విశ్వనాథ కోవెల

పెద్ద సమాసాలు పెద్ద వస్తువులనీ, కఠినాక్షరాలు ప్రపంచంలోని కఠిన విషయాలనూ సహజసిద్ధంగా సార్వత్రికంగా సూచించవు అని ఇక్కడ చేరా అంటున్నారు. అది నిజమే. అందులో అనుమానం లేదు. అయితే విశ్వనాథ ఉద్దేశ్యం ఇదా? కాదని సంపత్కుమారగారి వివరణ గమనిస్తే నాకు తోచిన సమాధానం. ఈ విషయంలో చేరా కొద్దిగా పొరబడ్డారేమో అని నాకనిపిస్తోంది. పెద్ద సమాసాలు పెద్ద వస్తువులని సహజంగా స్ఫురింపజేయక పోవచ్చు. అన్ని చోట్లా సూచించకపోవచ్చు. కాని పెద్ద విషయాలని చెప్పే చోట్ల ఎక్కువగా పెద్ద సమాసాలను కవులు ప్రయోగిస్తే, అది దానికి ఒక సూచికగా, గుర్తుగా మారవచ్చు. సందర్భాన్ని బట్టి చదివే పాఠకుడు దాన్ని గుర్తిస్తే ఆ పాఠకునిలో అధిక భావస్ఫూర్తి కలిగే అవకాశం ఉంది. శిల్పం సాధించే ప్రయోజనం ఇది. అన్ని శిల్పభేదాలకూ ఇదే వర్తిస్తుంది. శిల్పాన్ని తెలిసిన పాఠకుడే దాని ద్వారా అధిక స్ఫూర్తిని పొందగలుగుతాడు కాని, అప్రయత్నంగా అసంకల్పితంగా అది జరగదు అని నేను అర్థం చేసుకున్నాను.

1ఇ. పాశ్చాత్య ధోరణులు

శిల్పానుశీలనే కాకుండా మరికొన్ని అభివ్యక్తి పరమైన విశేషాలను సంపత్కుమార విశ్వనాథ రచనలో గుర్తించి వివరించారు. ఇందులో ముఖ్యంగా పాశ్చాత్యసాహిత్య ప్రభావంతో విశ్వనాథ చేసిన ప్రయోగాలు రెండున్నాయి. నాటక రచనలో ప్రాచీన సంప్రదాయాన్ని పాటించకుండా పాశ్చాత్య పద్ధతులని ప్రవేశపెట్టడం ఒకటి. నర్తనశాల గురించిన వ్యాసంలో దీన్ని సంపత్కుమార వివరించారు. అయితే, ఈ వ్యాసంలో ఎక్కువగా రససిద్ధాంత పరమయిన విశ్లేషణే చెయ్యడానికి వారు ప్రయత్నించారు. పాశ్చాత్య ధోరణులను గుర్తించి ఊరుకున్నారు. ఇది నాకు కొంత అసంతృప్తిని మిగిల్చింది. నర్తనశాల నాటకానికి రససిద్ధాంతాన్ని అన్వయించ బూనడం పెద్ద ప్రయోజనకారి కాదని నా అభిప్రాయం. పాశ్చాత్య నాటక ప్రభావం దీని మీద చాలా ఉంది. దానినే మరికొంత వివరిస్తే బాగుండుననిపించింది. బహుశా ఇతరత్రా కొందరు ఈ రకమయిన విశ్లేషణ చేసి ఉండడం వల్ల సంపత్కుమారగారు చేసి ఉండకపోవచ్చు.

పాశ్చాత్యసాహిత్యం నుండి విశ్వనాథ స్వీకరించిన మరొక అంశం, భావ్యర్థ సూచన. ‘ప్రస్తావన’లో మాత్రమే నాయకుడినీ నాటకవస్తువునూ సూచించటం మన భారతీయ నాటక సంప్రదాయం. అయితే విశ్వనాథవారి నాటకాలలోనూ, కావ్యాలలోనూ కూడా పాత్ర సంభాషణలలో చాలా చోట్ల, జరగబోయే దాన్ని సూచించడం మనకి కనిపిస్తుంది. ప్రఖ్యాతమైన కథని చెప్పేటప్పుడు ఇలాంటి సంవిధానం ద్వారా పాఠకుల మనస్సులో ఒక కొత్త అనుభూతి కలుగుతుందని సంపత్కుమార అభిప్రాయపడ్డారు.

అంతస్సారం

ఏ రచనకయినా అభివ్యక్తి కేవలం ఉపరితలమే. రచనలోని అంతస్సారాన్ని గ్రహించకుండా అందులోని అభివ్యక్తిని మాత్రమే చూసి ఊరుకుంటే ఆ దర్శనం అసమగ్రమే. అంతస్సారమే అసలైన సారం. అభివ్యక్తి అంతస్సారాన్ని ఆవిష్కరించే పద్ధతి. అందుకే అభివ్యక్తికి సంబంధించిన విశ్లేషణ అంతస్సారాన్ని గ్రహించే దిశగా సాగాలి. విశ్వనాథ సాహిత్యంలో అంతస్సారాన్ని సంపత్కుమార ఎలా దర్శించారో ఇప్పుడు చూద్దాం. విశ్వనాథ తత్త్వస్రవంతిని రెండు పాయలుగా చూడవచ్చు. ఒకటి సామాజికత, రెండు ఆధ్యాత్మికత. నిజానికి రెండిటి మూలం ఒకటే.

2అ. సామాజికత

విశ్వనాథ సామాజిక దృక్పథం ఆయన సర్వ సాహిత్యంలోనూ అక్కడక్కడా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. కాని వారి నవలలలో అది సంపూర్ణంగా ద్యోతకమవుతుంది. ‘విశ్వనాథ నవలలు: సామాజిక దృక్పథం’ అన్న వ్యాసంలో సంపత్కుమార దీన్ని సమగ్రంగా ఆవిష్కరించారు. విశ్వనాథ సామాజిక దృక్పథానికి ప్రాతిపదిక దేశీయత అని వారు గుర్తించారు. దేశీయత అంటే ఏమిటి?

“ఒక దేశం, ఆ దేశంలో జీవితాన్ని అనుభవిస్తున్న జాతీ, జీవితాన్ని గూర్చి జీవిత పరమార్థాన్ని గురించీ ఆ జాతి చేసిన విచారణా, వేసుకున్న ప్రశ్నలూ, అనుభవాల ద్వారా స్పష్టపరచుకొంటున్న ఆలోచనా, దాని నుంచి పొందిన సమాధానాలూ, వాటినుంచి ఎప్పటికప్పుడు రూపుదిద్దుకొనే ఆచరణ విధానమూ ఒక ప్రత్యేకమయిన తరహాలో ఉంటుంది… అన్ని దేశాల్లోనూ మట్టి ఉంటుంది; గాలీ, నీరూ, చెట్లూ, చేమలూ వగైరాలన్నీ ఉంటాయి; మనుషులూ ఉంటారు; పశువులూ, పక్షులూ, జంతువులూ, అడవులూ, కొండలూ, వాగులూ, వరదలూ, పాడీపంటా ఆయా దేశాల భౌగోళికతను బట్టి ఉండనే ఉంటాయి. కాని, దేశ దేశానికీ కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఆ దేశీయమయిన జాతి తన అవసరాలూ, అనుభవాలూ, ఆలోచనా నైశిత్యాన్ని బట్టి, విచారణాదక్షతనుబట్టి సంపాదించుకొన్న, రూపొందించుకొన్న జ్ఞాన విజ్ఞానాదులూ మొదలయిన వాటినిబట్టి జీవితానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన దృక్పథాన్ని ఏర్పరుచుకొంటుంది.”

ఇది దేశీయతకు సంపత్కుమారగారి నిర్వచనం. అది విశ్వనాథ అంతరంగానికి ప్రతిధ్వని. నేడు ప్రభంజనంలా వ్యాపిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దేశీయత గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉంది. రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం మాత్రమే స్వాత్రంత్ర్యమా? సాంస్కృతిక స్వాతంత్ర్యం అవసరం లేదా? అదిప్పుడు మనకి ఎంతవరకూ ఉన్నది? సాంస్కృతిక స్వాతంత్ర్యం రాజకీయార్థిక స్వాతంత్ర్యాలని ఎలా ప్రభావితం చేస్తుంది? మొదలయిన ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.

“ఈనాడు దేశీయ – దేశీయేతర భావజాల ప్రవృత్తుల మధ్య సాగుతున్న సంఘర్షణలో సంప్రదాయం, సమాజం మొదలయిన పదాలే కాదు, మొత్తం సమాజమే సతమతమయి నలిగిపోతున్నది.” అని అంటారు సంపత్కుమార. ప్రస్తుతం అలాంటి సంఘర్షణ కూడా కనిపించదు! సంప్రదాయం, సమాజం, ఆధునికత మొదలైన ఎన్నో విషయాల గురించి విశ్వనాథవారి దృక్పథం సంపత్కుమారగారి మాటల్లో మనకీ వ్యాసంలో కనిపిస్తుంది. మన భారతీయ సమాజ పూర్వ స్వరూపాన్ని ఏ రకంగా విశ్వనాథ తన నవలల్లో చిత్రించారో మనకీ వ్యాసంలో రూపుకట్టించారు. భారతీయమైన కుటుంబ ఆర్థిక రాజ్య వ్యవస్థలు, మత వ్యవస్థ, వీటన్నిటికీ అంతస్సూత్రంగా నిలిచిన ధర్మము – ఇవన్నీ విశ్వనాథ వారి రచనలన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాయి. ఆ ఆలోచనా సర్వస్వాన్ని గుదిగుచ్చి సంపత్కుమార తన వ్యాసంలో మనకి దర్శింపజేశారు.

“మర బియ్యముతో ప్రాణము పోవుచున్నది. తిన్నవారికి నాయుర్దాయము క్షీణించుచున్నది. పేదలకు దంచిన కూలినూకలు వచ్చుటలేదు. బస్తావడ్లు నలుగురు పేదవాండ్రు దంచెదరు. నలుగురకు నారోజు తిండికి బియ్యము దొరుకును. పెట్టుబడి పెట్టి మిల్లులు పెట్టిన సాహుకారిట్టి వంద నలుగురి నోళ్ళలో దుమ్ముకొట్టి తాను ధనవంతుడగు చుండెను. వానికి తిండి చాలకయా? అమిత ధనాభిలాష! అయ్యో; జనుడు ధనముతో నేమి చేయును? దుర్వ్యసనములు పెంపొందించుకొనును. నూటిలో తొంబది తొమ్మిది మందికి తిన తిండి లేకుండ జేసి ఒక్కడే ధనమంతయు ప్రోగుచేసి మేడలు కట్టును. మోటారులు కొనును. దుష్టవస్తువులను కొనుటకు ఉపయోగించును. భోగము దానికిచ్చిన డబ్బు మోటారులు కొన్న దానికన్న చెడిపోయినదా? ఇది యేదో యొక పేదజీవి బ్రతుకుటకుపయోగ పడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులు ఫోర్డు, రాక్ ఫెల్లర్లను బాగు చేయుచున్నది”

అని వేయిపడగలలో ధర్మారావు అంటాడు. ఇవి ఛాందస భావాలా? విప్లవాత్మక భావాలా? హోదా కోసం మోటారు కార్లు కొనడం ఎంతటి దుర్వ్యసనమో చెప్పడానికి భోగంవారి గురించిన ప్రస్తావన కాని దానిని పట్టుకొని విశ్వనాథ భోగపు వ్యవస్థని సమర్థించాడని అంటే అది సమంజసమా? పెట్టుబడిదారీ వ్యవస్థని విశ్వనాథ ఎంతగా వ్యతిరేకించారో దీనిబట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే ‘సముద్రపు దిబ్బ’ నవలలో నేతవృత్తివారు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థకి ఎలా బలి అవుతున్నారో వివరిస్తారు. ఇదంతా సామ్యవాద భావాలు కావా? వీటిని అర్థం చేసుకుంటే, మౌలికమైన సిద్ధాంతాలలో విభేదాలున్నా, విశ్వనాథ దృక్పథానికీ కమ్యూనిజానికీ గమ్యం ఒకటే అని అనిపించక మానదు.

విశ్వనాథ సాహిత్యమంతా చదవలేకపోయినా సంపత్కుమార వ్యాసాలు చదివితే వక్రీకరణలు లేని ఆయన సామాజిక దృక్పథం మనకి విస్పష్టంగా దర్శనమిస్తుంది.