్వనాథ చేసిన కవితారూప తపస్సుకి అనుసంధానం చేస్తూ విశ్వనాథని ‘మహాకవి’గా నిరూపించారు సంపత్కుమార.
అతిశయం లేని అచ్చమయిన సద్విమర్శకు సంపత్కుమారగారి వ్యాసాలు మచ్చుతునకలు. విశ్వనాథ సాహిత్య విరాడ్స్వరూపాన్ని స్థూలరూపంలో దర్శించేందుకు అనువైన కోవెల సంపత్కుమార!
సర్వపూర్వర్షి హృన్నిష్ఠ
భావనాపూర్ణరూపిణీ
రసాత్మికా సా జయతి
విశ్వనాథ సరస్వతీ
– (విశ్వనాథ గురించి సంపత్కుమారగారు చెప్పిన శ్లోకం)