2ఆ. ఆధ్యాత్మికత
అద్వైతాన్ని ఆత్మగతం చేసుకున్నవారు విశ్వనాథ. అది అతని సర్వ కవిత్వంలోనూ ప్రతిఫలిస్తూనే ఉంటుంది. రామాయణాన్ని పూర్వ వ్యాఖ్యాతలు విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానించారు. విశ్వనాథ కల్పవృక్షం అద్వైత పరమైన వ్యాఖ్యానం. దీని ఆధారంగా కల్పవృక్షంలో రామాయణ తత్త్వాన్ని విశ్వనాథ ఎలా దర్శించారో ఇలా వివరించారు సంపత్కుమార:
“నిజానికిది రఘువరచరితమా? సీతామహచ్చరితమా? అసలు కా ‘చరిత’లు రెండు కావు – ఒకటే. రెండుగా భాసించవచ్చుగాని, ఒకరు లేకుండా మరొకరిదనిపించే చరిత లేదు. కారణం, సీతారామచంద్రులు అభిన్నులు కావటమే. ఇద్దరూ ఒకే వెలుగు.
ఇరువురము నొక్క వెలుగున
చెరిసగమును, దీని నెరుగు శివుడొకరుండే,
పురుషుడవీవైతివి నే
గరితనుగానైతి…అని, అగ్నిప్రవేశం చేయబోతూ కల్పవృక్ష సీత చెప్పిన చివరి రహస్యమిది… అయితే ఒకే వెలుగు స్త్రీ-పుం రూపంగా వివర్తమానం కావటమెందుకు? రావణవధార్థం. వాల్మీకి వాక్యాల్లో రఘువరచరిత మన్నప్పుడు, సీతామహచ్చరిత మన్నప్పుడు కూడా వెనువెంటనే తప్పనిసరి అంశంగా, ఫలభూతంగా చెప్పబడింది దశ శిరస్క – పౌలస్త్య వధ. ఆ దశశిరస్కుడూ, పౌలస్త్యుడూ భిన్నులు కారు. రఘువరుడు, సీత కూడా కాదు… ఈ అభేదాన్ని రామాయణం గర్భీకరించుకొంది. ‘కావ్యం రామాయణం కృత్స్నం’ అంటే ఆ ‘కృత్స్నత’ ఇది. ఈ కృత్స్నమయిన రామాయణానికి ఫలం రాముడు సీతను పునర్లభించుకోవటం కాదు. ఈ అంశం కల్పవృక్ష రావణునికీ అర్థమయింది. అందుకనే –
సీతం గొంచును బోవ నీతడిట వచ్చెన్నాగ వ్యాజంబు, వి
ఖ్యాతిన్ దానవవంశ నాశనము కార్యం బీ శివాద్వైతికిన్
సీతం గైకొని పోవ వేవిధములం జేయంగ వచ్చున్, మహా
దైతేయోన్మథనంబు ముఖ్యము సముద్రాంభోవ్యధాకారికిన్అనుకుంటాడు… దశశిరస్కత మానవ సృష్టిలోని ప్రకృతి వైపరీత్యానికి ప్రతీక. పౌలస్త్యం మానవుని ఉదాత్తత్వానికి సూచిక. ఆ స్థాయిలో ఈ వైపరీత్యం సృష్టి వ్యవస్థా భంజక మయింది. ఆ భంజకమయినదాన్ని ఉన్మూలించటం సృష్టి యొక్క సుస్థితికి అభీష్టం. ఈ సుస్థితిని రక్షించటం ఆదిమ మహస్సులోని వైష్ణవీయతా లక్షణం. కాబట్టి రావణవధ రామాయణ ఫలం.”
భారతీయ సాహిత్యంలో ప్రతీకాత్మకతకూ, అనేక పొరలలో దాగుండే తత్త్వ రహస్యాలకూ ఎంతో ప్రాముఖ్యముంది. భారతీయ దర్శనాల ఆధారంగా వాటిని విశ్లేషించినప్పుడే ఇలాంటి లోతైన చింతనకు ఆస్కారముంటుంది. అలా కాకుండా, పైపైననే మనకి తోచిన సిద్ధాంతాలని ప్రయోగించి వ్యాఖ్యానిస్తే వెగటుదనమే మిగులుతుంది. ఈ వ్యాసం మొదట్లో ఉటంకించిన పద్యాన్ని ఇక్కడ మళ్ళీ అనుసంధానం చేసుకోవాలి.
సంపత్కుమారగారు విశ్వనాథ అద్వైత చింతనని ఎంతగా ఆకళించుకున్నారంటే, కిన్నెరసాని పాటలలో కూడా అద్వైతపరమైన ఒక విచారధార వారికి కనిపించేంత!
2ఇ. జీవునివేదన – బ్రాహ్మీమయత
ఆత్మగతం చేసుకున్న అద్వైత సిద్ధాంతమే విశ్వనాథలో ‘జీవునివేదన’గా పరిణమించింది. వారి కవిత్వంలోని అతిముఖ్యమయిన తాత్త్వికాంశం జీవునివేదన. “చేసిన తండ్రి బాసయును జీవునివేదన, రెండు నేకమై” తాను కల్పవృక్షం వ్రాస్తున్నానని విశ్వనాథ చెప్పినా, ‘భ్రష్ట యోగి’ నుండి ‘రామాయణ కల్పవృక్షం’ దాకా అతని కవిత్వమంతటా ఆ జీవునివేదన వ్యాపించి ఉంది. దీనిని సంపత్కుమారగారు ‘అత్యాధునికమూ, మౌలికమూ అయిన ఒక సాహిత్య దార్శనిక సిద్ధాంతం’గా అభివర్ణించారు. తనలోని ద్వంద్వాలను అధిగమించి పూర్ణమైన అద్వైత స్థితి పొందేందుకు ఆత్మపడే వేదనే యీ జీవునివేదన. ‘విశ్వనాథ’ అనే వ్యాసంలో విశ్వనాథ వేదన లోతులని తడుముతారు సంపత్కుమార.
“ఈ కెలన శరత్పూర్ణిమావృత శశాంక
లలితరోచిర్వితాన, మా కెలన ఘోర
ఘనత రాంధకారచ్ఛటాక్రాంత భూమి
అందు సగ మిందు సగముంటి…ఒకవైపు రమణీయమైన వెన్నెల – మరొకవైపు కరాళమైన చీకటి. తనలో ఈ రెండు సమానస్థాయిలో ఉన్నవి. ఈ రెండూ ప్రకృతితః విరుద్ధాలయినవి. జ్ఞానాజ్ఞాల కూడలి. ద్వంద్వమయమయి లోకం వలె ఉన్నాడన్న మాట. తనలో ఉన్న ఈ విరుద్ధ శక్తులకు తాను తట్టుకొని మహావేదనతో కాలాన్ని తోస్తున్నాడు.”
మరి ఈ వేదనకి పర్యవసానం ఏమిటి? తన వేదనని అధిగమించడానికి విశ్వనాథ చేసిన సాధన ఏమిటి? ఇక్కడే కవిగా విశ్వనాథ విలక్షణత గోచరమవుతుంది. ఈ విలక్షణత ఏమిటో సంపత్కుమారగారి మాటల్లో:
“ఈ ఆంతరికమైన వేదన – ఘర్షణ – సర్వవైశ్వనాధిక సాహితిలో దృగ్గోచరమవుతుంది. ఈ ఆంతరికమైన జీవ వేదనతో ‘సకలోహవైభవ సనాథంగా’ కవితను తపస్సుగా స్వీకరించినాడు. అందుకే రామాయణ కల్పవృక్షారణ్యకాండలో –
కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా! మనస్సంయమా
ది విధానంబుల చేతగాని తనమైతిన్, మూర్త సంవిత్కళా
యువతీభోగ! హరింపజేయుటకు మారోడ్తున్ జుమీ యింద్రియా
ది వికారంబులు భావనావిమల వాక్తీర్థంబు లేపారగన్అని అంటారు.”